వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారని ఇక్కడకి వస్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా, విభజన హామీలను నెరవేర్చారా అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అమలుకాని హామీలతో మరోమారు ఆంధ్రులను మభ్యపెట్టేందుకే వస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్ల ఎన్డీఎ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు ఏం వెలగపెట్టారో చెప్పిన తరువాతే రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఐదేళ్లు ఇస్తామని ప్రకటిస్తే, కాదు..పదేళ్లు ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష నేత వెంకయ్య నాయుడు నిండు సభలో మాట్లాడారని గుర్తు చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ పదేళ్లలో ఆంధ్రాకు కేవలం ఎన్నికల ముందే వస్తారని ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మార్గదర్శకాలను దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ ప్రవేశపెట్టాయని గుర్తు చేశారు. ఆ యాక్ట్పై ఎన్డీఎ కూటమికి చెందిన చంద్రబాబు దుష్ప్రచారం చేయడమే కాకుండా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.