
లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్టాక్మార్కెట్లు భారీగా పతనమవ్వడంపై కేంద్రం, సెబీ నివేదిక సమర్పించాలని విశాల్ తివారీ అనే న్యాయవాది డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పూర్తి నివేదికన సమర్పించేలా కేంద్రం, సెబీకి ఆదేశాలు జారీచేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు. దాంతోపాటు అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ జనవరి 3న ఇచ్చిన సూచనలపై స్టేటస్ రిపోర్టును సమర్పించేలా ప్రభుత్వం, సెబీని ఆదేశించాలని కోరారు.
నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం, సెబీ నిర్మాణాత్మకంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. నియంత్రణ ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తివారీ దాఖలు చేసిన పిటిషన్లో..‘సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటనల సమయంలో స్టాక్మార్కెట్లు భారీగా పెరిగాయి. కానీ వాస్తవ ఫలితాలు వెలువడిన రోజు మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని నివేదికల ప్రకారం ఏకంగా ఒక్కరోజే రూ.20లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం నియంత్రణ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మార్కెట్ నియమాలపై స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించలేదు’ అని తెలిపారు.
ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!
ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం సోమవారం (జూన్3న) బీఎస్ఈ బెంచ్మార్క్ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లేదా 3.4 శాతం పెరిగి 76,469 వద్ద గరిష్ట స్థాయిని చేరింది. తర్వాతరోజు వాస్తవ ఫలితాలు వెలువడిన మంగళవారం సెన్సెక్స్ 4,390 పాయింట్లు లేదా 6 శాతం దిగజారి 72,079 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment