అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలన పక్కాగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు విలాస్ వి.షిండే ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో వ్యయ పర్యవేక్షణపై అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదికలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా వ్యయ పరిశీలన చేపడుతున్నామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. అసిస్టెంట్ ఎలెక్షన్ అబ్జర్వర్లు, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎంసీసీ, వీవీటీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు, వస్తువులను సీజ్ చేస్తున్నామన్నారు. అకౌంటింగ్ బృందం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారీ ఖాతాల నిర్వహణ కోసం షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.