విజయవాడ లోక్సభ అభ్యర్థి కేశినేని నాని
తిరువూరు: కలగూర గంప మేనిఫెస్టోలతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని, ఆయన అబద్ధాల కోరు అని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. తిరువూరులో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసుతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ సెంటర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోల్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అమలుచేయలేని హామీలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసగించిన, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఎగ్గొట్టిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేశినేని విజ్ఞప్తి చేశారు. టీడీపీలో ఉన్నపుడు తమతో అన్ని రకాల అబద్ధాలూ చెప్పించిన చంద్రబాబుకు, జనరంజకపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలికే లేదన్నారు. సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు రాజకీయాలకు పనికి రాడన్నారు. అమరావతే రాజధానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 99 శాతం హామీలను నెరవేర్చి తనపై నమ్మకం ఉంటేనే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ధైర్యంగా చెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి ఎక్కడినుంచి వచ్చారో, ఆయనెవరో ఎవరికీ తెలియదని, ఇక్కడికి వచ్చి వ్యాపారుల్ని, వైద్యుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, జూన్ 4తర్వాత అడ్రస్ లేకుండా పోతారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకుడు గౌతమ్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రవేశపెడితే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కితాబు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.