‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ | Sakshi
Sakshi News home page

‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’

Published Sat, Mar 9 2024 8:11 AM

Fears Around New Innovations In The Previous Years - Sakshi

ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్‌ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. 

కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం.

విచిత్రమైన భయాలు

‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు.

రైల్‌ సిక్‌నెస్‌

ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్‌బాంక్రాన్‌కీట్‌’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్‌ సిక్‌నెస్‌’ అని అర్థం.

ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్‌బర్గ్‌ దంపతులు.. ధర ఎంతో తెలుసా..

బుల్లెట్‌ రైలు

ఇంగ్లండ్‌ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైళ్లకు చేరుకున్నాం.

Advertisement
 
Advertisement
 
Advertisement