డీజిల్‌ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం! | Sakshi
Sakshi News home page

Gujarat: డీజిల్‌ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం!

Published Mon, Apr 15 2024 11:52 AM

Ganiben Thakor Taking Campaign Expenses from Public - Sakshi

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. పలు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో పలు వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగిన గనీబెన్ ఠాకూర్‌ ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! 

ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్న గనీ బెన్‌ అందుకు అయ్యే ఖర్చును అక్కడి జనం నుంచి వసూలు  చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తన ఎన్నికల ఖర్చుల కోసం చాలామంది  విరాళాలు  ఇచ్చారని తెలిపారు.  అందుకు ప్రతిగా బనస్కాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత  10 రోజుల్లో తాను నిర్వహించిన బహిరంగ సభల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను పలువురు భరించారని తెలిపారు. తన కారు డీజిల్ ఖర్చును కూడా జనమే చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కాంగ్రెస్ ‘దేశం కోసం విరాళం’ ప్రచారాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపారు. 

బనస్కాంతలో కాంగ్రెస్‌ అభ్యర్థి గనీ బెన్‌పై బీజేపీ నుంచి ప్రొఫెసర్ రేఖా చౌదరి  ఎన్నికల బరిలోకి దిగారు. రేఖా చౌదరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2013లో జరిగిన ఉప ఎన్నికతో సహా గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో బనస్కాంత సీటును బీజేపీ గెలుచుకుంది.

Advertisement
Advertisement