-
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్లెన్నో ఊహించగలరా?
‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్కు పూనకాలే. బ్లాక్ బస్టర్మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. . పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్మూవీ జవాన్లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్ఆర్కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి. పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు. మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్ఫోన్ పైకి మళ్లదు. పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్ఫోన్ బారిన పడకుండా స్మార్ట్గా తయారవుతారు. -
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
స్మార్ట్ఫోన్లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్లో డిప్రెషన్తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. -
ఆన్లైన్లో ‘అగ్రి’ సెన్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రైతుల జీవన స్థితిగతులు..సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయగణన (అగ్రికల్చర్ సెన్సెస్) ఇటీవల దేశవ్యాప్తంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూకమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం పది అంశాలపై మూడు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాగిత రహితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు వినియోగించి ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో ఏఈఓలు సర్వే చేస్తుండగా, మిగతా రాష్ట్రాల్లో మాన్యువల్గానే చేపడుతున్నారు. 2021–22 ప్రామాణికంగా 11వసారి దేశంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక ఆర్థిక విధాన రూపకల్పనకు కేంద్రం ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తోంది. 1979లో వ్యవసాయగణన మొదలుకాగా, చివరగా పదోసారి 2015–16లో చేపట్టారు. 11వ వ్యవసాయ గణన 2021–22లో జరగాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021–22 ప్రామాణిక సంవత్సరంగా ఈ నెల నుంచి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. మూడు దశల్లో... వానాకాలం, యాసంగిలో ఆయా రైతుల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఏటా వ్యవసాయశాఖ సర్వే చేస్తోంది. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మూడు విడతల్లో వ్యవసాయ గణన చేపట్టారు. ♦ మొదటి విడతలో రైతు పేరు, సామాజికస్థితి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం, పురుషులు, మహిళలు ఇలా అన్ని సేకరించి రెవెన్యూ గ్రామం వారీగా నమోదు చేస్తున్నారు. ♦ రెండో విడతలో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టీఆర్ఏఎస్ (ట్రైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్)తో పాటు అదనంగా మరికొంత సమాచారం సేకరిస్తారు. ♦ మూడో దశలో ఏడు శాతం గ్రామాల్లో సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ రాయితీలు తదితర వివరాలు సేకరిస్తారు. సాంకేతికతతో సర్వే... తాజాగా రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణనలో అధికారులు వందశాతం సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో వ్యవసాయ కమతాలు, రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకానికి రైతుల నుంచి ఆధార్ కార్డులు, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పంటల సాగు తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచగా, వాటి ఆధారంగా వ్యవసాయగణనలో అదనపు సమాచారం తీసుకుంటున్నారు. ప్రణాళికకు వ్యవసాయ గణన కీలకం వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆర్థిక విధాన రూపకల్పనకు వ్యవసాయ గణన ఎంతో ఉపయోగకరం. నిరీ్ణత లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. – దశరథ్, మహబూబ్నగర్ జిల్లా ప్రణాళికశాఖ అధికారి ఈ నెల 31లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ గణన చేయిస్తున్నాం. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు అనుగుణంగా ఈ పంటల వివరాల లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేస్తాం. – బి.వెంకటేష్, మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి -
మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు!
ఇండియా టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతున్న తరుణంలో భారతీయులు సగటున ప్రతి రోజు 194 నిముషాలు.. అంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో గడుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సగటున భారతీయులు 46 నిమిషాలు ఆన్లైన్ గేమ్లలోనూ, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ఫామ్లపై 44 నిమిషాలు ఇలా సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్లోని డేటా ఆధారంగా విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్ఫోన్లు లేదా టాబ్లెట్ల ద్వారా జరిగినట్లు స్పష్టమైంది. OTT కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను, 4 శాతం మంది ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లను ఉపయోగించారు. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్లను ఉపయోగించారు. ఇదీ చదవండి: వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! ఇలా చేస్తే తగ్గే అవకాశం.. ఇంటర్నెట్లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే, సోషల్ మీడియా వినియోగదారులకు చాలా వరకు ఉచితం అని నివేదిక పేర్కొంది. కానీ వారు OTT కంటెంట్పై నెలకు రూ. 201 నుంచి రూ. 400, అదే విధంగా ఆన్లైన్ గేమింగ్పై నెలకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్ఫామ్ ధరలను 30 శాతం పెంచినట్లయితే.. 71 శాతం మంది గేమర్లు, 17 శాతం OTT ప్రేక్షకులు సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. -
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
రియల్మీ నుంచి కొత్త సిరీస్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ 11 ప్రో సిరీస్ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఏర్పాటు ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 4గీ లాస్లెస్ జూమ్ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్ సూపర్వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రోలైట్ కెమెరా, 67 వాట్ సూపర్వూక్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది. ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది! -
ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు.. తాజాగా హైదరాబాద్లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ శామ్సంగ్ ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్లెట్లలో స్మార్ట్థింగ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు. -
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈవో..
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు. అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్ఇన్లో చెప్పుకొచ్చారు. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
ఫ్లిప్కార్ట్లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్పై కచ్చితమైన డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్లో ఈ ఐ-సిమ్ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్లు, సేఫ్టీ ఫీచర్స్ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
లిథియం బ్యాటరీలకు భారీ డిమాండ్.. ఏకంగా 5 రెట్లు!
ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు. గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్గా పనిచేస్తోంది. 2030 నాటికి 5రెట్లకు పైగా.. పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి. 2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్లో చేరింది. (ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య) 2025 నాటికి లిథియం కొరత లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
ఆఫ్లైన్లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్లైన్ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్లైన్లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్పీరియెన్స్ జోన్ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్పీ ఆలోచన. వన్ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. (ఇదీ చదవండి: హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
ఫోన్.. ఆటబొమ్మ కాదండోయ్
స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోంది. ఫలితంగా విద్యార్థులు చదువుల్లోనూ వెనుకబడిపోతున్నారు. ఈ అలవాటు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెలుగు చూస్తున్న సర్వేలలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల వినియోగం పాఠశాలలు, కాలేజీ స్థాయి పిల్లల్లో విపరీతమైన మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విచ్చలవిడిగా మారడం, సరైన పర్యవేక్షణ లేమితో విద్యార్థులలో అత్యధిక శాతం మంది పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ లేదా ఇవ్వకుంటే ఏమి చేసుకుంటారోనన్న భయంతో స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. ఆటపాటలతో ఇంట్లో సందడి చేయాల్సిన పసి పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్లను అలవాటు చేయడం ఇలాంటి దుష్పరిణామాలు మరింతగా పెరగడానికి కారణమవుతోంది. పిల్లలు మారాం చేస్తున్నారనో.. అల్లరి చేయకుండా ఉంటారనో వారికి ఆట బొమ్మలకు బదులుగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఇటీవల పెరిగిపోయింది. చిన్నతనం నుంచే ఇలా చేయడం వల్ల పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క పాఠశాల పిల్లల్లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాక్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి వినియోగం కాస్తా వ్యసనంగా మారిందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో విద్యార్థులు, యువత మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు లోనవుతున్నారని తేల్చిచెప్పింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఇది తీవ్రరూపం దాల్చింది. అవసరం లేకున్నా పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలు చేరుతుండటం, పెద్దల పర్యవేక్షణ కరవవటంతో విపరిణామాలకు దారితీస్తోందని సర్వే సందర్భంగా నిపుణులు స్పష్టం చేశారు. టీనేజ్ పిల్లల్లో 71 శాతం ఫోన్లలోనే.. ► 9 నుంచి 13 ఏళ్లలోపు పిల్లలు పాఠశాల సమయం తరువాత ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో తేలింది. ► 13 నుంచి 17 మధ్య వయసు పిల్లల్లో 71 శాతం మంది పాఠశాలలతోపాటు బయట కూడా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారని వెల్లడైంది. ► 9 నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాలో వీడియోలను, ఆన్లైన్ గేమ్లతో గంటలకొద్దీ గడిపేస్తున్నారు. తల్లిదండ్రుల మాట అసలు వినడం లేదు. ► గట్టిగా చెబితే తమపై తిరగబడే పరిస్థితులు ఎదురవుతున్నాయని 47 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. ► 13 ఏళ్లలోపు వారు కూడా సోషల్ మీడియా ఖాతాలు తెరిచి చాటింగ్, ఇతర వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. ► కేంద్ర ప్రభుత్వం 2017లో మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని తెచ్చినా.. ఇంటర్నెట్ వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు నిర్దిష్ట రక్షణ చర్యలు పొందుపర్చకపోవడంతో పరిస్థితి చేయి దాటుతోందని సర్వేలో వివరించారు. ► ఐటీ చట్టంలోనూ అనేక సవరణలు చేయాల్సిన అవసరముందని వారు పేర్కొంటున్నారు. ► పబ్జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తి కొన్నిసార్లు హింసా ప్రవృత్తికి కారణమవుతోందని పేర్కొంటున్నారు. అవాంఛనీయ సైట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని తెలిసో తెలియకో చూసి అనుసరించే పిల్లలు వాటిలో నిమగ్నమవుతూ మానసిక, శారీరక సమస్యలకు లోనవుతున్నారని వివరించారు. ► స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు వినియోగిస్తూ గేమ్స్ వంటి వాటిలో విద్యార్థులు నిమగ్నం అవుతున్నందున పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని సర్వే పేర్కొంది. దీనివల్ల చదువుల్లో వెనుకబడిపోతున్నారని వివరించింది. ► స్మార్ట్ ఫోన్ల వల్ల సామాజిక సంబంధాలకు దూరంగా ఉండిపోతున్నారని, ఇది మెదడులో జన్యుపరమైన సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారని సర్వే తెలిపింది. ఇది పిల్లల్లో ‘నో మొబైల్’ ఫోబియా అనే కొత్త రుగ్మతను తెచ్చిపెట్టిందన్నారు. ► ఫలితంగా పిల్లలు ఆందోళన, నిరాశ, చిరాకు, ఒంటరితనం ఎక్కువై మానసిక వైకల్యంలో పడుతున్నట్టు స్పష్టం చేశారు. ► స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల 8–18 ఏళ్లలోపు పిల్లలు నిద్ర లేమికి గురవుతున్నారని.. ఫలితంగా వారిలో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతోందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
భారత్లోనూ ‘ఈ–సిమ్’ సేవలు.. స్పెషల్ ఏంటో తెలుసా?
సాక్షి, అమరావతి: సెల్ఫోన్లలో ఉపయోగించే సిమ్(సబ్స్రై్కబర్ ఐడెంటిటీ మాడ్యూల్) కార్డు మాయమైపోతోంది. పెద్ద సైజు నుంచి క్రమంగా నానో సైజుకు వచ్చేసిన సిమ్ కార్డు.. ఇప్పుడు కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్ఫోన్లు, వాచ్లతో పాటే ‘ఈ–సిమ్’లూ విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్లోకి వచ్చినా.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్ స్టోర్కు వెళ్లకుండానే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యేకత. సిమ్ కార్డులతో పెరిగిన మోసాలు కొన్నేళ్లుగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్లు పంపించి, ఫోన్ కాల్స్ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. ఫోన్ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్ పాడైపోయిందని చెప్పి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్తో కొత్త సిమ్ తీసుకుంటాడు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుతో పాటు ఫోన్లోని రహస్య సమాచారమంతా లాగేస్తాడు. ఈ–సిమ్తో అడ్డుకట్ట.. ఈ–సిమ్ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్ సిమ్కు డిజిటల్ రూపం. దీన్ని యాక్టివేట్ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్ ఐడెంటిఫియబుల్ ఇన్ఫర్మేషన్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ–సిమ్ అకౌంట్ను సెక్యూర్గా ఉంచుకోవడానికి ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ విధానంలో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్వర్క్ ప్రొవైడర్కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్తో మరో సిమ్ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్–14 మోడల్స్కు సిమ్ స్లాట్స్ లేవు. ఇవి ఈ–సిమ్ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సులభంగా యాక్టివేషన్.. డీ–యాక్టివేషన్ వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి–యాక్టివేట్ కూడా చేయవచ్చు. మలి్టపుల్ ఫోన్ నంబర్లు, ప్లాన్లను ఒకే డివైజ్లో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్ సిమ్ మాత్రమే సపోర్టు చేసే లేటెస్ట్ ఫోన్లలో అదనంగా ఈ–సిమ్ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్వర్క్లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్వర్క్ ప్రొవైడర్ స్టోర్కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్ విధానంలోనే ఎస్ఎమ్ఎస్, ఈ–మెయిల్ ద్వారానే యాక్టివేట్ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ ఈ–సిమ్ను సపోర్ట్ చేస్తుందా.. టెలికాం ఆపరేటర్ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్సంగ్, హానర్, గూగుల్ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ఫోన్లకు మాత్రమే ఈ–సిమ్ను సపోర్టు చేస్తున్నాయి. మొదటిసారిగా శామ్సంగ్లో.. ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్ను 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్వాచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్–ఐడియా ఈ–సిమ్ సేవలను అందిస్తున్నాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement