ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌

Published Sun, Apr 14 2024 1:51 PM

Matheesha Pathirana To Miss MI Clash In IPL 2024 - Sakshi

ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 14) జరుగబోయే కీలక సమరానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మతీశ పతిరణ గాయం కారణంగా ముంబై ​మ్యాచ్‌కు దూరం కానున్నాడు. పతిరణ గాయంపై అప్‌డేట్‌ను సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. పతిరణ సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌ సమయానికంతా కోలుకుంటాడని ఫ్లెమింగ్‌ తెలిపాడు. పతిరణ ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడి, ఆతర్వాత సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. పతిరణ గైర్హజరీలో సీఎస్‌కే సన్‌రైజర్స్‌ చేతిలో ఓడి.. కేకేఆర్‌పై విజయం సాధించింది.

కాగా, ఇవాళ రాత్రి జరుగబోయే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ బిగ్‌ ఫైట్‌ కోసం‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. క్రికెట్‌ ఎల్‌ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్‌ మెరుపుల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. 

ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పుడిప్పుడే (రెండు వరుస విజయాలు) గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్‌ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు  36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
 

Advertisement
Advertisement