-
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్జర్గాల్ డొల్గొర్జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
Swathi Muthyam@38: మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్తో పోలిక!! ఆస్కార్స్కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్కపూర్కు చూపించడం విశ్వనాథ్కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇది విశ్వనాథ్కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్సీజన్లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
బంగారంతో లెహంగా.. అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది!
అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రస్లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్ అగ్ర తారలు, ప్రముఖ పాప్ సింగర్లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన డ్రస్లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్కి తగ్గట్టు ఆమె డ్రస్లు నగలు చాలా గ్రాండ్గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్లో డ్రస్లు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా లండన్కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement