-
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
జనవరిలో జీఎస్టీ @ రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి. -
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్పై కసరత్తు, బడ్జెట్ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
సానుకూలమైనా... సవాళ్లూ ఉన్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 మొదటి నెల– ఏప్రిల్లో శుభారంభం చేసిందని ఆర్థికశాఖ ఏప్రిల్ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. అయితే భారత్ వృద్ధి బాటకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. వినియోగం స్థిరంగా ఉండడం విస్తృత ప్రాతిపదికన వృద్ధి నమోదుకావడానికి దోహదపడే అంశమైనా, పెట్టుబడుల్లో సామర్థ్యం సృష్టి, రియల్టీలో పెట్టుబడులు వంటి అంశాలపై అనిశ్చితి ఉందని పేర్కొంది. దేశీయంగా అన్నీ సానుకూల అంశాలేనని పేర్కొంటున్న నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ఆర్థిక సంవత్సరం శుభారంభం మొత్తం సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను అంచనా వేయడానికి ఏప్రిల్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను తీసుకుంటే, ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలతోనే ప్రారంభమైందని భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. అన్ని పరోక్ష పన్నులనూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలైలో కొత్త పన్ను విధానం ప్రారంభంమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. 2022 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 12 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ వార్త. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, పన్నుల వసూళ్లు నెలవారీగా ఈ స్థాయికి పెరగడం జీఎస్టీ పట్ల వ్యవస్థలో పెరిగిన విశ్వాసాన్ని, ఆమోదనీయోగ్యతను, సమ్మతిని సూచిస్తోంది. భారత్ ఎకానమీ పటిష్ట పురోగతిని ఇది సూచిస్తోంది. ఐఐపీ భరోసా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింకంలో (2022–23 జనవరి–మార్చి) పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ) అందులో దాదాపు 44 వెయిటేజ్ ఉన్న ఎనిమిది పరిశ్రమల కీలక గ్రూప్ ( క్రూడ్ ఆయిల్, విద్యుత్, సిమెంట్, బొగ్గు, ఎరువులు, స్టీల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టŠస్ ) స్థిరమైన వృద్ధి తీరును కనబరిచాయి. అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే (జూలై–డిసెంబర్) వినియోగ సామర్థ్యం 75 శాతం పెరిగింది. కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగం పెరుగుదల సానుకూలతలతో కార్పొరేట్లు కొత్త పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. భారీ యంత్రసామాగ్రి డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగాలు 4వ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. మూలధన వస్తువుల దిగుమతుల్లోనూ పెరుగుదల నమోదయ్యింది. సేవలు, తయారీ, వ్యవసాయమూ.. ప్లస్సే... తయారీ, సేవల రంగం మాదిరిగానే వ్యవసాయ రంగానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా, మిగులు నీటి నిల్వ స్థాయిలు, విత్తనాలు– ఎరువులు తగినంత లభ్యత, పటిష్టమైన ట్రాక్టర్ విక్రయాలు జూన్ 2023 నుండి ప్రారంభమయ్యే ఖరీఫ్ విత్తన సీజన్కు శుభసూచికలు. అకాల వర్షాలు నమోదవుతున్నప్పటికీ, గోధుమల సేకరణ సజావుగా సాగుతోంది. ఇది ఆహార భద్రతకు ఊతమిస్తోంది. గ్రామీణ డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయి. ఏప్రిల్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో అంకెల వృద్ధి నమోదయ్యింది. ఖరీఫ్ సీజన్కు మంచి అవకాశాలు, పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెరగడం, ప్రభుత్వం బడ్జెట్లో పెంచిన వ్య యం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి... 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు భేష్... తీవ్ర పోటీ, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్ ఎగుమతులు మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్ (పీఎల్ఐ) మద్దతుతో భారత్ నుండి వస్త్ర, రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల పునరేకీకరణ, కొత్త మార్కెట్లకు అనుగుణంగా శుద్ధి చేసిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. -
గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి వనరులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదంచేసే (గ్రీన్ క్లైమేట్) ప్రాజెక్టుల్లోకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తగిన మిశ్రమ ఫైనాన్స్ ఇన్స్ట్రమెంట్ల ద్వారా నిధులు సమీకరించడానికిగాను ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. 2070 నాటికి కర్బన్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి ఒక కీలక విధానాన్ని ఆమోదించింది. మెరుగైన వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంలో భాగంగా గ్లాస్గో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటిత ’పంచామృతం’ వ్యూహానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించిన జాతీయ విధాన రూపకల్పన ఉంది. ఈ విధానం ప్రకారం, ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతం తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుండి 50 శాతం విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధన దిశలో సస్టైనబుల్ ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్పై జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఐఎస్ఎస్బీ)తో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంప్రతింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఎస్బీ రాబోయే రెండు నెలల్లో క్లైమేట్ ఫైనాన్స్ కోసం ప్రమాణాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే నియమ నిబంధనవాళి, ఇన్స్ట్రమెంట్లు అభివృద్ధి చెందిన– చెందుతున్న దేశాల మధ్య వివక్ష చూపేవిగా ఉండరాదని కూడా భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
సింపుల్గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్కు విజ్ఞప్తి చేశారు. -
నియంత్రణ సంస్థల సేవలు ప్రశ్నార్థకం
ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం. ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి. ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు. చర్యలు తీసుకున్న దాఖలా లేదు సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి. స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి. డిప్యుటేషన్ మరో సమస్య ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా? చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది. నీలూ వ్యాస్ వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
అన్రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్తోపాటు, రిఫండ్కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్లుక్ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను (జూలై–సెప్టెంబర్) ఈ స్కీమ్లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020–21 ఏడాది తొలి త్రైమాసికం నుండి ఈ రేట్లను కేంద్రం సవరించలేదు. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక శాఖ ఈ వడ్డీరేట్లను నోటిఫై చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మే, జూన్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేటు రెపోను ఏకంగా 0.9 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇండియన్ బ్యాంక్ రుణ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గురువారం నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. అన్ని కాలపరమితులకు సంబంధించి రుణ రేట్లు పెరగనున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. పెరిగిన రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్ ప్రకటన ప్రకారం, వినియోగ రుణ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. ఓవర్నైట్ నుంచి 6 నెలల మధ్య కాలవ్యవధుల రుణ రేట్లు 6.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో పెరిగాయి. వీటితోపాటు బ్యాంక్ ట్రజరీ బిల్స్ ఆధారిత (టీబీఎల్ఆర్) రుణ రేటును, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా పెంచింది. 3 నెలల నుంచి మూడేళ్ల కాలానికి పెంపు శ్రేణి 5 నుంచి 6.10 శాతం వరకూ ఉంది. పెంపు 0.40 శాతం నుంచి 0.55% వరకూ నమోదయ్యింది. ఇక బేస్ రేటు 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. -
గురుకులం.. ఇక కొలువుల కోలాహలం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల జాతరకు వేళ అయింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రక్రియ పట్టాలెక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గతవారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు తలమునకలయ్యాయి. అనుమతించిన పోస్టులు, జోన్లవారీగా విభజన, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లకు సంబంధించి మరోమారు పరిశీలన చేపట్టాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261, ఎస్సీ 230, ఎస్టీ 105, మైనారిటీ విద్యాసంస్థలు 207 ఉన్నాయి. బీసీ గురుకులాల్లో అత్యధిక పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. విద్యాసంస్థల మంజూరు సమయంలోనే శాశ్వత ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో అన్ని సొసైటీల్లో రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. నియామకాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ)ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కొలువుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీ 2,267, ఎస్టీ 1,514, మైనార్టీ సొసైటీలో 1,445 చొప్పున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సొసైటీలవారీగా ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత గురుకుల నియామకాల బోర్డు వాటిని అన్నివిధాలా పరిశీలించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. -
ఏపీలో మే జీఎస్టీ వసూళ్లు రూ.3,047 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో రూ.3,047 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో వసూలైన జీఎస్టీ రూ.2,074 కోట్లతో పోలిస్తే 47 శాతం పెరిగిందని పేర్కొంది. తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో రూ.2,984 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఈ ఏడాది రూ.3,982 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ.1,40,885 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా మే నెలలో జీఎస్టీ రూ.1,40,885 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.97,821 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికమని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 43 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 44 శాతం పెరిగినట్లు వివరించింది. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కాగా.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడోసారని వెల్లడించింది. -
రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్ఆర్బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పుల శాతం కూడా తగ్గింపు ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్ఆర్బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది. అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది. -
ఖజానాకు రుణగండం!
►ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేకపోయింది. దీంతో రాష్ట్రం ఆశించిన రూ. 3 వేల కోట్లు రాలేదు. తొలి త్రైమాసికంలో రూ. 8 వేల కోట్ల రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూపాయి కూడా సమకూరలేదు. ►రుణ సమీకరణ జరగక సాధారణ ఖర్చులకు నిధులు కూడా గగనంగా మారింది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులూ ఆర్థిక శాఖకు కష్టతరమవుతోంది. ఇక ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలు తీసుకునే విషయంలో కూడా కేంద్రం మెలిక పెట్టడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రుణ సమీకరణ కష్టంగా మారింది. సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాలు సమీకరించుకునేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతంలో లేని ఆంక్షలు, నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే ప్రారంభమైన ఈ ఆర్థిక కష్టాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు)ను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఆర్థిక శాఖ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక అవసరాల మేరకు ఎఫ్డీలను ఉపసంహరించుకున్నా తాత్కాలికంగానే గట్టెక్కనుంది. రానున్న 10 నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది. దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించిన అనవసరపు ఆంక్షల సడలింపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్రం వివక్షపై ప్రశ్నిస్తున్నా.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కూడా ఈ విషయమై ధ్వజమెత్తారు. రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకుండా ప్రగతికి ప్రతిబంధకాలు వేస్తున్నారంటూ ఆయన అన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమక్షంలోనే ఆరోపణలు చేశారు. 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’అప్పులను (నేరుగా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వ గ్యారెంటీతో కా>ర్పొరేషన్లు తీసుకునే రుణాలు) రాష్ట్రాల అప్పులుగానే పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని విమర్శించారు. వెంటనే రుణసమీకరణకు అనుమతి ఇవ్వాలని ఆ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇవే విషయాలను ఉటంకిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొనలేకపోయింది. ఇతర రాష్ట్రాలను వేలానికి అనుమతించిన ఆర్బీఐ తెలంగాణను అనుమతించలేదు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి ఎలా తెస్తారు? మూలధన వ్యయం కింద చేసే ఖర్చు కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందే తప్ప నేరుగా రుణం తీసుకోదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ బడ్జెట్ రుణాలను ఎఫ్ఆర్బీఎం (జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) పరిధిలోకి ఎలా తెస్తారని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇలా పరిగణించడం ద్వారా 5 – 6 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు తగ్గిపోతాయని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటోంది. ఎఫ్డీల ఉపసంహరణపై మల్లగుల్లాలు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొత్త చర్చకు తావిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే తమకు పంపాలని, బ్యాంకుల ఎంప్యానెల్మెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎఫ్డీల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని అన్ని శాఖల అధిపతులకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. కొన్ని శాఖల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ నేఫథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ ఉత్తర్వులు వచ్చాయనే అభిప్రాయం ఉన్నా.. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డీలు ఉపసంహరించుకుంటుందా? అనే చర్చ కూడా ఆర్థిక నిపుణుల్లో జరుగుతోంది. అయితే ఎఫ్డీల ఉపసంహరణ వరకు ప్రభుత్వం వెళ్లకపోవచ్చని, ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని కొందరు ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఎఫ్డీలు ఉపసంహరణతో పాటు ఆంక్షల సడలింపు కోసం కోర్టుకు వెళ్లే అంశంపై కూడా ప్రభుత్వం బుధవారం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
ఖాళీ పోస్టు ఉంటేనే... క్రమబద్ధీకరణ!
♦క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆర్థిక శాఖ 15 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ప్రభుత్వ శాఖలకు పంపింది. వీటిని ఆయా ప్రభుత్వ శాఖలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చి వివరాలు, ఆధారాలను సేకరించాయి. ♦ప్రొఫార్మాలోని ఏడవ పాయింట్ ప్రకారం.. సదరు కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న పోస్టును ప్రభుత్వం ఏ జీఓ ఆధారంగా మంజూరు చేసిందనే దానికి ఆధారాలను, సంబంధిత వివరాలను సమర్పించాల్సి ఉంది. అయితే మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ పాయింట్కు సమాధానం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ మెలిక పెట్టింది. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న చోట ప్రభుత్వం అప్పటికే పోస్టు మంజూరు చేసి, అది ఖాళీ (వేకెంట్)గా ఉన్నప్పుడే క్రమబద్ధీకరణను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 11 వేల మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 11 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొనగా.. వారిలో ప్రస్తుతం ఎంతమంది సర్వీసులో ఉన్నారు?, ఎక్కడెక్కడ ఏయే హోదాలో పనిచేస్తున్నారు? తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రత్యేక ఫార్మాట్ను తయారు చేసి ప్రభుత్వ శాఖలకు పంపింది. లెక్కలు తేల్చిన శాఖలు ప్రొఫార్మా ప్రకారం క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వ శాఖలు.. లభించిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆయా శాఖల్లో జిల్లాల వారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ ఆధారంగా అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, రోస్టర్ మినహాయింపులతో అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, మొత్తంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను ప్రాథమికంగా తేల్చాయి. వాటిని మరోమారు పరిశీలిస్తున్న శాఖలు అతి త్వరలో ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేందుకు సిద్ధమవుతున్నాయి. భారీగా తగ్గుతున్న అర్హులు! ప్రభుత్వం గుర్తించిన 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పోలిస్తే.. ప్రభుత్వ శాఖలు గుర్తించిన క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వారి సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ)ను 2003లో నియమించారు. ఈ పద్ధతిలో నియామకాలు చేపట్టగా.. తెలంగాణ ఏర్పాటు నాటికి 1,237 మంది ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్న ఖాళీలు 901 ఉండగా.. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీగా అర్హత ఉన్న సీఆర్టీలు 159 మంది మాత్రమే కాగా, రోస్టర్ మినహాయింపుతో (కొన్నిరకాల సవరణలతో అవకాశం ఉన్నవారు) మరో 42 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా 201 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నట్లు అంచనా వేసింది. అంటే 1,237 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హత సాధిస్తున్నవారు 201 మంది (16 శాతం) మాత్రమేనన్నమాట. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే తరహాలో అర్హతలున్న కాంట్రాక్టు ఉద్యోగుల సం ఖ్యకు భారీగా కోత పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ పెట్టిన మెలిక ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశే మిగల్చనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాలి దాదాపు 18 ఏళ్లుగా సీఆర్టీలుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ టీచర్ల నియామకానికి సమానంగా అన్ని రకాల అర్హతలను పరిశీలించి మమ్మల్ని నియమించారు. క్రమబద్ధీకరణపై ఆశతోనే అతి తక్కువ వేతనం ఇచ్చినా ఇన్నేళ్లుగా సర్దుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఎంతో సంతోషించాం. కానీ నామమాత్రంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తే మా సీఆర్టీల్లో దాదాపు 85 శాతం మంది అవకాశాన్ని కోల్పోతాం. వివిధ రకాల మెలికలు పెట్టి కోత పెడితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ వయసులో మాకెవరూ ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాల్సిందే. – మాలోతు సోమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్టీ అసోసియేషన్ -
తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడడమేనని ధ్వజమెత్తింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సోమ వారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మూలధన వ్యయం కోసం 2022–23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథ కాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఇది కొనసాగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుని, ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఆ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్రమే చెప్పింది.. మూలధన వ్యయం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లు , 2021–22లో రూ.15 వేల కోట్లు , 2022–23లో లక్ష కోట్లను రుణాల రూపేణా రాష్ట్రాలకు ఇస్తూ.. వాటిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనికి రాదని గతంలో కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మూలధన వ్యయానికి సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెందిన వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగల స్థితికి వస్తాయని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్సీడీసీలు ఇచ్చే రుణాల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కానీ వాటిలో కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం వివక్షే అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షపూరిత చర్యలు సరికావని పేర్కొన్నారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యంత కక్షపూరిత చర్య 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’ (ప్రభుత్వం నేరుగా తీసుకోని అప్పులు) అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని రామకృష్ణా రావు పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగానే భావించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలుపరచదలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి కానీ గత సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పడం ఏ మాత్రం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు అవసరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిబం ధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పారు. -
జీఎస్టీ శుభారంభం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్లో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి నెలతో పోల్చితే ఈ మొత్తం 25 శాతం అధికం. వ్యాపార క్రియాశీలత మెరుగుదలను గణాంకాలు సూచిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం... ►ఏప్రిల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లు. ►వాటిలో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.33,159 కోట్లు. ►స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.41,793 కోట్లు. ►ఇంటిగ్రేటెడ్ వసూళ్లు రూ.81,939 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.36,705 కోట్లుసహా). ►సెస్ రూ.10,649 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.857 కోట్లు సహా). ►ఇప్పటి వరకూ గత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిలో రూ.1.42 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మరుసటి నెల్లోనే ఆ పరిమాణాన్ని తాజా గణాంకాలు అధిగమించడం గమనార్హం. -
జీపీఎస్తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్
సాక్షి, అమరావతి: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ పొందేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ను ప్రతిపాదించింది. జీపీఎస్తోనే అధిక పెన్షన్ ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్)లో 20 శాతం పెన్షన్ వస్తోంది. సీపీఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్ రానుంది. దీనివల్ల పెన్షన్ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్కు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్లో అయితే సెకండరీ గ్రేడ్ టీచర్కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్ రానుంది. అదే ఆఫీసర్ సబార్డినేట్ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్లో రూ.15,829 పెన్షన్ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆచరణ సాధ్యం కాకే.. సీపీఎస్తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్ కొనసాగిస్తూ పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీపీఎస్ వల్ల మేలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది. – కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం జీపీఎస్ను ఆహ్వానిస్తున్నాం.. మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జీపీఎస్ను ప్రతిపాదించారు. పాత పెన్షన్ విధానంలో బేసిక్పై 50 శాతం పెన్షన్ ఇచ్చేవారు. జీపీఎస్ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం. – కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ -
జలం.. పుష్కలం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం వాటర్గ్రిడ్కు రూపకల్పన చేసింది. తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకు(2054) నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించే వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపర ఉత్తర్వులను ఫిబ్రవరిలోనే జారీ చేసింది. దీంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఐదు నియోజకవర్గాల్లోని 4,938 పల్లెలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది. నిధుల వినియోగం ఇలా రూ.2,400 కోట్ల వ్యయంతో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, ఈ రెండు జిల్లాల్లోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.1,550 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో రూ.850 కోట్ల పనులకు పాలనాపర అనుమతి రావాల్సి ఉంది. రూ.1,550 కోట్లలో కేంద్రం జల్జీవన్ మిషన్ కింద రూ.755 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.755 కోట్లు ఖర్చు చేయనుంది.్ల గండికోట రిజర్వాయర్ నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఇంటింటికి శుద్ధిచేసిన జలాన్ని కుళాయిల ద్వారా అందిస్తారు. పైప్లైన్ ఇలా: మామిళ్లవారిపల్లె రీట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఎడమవైపు పైప్లైన్ ద్వారా గుర్రంకొండ, వాయల్పాడు, కలికిరి, కలకడ, కేవీపల్లె, పీలేరు, సదుం, రొంపిచర్ల, పులిచర్ల మండలాలకు,కుడివైపు పైప్లైన్ ద్వారా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మీదుగా మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల వరకు సాగుతుంది. 165 కిలోమీటర్ల పైప్లైన్ వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి జిల్లాలోని గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు కృష్ణా జలాలను తరలించేందుకు 165 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మిస్తారు. నీటి తరలింపు కోసం గండి, కొండప్పగారిపల్లె, గాలివీడు, కార్లకుండ, గాలివీడు, కలిచర్ల వద్ద 25వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు నిర్మిస్తారు. రూ.850 కోట్లకు అనుమతి రావాలి మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వాటర్గ్రిడ్ అమలు కోసం రూ.850 కోట్లకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతానికి మంజూరైన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పనుల అమలు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాం. –ఎండీ.అబ్దుల్ మతీన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, మదనపల్లె
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement