నెల్లూరు(దర్గామిట్ట): కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్రూమ్ను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈవీఎంలను భద్రపర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. నెల్లూరు సిటీ ఆర్వో, కమిషనర్ వికాస్ మర్మత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ మలోల, నెల్లూరు నగర, రూరల్ తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(అర్బన్): ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన వారు గురువారం నుంచి జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వారికి కేటాయించిన సంఖ్యను గుర్తుంచుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారికి సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఈ నెల 10 నుంచి వచ్చే నెల పది వరకు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను చేయించుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీలను మెసేజ్ రూపంలో తెలియజేయనున్నామన్నారు. వివరాలకు వెంకటేశ్వరపురంలోని బాలుర ఐటీఐ కళాశాలను సంప్రదించాలని సూచించారు.
జిల్లాకు ట్రెయినీ ఐపీఎస్లు
నెల్లూరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 163 మంది ట్రెయినీ ఐపీఎస్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఈ క్రమంలో జిల్లాకు మయాంక్ మిశ్రా, సిద్ధార్థ్ రామ్కుమార్, ప్రతీక్ సింగ్, ఖుష్మిశ్రా, సూరజ్, అభినవ్ ద్వివేది, జామాసోనర్, అషిమా వశ్వాణి, అపర్ణను కేటాయించారు. వీరందరూ జిల్లాకు బుధవారం చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలను ఎస్పీ పర్యవేక్షణలో వీరు తెలుసుకోనున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకూ వీరు ఇక్కడే ఉండనున్నారు.
సమాజ సేవకు
అంకితమవుదాం
నెల్లూరు(అర్బన్): క్షతగాత్రులు, ప్రకృతి వైపరీత్యాల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారికి స్వచ్ఛందంగా సేవలందిస్తూ.. సమాజ అభివృద్ధికి అంకితమవుదామని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ మస్తానయ్య పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో పలువురు సభ్యులు బుధవారం రక్తదానం చేశారు. తొలుత ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని నిర్వహించారు. హెన్రీడ్యూనాట్ చిత్రపటానికి నివాళులర్పించారు. తలసేమియా రోగులకు ఆటపాటలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్బాబు, ఎమ్సీ మెంబర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్లు సీత, హరిత, రమ్య తదితరులు పాల్గొన్నారు.
రవీంద్రుడి రచనలు మధురమైనవి
నెల్లూరు(బృందావనం): రవీంద్రుడి రచనల్లో బాలల ప్రపంచం ఎంతో మధురంగా ఉంటుందని ప్రముఖ రచయిత్రి డాక్టర్ చంద్రలత పేర్కొన్నారు. నగరంలోని పురమందిరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభను బుధవారం నిర్వహించారు. అడ్వొకేట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ పోషక వ్యవస్థాపకుడు రమణారెడ్డి స్మృత్యర్థం నెల్లూరు వర్ధమాన సమాజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాయని చేజర్ల వినయ, గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు లక్ష్మీసుహాసిని, బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు సుభద్రాదేవి, శ్రీనివాసులురెడ్డి, వర్ధమాన సమాజ కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.