Sakshi News home page

#GautamGambhir: కేకేఆర్‌కు తిరిగిరానున్న గంభీర్‌?.. ఖుషీలో అభిమానులు

Published Tue, Jul 11 2023 9:45 AM

Gautam Gambhir-Returning Kolkata Knight Riders-Fans Cant Keep Calm - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదితో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కోచ్‌ ఆండీ ప్లవర్‌ సహా సిబ్బందితో ఉన్న రెండేళ్ల కాంట్రాక్ట్‌ ముగియనుంది. కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొత్త కోచ్‌వైపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ జస్టిన్‌ లాంగర్‌ను కోచ్‌ పదవికి సంప్రదించినట్లు సమాచారం. మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ను కూడా లక్నో కంటిన్యూ చేయాలనుకోవడం లేదు. దీంతో గౌతమ్‌ గంభీర్‌ను వచ్చే ఐపీఎల్‌లో కొత్త జట్టుతో చూసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌ లేదా మెంటార్‌గా వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేకేఆర్‌ ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగిపోయారు. గౌతమ్‌ గంభీర్‌ కేకేఆర్‌కు తిరిగి రానున్నాడన్న విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ గంభీర్‌ సేవలు ఇప్పుడు కేకేఆర్‌కు చాలా అవసరమని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. గంభీర్‌ తిరిగి వస్తున్నాడన్న విషయాన్ని ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నితీశ్‌ రానా సారధ్యంలోని కేకేఆర్‌ జట్టు మోస్తరు ప్రదర్శన మాత్రమే చేసింది. 2021లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ రెండు సీజన్లుగా లీగ్‌ దశకే పరిమితమయింది. ఒకవేళ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వస్తే కేకేఆర్‌ ఆటతీరు మారిపోయే అవకాశం ఉంది. ఇక శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా గంభీర్‌తో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఐపీఎల్‌ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన గౌతమ్‌ గంభీర్‌ ఆ తర్వాత కేకేఆర్‌ తరపున ఆడాడు. 2011లో రూ.11 కోట్లతో కేకేఆర్‌లో జాయిన్‌ అయిన మరుసటి ఏడాది అంటే 2012లో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2014లోనూ అతని కెప్టెన్సీలోనే కేకేఆర్‌ రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు కేకేఆర్‌కు కొనసాగిన గౌతమ్‌ గంభీర్‌ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికి 2021లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా వచ్చాడు.కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 

చదవండి: TNPL 2023: మరో 'రింకూ సింగ్‌'.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం

Advertisement

What’s your opinion

Advertisement