-
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ది నయవంచన: రఘునందన్రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
బీజేపీ నేత రఘునందన్రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ ఫొటోలతో ముద్రించిన శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్రావును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు. కాగా, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్కు గత నెల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాట్లాడి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
2014 నుంచి ట్యాపింగ్లపై విచారణ జరిపించాలి: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. 2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, ఎస్ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్రావు, సందీప్రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవగాహనతోనే విచారణ ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు. రఘునందన్రావుపై కేసు నమోదు సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, చీఫ్ జస్టిస్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంత్: రఘునందన్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్తో హరీష్రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
‘BRS ఎమ్మెల్యేలది బలవంతపు ప్రెస్మీట్’
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్ఎస్ను వీడడం ఖాయమని అన్నారాయన. తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్ రావు బ్లాక్మెయిలింగ్కు దిగారు. హరీష్రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్మీట్ పెట్టించారు. కానీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ కావడం ఖాయం’’ అని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్ అన్నారు. ప్రోటోకాల్ కోసం సీఎం రేవంత్రెడ్డిని కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? అని నిలదీశారాయన. హిస్టరీ రిపీట్ అవుతది ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్ జోస్యం పలికారు. -
కేటీఆర్, హరీశ్రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావుపై ఫైరయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల మాటల ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లడారు. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాగా మిగులుతుందని అన్నారు. బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి -
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు సవాల్ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. శనివారం రఘునందన్రావు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్కు అలవాటు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్ అధినా యకులకు అలవాటని రఘునందన్ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్టేనన్నారు. ఆ విషయంపై హరీశ్ సమాధానం చెప్పాలి కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడడం సరికాదని రఘునందన్ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు. -
కేసీఆర్ పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, నేతలపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వీరెవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్ కేసీఆర్ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు రఘునందన్రావు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్ల ఇవ్వరు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా?. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ మొహం చాటేశారు’ అని గుర్తుచేశారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. అందుకు సీఎంకి ఉన్న అభ్యంతరాలేమిటి? సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు... మేడిగడ్డ అందులో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయా లని కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కేసును పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో టీపీసీ సీ అధ్యక్షుడిగా రేవంత్ కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రేవంత్ లేఖ కూడా రాశారని చెప్పారు. ఇప్పుడు సీఎం హోదా లో తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకు, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కథ కంచికి చేర్చాలనే కుట్ర కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథ కంచికి చేర్చాలని చూస్తోందని రఘునందన్ ఆరోపించారు. ఈ ప్రాజె క్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ పలు దఫాలుగా ఉత్తరాలు రాసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 20న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చిందన్నారు. ఈ లేఖకు ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ వరకే విషయా న్ని పరిమితం చేస్తున్నారని, ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. -
'పెన్షన్లు కాదు.. నౌకర్లు కావాలి' : ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు
సాక్షి, మెదక్: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. అలాగే దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్వాడీలు, వీఆర్ఏ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన.. ‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానన్నారు. బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఆగమవుతాం! దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్రావు కోరారు. సోమవారం మాచిన్పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాల్లో రఘునందన్రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. ఇంటింటి ప్రచారం! చేగుంటతో పాటు రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఉపసర్పంచ్ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్, బాలరాజు, నవీన్, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్, లావణ్య పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్రెడ్డి -
దుబ్బాకలో నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..? కేసీఆర్ కేబినెట్లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మాధవనేని రఘునందన్రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు. హరీశ్ను దుబ్బాక ప్రజలు నమ్మరు హరీశ్రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్పేట మండలంలోని చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలన్నారు. రాయపోల్ మండలంలో..| రాయపోల్ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు. పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఏరులై పారుతున్న మద్యం మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్రావు విమర్శించారు. అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు. -
దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: రఘునందన్
-
ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్రావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఎంపీ ప్రభాకర్రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..
సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్రావు స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభాకర్రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. -
ఒకేరోజు 1,603 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. శనివారం దరఖాస్తులిచ్చిన వారిలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు (తమ ఆఫీసు ప్రతినిధి ద్వారా అందజేత), శేరిలింగంపల్లికి గజ్జల యోగానంద్, రాజేంద్రనగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, షాద్నగర్కు మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి కుమారుడు మిథున్రెడ్డి, సనత్నగర్ సీటుకు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, జనగామ నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, పాలకుర్తి టికెట్ కోసం సీనియర్ జర్నలిస్ట్ యెడ్ల సతీష్ కుమార్ తదితరులున్నారు. ఆదివారంతో దరఖాస్తుల స్వీకారం ముగుస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతల చేరిక, బీజేపీ నుంచి ముఖ్యనేతల పోటీకి సంబంధించి కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు ఇంకా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అందువల్ల ఇతర పార్టీల నుంచి బలమైన నేతలొచ్చే కొన్ని నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పార్టీ కీలక నేతలకు సంబంధించి దరఖాస్తులు లేకుండానే ఆయా స్థానాలకు వారి అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా వలస నేతలతోపాటు పార్టీ ముఖ్య నేతలకు కొంత వెసులుబాటు ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటివి ఎన్నికల దాకా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగనుందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ను ఎంపిక చేయాలని కోరుతూ ఆ పార్టీ గజ్వేల్ నేతలు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం సమరి్పంచారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్చేసి టాస్క్పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్రావు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement