అన్నవరం: రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవాలకు మరో 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనులు చురుకుగా జరుగుతున్నాయి. స్వామివారి టేకు రథం చక్రాలకు ఇనుప పట్టీలను రథానికి రంగులు వేయడం మొదలయ్యాయి.
19వ తేదీన సత్యదేవుని కల్యాణం
ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు అధ్యక్షతన గత నెల 28వ తేదీన దేవ స్థానంలో జరిగిన ప్రభుత్వ శాఖ లు, దేవస్థానం అధి కారుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించిన విష యం విధితమే. తర్వాత దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ ఆలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలకు చేయాల్సిన పనులపై ఆదేశాలిచ్చారు. ఉత్సవాలలో భాగంగా మే 19వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఆ రోజు విస్తృత ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించారు.
శరవేగంగా పనులు
సత్యదేవుని ధ్వజస్తంభానికి పీఠం ఏర్పాటు చేసే పనులు చురుకుగా జరుగుతున్నాయి. తర్వాత స్తంభానికి బంగారు రేకు తాపడం చేసే పనులు ప్రారంభిస్తామని పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈ ఉదయ్ తెలిపారు. సత్యదేవుని నూతన టేకు రథాన్ని గత నెల 24వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. మిగిలిన పనులు పూర్తి చేయడంతో పాటు రంగులు వేస్తున్నారు. చక్రాలకు ఇనుప బద్దెలతో పట్టీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రంగులు వేసే పనులు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, వ్రత మంటపాలు, ఇతర భవనాలకు రంగులు వేసే కార్యక్రమం చురుకుగా జరుగుతోంది. ఈ పనులు ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి కానున్నాయి. వార్షిక కల్యాణ వేదికకు రంగులు వేసే పనులు పూర్తయ్యాయి. దీనిపైకి భక్తులు ఎక్కకుండా చుట్టూ మెస్ చట్రాలు పెట్టారు. అయితే వాటి స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశించారు.