మనిషిలో మానసిక ఒత్తిడి, ఇతరులకు దూరంగా ఉండటం ప్రధానంగా ఆత్మహత్యలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడేవారికి సరైన సమయంలో సాయం అందించడం ద్వారా ఆత్మహత్యలను కొంతమేర నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారిని ఆ ఆలోచనల నుంచి బయటకి తీసుకురావడానికి సాయం అందించే హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని వారు అంటున్నారు. అయితే దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం కూడా ఆత్మహత్యలకు దారితీస్తుంది.
ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ హెల్ప్లైన్ నంబర్లపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ముందుకువచ్చారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేయడమే కాకుండా.. మరో ఇద్దరు దీనిని రీ-పోస్ట్ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు సాయిధరమ్తేజ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, నిహారిక కొణిదెల, రాహుల్ రవీంద్రన్, దేవకట్టా.. ఇలా పలువురు ప్రముఖులు ట్విటర్లో ఈ సందేశాన్ని షేర్ చేశారు.