-
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్కు కంటగింపైంది. అఫ్గాన్లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
దేశం విడిచి వెళ్లండి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1లోగా అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్బ్యాంక్లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్బ్యాంక్లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్బ్యాంక్పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్స్లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు నెతన్యాహూ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్బ్యాంక్లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్లో సైనిక ఆపరేషన్కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్ భారీ సైనిక ఆపరేషన్
జెనిన్: శరణార్థుల శిబిరాల్లో మాటు వేసిన పాలస్తీనా ఉగ్రవాదులను ఏరివేయడం, వారి ఆయుధాలను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా వెస్ట్బ్యాంక్పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. వెస్ట్బ్యాంక్లోని జెనిన్ శరణార్థుల క్యాంప్లో సోమవారం నుంచి విస్తృతంగా సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సైతం దాడులు కొనసాగాయి. దీంతో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. దాదాపు 4,000 మంది పాలస్తీనా శరణార్థులు బయటకు వెళ్లిపోయారని జెనిన్ నగర మేయర్ నిడాల్ అల్–ఒబిడీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెన్ సైన్యం చెబుతున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని, జెనిన్ క్యాంప్లో మసీదు కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. జెనిన్ క్యాంప్లో ఈ స్థాయిలో సైనిక ఆపరేషన్ జరుగుతుండడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వెస్ట్బ్యాంక్లోని ఇజ్రాయెల్ వాసులపై ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి. గతనెలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అంతేకాకుండా పాలస్తీనా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. తమ పౌరులకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ వెస్ట్బ్యాంక్లు పాలస్తీనా పౌరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెనిన్ సిటీపై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులకు గట్టిపట్టుంది. వెస్ట్బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్ను 1967లో జరిగిన యుద్ధంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ స్వా«దీనం చేసుకుంది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ సైనిక వాహనం వద్ద బాంబు పేలుడు దృశ్యం -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
గ్రీస్లో పడవ మునక.. 79 మంది జలసమాధి
గ్రీస్: ఏథెన్స్: బతుకుదెరువు కోసం వలసపోతున్న డజన్లకొద్దీ శరణార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. దక్షిణగ్రీస్ సముద్రజలాల్లో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 79 మంది జలసమాధి అయ్యారు. డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. పెలోపోన్నీస్ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో మంగళవారం రాత్రివేళ జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు. విషయం తెల్సుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కాపాడిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్న వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. 78 మంది మరణించారని అధికారులు చెబుతున్నా ఇంకా ఎంతమంది మరణించి ఉంటారనేది తెలియట్లేదు. ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. తూర్పు లిబియా దేశంలోని తోబ్రక్ ప్రాంతం నుంచి ఈ శరణార్థుల పడవ బయల్దేరి ఇటలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఇలా ఒక వలసదారుల పడవ వస్తోందని ముందే గ్రీక్ అధికారులకు ఇటలీ అధికారులు సమాచారం ఇచ్చారు. వలసదారులను కలామటా నౌకాశ్రయానికి తరలించి అక్కడ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రథమ చికిత్స అందించారు. లిబియా అదుపులో వేలాది మంది శరణార్థులు అక్రమంగా ఇలా ప్రయాణం సాగిస్తున్న వారిపై గతంలోనే లిబియా సర్కార్ తన అప్రమత్తతను కనబరిచింది. ఈజిప్ట్, పాకిస్తాన్, సిరియా, సూడాన్ తదితర దేశాలకు వేలాది మంది శరణార్థులు సముద్ర జలాల్లో అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈజిప్ట్కు చెందిన వారిని వెంటనే భూమార్గంలో తిరిగి వారి దేశానికి పంపేసింది. లిబియా దక్షిణ ప్రాంతంలో చూస్తే రాజధాని ట్రిపోలీసహా పలు ప్రాంతాల్లోని శరణార్థి హబ్లలో సోదాలు చేసి దాదాపు 1,800 మందిని అదుపులోకి తీసుకుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. మధ్యధరా సముద్ర జలాల్లో స్థానిక తీర గస్తీ పెట్రోలియం దళాల కంటపడకుండా ఉండేందుకు చాలా మంది స్మగ్లర్లు పెద్ద సైజు పడవలను సమకూర్చుకుని అంతర్జాతీయ జలాల వెంట అక్రమంగా శరణార్థులను తరలిస్తున్నారు. ఆదివారం ఇదే మధ్యధరా సముద్ర జలాల్లో తమను కాపాడండంటూ అమెరికా తయారీ పడవలో వెళ్తున్న 90 మంది శరణార్థులు అత్యవసర సందేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
శరణార్థుల గోడు పట్టదా?
రోహింగ్యా శరణార్థుల అంశం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. అధికారంలో ఉన్నవారికి ఈ కాందిశీ కుల పట్ల అనుసరించాల్సిన వైఖరిలో స్పష్టత లేదని మరోసారి రుజువైంది. మురికివాడల్లోని 1100 మంది రోహింగ్యాలను ఢిల్లీ శివార్లలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు ఉద్దేశించిన నివాసాల్లోకి తరలించి, ప్రాథమిక వసతులు కల్పించి, పోలీసు భద్రత కల్పిస్తామంటూ కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆగస్ట్ 17న ట్వీట్ చేశారు. కానీ, అమిత్ షా సారథ్యం లోని హోమ్ శాఖ తక్షణమే రంగంలోకి దిగి, ‘‘చట్టవిరుద్ధమైన రోహింగ్యా విదేశీయులకు’’ ఆ నివాసాలివ్వాలంటూ ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివరణనిచ్చింది. కొద్ది గంటల తేడాలో ఒకే అంశంపై రెండు మంత్రిత్వశాఖలు రెండు రకాలుగా స్పందించడం విడ్డూరం. కాందిశీకుల అంశంపై దేశంలో జాతీయ స్థాయిలో ఓ చట్టం అవసరమని తాజా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. గతంలో యూపీ నీటిపారుదల శాఖ స్థలంలో ఉంటున్న నివాసాలు ప్రభుత్వం నోటీసిచ్చిన మరునాడే అనూహ్యంగా అగ్నికి ఆహుతయ్యాక, ఢిల్లీ శివారులోని ఓ ఇస్లామిక్ ఛారిటీకి చెందిన స్థలంలో తాత్కాలిక నివాసాల్లో, దగ్గరలో మరుగుదొడ్లు కూడా లేని దుర్భరస్థితిలో రోహింగ్యాలు బతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పిస్తామని సర్కార్ 2021లోనే అంది. ఆ పరిణామ క్రమంలోనే దౌత్యవేత్త, సీనియర్ మంత్రి పూరీ తాజా ట్వీట్ వచ్చింది. తీరా విశ్వహిందూ పరిషత్ సహా అధిక సంఖ్యాక హిందూ సమర్థకుల విమర్శలకు వెరచి, ప్రభుత్వం ప్లేటు ఫిరాయిం చడం శోచనీయం. రోహింగ్యా అనేది పశ్చిమ మయన్మార్ (బర్మా)లోని రఖైన్ ప్రావిన్స్కు చెందిన సమూహం. ముస్లిమ్లైన వీరు బెంగాలీలోని ఓ మాండలికంలో మాట్లాడతారు. మయన్మార్ వీరిని ‘నివాసిత విదేశీయులు’ అనీ, ‘సహచర పౌరుల’నీ పేర్కొంటోంది. 2012 నుంచి వరుస హింసా కాండలతో వీరు మయన్మార్ను వదిలిపోవాల్సి వచ్చింది. 5 లక్షల మంది సౌదీ అరేబియాకు పారి పోయారు. 2017లో మళ్ళీ మయన్మార్ సైన్యం దాడులతో, లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్లో తలదాచుకున్నారు. 2012లో 1200 మంది తొలి బృందం శరణార్థులుగా ఢిల్లీకి వచ్చింది. అయితే, 2018 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తం 12 మంది శరణార్థుల్ని మయన్మార్కు తిప్పి పంపింది. ఇది రోహింగ్యాల అంశంపై గళం విప్పుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ బృందం లెక్క. వారందరూ స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళారని సర్కారు వారి మాట. కానీ, ఐరాస శరణార్థి సంస్థ స్వతంత్రంగా ఆ సంగతి నిర్ధారించుకొనేందుకు పదే పదే అభ్యర్థించినా, అనుమతి నిరాకరించడం గమనార్హం. మన దేశంలో మొత్తంగా 40 వేల మంది రోహింగ్యా కాందిశీకులు ఉన్నారు. వారిలో 5700 మంది జమ్మూలో, మిగిలినవారు తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్లలో తలదాచుకున్నారు. అయితే వీరిలో 16 వేల మందే ఐరాస శరణార్థి సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు అని చిత్రీకరిస్తూ మెజారిటీ వర్గీయులు పోనుపోనూ స్వరం పెంచుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడితే, అంత ఎక్కువగా జాతీయతావాదులనే కీర్తి దక్కుతుందని భావిస్తున్నారు. నిజానికి, 1951 నాటి ఐరాస అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందంపై కానీ, కాందిశీకుల హోదాకు సంబంధించిన 1967 నాటి ప్రోటోకాల్పై కానీ భారత్ సంతకం చేయలేదు. కాబట్టి, అవతలి దేశంలో పీడనకు గురవుతారని తెలిసీ రోహింగ్యాలను మయన్మార్కు బలవంతాన పంపేయడం చట్టప్రకారం సరైనదేనని వాదించవచ్చు. అందుకు మునుపటి సుప్రీమ్ కోర్ట్ తీర్పుల్నీ ఉదాహరణగా చూపవచ్చు. కానీ, తెలిసి తెలిసీ అలా పంపరాదన్నదే సంతకాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టంలో అందరూ అనుసరించే సంప్రదాయం, ధర్మం. న్యాయస్థానం సైతం ఈ నిస్సహాయులకు అండగా నిలవకపోవడం విషాదం. హోమ్శాఖ 2011లో జారీ చేసిన ‘ప్రత్యేక వ్యవహార సూత్రాలు’ మినహా ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ ఆదర్శాలకు తగ్గట్టు శరణార్థులకు ఓ జాతీయ చట్టమంటూ లేకపోవడమే దీనికి కారణం. శశిధరూర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా రాజకీయ ఏకాభిప్రాయం లేక, లాభం లేకపోయింది. ఇప్పటికీ పాకిస్తానీ హిందువులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు దేశంలోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏ ప్రాంతానికీ చెందని ఇలాంటివారు దేశంలో 2.89 లక్షల మంది ఉన్నారు మరి, ఐరాస గుర్తింపుకార్డులిచ్చిన రోహింగ్యాల పట్ల పాలకులు అదే తరహా వైఖరి చూపడానికి ఇబ్బందేమిటి? పదేళ్ళుగా ఈ గడ్డపైనే ఉంటున్న సాటి మనుషులుగా రోహింగ్యాలు మెరుగైన జీవితం గడిపేలా చూడడం మానవత్వం. ఆ మేరకు గతంలో చేసిన బాసలకు భారత్ కట్టుబడాలి. వేదికలపై ‘వసుధైక కుటుంబం’ లాంటి కబుర్లు చెప్పే పాలకులు తీరా చేతల్లో తద్భిన్నంగా వ్యవహరిస్తే ఎలా? శరణార్థులపై విదేశాంగ విధానాల్లో ఒక మాట, దేశంలో రాజకీయ లబ్ధి కోసం వారినే ‘చెదలు’ అని ఈసడిస్తూ మరోమాట మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం? రోహింగ్యాలంటే తీవ్రవాదులే అన్న భావన ఎవరు, ఎందుకు కల్పిస్తున్నారు? ‘అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందా’న్ని భారతదేశం గౌరవిస్తుంది. జాతి, మతం, ధార్మిక విశ్వాసాల సంబంధం లేకుండా అందరికీ ఆశ్రయమిస్తుంది’ అనే మంత్రి గారి మాట ఉత్తుత్తిదేనా? శరణు కోరినవారిని కాపాడమనే శ్రీరాముడే ఆదర్శం అనే పాలకులు ఆలోచించాలి. -
World Refugee Day: బతుకు జీవుడా
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కన్న భూమిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాది పెరిగిపోతున్న శరణార్థుల్ని చూసే దిక్కు లేక దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడాది జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినం నిర్వహిస్తోంది. 10 కోట్లు.. అక్షరాలా పది కోట్లు మంది ప్రపంచవ్యాప్తంగా.. ఉన్న ఊరుని విడిచి పెట్టి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజీస్ (యూఎన్హెచ్సీఆర్) తేల్చిన లెక్కలు ఇవి. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణచివేత, హింసాకాండ, మానవహక్కుల హననం వంటి కారణాలు దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్యను పెంచేస్తున్నాయి. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో బలవంతంగా వలస బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. ఏటికేడు శరణార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందంటే వీళ్లందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే అది ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన 14వ దేశంగా అవతరిస్తుంది. అందులోనూ ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.9 కోట్ల మంది శరణార్థులు ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వారి సంఖ్య 10 కోట్లు దాటేసింది ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభాలు ఉక్రెయిన్ ఉక్రెయిన్పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చేస్తున్న భీకరమైన దాడులతో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇక అంతర్గతంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు 80 లక్షల మంది వరకు ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థి సంక్షోభం రికార్డు స్థాయికి చేరుకుంది ఇప్పుడే. పోలండ్, రష్యా, రుమేనియా వంటి దేశాలు ఉక్రెయిన్ శరణార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. వారి అవసరాలు తీరుస్తున్నాయి. సిరియా దాదాపుగా పదేళ్ల పాటు అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియాలో 2021 చివరి నాటికి 67 లక్షల మంది సిరియన్లు శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోయారు. లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టు, టర్కీ దేశాల్లో వీరంతా బతుకులీడుస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఈ దేశం నుంచి నిరంతరం శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లేవారు చాలా ఎక్కువ. ప్రతీ పది మందిలో ఒకరు అక్కడ జీవనం సాగించలేక ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. కనీసం 26 లక్షల మంది శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. సూడాన్ దక్షిణ సూడాన్లో నిరంతర ఘర్షణలతో ఇల్లు వీడి వెళ్లిన వారి సంఖ్య 40 లక్షలు ఉంటే, 26 లక్షల మంది దేశం విడిచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మయన్మార్ మయన్మార్లో రోహింగ్యాలను మైనార్టీల పేరుతో ఊచకోత కోస్తూ దేశం నుంచి తరిమి కొట్టడంతో ఏకంగా 10 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఆదుకోవడం ఎలా? శరణార్థులుగా ఇతర దేశాలకు వెళుతున్న వారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించడానికి ఆయా దేశాలు ఎంతో చేస్తున్నాయి. కానీ కేవలం అవి చేస్తే సరిపోవు. వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, కుటుంబం , స్థిరత్వం అన్నింటికంటే గుర్తింపు కూడా అత్యంత ముఖ్యం. ఇల్లు, దేశం విడిచి వెళ్లిన శరణార్థి ఇతర దేశాల్లో స్థిరపడడానికి కనీసం 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. శరణార్థులు కొత్త జీవితం గడపడానికి అవసరమైన నిధులు అందడం లేదు. ప్రతీ ఏడాది మానవీయ సంక్షోభాలు లెక్కకు మించి వస్తూ ఉండడంతో కనీసం వెయ్యి కోట్ల డాలర్లు (రూ.77,000 కోట్లు) లోటు ఉంది. యెమెన్, అఫ్గానిస్తాన్, సూడాన్లో శరణార్థులుగా మారిన వారిలో మూడో వంతు మందికి కూడా సాయం అందలేదని యూఎన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కాకుండా నిత్యం శరణార్థుల్ని పుట్టించే 30 ఘర్షణాత్మక ప్రాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. శరణార్థుల్లో సగానికి సగం మంది పిల్లలే ఉండడం ఆందోళనకరం. వారిలో ఒక్క శాతం మందికి కూడా సాయం అందడం లేదు. సంపన్న దేశాలు ఇకనైనా శరణార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
పగవారికీ రావొద్దీ కష్టం.. ఈయూ సాయం మరువలేనిది.. గణాంకాలివే!
రష్యా నిర్దాక్షిణ్యంగా కురిపిస్తున్న బాంబుల వర్షానికి గూడు చెదిరిపోయింది. శిథిల దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోతోంది. యుద్ధం ఊరు విడిచి వెళ్లిపొమ్మంటోంది. మగవాళ్లు దేశ రక్షణ కోసం ఆగిపోతుంటే మహిళలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో వలసబాట పట్టారు. వీరిని యూరప్ అక్కున చేర్చుకుంటోంది... కనీవినీ ఎరుగని మానవీయ సంక్షోభంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రష్యా దాడి మొదలైనప్పటి నుంచి దేశం విడిచిన వారి సంఖ్య 33 లక్షలు దాటేసింది. వీరిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. లక్షలాది మంది సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక దేశంలో నిరాశ్రయులైన వారు 65 లక్షల దాకా ఉంటారని ఐరాస హక్కుల మండలి అంచనా. ‘‘ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్న జనం వలస బాట పట్టారు. యుద్ధం ఆగితే తప్ప వలసలు ఆగేలా లేవు’’ అని యూఎన్హెచ్ఆర్సీ చీఫ్ ఫిలిప్పో గ్రాండీ అన్నారు. ఉక్రెయిన్లో మహిళల కష్టాలు వర్ణనాతీతం! ‘‘కరెంట్ లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవు. నరకం భరించలేక నానాకష్టాలకోర్చి వలస వచ్చా’’ అని ఓల్హా అనే మహిళ కన్నీరుమున్నీరైంది. శరణార్థులుగా మారితే అల్లకల్లోలం ఉక్రెయిన్ వలసలను చూసి ఇతర దేశాల్లోని శరణార్థులూ చలించిపోతున్నారు. ఈ బాధలు పగవారిక్కూడా వద్దని 13 ఏళ్లప్పుడే సిరియా నుంచి అమెరికా వలస వచ్చిన నిడా అల్జబౌరిన్ చెప్పింది. చిన్నవయసులో శరణార్థులుగా మారితే జీవితం అల్లకల్లోలమవుతుందని ఆవేదన వెలిబుచ్చింది. చిన్నారులను నేరస్తుల ముఠాలు ఎత్తుకెళ్లే ప్రమాదముందని యునిసెఫ్ హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ సాయం ఇలా ఉక్రెయిన్ ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని వస్తున్న వారిని యూరోపియన్ యూనియన్ అక్కున చేర్చుకుంటోంది. ఎక్కడికక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా నిత్యావసరాలు అందిస్తోంది. మంచి ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు సంక్షేమాన్ని కూడా చూస్తోంది. పిల్లలకు స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వనుంది. 27 ఈయూ దేశాలు శరణార్థులకు మూడేళ్ల పాటు ఉండే అవకాశం కల్పించాయి. అమెరికాలోకి శరణార్థులెవరూ రాకపోయినా మానవతా సాయం కింద ఉక్రెయిన్కు ఇప్పటికే 400 కోట్లకు డాలర్లకు పైగా అందించింది. అందులో 104 కోట్ల డాలర్లు శరణార్థులకు ప్రత్యేకించింది. ► ఉక్రెయిన్ నుంచి అత్యధికంగా పోలండ్కు 20 లక్షల మందికి పైగా వలస వెళ్లారు ► 5 లక్షల మంది రుమేనియాకు వెళ్లారు ► మాల్దోవాకు 4 లక్షల మంది వెళ్లారు. ఇక్కడ్నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు. ► 3 లక్షల మంది హంగరీ వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి ► స్లొవేకియాకు 2.5 లక్షల మంది వెళ్లారు – నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గానిస్తానీల దరఖాస్తులు 736
న్యూఢిల్లీ: ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 11 మధ్య 736 మంది అఫ్గానిస్తానీల దరఖాస్తులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శరణార్థుల విభాగం (యూఎన్హెచ్సీఆర్)లో నమోదయ్యాయని బుధవారం వెల్లడించింది. ఇవి భారత్లో ఉండేందుకు అఫ్గాన్వాసులు పెట్టుకున్న దరఖాస్తులని చెప్పింది. భారత్లో ఉన్న అఫ్గానిస్తాన్ వాసుల వీసాలు ముగిసిన వారు, తిరిగి వెళ్లాల్సిన వారు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. యూఎన్హెచ్సీఆర్ వద్ద ఉన్న డేటా ప్రకారం మొత్తం 43,157 మందికి భారత్ నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందని, అందులో 15,559 మంది అఫ్గాన్ శరణార్థులని చెప్పింది. 2021లో కొత్తగా భారత్ వచ్చిన వారు విద్యార్థి, వ్యాపారవేత్త, సాధారణ, మెడికల్ వీసాలను ఇచ్చే ప్రక్రియ తిరిగి ప్రారంభమవ్వాలని చూస్తున్నారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని యూఎన్హెచ్సీఆర్ తెలిపింది. శరణార్థుల కోసం 24/7 హెల్ప్ లైన్ ప్రారంభించినట్లు తెలిపింది. రోజుకు 130కి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిపింది. -
అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్ కార్ప్స్ బేస్, ఫోర్ట్ పికెట్, హోలోమ్యాన్ ఎయిర్బేస్లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్ ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు దీంతో అఫ్గాన్ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్ల్యాండ్ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు ఏ బేస్లో ఎంతమంది? జర్మనీలోని రమ్స్టెయిన్ బేస్కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు. బహ్రెయిన్లోని ఇసా ఎయిర్బేస్లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్ బ్లిస్లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్ డిక్స్లో 9,500 మందికి టెంట్ హౌస్ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అల్ ఉదైద్ బేస్లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్లను అధ్యక్షుడు బైడెన్ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్ పేలుళ్ల కారణంగా వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది. –నేషనల్ డెస్క్, సాక్షి -
శరణార్థులుగా మరో 5 లక్షల మంది అఫ్గాన్లు
జెనీవా: అఫ్గానిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న అనంతర పరిణామాలతో మరో 5 లక్షల మంది ప్రజలు స్వదేశాన్ని వీడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల విభాగం యూఎన్హెచ్సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారి 5.15 లక్షల మంది వరకు ప్రజలు శరణార్థులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. వీరికి ఆహారంతోపాటు తగు వసతులు కల్పించేందుకు సుమారు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల్లో 22 లక్షల మంది అఫ్గాన్లు శరణార్థులుగా నమోదై ఉన్నారని తెలిపింది. ‘ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస పెచ్చరిల్లిపోవడంతో ఆ ప్రభావం సామాన్య పౌరులపై తీవ్రంగా పడుతోంది. వారంతా ఉన్న చోటును వదిలి వేరే సురక్షిత ప్రాంతాలను వెదుక్కుంటూ మరోచోటుకు తరలివెళ్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5.58 లక్షల మంది ఇలా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే. పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి.. అంతర్గతంగా, విదేశాలకు తరలివెళ్లే వారి సంఖ్య ముందుముందు మరింత పెరిగే ప్రమాదముంది. అఫ్గాన్ ప్రజలకు రానున్నవి చీకటి రోజులు’ అని యూఎన్ హెచ్సీఆర్ ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ నెట్వర్క్ సీఈవో నజీబా వజెదాఫోస్ట్ శుక్రవారం వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్లో తెలిపారు. -
ఈ భూమిపై మాకింత చోటేది?
ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు విదేశీయుల ఏలుబడిలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నాయి. తమ పాలకులను, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ కొన్ని దేశాల్లోని ప్రజలకు ఆ స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. బాధ వస్తే కన్నీళ్లు కార్చడం, ఆకలి వేస్తే పొట్ట చేత పట్టుకోవడం అక్కడ ప్రజలకు సర్వసాధారణం. ఎందుకంటే.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. 2001 నుంచి ఐక్యరాజ్య సమితి, 100కి పైగా దేశాలు జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి. మరి ఆ కన్నీటి గాథలు ఓసారి తెలుసుకుందాం! యూఎన్హెచ్సీఆర్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో 21 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ 10 మిలియన్ల మందికి సరియైన ఉందామంటే గూడు లేదు. రోజుకు సగటున 42,500 మంది రక్షణ కోసం తమ ఇళ్లను వదిలి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. గత సంవత్సరం 13.9 మిలియన్ల మంది కొత్తగా నిరాశ్రయులయ్యారు. ఇక సిరియాలో అంతర్యుద్ధం అక్కడి ప్రజల జీవితాల్లో అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా సిరియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది సిరియా జనాభాలో 45శాతం. ప్రపంచంలోని 86శాతం శరణార్థులకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. గత దశాబ్దంలో వివిధ దేశాలకు శరణార్థులుగా వేళ్లే వారి సంఖ్య 16 శాతం పెరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం కెన్యాలోని దాదాబ్లో ఉంది. అక్కడ దాదాపు 3,29,000 మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే గతంలో భద్రతాపరమైన ప్రమాదాల కారణంగా దాదాబ్ శరణార్థుల శిబిరాన్ని మూసివేస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మిలియన్ల శరణార్థులలో 18 ఏళ్లలోపు ఉన్నవారు 51 శాతం. రెండవ ప్రపంచ యుద్థ తరువాత అత్యధిక సంఖ్యలో బాలలు శరణార్థులుగా మారడం ఇదే ప్రథమం. ఇక 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోని శరణార్థుల్లో ప్రధానభాగం సిరియా, అఫ్గానిస్థాన్, దక్షిణ సూడాన్, పాలస్తీనా, ఇరాక్, ఉగాండా, సోమాలియా, మయన్మార్లలోనే ఉన్నారు. ఇప్పటికీ సిరియాను 'శరణార్థుల ఉత్పత్తి దేశం'గా పిలుస్తారు. ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, విదేశాంగ దౌత్య సంబంధాలు, భూభాగ సరిహద్దుల అంశాల్లో కట్టుదిట్టమైన విధానాలను అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల్లో సరిహద్దు భూభాగంలో ఇనుప కంచెల ఏర్పాటు, గట్టి భద్రత, పౌరసత్వ గుర్తింపు తనిఖీ, నియంత్రణ కోసం గస్తీ బలగాలను పెద్దఎత్తున మోహరిస్తున్నారు. ప్రధాన రహదారులనూ మూసివేస్తూ, శరణార్థులు చొరబడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఐరాస చొరవతో ప్రపంచంలోని అన్ని దేశాలతో చర్చలు జరిపి, ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు ప్రాణరక్షణ, పునరావాసం, విద్య, వైద్యం, ఆహారం, మందులు, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
'ఆ' చట్టంలో శ్రీలంక తమిళులు ఎక్కడా?
ముంబై: సవరించిన పౌరసత్వ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే ఎందుకు రూపొందించారని, శ్రీలంక తమిళులకు ఎందుకు వీలు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర గణాంక పట్టిక (ఎన్నార్సీలు) దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీలను కేవలం మైనారిటీలే కాదు, దేశంలో ఏకత్వం(ఐక్యత), దేశ అభివృద్ధిని కాంక్షించే వారు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పౌరసత్వ చట్టం సమాజంలో మతపరమైన ఇబ్బందులను సృష్టించడంతో పాటు దేశ ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. సీఏఏ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కావచ్చు, కానీ దాని అమలు రాష్ట్ర ప్రభుత్వాలచే చేయబడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని బిహార్తో సహా ఎనిమిది రాష్ట్రాలు నిరాకరించాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబించాలని పవార్ పేర్కొన్నారు. సవరించిన చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింసేతర కారణల వల్ల భారత్కు వచ్చే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు. కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే విభజించబడిందని పేర్కొన్నారు. మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. नागरिकता संशोधन कानून का प्रस्ताव लोकसभा और राज्यसभा में रखा गया और वह बहुमत से पारित हुआ। इस पहल के लिए, इस साहसिक कदम के लिए, हम केंद्र सरकार का और विशेषतः प्रधानमंत्री और गृहमंत्री जी का हृदय से अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं। - सरकार्यवाहhttps://t.co/UfcVpZLDID pic.twitter.com/dUgs9Kvu12 — RSS (@RSSorg) December 12, 2019 ‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు. -
బైబై ఇండియా..!
భారత్ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ
కొలంబో/కల్మునయ్: శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి కల్మునయ్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. షాంగ్రీలా హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్ అహ్మద్ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్ టీచర్(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సదరు టీచర్ నుంచి 50 సిమ్కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్ హషీమ్ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్ తౌహీద్ జమాత్ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్ను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం శ్రీలంకలోని కల్మునయ్ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్ హషీమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
మెక్సికో సరిహద్దుకు భారీగా అమెరికన్ దళాలు
వలసల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంభించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. మెక్సికో సరిహద్దు భద్రతలో చురుకైన పాత్ర పోషించేందుకు మిలటరీ హెలికాప్టర్లు సహా 5,200కు పైగా దళాలను పంపనున్నట్టు సోమవారం ప్రకటించింది. నవంబరు 6న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో – తన మద్దతుదారులను ఆకట్టుకునేందుకు ట్రంప్ ‘అక్రమ వలస’ల అంశాన్ని అతి పెద్ద ఎజెండాగా మలచుకున్నారు. సరిహద్దుల భద్రతనే దేశ భద్రతగా స్పష్టీకరించారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దీన్నొక రాజకీయ స్టంటుగా వ్యాఖ్యానించింది. రిపబ్లికన్లు సెనేట్పై పట్టు కోల్పోయినట్టయితే.. అధికారంలో వుండే మిగిలిన రెండేళ్లలో తన విధానాలు కొనసాగించడం ట్రంప్కు కష్టమే. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అక్రమ వలసపై విరుచుకుపడుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – 75శాతం రిపబ్లికన్ ఓటర్లు అక్రమ వలసలను అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. (డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లలో ఇలా భావించే వారు 19 శాతం) వలసదార్లను తిప్పికొట్టే విషయంలో మిలటరీ తనదైన ప్రత్యేక పాత్ర పోషించబోతున్నట్టు ట్రంప్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దక్షిణ సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించబోతున్న సమూహాల్లో – కొందరు దుష్టులు, అనేక ముఠాలవాళ్లు వున్నారన్న ట్రంప్.. వలసదార్లు తరలిరావడాన్ని దేశంపై జరుగుతున్న దండయాత్రగా అభివర్ణించారు. శరణుకోరి వచ్చే వారి కోసం టెంట్ సిటీలు నిర్మిస్తామని, మిలియన్ డాలర్లు ఖర్చుబెట్టి ఎలాంటి నిర్మాణాలూ చేపట్టబోమని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పేర్కొన్నారు. సరిహద్దు గుండా దేశంలో ప్రవేశించే వలసదార్లపై ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ను ప్రయోగించడంపై కూడా ట్రంప్ సర్కారు పరిశీలన జరుపుతోంది. జాతీయ భద్రతా కారణాలపై కొందరు వలసదార్లకు ఆశ్రయమివ్వకుండా తిరస్కరించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. మెక్సికోకు బెదిరింపులు గ్వాటిమాలా, హోండురాస్, ఎల్ సాల్విడార్ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించజూస్తున్న వలసదార్లను ఆ దేశం గనుక అడ్డుకోనట్టయితే, సరిహద్దులోకి మిలటరీని తరలిస్తామని, దక్షణ సరిహద్దును మూసివేస్తామని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. వలసదార్లను అడ్డుకోనట్టయితే పెండింగ్లో వున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మళ్లుతామని కూడా ఆయన బెదిరించారు. ఈ నేపథ్యంలో వలసదార్లను అడ్డుకునేందుకు.. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నిటో భారీగా పోలీసులను రంగంలోకి దించారు. గత వారం వలసదార్ల ముందు ఒక ఒప్పంద ప్రతిపాదన కూడా చేశారు. మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా, చిపాస్లో వుండేట్టయితే.. వారికి తాత్కాలిక వర్క్ పరిమిట్లు ఇస్తామని, పాఠశాలల్లో చేరేందుకు, వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని ప్రకటించారు. అత్యధిక వలసదార్లు దీన్ని కొట్టిపడేశారు. అమెరికా సరిహద్దులోకి వెళ్లేందుకే వారు మొగ్గు చూపారు. శరణార్ధుల సుదీర్ఘ యాత్ర.. అమెరికాలోకి ప్రవేశించేందుకు హోండురాస్లోని శాన్ పెడ్రో సులా నుంచి 15 రోజుల కిందట బయలుదేరిన 3000 నుంచి 7000 మంది శరణార్ధులు 600 మైళ్లు దాటినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించాలంటే వీరు ఇంకా 2,200 మైళ్లు ప్రయాణించాల్సివుంది. అమెరికానే తమకు ఆశావహమైన దేశమనీ, అక్కడే సురక్షితంగా వుండగలమనీ భావిస్తున్న ఈ శరణార్ధులు – ఉత్సాహం తెచ్చుకునేందుకు పాటలు పాడుకుంటూ.. నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
శరణం గచ్ఛామి
టైమ్ మ్యాగజైన్ తాజా ముఖచిత్రం చూశారా? గులాబీ రంగు చొక్కాతో ఓ అమ్మాయి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూంటే.. ఎదురుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉంటాడు. ఆ చిన్నారి తల్లి ఓ శరణార్థి. బతుకీడ్చేందుకు సరిహద్దు దాటింది. అవకాశాల స్వర్గమంటున్న అమెరికాలో కాలుపెట్టి దొరికిపోయింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు.. యుద్ధ వాతావరణంతో నిండిన ఏ దేశ సరిహద్దులు చూసినా ఇదే తీరు. పొట్టచేత పట్టుకుని దేశాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎందరో..! ఆ మూడు దేశాల్లోనే సగం మంది! సరిహద్దులు దాటివచ్చిన శరణార్థులకు పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించిన దేశాల్లో టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా ముందు వరసలో ఉన్నాయి. భారత్ కూడా అత్యధికంగా శరణార్థుల్ని అక్కున చేర్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగం మందికిపైగా ఈ మూడు దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా వంటి ధనిక దేశాలు శరణార్థులపై అక్రమ వలసదారులన్న ముద్ర వేసి సరిహద్దుల్లో ఆపేస్తూ, గోడలు నిర్మిస్తామని హెచ్చరికలు చేయడం, తల్లిదండ్రుల నుంచి చిన్నారుల్ని వేరు చేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడటంతో నిరాశ్రయుల్ని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ మూడు దేశాలు శరణార్థుల ఆశ్రయానికి ముందుకు రాకపోతే నిరాశ్రయులకు భద్రత కరువై మానవత్వమే మంట గలిసే పరిస్థితి రావడమే కాదు, వివిధ దేశాల్లో సుస్థిరత కూడా దెబ్బతినేదన్న అంచనాలు ఉన్నాయి. ఉన్న ఊరు పొమ్మంటోంది. తలదాచుకోవడానికి జన్మభూమిలో జానెడు జాగా కూడా లేదు. నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రవాదుల దాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు.. కారణాలు ఏవైతేనేం పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల దుర్భర పరిస్థితులు గుండెల్ని మెలిపెడుతున్నాయి. జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల సంస్థ(యూఎన్హెచ్సీఆర్), అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణా కేంద్రం సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఆ నివేదిక ప్రకారం 2017లో అత్యధికంగా శరణార్థులు సొంత దేశాలు విడిచి వెళ్లారు. శరణార్థుల సంఖ్యలో 13 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 6.85 కోట్ల మంది నిర్వాసితులైతే, వారిలో 2.54 కోట్ల మంది వేరే దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శరణార్థుల సంఖ్య పెరిగింది గత ఏడాదే. ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతూ ఉండటం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. శరణార్థుల్లో ఎక్కువ మంది సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్ తదితర దేశాల వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 52 శాతం చిన్నారులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. 2009లో శరణార్థుల్లో 41 శాతం మంది బాలలు ఉంటే, అదిప్పుడు 52 శాతానికి పెరిగింది. దక్షిణ సూడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఎక్కువ మంది పిల్లలు శరణార్థులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కారణాలివే.. - 2011లో సిరియాలో అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు అంతర్యుద్ధానికి దారి తీసింది. తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు పలకడం, రష్యా, ఇరాన్ అసద్ వైపు నిలబడటంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల్లో సిరియా నుంచి 56 లక్షల మంది టర్కీ, లెబనాన్, జోర్డాన్, జర్మనీలకు శరణార్థులుగా వెళ్లారు. - అఫ్గానిస్తాన్లో దీర్ఘకాలంగా నెలకొన్న యుద్ధవాతావరణం, తాలిబన్ల అరాచకాల కారణంగా ప్రపంచంలోనే శరణార్థులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా మారింది. పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారి సంఖ్య 26 లక్షల వరకూ ఉందని అంచనా. - దక్షిణ సూడాన్లో నెలకొన్న దుర్భర కరువు పరిస్థితులు, ఆహార కొరత, అంతర్యుద్ధం కారణంగా శరణార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికీ దేశంలోని సగం మంది జనాభాకి కడుపు నిండే పరిస్థితి లేదు. ఆ దేశం నుంచి 14 లక్షల మంది ఉగాండా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. - మయన్మార్లో రోహింగ్యాలు ఎదుర్కొన్న వివక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైనిక, భద్రతా దళాల వేధింపులు తట్టుకోలేక రోహింగ్యాలు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్కు వెల్లువలా వచ్చారు. 2017లో మయన్మార్ నుంచి 12 లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బంగ్లాదేశ్కు వెళ్లిపోయారు. - 1991 నాటి అంతర్యుద్ధ ప్రభావం ఇప్పటికీ సోమాలియాను వెంటాడుతోంది. అత్యంత నిరుపేద దేశంగా మారింది. 2012లో అంతర్జాతీయ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన దాడులతో కల్లోలం ఏర్పడింది. అల్ కాయిదా వంటి సంస్థలు కూడా దాడులకు దిగడంతో 10 లక్షల మంది కెన్యా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఏయే దేశాల నుంచి.. సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియా, వియత్నాం ఏయే దేశాలకు వెళుతున్నారు.. (శరణార్థులు ఎక్కువగా సరిహద్దు దేశాలకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు) టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా, పాకిస్తాన్, లెబనాన్, ఇరాన్ - రోజుకి సగటున 44,500 మంది దేశం విడిచి వెళుతున్నారు. - ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతున్నారు. - శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. - ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగానికి పైగా టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండాలో తలదాచుకుంటున్నారు. - అమెరికా శరణార్థుల్ని దరికి రానివ్వట్లేదు. గతేడాది 60 వేల మందికే ఆశ్రయమిచ్చింది. - భారత్కు శరణార్థులు వరదలా వస్తున్నారు. ఏకంగా 20 లక్షల మందికి ఆశ్రయం కల్పిం చింది. వీరిలో చైనా(ముఖ్యంగా టిబెట్ నుంచి), శ్రీలంక నుంచే అత్యధికులు వచ్చారు. పౌరసత్వం ఫర్ సేల్..! వివిధ దేశాల్లో అత్యంత సంపన్నులు, మల్టీ మిలియనీర్లు ఒకటికి మించి ఎక్కువ దేశాల పాస్పోర్టులు కలిగి ఉండటం ఓ అత్యున్నత హోదాకు చిహ్నం. ముఖ్యంగా 21వ శతాబ్దపు ధనికస్వామ్యంలో మూడు, నాలుగు దేశాల పౌరసత్వాలున్న వారు కూడా ఉన్నారు. ఐరోపా సంఘం(ఈయూ) లోని పలు దేశాలతోపాటు దాదాపు పాతిక దేశాల్లో పౌరసత్వం పొందవచ్చు.. అయితే దానికీ ఓ రేటు ఉంది సుమా..! గ్లోబల్ మార్కెట్లో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్(సీఐపీ) ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు బాగా డిమాండున్న బిజినెస్. తక్కువలో తక్కువ రూ.68 లక్షలు(లక్ష అమెరికన్ డాలర్లు) మొదలుకుని 2.5 మిలియన్ యూరోల(సుమారు రూ.20 కోట్లు) వరకు వివిధ స్కీంల కింద ఖర్చవుతుంది. ఆయా దేశాల్లో ఆస్తుల కొనుగోలు లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు లేదా నేరుగా నగదు విరాళాలు ఇవ్వడం ద్వారా పౌరసత్వాన్ని, పాస్పోర్ట్ను పొందవచ్చు. కొన్ని దేశాల్లోనైతే ఒకేసారి సిటిజన్షిప్ ఇవ్వకుండా ‘గోల్డెన్ వీసా’పథకాల నిర్వహణ ద్వారా ఐదేళ్ల తర్వాత పౌరసత్వాన్ని ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మనది భిన్నమైన పరిస్థితి.. భారత్లోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఐపీఎల్ మాజీ సారథి లలిత్ మోదీ, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఈ కోవలోకే వస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు అందకుండా తప్పించుకుని తిరుగుతూ విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న నీరవ్ మోదీ వద్ద ఆరు పాస్పోర్టులున్నాయి. ప్రస్తుతం డొమినికా, సెయింట్ లూసియా, ఆంటిగ్వా, గ్రేనెడా, సెయింట్ కిట్స్, మాల్టా, సైప్రస్లో లక్ష డాలర్ల నుంచి 2.4 మిలియన్ డాలర్లలోపు పెట్టుబడులు పెడితే 3, 4 నెలల్లోనే సిటిజన్షిప్ను అందజేస్తున్నాయి. రెండు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి భారత్లో అనుమతి లేదు కాబట్టి, దేశం వెలుపల శాశ్వతనివాసం పొందడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. మరో దేశ పౌరసత్వం కోరకుండానే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. కరీబియన్ దీవుల్లో ప్రభుత్వ నిధికి లక్ష డాలర్లు విరాళమిస్తే చాలు పౌరసత్వం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పాస్పోర్టుల ద్వారా వీసాలు లేకుండానే 120 దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది. కరెన్సీ డాలర్లలోనే ఉంటుంది కాబట్టి విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులేమి పడవు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో.. తమ దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొన్ని నెలల్లోనే పౌరసత్వం అందిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. సైప్రస్లో 20 లక్షల యూరోలు పెట్టుబడి పెడితే చాలు సిటిజన్ షిప్ వచ్చేస్తుంది. మనదేశం నుంచి 2017లో ఏడు వేల మంది శ్రీమంతులు ఇతర దేశాలకు మకాం మార్చినట్టు న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ఇటీవల వెల్లడించింది. -
అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది 7000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2017లో అమెరికాను ఆశ్రయం కోరిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది వలసబాట పట్టారని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ తన వార్షిక నివేదికలో తెలిపింది. వీరిలో 1.6 కోట్ల మంది కేవలం గత ఏడాదిలోనే వలసలకు లోనయ్యారని పేర్కొంది. రోజుకు 44,500 మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రతి రెండు సెకన్లకూ ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళుతున్నారని నివేదిక వెల్లడించింది. యుద్ధాలు, హింస, ప్రాసిక్యూషన్ల కారణంగా వరుసగా ఐదో ఏడాది 2017లో అత్యధికంగా వలసలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కాంగో సంక్షోభం, సూడాన్ యుద్ధం, రోహింగ్యా శరణార్ధుల వ్యవహారంతో వలసలు పెరిగాయని విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆలియా
‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి.‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. పైనెక్కడో స్వర్గం ఉంటే ఉండనివ్వండి. ఎవరిక్కావాలది భూమ్మీద మనకో ఇల్లుంటే! సొంతఇల్లేం కాదు. సొంత మనుషులతో ఉన్న ఇల్లు. అది చాలు. దేవుణ్ణే దిగిరమ్మని పిలిచి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దేవుణ్ణి ఇల్లంతా తిప్పి చూపించవచ్చు. ‘దేవుడా ఇది హాలు. అది కిచెన్. ఇదిగో నీ గది. అందులో నీ పటం. తినని రోజు ఉంటుందేమో. నీ పటం ముందు నిలబడని రోజు ఉండదు మాకు’ అని ఆయనక్కూడా కాస్త కుంకుమ అద్దొచ్చు. దేవుణ్ణి కాసేపలా మొక్కల మధ్యలోకి తీసుకెళ్లొచ్చు. దేవుడు ఊరికే చూస్తుంటాడు. అతిథి కదా. అది మన ఇల్లు కదా! ఆలియాకు కూడా ఇలాంటి ఇల్లే ఉండేది. ఆలియా ఏడేళ్ల పిల్ల. అలెప్పోలో వాళ్ల ఇల్లు. సిరియా! ఆ ప్రాంతంలోనే కొంత దూరంలో నానమ్మ, తాతయ్యల ఇల్లు. రెండు స్వర్గాలు ఆలియాకు. ఓ రోజు ఆలియాను చంకనేసుకుంది తల్లి. ‘ఎక్కడికమ్మా!’.. అడిగింది ఆలియా. ‘ఇల్లొదిలి వెళ్లిపోతున్నాం’ అంది. ఇల్లొదిలి వెళ్లిపోతున్నామనే చెప్పింది. ఊరొదిలీ, దేశం వదిలీ వెళ్లిపోతున్నాం అని చెప్పలేదు. ముందు నానమ్మ వాళ్లింట్లో వదిలిపెట్టింది. అక్కడ మళ్లీ తాతయ్య ఆలియాను చంకనేసుకున్నాడు. తాతయ్య కూడా అమ్మ చెప్పినట్లే చెప్పాడు. ‘మనం ఇల్లొది వెళ్లిపోతున్నాం’ అని! రెండిళ్లూ పోయాయి. పోయిన స్వర్గాల గురించి ఆలోచించే వయసా అది. వెళ్లిన చోట ఇంకో స్వర్గం. అంతే కదా పిల్లలు. కొత్త ప్రదేశాల కన్నా కూడా కొత్త ప్రదేశాలకు కదలడాన్ని ఇష్టపడతారు. తాతయ్య భుజం ఎక్కి కూర్చుంది ఆలియా. కుటుంబం అంతా నడుస్తోంది. నడుస్తోంది. నడుస్తోంది. దారి పొడవునా తాతయ్య కాళ్లకు మనుషులు తగులుతున్నారు. మనుషులు కాదు. తునాతునకలైన మనుషులు. కాళ్లూ చేతులు లేనివి కొన్ని. తలలూ మొండేలు లేనివి కొన్ని. మనవరాలికి నేల కనిపించకుండా ఆకాశాన్ని చూపిస్తున్నాడు తాతయ్య. ఎంతసేపని ఆకాశంలోకే చూస్తుంది. ఆమె చూపు నేలను తాకింది. పెద్దగా ఏడుపందుకుంది ఆలియా. ‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి. ‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. ఇప్పుడు లెబనాన్లోని దేమర్లో ఉంటోంది ఆలియా, తాతయ్య.. ఇంకా అమ్మ, నాన్న. అలెప్పోలో తన స్నేహితురాలిని వదిలొచ్చి సరిగ్గా ఏడాది అవుతోంది ఆలియా. ఆ స్నేహితురాలి పేరు రవుయా. తనను మర్చిపోలేకపోతోంది. కలిసి ఆడుకునేవారు. కలిసి స్కూలుకు వెళ్లేవారు. కొన్ని పావురాలు ఉండేవి. వాటిల్లో కొన్ని గుడ్లు కూడా పెట్టాయి. ఆ పావురాలకు ఆలియా గింజలు వేసేది. ఇప్పుడు వాటన్నిటినీ తలుచుకుని బెంగపడుతోంది. వాటి గురించి దేవుణ్ణి ప్రార్థిస్తోంది. వాటి గురించే కాదు, ఆ రోజు తాతయ్య భుజం మీద నుంచి చూసిన మృతదేహాల గురించి కూడా! ఇప్పుడు తెలుస్తోంది ఆలియాకు అలñ ప్పోలో తనకు రెండు స్వర్గాలు ఉండేవని. శరణార్థులకు అందే సహాయం ఆలియా కుటుంబానికి కూడా అందుతోంది. మంచి తిండి ఉంది. మంచి బట్టలు ఉన్నాయి. మంచి స్వర్గమే లేదు. ఆలియా ఓ పిల్లి పిల్లను పెంచుకుంటోంది. అదెప్పుడూ ఆలియా ఒంటి మీదే ఉంటుంది. ఆ పిల్లితో ఆలియా ఎప్పుడూ అంటుండే మాట.. ‘అలా మ్యామ్ మ్యావ్ మంటూ అరవకు. త్వరలోనే మన ఇంటికి మనం వెళ్లిపోతాం’ అని! ఈ రోజు ‘ప్రపంచ శరణార్థుల దినం’. ప్రపంచం మొత్తం మీద రెండు కోట్ల ఇరవై లక్షల మంది శరణార్థులు ఉన్నారు. ఆలియాకు ఉన్నట్లే.. రెండు కోట్ల ఇరవై లక్షల కథలున్నాయి. – మాధవ్ శింగరాజు -
రోహింగ్యాలకు మయన్మార్ పిలుపు
కాక్స్ బజార్ : మయన్మార్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన ఏడు లక్షల రోహింగ్యా ముస్లింలు తిరిగి స్వచ్ఛందంగా మయన్మార్ రావచ్చని ఈ దేశ జాతీయ భద్రత సలహాదారుడు థాంగ్ తన్ తెలిపారు. సింగపూర్లో జరుగుతున్న ప్రాంతీయ భద్రతాదళ సమావేశంలో థాంగ్ మాట్లాడుతూ.. ‘రోహింగ్యా ముస్లింలు స్వచ్ఛందంగా మయన్మార్ తిరిగి రావచ్చు. వారు మేం వస్తున్నాం అంటే మా దేశం వారికి స్వాగతం పలుకుతుంది. ఐక్యరాజ్యసమితి బాధ్యతలను కాపాడటానికి రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను తమ దేశానికి ఆహ్మానించాల్సిన అవసర ఉందని’ ఆయన పేర్కొన్నారు. 2017 నుంచి మయన్మార్లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైన్యం చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. సైన్యం నుంచి తప్పించుకుని పారిపోయిన రోహింగ్యాలు ఎక్కువగా బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను మయన్మార్ రావటానికి వీలుగా యూఎన్ఓ రూపొందించిన అవగాహన పత్రంపై థాంగ్ తన్ సంతకం చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. ముఖ్యమైన సూచనలు ఇవే..
గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!
సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్..
టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
Advertisement