Supreme court of India
-
నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ మరణం తరువాత అతని భార్య ప్రియా కపూర్, తల్లి రాణీ కపూర్ మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనా గ్రూప్ (Sona Group) వారసత్వ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు కోర్టు మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఆశ్రయించాలని సూచించింది.మధ్యవర్తిగా మాజీ సీజేఐసోనా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాణి కపూర్- ఆమె కోడలు ప్రియా కపూర్ (దివంగత సంజయ్ కపూర్ భార్య) మధ్య నడుస్తోంది. ఈ కేసులో విచారణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ గారిని ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇరు పక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి అంగీకరించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.వివాదం ఏమిటి?2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు,తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడు సంజయ్ కపూర్, కోడలు ప్రియా కపూర్ తన ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేశారని తల్లి రాణి కపూర్ ఆరోపించారు. పరిపాలనాపరమైన ఫార్మాలిటీస్ అని చెప్పి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. గతేడాది జూన్లో సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ప్రియా కపూర్ సోనా గ్రూప్ సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆస్తిలో ఎటువంటి వాటా లేకుండా చేస్తున్నారని రాణి కపూర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఇది కుటుంబ వివాదం కనుక కుటుంబానికే పరిమితం చేచాలని ఇది ఇతరులకు వినోదంగా మారకూడదని హితవు పలికింది. అలాగే . 80 ఏళ్ల వయస్సులో ఉన్న పిటిషనర్ కోర్టుల చుట్టూ తిరగడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా అన్ని సమస్యలను (A to Z) ఒకేసారి పరిష్కరించు కోవడం శ్రేయస్కరం అంటూ పెద్దావిడ రాణి కపూర్కి సూచించింది.కాగా సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన తొలి, మాజీ భార్య, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలలు ఆస్తులు, వారసత్వ హక్కులపై కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు. సంజయ్ కపూర్ ఆస్తులపై ప్రియా కపూర్ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది మరోవైపు ఈ వివాదం వార్తల్లోకి రావడంతో గురువారం ట్రేడింగ్లో సోనా బీఎల్ డబ్ల్యూ (Sona BLW) షేర్లు సుమారు 0.96శాతం బనష్టపోయాయి. ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్భవన్కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్తో రావాలని టీవీకేకు గవర్నర్ అర్లేకర్ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్కు గవర్నర్ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్తో భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. గతంలో.. సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్కు 28 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్ ఫిగర్(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్ కాంగ్రెస్ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు విజయ్ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. విజయ్ కోరినట్లు రెండు వారాల గడువు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.కాబట్టి విజయ్ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్ భావిస్తున్నారు. నేషనల్ లెవల్లోనూ..గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. -
మార్గదర్శి కేసు ముగించాలంటే.. ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు పంచుతాం
ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన.. కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజా ధనానికి సంబంధించి చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..! – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంకోర్టులో తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన నిందితుడు రామోజీరావు మరణించినందున ఈ కేసును కొట్టివేయాలన్న మార్గదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. రామోజీరావు మరణించినా.. సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తున్నందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని తేల్చి చెప్పింది. ‘ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి, ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మార్గదర్శిపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి ఫైనాన్షియర్స్కు నోటీసులు జారీ చేసింది. బాధితులందరికీ చెల్లింపులపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏకంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు సేకరించడంపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటెనబుల్ కాదన్న మార్గదర్శి వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించటాన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్, న్యాయవాదులు అల్లంకి రమేష్, మమత వాదనలు వినిపించారు. వ్యక్తి మరణిస్తే.. సంస్థపై కేసు ఆగిపోదు విచారణ ప్రారంభం కాగానే మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితుడు మరణించిన నేపథ్యంలో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనాన్ని కోరారు. దీన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన కేసు ముగియదని, జరిమానా చెల్లించే బాధ్యత హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్)పై ఉంటుందని నివేదించారు. దర్యాప్తు పెండింగ్లో ఉండగానే.. రామోజీ మరణించారన్న కారణంతో ఆయనతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై గతంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసిందన్నారు. భారీ ఆర్థిక అవకతవకలను, ప్రజా ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన విషయం స్పష్టంగా రుజువవుతున్నా హైకోర్టు సాంకేతిక కారణాలతో కేసును కొట్టేసిందన్నారు. అటు ఐటీ శాఖ, ఇటు ఆర్బీఐ వద్ద మార్గదర్శి అక్రమాల వివరాలు ఉన్నాయని నివేదించారు. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించాలని ధర్మాసనాన్ని కోరారు. ఎఫ్ఐఆర్ అనేది ’ఎన్సైక్లోపీడియా’ కాదు దర్యాప్తు ఇంకా పూర్తికాని దశలో హైకోర్టు కేసును కొట్టివేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎఫ్ఐఆర్ అనేది నేరాలకు సంబంధించిన ‘పూర్తి ఎన్సైక్లోపీడియా’ కాదని ఉదహరించారు. డిపాజిట్ల సేకరణపై దశాబ్దాలుగా నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మార్గదర్శి రూ.వేల కోట్లు వసూలు చేస్తూ కార్యకలాపాలు సాగించిందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, రెగ్యులేటరీ సంస్థ ఆర్బీఐ వాదనలను సైతం హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని నివేదించారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన కేసులో దర్యాప్తును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందన్న రంగాచారి... ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజున జీవో 800 జారీ చేసింది. రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రంగాచారి విచారణను పూర్తి చేసి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల వద్ద నుంచి రూ.వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన నివేదికలో పేర్కొన్నారు. అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు అధీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ 2008 జనవరి 23న హైదరాబాద్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58 కింద శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. అందరి వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్కుమార్తో పాటు అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి, అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సోమవారం జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ జరిపింది. రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యాలయాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ఇలా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిన వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని కూడా చెప్పడంతో డిపాజిటర్ల ప్రయోజనాల కోసం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసును కొనసాగించవద్దని మార్గదర్శి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అలాగైతే రామోజీ ఆస్తులు అటాచ్ చేసి, బాధితులకు పంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాము ఇప్పటికే అందరికీ చెల్లింపులు చేశామని ముకుల్ రోహత్గీ చెప్పుకొచ్చారు. అనంతరం, ఆ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శికి సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా, మార్గదర్శి కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సేకరించింది. ఈ నేపథ్యంలో రామోజీరావు చనిపోవడంతో కేసు మెయింటైనబుల్ కాదని హైకోర్టులో మార్గదర్శి వాదనలు వినిపించింది. దాంతో ఎఫ్ఐఆర్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఉండవల్లి సవాల్ చేశారు.దీంతో, సుప్రీంకోర్టు.. ఆర్బీఐ, ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు, కిరణ్, రామోజీరావులకు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది పరమేశ్వరన్, న్యాయవాదులు అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈరోజు వాదనల తర్వాత తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. ‘‘రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఈసీపై టీఎంసీ ఆరోపణలకు దిగింది. అయితే ఈసీ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎంసీ పార్టీ శుక్రవారం కోల్కతా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా మమతా బెనర్జీకి బిగ్ షాకే తగిలింది. ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ధర్నాకు దిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్న అస్సాం పోలీసులకు భంగపాటు కలిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ (Article 21)ను తేలికగా ప్రమాదంలో పడేయరాదని ముందస్తు బెయిల్ తీర్పు సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ అరెస్ట్ గనుక జరిగితే కచ్చితంగా ఆయన్ని బెయిల్పై విడుదల చేయాలని అస్సాం పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో.. విచారణలో సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పవన్ ఖేరాకు కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ బెయిల్లో అవసరమైతే అదనపు షరతులు కూడా విధించవచ్చని ట్రయల్ కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాదనలు ఇలా.. 👉ఖేరా తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదించారు. ‘‘ఇది పరువు నష్టం కేసు మాత్రమే. కస్టడీ విచారణ అవసరం లేదు. అరెస్ట్ అవమానకరం. అలాగే ఈ కేసు అనూహ్యమైంది. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.👉అస్సాం పోలీసుల తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ‘‘పవన్ ఖేరా మీడియా సమావేశంలో చూపించిన పాస్పోర్ట్ పత్రాలు నకిలీ, కల్పితమైనవి. వాటిలో ఉన్న సర్కారీ ముద్రలు, QR కోడ్లు, అధికారిక గుర్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి విచారణ అవసరం. అందుకు కస్టడీ తప్పనిసరి. ఈ పత్రాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు. 👉కోర్టు తీర్పు.. కస్టడీ అవసరం లేదు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నాం. విచారణకు ఖేరా పోలీసులకు సహకరించాలిముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రింకీ భూయాన్ శర్మపై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఆమెకు 3 దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని పలు పత్రాలకు మీడియాకు ప్రదర్శించారాయన. అయితే.. ఈ వ్యవహారంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పరువు నష్టం దావాకు వెళ్లడంతో గువాహతి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలంగాణ హైకోర్టులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ అత్యవసర పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వారంపాటు మధ్యంతర ఊరట ఇస్తూ.. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే.. అస్సాం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గువాహతి హైకోర్టు(అస్సాం)లో పిటిషన్ వేయాలని ఖేరాకు సూచించింది. దీంతో ఆయన స్టే తొలగించాలంటూ మరోసారి పిటిషన్ వేయగా.. మరోసారి చుక్కెదురైంది. ఈ తరుణంలో.. పవన్ ఖేరా అరెస్ట్కు రంగం సిద్ధం అవుతోందన్న ప్రచారం ఉధృతంగా సాగింది. ఈలోపు ఆయన గువాహతి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దీంతో కచ్చితంగా అరెస్ట్ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
ఆ చట్టాన్ని సవరించండి
న్యూఢిల్లీ: అత్యాచార బాధిత బాలికల గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మైనర్ను గర్భాన్ని మోయాలంటూ బలవంతం చేయజాలమని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం.. బాధిత మైనర్ తన అవాంఛిత గర్భాన్ని 20 వారాలు దాటిన తర్వాత సైతం తొలగించుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం వెలువరించిన ఈ నిర్ణయం అత్యాచార బాధితులు, ముఖ్యంగా చిన్నారుల ప్రాథమిక హక్కుల విషయంలో ఒక మైలురాయిగా మారనుంది. 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తొలగించాలంటూ ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం ఎయిమ్స్ను ఆదేశించడం తెల్సిందే. దీనిపై ఎయిమ్స్ వేసిన క్యూరేటివ్ పిటిషన్పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఎయిమ్స్ వినతిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామం చెందేలా చట్టాలు ఉండాలి. అత్యాచారం వంటి కారణాలతో గర్భం దాల్చినప్పుడు, దాన్ని తొలగించుకునేందుకు సమయ పరిమితి విధించడం సరికాదు. ఆ మేరకు చట్ట సవరణ చేయండి. ఇటువంటి కేసుల విచారణను వారంలోపే పూర్తి చేసేలా మార్పులు చేపట్టండి. విచారణ ఆలస్యంతో కలిగే మానసిక వేదనను ఆ చిన్నారి ఎందుకు అనుభవించాలి?’అని సీజేఐ ప్రశ్నించారు. ఎయిమ్స్ వాదనను ఖండించిన ధర్మాసనం ఇది చిన్నారికి, లోపలున్న పిండానికి సంబంధించిన సమస్య కాదని, చిన్నారికి మరో చిన్నారికి సంబంధించిన అంశమని ఎయిమ్స్ తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ‘ఇప్పటికే 30 వారాలు గడిచాయి కాబట్టి, గర్భస్థ శిశువు స్వతంత్రంగా జీవించగలిగే స్థితిలో ఉన్న ప్రాణం. ఒకవేళ ఇప్పుడు గర్భస్రావం చేస్తే, అది తీవ్ర వైకల్యాలతో కూడిన సజీవ శిశువు అవుతుంది. మరోవైపు, మైనర్ అయిన ఆ తల్లి జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆమె తిరిగి గర్భం దాల్చే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు’అని భాటి వివరించారు. స్పందించిన ధర్మాసనం..‘అన్ని వివరాలను బాలిక తల్లిదండ్రులకు చూపించండి. వారు ఆ గర్భాన్ని ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే, అలాగే కానివ్వండి. ఆ చిన్నారి మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వారు భావిస్తే, నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వండి. వారే క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. ఒక సైకియాట్రిస్ట్ను, కౌన్సెలర్ను వారితో మాట్లాడించండి. అంతిమ నిర్ణయం వారిదే కావాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల తరపున నిర్ణయాలు తీసుకోవడం ఎయిమ్స్ పని కాదని, వారు కేవలం వైద్య సేవలు మాత్రమే అందించాలని తేల్చిచెప్పింది. స్కూలుకెళ్లే వయస్సు.. ‘ఇది చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం. గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోతే, ఆ బాధితురాలి మనసుపై జీవితాంతం ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది. ఆ చిన్నారికి ఎటువంటి శాశ్వత శారీరక వైకల్యం కలగనంత వరకు, గర్భస్రావం చేపట్టాల్సిందే. ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఆమె ఒక చిన్నపిల్ల. స్కూలుకెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో మనం ఆమెను తల్లిని చేయాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ చిన్నారి అనుభవిస్తున్న బాధను, అవమానాన్ని ఒక్కసారి ఊహించండి’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. -
వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి.. సోషల్ మీడియా పోస్టు కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసుపై రేపు(బుధవారం) హైకోర్టులో విచారణలో అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని ‘సుప్రీం’ కోరింది. అలాగే రేపటి హైకోర్టు విచారణ నేపథ్యంలో మధ్యంతర ఉపశమన చర్యలకు నిరాకరించింది. సోషల్ మీడియా పోస్టు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తరులను సుప్రీంకోర్టులో శ్రీహరి సవాల్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర యానిమేషన్ చిత్రాలు, అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి అనే వ్యక్తిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కత్తి పట్టుకున్నట్లుగా ఉన్న యానిమేషన్ వీడియోలను వైరల్ చేశారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో, ఏప్రిల్ 1న తాడేపల్లిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ శ్రీహరి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత ట్రయల్ కోర్టు రిమాండ్ను తిరస్కరించినప్పటికీ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే లభించింది.ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, తనపై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని శ్రీహరి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున, తాము ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని, నిందితులకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేస్తూ, హైకోర్టు నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చింది. -
మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో గత నెలలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని యూపీ డీజీపీని ఆదేశించింది. గడువులోగా విచారణను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ దారుణంపై దర్యాప్తు చేయడంలో ఘాజియాబాద్ పోలీసులు చూపిన అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం లేదా శనివారం ఉదయం 11 గంటల్లోగా సిట్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని డీజీపీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. మార్చి 16వ తేదీన ఓ కామాంధుడు పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశచూపి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. రోజువారీ కూలీ అయిన బాలిక తండ్రి ఆమె జాడ కోసం వెతగ్గా రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ప్రాణాపాయ స్థితిలో పడి ఉంది. ఆమెకు చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల నిర్వాహకులు నిరాకరించారు. చివరికి ఘాజియాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే చిన్నారి ప్రాణాలు విడిచింది. సిట్ లేదా సీబీఐతో ఈ దారుణంపై దర్యాప్తు జరిపించాలని బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం చిన్నారి మృతికి దారితీసిన ఘటనల క్రమంపై విస్మయం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. -
ఇష్టంలేకుండా గర్భం కొనసాగించాలని ఏ కోర్టు ఆదేశించజాలదు
న్యూఢిల్లీ: ఇష్టంలేకుండా మహిళను మరీముఖ్యంగా మైనర్ బాలికను అవాంఛిత గర్భం కొనసాగించాలని ఏ న్యాయస్థానమూ ఆదేశించజాలదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఏడునెలల తన అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతినిస్తూ శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘జన్మనివ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు పుట్టబోయే బిడ్డ కంటే గర్భంతో ఉన్న మహిళకే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇష్టంలేని గర్భం కొనసాగిస్తే దీర్ఘకాలంలో ఆ టీనేజర్ మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులు మొత్తంగా ఆమె అభివృద్ధి మీద దుష్ప్రభావం పడే ఆస్కారముంది. ఒకరికి ఆమె జన్మనివ్వాలా వద్దా అనే స్వయంనిర్ణాయాధికారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. అవాంఛిత గర్భాన్ని నువ్వు కొనసాగించాల్సిందేనని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఆదేశిస్తే అది ఆమెకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. -
మీ విధులు ఔట్సోర్సింగ్కు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కొన్ని నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్(ఏఓఆర్) బృందం అప్రమత్తంగా వ్యవహరించాలని, న్యాయపరమైన పనులను కృత్రిమ మేధ(ఏఐ) లేదా ఇతర బాహ్య సంస్థలకు ఔట్సోర్సింగ్కు అప్పగించవద్దని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం.. అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్గా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరఫున వాదించగలరు. న్యాయవాదులను ఏఓఆర్లుగా నియమించే ముందు సుప్రీంకోర్టు వారికి పరీక్ష నిర్వహిస్తుంది. శుక్రవారం ఏఓఆర్ల పదవీ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ఏఓఆర్లు కేవలం బార్ సభ్యులు మాత్రమే కాదని.. అధికారిక కోర్టు అధికారులు అని గుర్తుచేశారు. ఏఓఆర్ల వృత్తి నిబద్ధత, అంకితభావంపైనే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. వారిపై ఉంచిన విశ్వాసమే వారు తమ ప్రతిష్టను నిర్మించుకోవడానికి పునాదిగా తోడ్పడుతుందన్నారు. న్యాయపరమైన విధులను ఏఓఆర్లే వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. కేసుల ఫైలింగ్ను ఒక సాధారణ ప్రక్రియగా భావించవద్దని అన్నారు. -
పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురు.. అరెస్ట్ తప్పదా?
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అసోం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ బెయిల్పై స్టే విధించగా.. దానిని తొలగించాలని వేసిన మరో పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని ఆరోపించారాయన. ఈ నేపథ్యంలో ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గువాహటిలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అస్సాం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఖేరా భార్య హైదరాబాద్ నగరంలో పోటీ చేశారని.. ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయని.. కాబట్టి పిటిషన్ ఈ కోర్టులోనే విచారణకు అర్హత ఉందని పవన్ ఖేరా తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు.. వారంపాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది(ఏప్రిల్ 10న) హైకోర్టు. ఈలోపు సంబంధిత కోర్టుకు బెయిల్కు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఊరటను అస్సాం పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన ఆధార్, ఇతర పత్రాలు కూడా తప్పుడువేనని వాదించారు. దీంతో అక్కడ పవన్ ఖేరాకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది(ఏప్రిల్ 15న). అదే సమయంలో..గువాహటి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. అయితే.. అస్సాంలో న్యాయస్థానాలకు సెలవులు ఉన్నాయని.. తన ట్రాన్సిట్ యాంటీసిపేటరీ బెయిల్పై స్టే ఎత్తివేయాలని.. ఆ స్టేను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును అభ్యర్థిస్తూ మరో పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టు ఇవాళ(ఏప్రిల్ 17) ఆ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఇవాళ శుక్రవారం. సోమవారం పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్నా? లేక ఉగ్రవాదినా? అని పవన్ ఖేరా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని.. అస్సాం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని.. కాబట్టి ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని.. అవసరమైతే అత్యవసర పిటిషన్కు వెళ్లమని ఖేరాకు సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈలోపు ఈ ఆదేశాలతో అస్సాం పోలీసులు పవన్ ఖేరాను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు.లొంగిపోతే మంచిదిసుప్రీం కోర్టు ఆదేశాలపై అస్సాం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. పోలీసులు స్పందించడం కంటే ముందే.. ఎక్కడున్న పవన్ ఖేరా గువాహటికి వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం మంచిదని సూచించారు. -
భార్యకు భరణం భర్త నిరంతర బాధ్యత
న్యూఢిల్లీ: భార్యకు భర్త ఇచ్చే భరణం నామమాత్రంగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో, విడిపోయిన తర్వాతా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని తెలిపింది. అదే సమయంలో, భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఒక మహిళకు ఇస్తున్న నెలవారీ వేతనం మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన హిందూ ఆచారం ప్రకారం వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో ఏడాదికే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తనకు ఎటువంటి ఆదాయ వనరులు లేనందున భరణం ఇప్పించాలంటూ ఆమె చంపావత్లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, న్యాయస్థానం నెలకు రూ.8 వేలు భరణంగా నిర్ణయించింది. బాధితురాలు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. ఆ న్యాయస్థానం రూ.15 వేలకు భరణం మొత్తాన్ని పెంచింది. ఆపైన బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పైవిధంగా తీర్పు వచ్చింది. -
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఉన్నపళంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 1,000 మందికిపైగా ఉన్నతాధికారులను రాత్రికి రాత్రే ఈసీ బదిలీచేసిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. అయితే ఈ ఘటనలో తాము జోక్యంచేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ఈసీ నిర్ణయాన్ని సమరి్థస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్చేస్తూ దాఖలైన పిల్ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదిస్తే సముచితంగా ఉంటుంది. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల బేధాలతో అఖిలభారత సర్వీసుల అధికారులు నలిగిపోతున్నారు. ఆలిండియా సర్వీసెస్ ఏర్పాటు ఉద్దేశం నిష్ఫలమవుతోంది. ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం లోపించిన నేపథ్యంలో సమన్వయం కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)సర్వే కోసం న్యాయాధికారులను మేం నియమించాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించింది. -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ను అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందుర్కర్ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అస్సాం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా దరఖాస్తు చేసుకుంటే.. దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్టైమ్తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది. ‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
క్లీన్ ఎలక్షన్స్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు (Fingers), కంటి (Iris) సంబంధిత బయో మెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత, జస్టిస్ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో.. బయో మెట్రిక్ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సీజే బెంచ్ తోసిపుచ్చింది. అది సాధ్యమయయే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.అడ్వొకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్లో.. ఒక ఓటర్ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డూప్లికేట్ ఓటింగ్, గోస్ట్ ఓటింగ్.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలింగ్ బూత్ల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ అమలు చేయాలి.సీజే బెంచ్ ఏమందంటే.. ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్ అవసరమా?. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేనికంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉంది.ఇప్పటికే ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్ ఎలక్షన్స్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలనుకోవడం విశేషం. -
ప్రజలకు అందని చట్టాలు అంతరాన్ని పూడ్చాలి: జస్టిస్ సూర్యకాంత్
డెహ్రాడూన్: ‘‘దేశ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు చట్టాల కొరత కాదు. అవి సామాన్య ప్రజలకు ఆశించినంతగా అందుబాటులో లేకపోవడమే’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చట్టపరమైన హక్కులకు, వాటి ఆచరణాత్మక లభ్యతకు మధ్య అంతరాన్ని తక్షణమే పూడ్చాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. మన దేశంలో హక్కులు, విధానాలకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ.. దూరం, జాప్యం, అమలులో లోపాల కారణంగా ఆయా ప్రయోజనాలు నిరుపేదలకు చేరడం లేదని వివరించారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్ర హైకోర్టు, నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ (నల్సా), ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నార్త్ జోన్ ప్రాంతీయ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ‘‘న్యాయం కేవలం ఉనికిలో ఉంటే చాలదు. అది ప్రతి పౌరుడి ముంగిటికీ సకాలంలో చేరాలి’’ అని స్పష్టంచేశారు. ఒక గణతంత్ర దేశపు బలాన్ని అది ప్రకటించుకున్న హక్కుల ద్వారా కాకుండా, సాకారమైన హక్కుల ద్వారానే కొలవాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు హక్కులు ఉన్నప్పటికీ.. అవి వారికి సులువుగా చేరే మార్గాలు, వేదికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం న్యాయ వ్యవస్థ బాధ్యత అని పిలుపునిచ్చారు. -
విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చేమో
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10–50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం కారణంగా సమాజంలో విభజన తలెత్తవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆలయ ప్రవేశం నుంచి మహిళలను దూరంపెట్టడం హిందుత్వంపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుక్రమ వయసు మహిళలనూ ఆలయంలోకి అనుమతించాలంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలంటూ 50కిపైగా దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదోపవాదనలను వరసగా మూడోరోజూ సుప్రీంకోర్టు ఆలకించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట గురువారం నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం, క్షేత్ర సంరక్షణ సమితుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. ‘‘ప్రత్యేకంగా ఒక మతశాఖకు సంబంధించి ఆలయంలోకి ఎవరిని అనుమతించాలి? ఎవరు పూజించాలి? ఎవరు దర్శనం చేసుకోవాలి? అనేది ఆ మతశాఖ ఇష్టం’’అని అన్నారు. ఈ వాదనతో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత్ బ్రాహ్మణులను మినహా ఎవరినీ రానివ్వబోమని అంటున్నారు. ఒక నిమిషం శబరిమల ఆలయ వివాదం విషయం పక్కనబెడదాం. కేవలం మా వర్గీయులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తాం, వేరే వాళ్లకు ప్రవేశం లేదు అని అనడం హిందుత్వంలో మంచిదికాదు. అంతిమంగా మతంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి’’అని అన్నారు. జడ్జి నాగరత్న వ్యాఖ్యలతో ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్ ఏకీభవించారు. భక్తులను ఇలా దూరం పెడితే సమాజంలో విభజనలు తలెత్తుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినాసరే వైద్యనాథన్ తన వాదనలకు కట్టుబడ్డారు. ‘‘తమ వర్గీయులకే ఆలయంలో ప్రాధాన్యత దక్కాలనే ఆలయ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులను ఆశించబోవు. ప్రైవేట్ దాతల నుంచిగానీ ప్రజల నుంచిగానీ విరాళాలు స్వీకరించబోవు. ఆలయాలు వాళ్లపై ఆధారపడవు’’అని అన్నారు. -
PIL: ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్ తొలగిస్తే..
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే కాన్సెప్ట్ను తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీం కోర్టు వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. శబరిమల కేసు సమీక్ష పిటిషన్ల సందర్భంగా ఇది చోటు చేసుకుంది. అయితే సుప్రీం కోర్టు మాత్రం తొందరపాటు నిర్ణయం మంచిది కాదన్న రీతిలో వ్యాఖ్య చేసింది. పిల్(Public Interest Litigation) తరచుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయన్నది కేంద్రం వాదన. బుధవారం శబరిమల కేసు విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిల్లు ఇప్పుడు తమ అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయాయి అన్నారు. నేటి పరిస్థితుల్లో న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్, కోర్టులకు సులభమైన ప్రాప్యత పెరిగినందున పిల్ అవసరం తగ్గిందని కేంద్రం అభిప్రాయపడుతోందని తెలిపారాయన. అయితే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం ప్రజా ప్రయోజన వ్యాజ్యల విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం అని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. కోర్టులు పిల్ను స్వీకరించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. అవి దాఖలు చేసే సమయంలో కఠినమైన ప్రమాణాలు అమలు చేస్తున్నాం. ప్రతి పిటిషన్ను పరిశీలించి మాత్రమే స్వీకరిస్తున్నాం అని సాలిసిటర్ జనరల్కు గుర్తు చేశారు. అలాగే.. శబరిమల కేసులో భక్తులు కాని వ్యక్తులు వేసిన పిటిషన్లు ఎందుకు స్వీకరించబడ్డాయి? అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు.అసలు పిల్ అంటే..పిల్ అనేది 1980లలో భారత న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టబడిన ఒక ప్రత్యేక పద్ధతి. దీని ఉద్దేశ్యం పేదలు, అక్షరాస్యులు, శారీరక వైకల్యం ఉన్నవారు, సామాజికంగా వెనుకబడినవారు న్యాయస్థానాలకు చేరుకోలేని పరిస్థితుల్లో వారి తరఫున ఇతరులు పిటిషన్ వేసే అవకాశం కల్పించడం. తద్వారా సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు వంటి అంశాలు కోర్టు దృష్టికి వస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితిగతంలో సామాజిక మార్పు సాధనంగా పిల్ ఉపయోగపడినప్పటికీ.. ఇప్పుడు అవి అధిక సంఖ్యలో దాఖలు అవుతున్నాయి. తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. అందుకే కేంద్రం తొలగింపు కోరుకుంటోంది. అయితే.. సామాజిక న్యాయం కోసం PILలు ఇంకా అవసరమే అని న్యాయవేత్తలు, పౌరసమాజం భావిస్తోంది. కాబట్టే.. కేంద్రం PILలను తొలగించాలని కోరుకుంటున్నప్పటికీ.. సుప్రీం కోర్టు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ కొనసాగిస్తోంది. -
అది మహాభారత వైవాహిక యుద్ధం
న్యూఢిల్లీ: విడిపోయిన దంపతుల మధ్య దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదాన్ని సుప్రీంకోర్టు ‘మహాభారత వైవాహిక యుద్ధంగా అభివరి్ణంది. ఈ న్యాయ పోరాటానికి పూర్తిగా ముగింపు పలికింది. వివాహాన్ని రద్దు చేసింది. ఆ వివాహం అచరణాత్మకంగా అన్ని విధాలుగా ముగిసిపోయినట్లు పేర్కొంది. వివాహాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంది. సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఏ కేసులోనైనా ఎలాంటి ఉత్తర్వునైనా జారీ చేసే అధికారాన్ని ఈ ఆర్టీకల్ సుప్రీంకోర్టుకు కల్పిస్తుంది. ఈ కేసులో వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్త తన న్యాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భార్య, ఆమె కుటుంబం, చివరికి ఆమె తరఫు న్యాయవాదిపై పగతో కూడిన ప్రచారం ప్రారంభించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. విడిపోయి విరోధులుగా మారిన దంపతులు దీర్ఘకాలిక, తీవ్రమైన వైవాహిక కలహంలో చిక్కుకున్నారని, ఫలితంగా వివిధ కోర్టులు, వేదికలలో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయని తెలిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. భార్య, పిల్లలు నిరాశ్రయులు కాకుండా ప్రతివాది అయిన భర్త మొత్తం రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
అప్పర్ భద్రకు లైన్క్లియర్ !
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఒక్క నీటి చుక్కను కేటాయించకపోయినా.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా 29.9 టీఎంసీల నీటిని తరలించి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో కర్ణాటక సర్కార్ అక్రమంగా చేపట్టిన అప్పర్ భద్రకు కేంద్రం లైన్క్లియర్ చేసింది. గత నెల 20న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన సమావేశమైన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని సాంకేతిక సలహామండలి (టీఏసీ) సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఆ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.21,167.93 కోట్లుగా ఆమోదించింది. దీనికి సంబంధించిన సమావేశ మినిట్స్ వివరాలను సీడబ్ల్యూసీ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2023, ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో నాటి ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే కేంద్రం అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచేసి 130 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించడానికి కర్ణాటక సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ఆధారపడిన రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించనుంది. ప్రధానంగా తుంగభద్ర జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్లోని రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) రైతాంగానికి పెద్దదెబ్బ అని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునళ్ల తీర్పులకు విరుద్ధంగా... తుంగభద్ర డ్యామ్కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్టు కేడబ్ల్యూడీటీ–2 తేల్చింది. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్భద్ర ప్రాజెక్టును 2015లో కర్ణాటక చేపట్టింది. 2019, మార్చి నాటికే రూ.4,830 కోట్లను ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసి అప్పర్తుంగ నుంచి భద్ర ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా ఎత్తిపోతలు, ప్రధాన కాలువలతోపాటు భద్ర నుంచి వాణివిలాస రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాలువ పనులను కర్ణాటక పూర్తి చేసింది. అప్పర్భద్ర ద్వారా 2019–26 వరకు 3.80 టీఎంసీలను వాణివిలాస రిజర్వాయర్కు తరలించింది. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు జాతీయ హోదా అప్పర్భద్రకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను సీడబ్ల్యూసీ తీసుకోవాలి. కానీ..రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్24న సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల ఎలాంటి నీటి మిగులు లేదని.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో సాంకేతిక అనుమతి ఇవ్వడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని పేర్కొంటూ వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి 2020 డిసెంబర్ 30న లేఖ రాసింది. ఈ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ నివేదిక ఆధారంగా అప్పర్భద్రకు 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీ య హోదా కల్పించాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2021, నవంబర్ 6న సమావేశం నిర్వహించింది. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని.. దానికి జాతీయ హోదా ఇవ్వకూడదని నాటి కేసీఆర్ సర్కార్తోపాటు వైఎస్.జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కానీ.. వాటిని బుట్టదాఖలు చేసి 2022, ఫిబ్రవరి 15న అప్పర్భద్రకు జాతీయ హోదా కల్పించింది. వర్షాభావంలో రాష్ట్రానికి కష్టమే.. : అప్పర్ భద్ర ప్రాజెకు పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. -
శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన
ఢిల్లీ: సుప్రీంకోర్టులో శబరిమల కేసుపై మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018లో శబరిమలలో మహిళల పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. 10 నుంచి 50 ఏళ్ల మహిళల శబరిమల ప్రవేశం పై నిషేధ విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 80 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమల తీర్పునే కాకుండా...మత స్వేచ్ఛ , సమానత్వపు హక్కు అంశాలపై తొమ్మిదిమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. శబరిమలలో మహిళలపై ఆంక్షలు మతాచారమని.. అవి న్యాయ సమీక్షకు అతీతమైనవని కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం వాదిస్తున్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక వాదనలు వినిపించింది. ఒక ప్రార్థనా మందిరంలోకి ఎవరు ప్రవేశించాలనేది 'లింగ వివక్ష' కిందకు రాదని, అది దేవతామూర్తి స్వభావం, తరతరాల మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశమని స్పష్టం చేసింది.మహిళల అపవిత్రత లేదా వారి న్యూనతకు సంబంధించినది కాదని కేంద్రం తన లిఖితపూర్వక వాదనలలో స్పష్టం చేసింది. స్వామివారు 'నైష్ఠిక బ్రహ్మచారి కావడం వల్లే శతాబ్దాలుగా ఈ ఆచారాలు అమలులో ఉన్నాయని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇస్తూ.. ‘మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తే అక్కడి పూజా విధానాల మౌలిక స్వభావమే పూర్తిగా మారిపోతుంది. ఇది రాజ్యాంగం కల్పించిన మతపరమైన స్వేచ్ఛను దెబ్బతీయడమే. దశాబ్దాలుగా పురుషులతో పాటు, మహిళలు సైతం ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఆలయ ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సమర్థించాలని సుప్రీంకోర్టును కోరారు.మతపరమైన ఆచారాలను ‘హేతుబద్ధత', ‘ఆధునికత’ లేదా 'శాస్త్రీయత' వంటి ప్రమాణాలతో బేరీజు వేయడం సరికాదని కోర్టుకు సూచించింది. ఈ వివాదం పూర్తిగా మత విశ్వాసాలు, స్వయంప్రతిపత్తి పరిధిలోకి వచ్చే అంశమని, దీనిపై న్యాయసమీక్ష తగదని అభిప్రాయపడింది. మత గ్రంథాలను అన్వయించడానికి లేదా వేదాంతపరమైన ప్రశ్నలను నిర్ధారించడానికి న్యాయమూర్తులకు ఆ స్థాయి శిక్షణ లేదని, అది వారి పరిధిలో లేని అంశమని కేంద్రం తన వాదనల్లో తెలిపింది. -
అతిగా ఊహించుకోకండి.. కాస్త తగ్గండి!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), రాష్ట్ర డీజీలపై సుప్రీంకోర్టు తలంటింది. వారి వ్యవహార శైలిని తప్పుబట్టడంతోపాటు, మాల్డా ఘటన జరిగిన రోజున కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోన్కాల్కు సీఎస్ స్పందించక పోవడాన్ని సీరియస్గా తీసుకుంది. అతిగా ఊహించుకోకండి..కాస్తంత తగ్గండి అంటూ మందలించింది. ఘటన విచారణ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల ఒకటో తేదీన సర్ ప్రక్రియలో భాగంగా విచారణకు వెళ్లిన 9మంది న్యాయాధికారుల బృందాన్ని 9 గంటలపాటు కొందరు నిర్బంధించారు. సాయంత్రం 3.30 గంటలకు ఘెరావ్ మొదలుకాగా, అర్ధరాత్రి 11.30 గంటల వేళ సీజేఐకి సమాచారం అందింది. ఆయన జోక్యంతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆతర్వాతే అర్ధరాత్రి సమయంలో న్యాయాధికారులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఈ ఘటనపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్చువల్ హాజరైన సీఎస్ దుష్యంత్ నరియాలానుద్దేశించి ధర్మాసనం.. ‘ప్రధాన న్యాయమూర్తి ఫోన్ చేసినా స్పందించరా?’అంటూ నిలదీసింది. తాను ఆ సమయంలో ఢిల్లీ లో ఉన్నానని, ఎటువంటి ఫోన్ కాల్స్ తనకు రాలేదని సీఎస్ బదులిచ్చారు. ‘మీ నంబర్ను హైకోర్టు సీజేకి ఇచ్చి ఉంటే ఆయనకు ఆ సమయంలో ఎంతో ఉపయోగపడేది. మీరు హైకోర్టు సీజేకి కూడా అందనంత ఎత్తులో ఉన్నారు. తగ్గండి. హైకోర్టు సీజేకి అయినా అందుబాటులో ఉండండి’అంటూ గట్టిగా హెచ్చరించింది. ‘యంత్రాంగం తీరు ఇలా ఉండటం వల్లే అరాచకం రాజ్యమేలుతోంది’అని వ్యాఖ్యానించింది. మాల్డా ఘటనకు సరైన రీతిలో స్పందించడంలో విఫలమైనందుకు గాను హైకోర్టు సీజేకి క్షమాపణ లేఖ రాయాలంటూ సీఎస్కు, డీజీపీకి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాల్డా ఘటనపై కలకత్తా హైకోర్టు సీజే నివేదిక ఆధారంగానే కలెక్టర్, ఎస్పీలపై తీసుకునే చర్యలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైకోర్టు సీజేకి పూర్తి సహాయ సహకారాలను అందించాలని సీఎస్, డీజీపీ, ఇతర యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. మాల్డాలో న్యాయాధికారుల ఘెరావ్కు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ ఎన్ఐఏకి అప్పగించాలంది. ముందస్తు ప్రణాళికతో జరిగిన ఈ ఘటన వెనుక సూత్రధారులెవరో తేల్చాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. -
అభ్యర్థులపై ఈసీ ఆధారపడితే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే అవి నిష్పక్షపాతంగా జరుగుతాయని హామీ ఇవ్వలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. పట్నాలోని చాణక్య లా యూనివర్సిటీలో రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ లెక్చర్లో ఆమె మాట్లాడారు. ఎన్నికలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన వారి స్వతంత్రత గురించి ప్రస్తావించారు. ఎన్నికల సంఘం అత్యున్నత ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థగా 1995 నాటి తీర్పులో సుప్రీంకోర్టు గుర్తించిందని తెలిపారు. ఎన్నికల సమగ్రతను కాపాడే విధిని ఈసీకి అప్పగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసీ గనక పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే ఎన్నికలు సజావుగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని భావించలేమన్నారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై నియంత్రణ అంటే రాజకీయాలపైనే నియంత్రణ.రాజ్యాంగ నిర్మాణం బలహీనపడితే రాజ్యాంగం కుప్పకూలుతుంది. హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇది చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠం. ప్రజాస్వామ్యంలో ఒక సంస్థ మరో సంస్థను నియంత్రించలేని పరిస్థితి ఉన్నప్పుడు వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాంటప్పుడు ఎన్నికలు కొనసాగినా, కోర్టులు పనిచేసినా, పార్లమెంట్ చట్టాలను రూపొందించినా అధికారంపై వాస్తవిక నియంత్రణ అంటూ ఉండదు. వ్యవస్థాగత క్రమశిక్షణా ఉండదు’’ అన్నారు. రాష్ట్రాలను సబ్ఆర్డినేట్లుగా కాకుండా, కో–ఆర్డినేట్లుగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న సూచించారు. ‘‘రాష్ట్రాలు కేంద్రం కంటే తక్కువ కాదు. వాటిని కేంద్రంతో సమానంగా పరిగణించాలి’’ అని తేల్చిచెప్పారు. అధికారాల విభజన సమానుల మధ్య రాజ్యాంగం చేసిన ఏర్పాటన్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలో పార్టీ విభేదాలను పక్కనపెట్టాలని అన్నారు. పరిపాలన అనేది ‘కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది’అనే అంశంపై ఆధారపడకూడదని స్పష్టంచేశారు. -
గృహ హింస రుగ్మతగా మారింది
న్యూఢిల్లీ: గృహ హింస ఘటనలు కేవలం సమాజంలో వికృత చేష్టలుగాకాకుండా ఒక సామాజిక రుగ్మతగా మారిపోయాయని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై నేరాల చిట్టా నేటి భారత విషాద ముఖచిత్రాన్ని లిఖిస్తున్నాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. 14 సంవత్సరాల క్రితం భార్యను తగలబెట్టిన భర్తకు గతంలో విధించిన మరణదండన తీర్పును సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ రెండో తేదీన ఇచ్చిన తీర్పు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తీర్పు సందర్భంగా పితృస్వామ్య భావజాల విషపోకడలను ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘నేటి భారతంలో ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత, విద్యా రంగం, కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ పితృస్వామ్య ఆధిపత్య భావజాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అలాగే మాయని మచ్చగా కొనసాగుతోంది. లింగ భేదం లేకుండా సమానత్వం, స్వేచ్ఛా, జీవించే హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా కొందరికి అవన్నీ ఎండమావులుగా మిగిలిపోయాయి. లింగ అసమానతలను రూపుమాపేందుకు బేటీ బచావో, బేటీ పఢావో వంటి పథకాలు ద్వారా ప్రభుత్వాలు మహిళల సంక్షేమం, సామాజిక పరిణతికి ప్రయత్నిస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన వంటి పథకాలు మహిళల ఆర్థిక భద్రత, మెరుగైన జీవనాలకు దోహదపడతాయి. కానీ వీటితో సమస్య సమసిపోవట్లేదని గణాంకాలు చాటుతున్నాయి. 2023లో జాతీయ నేరగణాంకాల రికార్డుల ప్రకారం మహిళలపై 4.48 లక్షల నేరాలు జరిగాయి. ఏటా వరకట్న వేధింపుల కేసులు 6,000కుపైగా నమోదవుతున్నాయి. గృహహింస అనేది అత్యధిక కేసుల్లో కన్పిస్తోందని జాతీయ మహిళా కమిషన్ వద్ద పోగుబడిన ఫిర్యాదులు చాటిచెబుతున్నాయి. మహిళ సంపాదించినాసరే ఇంట్లో వంటచేయడం మొదలు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడందాకా పనులన్నీ మహిళే చేయాలనే ఆలోచనాధోరణి మారట్లేదు. చట్టపరంగా, ఆర్థికంగా మహిళలుపురోగమిస్తున్నా పురుషాధిక్యత, పితృసామ్యం అనేవి ప్రతిచోట ప్రతిబంధకాలుగా ఎదురుపడుతున్నాయి. దశబ్దాలుగా చట్టాలు, పథకాలు, సంస్కరణలు, ఇళ్లు, కార్యాలయాలు, వ్యక్తిగత సంబంధాలు, చివరకు సాయుధ బలగాల్లోనూ సమానత్వంకోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా మహిళలపై, వాళ్ల ఇష్టాఇష్టాలపై, వాళ్ల జీవితాలపై పురుషాధిక్యత ఎందుకుంటోంది? సమాధానం బహుశా మన భారతీయ ప్రజల్లోనే దాగి ఉందేమో’’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. -
మాల్డా ఘటనలో సూత్రధారి అరెస్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో అసలు సూత్రధారి అడ్వొకేట్ ముఫకరూల్ ఇస్లాంతోపాటు మరో వ్యక్తిని శుక్రవారం సిలిగురి బాగ్దోగ్రా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 35 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) అభ్యర్థి మౌలానా మొహమ్మద్ షాజహాన్ అలీ ఖాద్రీ కూడా ఉన్నాడు. మొతాబారీ అసెంబ్లీ స్థానం పరిధిలోని కాలియాచాక్ గ్రామంలో బుధవారం రాత్రి జ్యుడీషియల్ అధికారులను స్థానికులు ఘెరావ్ చేసి తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. అర్ధరాత్రి తర్వాత సైన్యం వారిని రక్షించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జ్యుడీషియల్ అధికారులను వేధించిన ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఇతాహర్ గ్రామానికి చెందిన ముఫకరూల్ ఇస్లాం ప్రస్తుతం కోల్కతాలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ కాలియాచాక్లో స్థానికులను రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముఫకరూల్ ఇస్లాం ప్రోద్బలంతోనే జనం జ్యుడీషియల్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తేలింది. కాలియాచాక్ పోలీసు స్టేషన్పై అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. -
పోలీసుల అత్యుత్సాహం
మన దేశానికి సంబంధించినంతవరకూ అధికారం దైవదత్తమేమీ కాదు. అదిరాజ్యాంగం ద్వారా సమకూడిన బాధ్యత. అధికారమైనా, విధులైనా నిర్వర్తించేవారు ఈ సంగతి మరిస్తే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది. పాలకులు మొదలు సామాన్య ప్రభుత్వోద్యోగి వరకూ అందరూ దీన్ని పాటించి తీరాల్సిందే. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఈమధ్య వరసబెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరు యువకుల్ని ‘నేరగాళ్లు’గా చిత్రిస్తూ వారిని తాళ్లతోకట్టి పబ్లిగ్గా నడిరోడ్లపై నడిపిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో మోకాళ్లపై పాకించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి తమ ఘనకార్యాలను చాటుతున్నారు. ఈ ‘పేరుప్రఖ్యాతులు’ చూసి ఆ రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా కొందరు ఇలాంటి పనులకే దిగారు. పోలీసుల మతిమాలిన చేష్టలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి వైపరీత్యాలు తక్కువేం కాదు. తెనాలిలో నిరుడు మే నెలలో దళిత వర్గాల యువకులు ముగ్గుర్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోది హింసించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి వారి దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉంటాయి. కోడిని కోశారని కేసు పెట్టవచ్చు... గ్రహస్థితి బాగో లేకపోతే డ్రగ్స్ విక్రయిస్తున్నారని అభాండం వేయొచ్చు. ఆ ఉదంతాన్ని నిరసిస్తూగుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయినా ఆ మాదిరి ఘటనలు ఆగింది లేదు. ఆ మరుసటి నెలలో నెల్లూరు పోలీసులు సైతం మరో అయిదుగురు యువకులను నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు.చేతిలో లాఠీ ఉంటే చాలు... తాము సర్వం సహాధికారులమన్నట్టు ప్రవర్తించే పోలీ సుల తీరు గర్హనీయమైనది. ఉద్యోగులకైనా, సాధారణ పౌరులకైనా చట్టాలు, రాజ్యాంగం ఒక్కలాగే వర్తిస్తాయి. అధికారంలో ఉన్నవారు తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకునే ఏ చర్య అయినా వాటికి లోబడే ఉంటుంది. పోలీసులు సభ్యసమాజ పోకడలకు విరుద్ధంగా పోకూడదని షీలాబార్సే దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. డీకే బసు కేసులో సైతం నిందితులతో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అసలు పోలీసు మాన్యువల్స్లోనే నిందితులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలున్నాయి. సాధారణ పౌరుల విషయంలో చిన్న చిన్న అంశాల్లో కూడా చెలరేగిపోయేపోలీ సులు... బడా బాబులు పెద్ద నేరాలు చేసినప్పుడు మాత్రం ‘శవాసనం’ వేసిన చందాన మిన్నకుండిపోతారు. ఏపీలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, బలవంతంగా అబార్షన్ చేయించాడనీ ఒక మహిళా ప్రభుత్వోద్యోగి ఆరోపిస్తే నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పైగా ఆమె బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారంటూ ఎదురు కేసులు పెట్టారు. మరో మహిళా మంత్రి పీఏపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయినా జరిగింది శూన్యం. 60వ దశకంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా పోలీసులుసంఘటిత నేరగాళ్ల గుంపుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వినడానికి అవి కటువుగా ఉన్నా, ఆయనన్నది నిజమే అన్నట్టు ప్రవర్తించే పోలీసులకు మన దేశంలో ఎప్పుడూ కొదవలేదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఇష్టానుసారం ప్రవర్తించటానికి లేదు. ఒక వ్యక్తి నిజంగా తప్పుచేసినా వారి చర్యను న్యాయస్థానంలో నిరూపించి తగిన శిక్ష పడేలా చూడటమే పోలీసుల కర్తవ్యం. ప్రతి నేరానికీ గతంలో ఐపీసీలోనూ, ఇప్పుడు భారతీయ న్యాయసంహితలోనూ నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. నేరగాళ్లు సిగ్గుపడేలా చేయటమనే శిక్ష ఎక్కడా లేదు. తెనాలి ఉదంతంలో విచిత్రమేమంటే... ఒక పోలీసు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా అతగాడి సహోద్యోగులు శిక్ష అమలు చేశారు. మరి న్యాయస్థానాలెందుకున్నట్టు? చవకబారు సినిమాలు చూసి, ‘రెడ్బుక్’ రాజ్యాంగంలో ఏదైనా చెల్లుతుందనుకుని చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ బాపతు అత్యుత్సాహపరులు ఏదో ఒకరోజు చట్టానికి చిక్కక తప్పదు. -
జ్యుడీషియల్ అధికారుల నిర్బంధంపై సీరియస్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో నిమగ్నమైన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు నిర్బంధించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని గురువారం ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగిన రక్షణ కల్పించలేకపోయారని బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడింది. జ్యుడీషియల్ అధికారులను జనం ఘెరావ్ చేసి, దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పట్ల అభ్యంతరాలను పరిష్కరిస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘానికి సూచించింది. జ్యుడీషియల్ అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం సుప్రీంకోర్టు అధికారానికే సవాలు విసరడంతో సమానమని ఆక్షేపించింది. ఎస్ఆఐర్ను వ్యతిరేకిస్తూ బుధవారం మాల్డా జిల్లాలోని కాలియచౌక్లో జ్యుడీషియల్ అధికారులను నిరసనకారులు తొమ్మిది గంటలపాటు నిర్బంధించారు. ఆహారం, నీరు కూడా ఇవ్వలేదు. అర్ధరాత్రి తర్వాత భద్రతా సిబ్బంది వారిని రక్షించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. అది ఘెరావ్ కాదని, రాజకీయ నిరసన అంటూ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇవ్వగా, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. అది సాధారణ ఘటన కాదని, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని పేర్కొంది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేజి్రస్టేట్, ఎస్పీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మాల్డా జిల్లా ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 6న తమ ఎదుట ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 700 మంది జ్యుడీషియల్ అధికారులు బెంగాల్లో ఎస్ఐఆర్పై అభ్యంతరాలను పరిష్కరిస్తున్నారు. వీరంతా బెంగాల్తోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. -
‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ పాలనాయంత్రాంగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. మాల్దాలో జుడీషియల్ అధికారుల ఘెరావ్ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇది ఆకస్మికంగా జరిగిన అల్లరి కాదని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని పేర్కొంది.ఈ ఘటనపై గురువారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కోర్టు అధికారానికే సవాల్ విసిరేలా ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న న్యాయాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు, అలాగే ఈ ప్రక్రియను స్తంభింపజేసేందుకే అత్యంత తెలివిగా ఈ వ్యూహాన్ని అమలు చేశారు’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ను దేశంలోనే ‘మోస్ట్ పోలరైజ్డ్ స్టేట్’(రెండు పరస్పర విరుద్ధ వర్గాలుగా విడిపోయిన రాష్ట్రం)గా అభివర్ణించింది.ఈ వ్యవహారంలో పరిపాలనా విభాగం తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 3:30 గంటలకే ఘెరావ్ ప్రారంభమైనట్లు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సమాచారం అందినప్పటికీ, అధికారులు గంటల తరబడి స్పందించలేదని కోర్టు తప్పుబట్టింది. ‘రాత్రి 8:30 వరకు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా రంగంలోకి దిగి డీజీపీ, హోం సెక్రటరీలతో గ్రూప్ కాల్ మాట్లాడితే తప్ప హామీ రాలేదు. తీరా హామీ ఇచ్చాక కూడా క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలేమీ లేవు’ అని సీజేఐ మండిపడ్డారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అక్కడికి చేరుకోకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, ఇది న్యాయవ్యవస్థను భయభ్రాంతులకు గురిచేసే చర్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘పాక్ను సముద్రంలో కలిపేవాళ్లం’: నేవీ చీఫ్ -
జవాన్లకు న్యాయ సౌలభ్యం కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర శ్లాఘనీయమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వారికి మెరుగైన న్యాయసౌలభ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం సరిహద్దుల్లో ఒక యుద్ధం, న్యాయపరమైన హక్కుల కోసం మరో యుద్ధం, ఇలా రెండు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులను వారికి రానివ్వరాదన్నారు. లేహ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. కోర్టులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పిస్తుండగా, సాయుధ బలగాలు అందుకు అవసరమైన ఆదర్శాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, గౌరవం, సమానత్వం, న్యాయం దేశ ప్రజలకు అందించేందుకు తగిన రక్షణను, పరిస్థితులను కల్పించిన ఘనత సైనికులకే దక్కుతుందన్నారు. -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. -
‘అది వివక్ష కాదు.. ఆచారం’
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన వైఖరిని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కీలక వివరణ ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలపై ఉన్న నియంత్రణ అనేది లింగ వివక్ష కిందకు రాదని, అది ఆలయ సంప్రదాయంలో భాగమని బోర్డు కోర్టుకు విన్నవించింది.నైష్ఠిక బ్రహ్మచర్యమే ప్రాతిపదికగా..శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా భక్తులు ఆరాధిస్తారని దేవస్వం బోర్డు తన వాదనలో పేర్కొంది. స్వామివారికి ఆధ్యాత్మిక శక్తి అనేది ఆయన ఆచరించిన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ద్వారానే లభిస్తుందని.. ఈ క్రమశిక్షణను భక్తులు కూడా పాటిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ, శబరిమల ప్రత్యేకత ఈ ‘నైష్ఠిక బ్రహ్మచర్యమే’నని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నియంత్రణలు ఉన్నాయని, అయితే 10 ఏళ్లలోపు బాలికలు, 50 ఏళ్లు దాటిన మహిళల ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని గుర్తు చేసింది.అంతర్జాతీయ పరిశోధనల ప్రస్తావనతన వాదనను బలపరుచుకునేందుకు దేవస్వం బోర్డు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1987లో ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్తో పాటు, 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను బోర్డు గుర్తు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం.. శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమే తప్ప, సమానత్వ హక్కులను కాలరాయడం కాదని బోర్డు ‘సుప్రీం’లో వాదించింది. ఒక సమూహాన్ని లేదా వర్గాన్ని ‘మతపరమైన శాఖ’గా గుర్తించాలా వద్దా అనేది కేవలం చట్టపరమైన అంశమే కాదని, అది వాస్తవాలతో కూడిన విషయమని బోర్డు అభిప్రాయపడింది. డాక్యుమెంటరీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: ‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్ -
ఐదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి
శృంగవరపుకోట: కోర్టుల్లో ఐదేళ్లకుపైబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు చెప్పారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిరి్మంచనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్ చేశారని, మరో పాతికేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్టుగా కోర్టు భవనాల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు బెంచ్–బార్ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ తగాదాలు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు గమనించామని, జ్యుడీషియల్ వ్యవస్థపై కోర్టులకు వెళ్తే తరాలు మారినా న్యాయం జరగదని, ఫలితం రాదన్న అపవాదు ఉందని, దాన్ని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో తొలి విడతలో 3 లక్షలు, రెండవ విడతలో 3 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ కృషితో నిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసుల జడ్జిమెంట్ సరిగా లేకుంటే మళ్లీ కేసులు పడే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఎస్.కోట కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ క్రెడిట్ని తన ఖాతాలో వేశారని పేర్కొన్నారు. తనకు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మంచి స్నేహితుడు, మార్గదర్శకులు అని చెప్పారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత, గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ రాంసుందర్రెడ్డి, విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జేఆర్సీతో పెండింగ్ కేసుల పరిష్కారం
బెంగళూరు: దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న చెప్పారు. కేసుల కొండ కరగాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ (జేఆర్సీ) ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవస్థాగతపరమైన కొన్ని లోపాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో జాప్యానికి కారణమవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ‘పెండింగ్ నుండి సత్వర న్యాయం వరకు: భార తీయ న్యాయస్థానాల్లో న్యాయ పంపిణీపై పునరాలోచన’ అనే అంశంపై జస్టిస్ నాగరత్న మాట్లాడారు. న్యాయ సంస్కరణల కమిషన్లో కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులకే కాకుండా జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, న్యాయ వాదులకు సభ్యత్వం కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి బార్ అసోసియేషన్ సభ్యులకు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు, ప్రభుత్వ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉండాలన్నారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసే బాధ్యతను ఈ కమిషన్కు కట్టబెట్టాలని జస్టిస్ నాగరత్న సూచించారు. వాయిదాలకే ప్రాధాన్యం కేసులో యథాతథ స్థితిని విధించడం, విచారణను సుదీర్ఘకాలం వాయిదా వేయడం వంటి కారణాలతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ‘స్టేటస్ కో’తో ప్రయోజనం పొందే కక్షిదారులు కేసు విచారణ వాయిదాపడడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు. లాయర్లు వాయిదాలను ఇష్టపడుతున్నారని, దానివల్ల వారికి లాభం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రతిసారి విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎంతోకొంత ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వ విభాగాలు ఏదైనా కేసులో ప్రతికూలంగా తీర్పు వస్తే మళ్లీ అప్పీల్కు వెళ్తున్నాయని గుర్తుచేశారు. చివరకు కేసులు ఎటూ తేలకుండా పెండింగ్లో కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు సత్వర తీర్పు కంటే కేసుల వాయిదాకే ప్రాధాన్యం ఇస్తున్నారని జస్టిస్ నాగరత్నం వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే న్యాయ సంస్కరణల కమిషన్ ద్వారా సంస్థాగతమైన మార్పులు తీసుకురావాలని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా మారుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారులు సూక్ష్మపరిశీనలను తప్పించుకోవడానికి అప్పీళ్లు దాఖలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని తెలిపారు. దీనివల్ల త్వరగా పరిష్కారమయ్యే వివాదాలు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. లాయర్లు వృత్తిపరమైన, నైతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జస్టిస్ నాగరత్న పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆచరణీయమైన లిటిగేషన్ పాలసీ తీసుకురావాలన్నారు. నిధులు సకాలంలో ఇవ్వాలని, న్యాయమూర్తుల పోస్టులు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని వెల్లడించారు. -
ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ను తొలగిస్తూ కేంద్రం 2023లో తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వైదొలిగారు. పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ ఆరంభంలోనే ‘ఈ కేసులో నేను విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనా(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)లున్నాయి’అని వ్యాఖ్యానించారు. విచారణ నుంచి తప్పుకోవడం సబబని భావిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించాలని సూచించారు. సీజేఐ అభిప్రాయంతో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఏకీభవించారు. దీంతో, ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీన మరో ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని సీజేఐ తెలిపారు. సీజేఐ అయ్యేందుకు అవకాశం లేని జడ్జీలతో నూతన ధర్మాసనం ఏర్పాటవుతుందని ప్రకటించారు. తీర్పు వెలువడే వరకు ప్రస్తుత చట్టం యథాతథంగా అమల్లో ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నెలల్లోనే 2023 డిసెంబర్లో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు కమిషనర్ల నియామకానికి ఏర్పాటయ్యే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతోపాటు హోం శాఖ సిఫార్సు చేసిన కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు. సీజేఐను మినహాయిస్తూ తీసుకు వచ్చిన కొత్త చట్టంతో ఈసీ నియామక ప్రక్రియ నిష్పాక్షికతను కోల్పోయిందంటూ సుప్రీంలో కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరులు పిటిషన్లు వేశారు. అయితే, ఈసీ ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రతినిధి ఉండటం వల్ల నియామక ప్రక్రియలో నిష్పాక్షికత వచ్చినట్లు కాదని కేంద్రం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం నిబంధనల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. -
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: కార్మిక వర్గానికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. పరిశ్రమ(ఇండస్ట్రీ) అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం–1947లోని ఇండస్ట్రీ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని కోరుతూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై 1978 ఫిబ్రవరి 21న అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్సులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలను కూడా ‘ఇండస్ట్రీ’గా పరిణించాలని వెల్లడించింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పారిశ్రామిక వివాదాల చట్టం–1947 పరిధిలోకి వచ్చారు. తద్వారా వారికి లబ్ధి చేకూరుతోంది. 1978 నాటి తీర్పు సరైనదేనా? అని ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మూడు రోజులుగా విచారణ కొనసాగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై వాదనలు వినిపించారు. అటవీ శాఖ ఇతర శాఖలను కూడా ఇండస్ట్రీగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక అంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. తమ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పు కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
తీరు మారుస్తూ.. సుప్రీం ‘తీర్పు’!
సాక్షి, అమరావతి: న్యాయాన్ని అందించడంలో జాప్యం జరిగితే.. అది న్యాయాన్ని తిరస్కరించడమే..!న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కూడా కనిపించాలి..!ఇవి న్యాయ వ్యవస్థలో రూఢీ అయిన సూత్రాలు. అయితే కక్షిదారులకు న్యాయం అందించే విషయంలో దేశంలోని హైకోర్టుల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంపై స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హైకోర్టుల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన నాటి నుంచి తీర్పు వెలువరించేంత వరకు జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తీర్పులను వెలువరించేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏదైనా కేసులో వాదనలు విన్న తరువాత ఆ కేసులో తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు..? ఆ తరువాత తీర్పును ఎప్పుడు వెలువరించారు..? ఆ తీర్పు కాపీని ఎప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు..? అనే వివరాలను తేదీలతో సహా తీర్పు కాపీపై స్పష్టంగా ముద్రించాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా ఆ కేసులో ఎప్పుడు ఏం జరిగిందని అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తీర్పులు వెలువరించే విషయంలో వేగం కూడా పెరగనుంది.విప్లవాత్మక సంస్కరణ అంటున్న న్యాయ నిపుణులు..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలను న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, తీర్పులు ఇచ్చే విషయంలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుండా ఉండేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అలా సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుంటే.. చివరకు తీర్పు వెలువరించిన సమయంలో ఆ వివరాలను అందులో ప్రస్తావించాల్సి ఉంటుంది. దీంతో జాప్యంపై ఎవరో ఒకరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తీర్పు వెలువరించే విషయంలో న్యాయమూర్తులకు చట్టపరంగా నిర్దిష్ట గడువంటూ ఏదీ లేదు. అయితే తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తీర్పు వెలువడటం ఓ సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి 2001లో అనిల్రాయ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లో తీర్పు వెలువరించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్నీ హైకోర్టులను ఆదేశించింది.ఇప్పటికే గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు...అలాగే కొన్ని హైకోర్టుల్లో తీర్పులు వెలువరించిన తరువాత అవి అందుబాటులోకి రావడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు తీర్పు కాపీలు బయటకు వచ్చేందుకు నెలల సమయం కూడా పడుతోంది. దీంతో కక్షిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తీర్పులు వెలువరించే విషయంలో నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఓ తీర్పునిచ్చింది.ఏదైనా కేసులో తీర్పు రిజర్వ్ చేసిన తరువాత 3 నెలల్లోపు తీర్పు వెలువరించకుంటే ఈ విషయాన్ని సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తేవాలని ఆదేశించింది. అనంతరం సీజే.. ఆ విషయాన్ని సదరు న్యాయమూర్తి, ధర్మాసనం దృష్టికి తెచ్చి రెండు వారాల్లో తీర్పునివ్వాల్సిందిగా కోరాలని సూచించింది. ఆ రెండు వారాల్లో కూడా తీర్పు వెలువరించకుంటే, ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును మరో న్యాయమూర్తికి, ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు లోపు తీర్పు వెలువరించకుంటే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేయాలి, కక్షిదారులు ఏం చేయాలన్న దానిని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.సుప్రీం.. తీవ్ర విస్మయం తమకు కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై తీర్పును రిజర్వ్ చేసిన జార్ఖండ్ హైకోర్టు రెండు మూడేళ్లుగా తీర్పు వెలువరించలేదంటూ కొందరు ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు రిజర్వు చేసి రెండేళ్లయినా కూడా తీర్పు వెలువరించకపోవడంపై ధర్మాసనం తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తూ దేశంలోని అన్ని హైకోర్టుల నుంచి నివేదికలు కోరింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం చేయడం కక్షిదారుల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. హైకోర్టులకు తగిన దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించింది. తమ ముందున్న కేసుల్లో తీర్పులు వెలువరించేందుకు ఎంత కాలం పడుతుందో ప్రజలందరికీ తెలియచేసేందుకు వీలుగా ఆ వివరాలను తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొనాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచేలా ఆ సంస్కరణలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సుప్రీం ఆదేశాల అమలుకు రాష్ట్ర హైకోర్టు శ్రీకారం..సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఏపీ హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రతి తీర్పు సర్టిఫైడ్ కాపీతో పాటు అప్లోడ్ చేసిన కాపీలోనూ తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు.. ఎప్పుడు తీర్పు వెలువరించారు.. ఎప్పుడు ఆ తీర్పును అప్లోడ్ చేశారు.. లాంటి వివరాలను తీర్పు మొదటి పేజీలో స్పష్టంగా పేర్కొనాలని హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా న్యాయమూర్తుల కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీలు చర్యలు చేపట్టారు. దీంతో తీర్పులు సకాలంలో అప్లోడ్ అవుతూ కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.ఆ వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది..‘ఏ న్యాయమూర్తి ఎప్పుడు తీర్పు రిజర్వ్ చేశారు? ఎంత కాలం తర్వాత తీర్పు ఇచ్చారు? ఆ తీర్పు కక్షిదారులకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? తీర్పులను వెబ్సైట్లలో అప్లోడ్ చేయడానికి హైకోర్టులు ఎంత సమయం తీసుకుంటున్నాయి? లాంటి వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు. తీర్పుల రిజర్వ్, తీర్పు వెలువడిన తేదీలను మాత్రమే చూపే ఒక ప్రత్యేక డాష్బోర్డ్ హైకోర్టు వెబ్సైట్లలో ఉండాలని జస్టిస్ బాగ్చీ అభిప్రాయపడ్డారు.ఏడాదికి కూడా వెలువడని తీర్పులుఅయితే ఈ ఆదేశాలు పలు హైకోర్టుల్లో అమలు కావడం లేదు. వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన తరువాత ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని పలు ఉదంతాలు ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. కొన్ని హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసిన రెండేళ్లకు కూడా తీర్పులు వెలువరించకపోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. తీర్పులు వెలువరించడంలో అసాధారణ జాప్యం చేసినందుకు కొందరు న్యాయమూర్తులను సైతం సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దక్షిణాదిలోని ఓ హైకోర్టులో న్యాయమూర్తి ఒకరు దాదాపు 700 కేసుల్లో ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని కారణంతో సుప్రీంకోర్టు ఆయన్ను బదిలీ చేసింది. సకాలంలో తీర్పులు వెలువరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వైఖరి చాలా స్పష్టంగా ఉంది. -
అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా పోలీసులు అడ్డగోలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో కేసు నమోదుకు ముందే 14 రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి, నేరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయితేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) చెబుతోందన్న సుప్రీంకోర్టు, పోలీసులు ఈ సెక్షన్ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ తప్పుపట్టింది. వేధింపులు లేదా నిరాధారమైన ఆరోపణలతో క్రిమినల్ చర్యలు ప్రారంభించకుండా అడ్డుకోవడమే ప్రాథమిక విచారణ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేసింది. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం యాంత్రికంగా వ్యవహరించడమే అవుతుందని స్పష్టం చేసింది. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఫిర్యాదు అందిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా యాంత్రికంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పోలీసులను నిరోధించడమే శాసనకర్తల ముఖ్య ఉద్దేశమని, అందుకే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 (3) తీసుకొచ్చారని గుర్తు చేసింది.హైకోర్టులు ఆ ఎఫ్ఐఆర్లను కొట్టేయచ్చు..భజన్ లాల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆరోపణలు అసంబద్ధంగా, అస్పష్టంగా ఉన్నప్పుడు హైకోర్టులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 కింద తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి కేసును కొట్టేయవచ్చునని సుప్రీంకోర్టు తెలపింది. ఓ మీడియా సంస్థ తన సంస్థలో పనిచేసిన ఉద్యోగిపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైపూర్ సిటీ, అశోక్ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది. అస్పష్టమైన ఆరోపణలతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని, అందుకే కేసును కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఫిర్యాదులోని ఆరోపణలు చాలా అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. అధికార దుర్వినియోగం, అక్రమాలు తదితర ఆరోపణలు ఉన్నప్పటికీ, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను సమర్పించలేదంది. పోలీసులు సైతం ప్రాథమిక విచారణ జరపకుండా, ఆరోపణలను దృవీకరించుకోకుండానే చాలా వేగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇది ఆశ్చర్యకరంగా ఉందని ధర్మాసనం ఆక్షేపించింది. ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపిడియా కానప్పటికీ, అందులో ప్రాథమిక వాస్తవాలు ఉండాలని తెలిపింది. సామాన్యుడు ఎవరైనా ఇలాంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసి ఉంటే పోలీసులు కేసు నమోదు చేసి ఉండే వారు కాదని, అయితే ప్రముఖ మీడియా సంస్థ కావడంతో ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారని తెలిపింది. -
హక్కుల హరణం అన్యాయం
సమస్య ఉందని గుర్తించటం, దానికి పరిష్కారం అన్వేషించటం ఒక ఎత్తయితే అందుకు సంబంధించి చట్టం తీసుకురావటం మరో పెద్ద పని. మన దేశంలో చాలా సందర్భాల్లో అందుకు దశాబ్దాలు పడుతుంది. తీరా ఆ చట్టాన్ని కాస్తా నీరుగారిస్తే...? ట్రాన్స్జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ), చట్టం 2019కి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణలు వారికి దక్కిన అరకొర హక్కుల్ని కాస్తా హరించేలా ఉన్నాయి. సృష్టి ఒక గీత గీసిందనీ, ఎవరైనా దానికి అటో, ఇటో ఉండాలి తప్ప వేరేవిధంగా ఉండటానికి వీల్లేదన్నది కాలం చెల్లిన భావన. మన దేశంలో తొలిసారి 2014లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని గుర్తించి,వారికి కూడా ఇతరుల్లాగే ప్రాథమిక హక్కులుంటాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయాలే విలువలుగా చలామణిలోకొస్తాయి. ఆడ, మగ కలిసి ఉండటం సహజమనీ, ఇతరమైన సంబంధాలు అసహజమనీ భావించే ధోరణి అటువంటిదే.ప్రభుత్వాలు సైతం ఆ దోవనే పోవటంతో దశాబ్దాలుగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్) వర్గాల వారు అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కోవడం సాధారణ విషయాలుగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అయిదేళ్లకు 2019లో ఎట్టకేలకు ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. ఆ చట్టం కింద జిల్లా కలెక్టర్కు ట్రాన్స్జెండర్నని దరఖాస్తు చేసుకున్నవారికి ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేది. కొత్త సవరణ అలా కుదరదంటోంది. ప్రధాన వైద్యాధికారి లేదా ఉప వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్ బోర్డులు ఏర్పడాలనీ, వాటి సిఫార్సుల ఆధారంగానే కలెక్టర్లు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలనీ తాజా సవరణ చెబుతోంది. దీంతోపాటు ట్రాన్స్జెండర్ వ్యక్తులపై జరిగే హింస, భిక్షాటన చేయించటం నేరాలుగా పరిగణిస్తూ, కఠిన శిక్షలు నిర్దేశిస్తూ నిబంధనలు పొందుపరిచారు. అసలు జిల్లా కలెక్టర్ స్థాయిలో ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవటమే పెద్ద సమస్యగా పరిణమిస్తున్నదనీ, ఈ క్రమంలో వేధింపులు ఎదురవుతున్నాయినీ ఆ వర్గాలవారు ఆవేదన పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ధ్రువీకరణ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా 2023 డిసెంబర్ నాటికి దరఖాస్తుల్లో 65 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈలోగా దాన్ని మరింత జటిలం చేసే సవరణలు వచ్చిపడ్డాయి. చట్టం రూపొందించేటపుడూ లేదా దానికి సవరణలు తీసుకురాదల్చుకున్నప్పుడూ సంబంధిత వర్గాలతో చర్చించటం, అవసరమైన మార్పులు చేర్పులకు సిద్ధపడటం ఒక ప్రజాస్వామిక సంప్రదాయం. సాగు చట్టాలు మొదలుకొని చాలా విషయాల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దాన్ని పక్కనబెడుతోంది. పుట్టుకతో అందరూ గుర్తించిన జెండర్కు భిన్నమైన లైంగిక భావనలుండటం ప్రకృతి విరుద్ధం కాదని చెబుతూ స్వలింగసంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 277 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ‘స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం’ అని వ్యాఖ్యానించారు. ఆ వర్గాలవారు అసలే దారుణ వివక్ష ఎదుర్కొంటున్నారు. జాతీయ మానవ హక్కుల నివేదిక, 2018 ప్రకారం వారిలో 92 శాతం మంది ఆర్థిక వెలికి గురవుతున్నారు. అక్షరాస్యత కూడా 56.1 శాతం. జాతీయ సగటు 74 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. నిరుద్యోగం 48 శాతం. బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా అడ్డంకులు. ఇక ఆర్థిక సాయం పొందటం గురించి చెప్పేదేముంది?స్వలింగ సంపర్కం నేరం కాదని మొదటిసారి గుర్తించింది 1791 నాటి ఫ్రెంచ్ విప్లవం సమయంలో. లెనిన్ ఆధ్వర్యంలోని సోవియెట్ ప్రభుత్వం 1920లో స్వలింగసంపర్కుల హక్కుల్ని గుర్తించి చట్టం తీసుకొచ్చింది. ఆ మాత్రం మార్పు రావటానికి ప్రపంచ దేశాల్లో ఎంతకాలం పట్టిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దాన్ని మహాపాపంగా, నేరంగా పరిగణించే దేశాలు ఎన్నో! ఈ బిల్లుపై పార్లమెంటు చర్చించేలోగా ట్రాన్స్జెండర్ వర్గాలను సంప్రదించాలి. చట్టాన్ని మరింత సరళం చేయటం అవసరమని భావిస్తున్న తరుణంలో వారికి వ్యవస్థ ఆమోద ముద్రను తప్పనిసరి చేయటం ధర్మం కాదు. -
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది.జనవరి 8న కోల్కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా, మమతా బెనర్జీ అక్కడకి దూసుకొచ్చారు. సోదాలకు అడ్డు తగలడంతోపాటు అక్కడున్న ల్యాప్టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంంతంగా లాక్కొని వెళ్లిపోయా రు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసు గా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.‘‘ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే’’ అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత, అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని రూపొందించాలని తేలి్చచెప్పింది. ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదావేసింది. -
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయదుందుభి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి) ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాదులు విజయదుందుభి మోగించారు. మొత్తం 23 మంది సభ్యుల్లో ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నలుగురు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన మరో నలుగురు గెలిచారు. జనసేనకు చెందిన ఇద్దరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఐదుగురు తటస్థులు బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో 23 మంది అభ్యర్థులు ఎన్నికైనట్టు సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ ప్రకటించింది. బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారిలో అజయ్కుమార్ చలసాని, చిదంబరం కలిగినీడి, రామిరెడ్డి ఆలూరు, శాంతకుమార్ గొర్రెముచ్చు, బ్రహ్మారెడ్డి వట్టిజొన్నల, బాలాజీ యలమంజుల, కృష్ణారెడ్డి బీవీ, శ్రీనివాసరాజు ఉప్పలపాటి, రాజేంద్రప్రసాద్ సుంకర, శ్రీనివాసులరెడ్డి కొమ్మసాని, సుమంత్ ఎన్వీ, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి బండారు, రామారావు ఘంటా, రామ జోగేశ్వరరావు కీర్తి, వెంకట్రామిరెడ్డి కొవ్వూరి, మాధవి రోళ్ల, కృష్ణమోహన్.ఎస్, అంకయ్య సత్తు, శ్రీదేవి జంపాని, మంజులత దోని, దుర్గనాగశ్రీ, గంగాభవాని రాగి ఉన్నారు. రిజర్వేషన్తో మహిళలకు సముచిత స్థానం ఎన్నికైన 23 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో ఇంత మంది ఎన్నిక కాగలిగారు. మరో ఇద్దరు మహిళలను కో–ఆప్షన్ కింద హైపవర్ కమిటీ ఎంపిక చేయనుంది. ఎన్నికైన వారిలో రామారావు ఘంటా గతంలో బార్ కౌన్సిల్ చైర్మన్గా చేశారు. రామిరెడ్డి ఆలూరు ప్రస్తుతం బీసీఐ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రామజోగేశ్వరరావు గతంలో వైస్ చైర్మన్గా పనిచేయగా, కృష్ణమోహన్ ప్రస్తుతం వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి కుమారుడు సుమంత్ ఎన్వీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. శాంతకుమార్, బాలాజీ, శ్రీనివాసరాజు, శ్రీనివాసులరెడ్డి, సుమంత్, రవి బెల్లాన, వెంకటరమణమూర్తి, అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గనాగశ్రీ, గంగాభవాని తొలిసారిగా బార్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్లో మొత్తం 26 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో 25 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అడ్వొకేట్ జనరల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ఈ 25 మందిలో ఇప్పుడు 23 మందిని ఎన్నికైనట్టు ప్రకటించారు. మరో ఇద్దరిని కో –ఆపె్టడ్ సభ్యులుగా హైపవర్ కమిటీ ఎంపిక చేస్తుంది. బార్ కౌన్సిల్ చైర్మన్ రేసులో అజయ్కుమార్, చిదంబరం, బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేయింబవళ్లు ఓట్ల లెక్కింపు ఎన్నికలు గత నెల 13న జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 149 కేంద్రాల్లో పోలింగ్ జరగ్గా.. గత నెల 16 నుంచి ఈ నెల 18 వరకు నిరాటంకంగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎలాంటి గందరగోళం, అవాంతరాలు లేకుండా ఓట్ల లెక్కింపును పూర్తి చేసినందుకు బార్ కౌన్సిల్ అధికారులను న్యాయవాద వర్గాలు అభినందించాయి. ప్రాధాన్యత ఓట్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ నిర్దేశించిన గడువు దగ్గర పడటంతో బార్ కౌన్సిల్ అధికారులు, ఉద్యోగులు చివరి మూడు రోజులు రోజుకు రెండు మూడు గంటల విరామం మాత్రమే తీసుకుని రేయింబవళ్లు ఓట్లు లెక్కించారు. చివరి రోజున ఓట్ల లెక్కింపు చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. అంకయ్య సత్తు, మరో సభ్యుడు వేనాటి చంద్రశేఖరరెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరకు అంకయ్య 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరిద్దరూ నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులు కావడం విశేషం.రూ.కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి రిటర్నింగ్ అధికారిగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా సీనియర్ న్యాయవాది వి.వేణుగోపాలరావు, న్యాయవాది పీఎస్పీ సురేష్ కుమార్, పరిశీలకులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ వ్యవహరించారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు భారీ స్థాయిలో ఖర్చు చేశారు. కొందరు అభ్యర్థుల ఖర్చు రూ.5 కోట్లు దాటింది. ఫలానా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అభ్యర్థులు ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో బార్ కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించిన పలువురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. -
సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్.నిరంజన్రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
‘కారుణ్య మరణానికి’ ఊపిరి!
అచేతన లేదా అర్ధ చేతన స్థితిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ మనుగడ సాగించే రోగుల విషయంలో ఏం చేయాలన్న అంశంలో స్పష్టత కొరవడిన నేపథ్యంలో బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా అనే యువకుడి పరోక్ష కారుణ్య మరణానికి అనుమతిస్తూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చావు బతుకుల పొలిమేరల్లో కొట్టుమిట్టాడేవారి విషయంలో ఏం చేయాలన్న మీమాంస మన దేశానికే పరిమితమైనది కాదు. దాదాపు అన్ని సమాజాల్లోనూ దశాబ్దాలుగా ఎడతెగని చర్చ కొనసాగుతోంది. 27 దేశాలు మాత్రమే కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ కొన్ని మొగ్గు చూపగా, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ మరికొన్ని అనుమతించాయి. 1973లో ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్న అరుణా రామచంద్ర శాన్బాగ్ అనే యువతి లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్లిన ఉదంతం అనంతరం ఈ విషయమై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమెను నాలుగు దశాబ్దాల పాటు ఆసుపత్రి సహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2009లో ఆమె స్నేహితురాలు పింకీ విరానీ... అరుణా శాన్బాగ్కు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతినీయటం రాజ్యాంగబద్ధమేనని 2011లో న్యాయస్థానం అభిప్రాయపడింది. కానీ రోగి తరఫు బంధువులు కోరనందున ఈ తీర్పు బాధితురాలికి వర్తించబోదని తెలిపింది. ఎన్నో పరిమితులు విధించినా 2011 నాటి తీర్పు ఎన్నదగింది. అయితే 2018లో ‘కామన్ కాజ్’ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ‘జీవించే హక్కు’కు పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ‘హుందాగా మరణించే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని తెలిపింది. దీనికోసం ఒక చట్టం చేయాలని కేంద్రానికి సూచిస్తూ, ఈలోగా వర్తింప జేయటం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కానీ ఇప్పటివరకూ ఆ చట్టం జాడలేదు. ఆచరణలో ఆ మార్గదర్శకాల వల్ల ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేశాక 2023లో అవి మరింత సరళమయ్యాయి. కానీ వాటి అమలుకు అనుమతించటం ఇదే ప్రథమం.పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతించటం విషయంలో నైతిక పరమైన సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం. ఎందుకంటే గుండె, లేదా మెదడు ‘సజీవంగా’ ఉన్నట్టు వైద్యులు చెప్పాక చూస్తూ చూస్తూ అలాంటి రోగి మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఏ క్షణమైనా కోలుకోవచ్చని ఆశిస్తారు. ప్రస్తుత కేసులో రోగి 13 ఏళ్లుగా అలాంటి స్థితిలోనే కొనసాగాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించాక అతని తల్లితండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తీర్పు వెలువరించినప్పుడు స్వయానా న్యాయమూర్తే కంటతడి పెట్టారంటే ఆయనలో సాగిన అంతస్సంఘర్షణ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కన్నవారి గురించి చెప్పేదేముంది? తీర్పు వెలువరించిన రోజే మీడియాలో యూపీ ఉదంతం ఒకటి వచ్చింది. దాన్ని గమనిస్తే ఈ తరహా రోగుల స్థితిని అంచనా వేయటం ఎంత సంక్లిష్టమో తెలుస్తుంది. ‘బ్రెయిన్ డెడ్’ అయి కోమాలోకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ కొద్ది నిమిషాల్లోనే మరణిస్తుందని వైద్యులు చెప్పటంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని వెనక్కి తీసుకెళ్తుండగా రోడ్డుపై లోతైన గుంతలో అంబులెన్స్ చిక్కుకుంది. దాన్ని కదల్చటానికి ఇంజిన్ను హెచ్చించటంతో వాహనం కుదుపునకులోనై ఆ మహిళలో శ్వాస సాధారణ స్థాయికి చేరి, మాట్లాడటం మొదలైంది. అందుకే అత్యంత జాగరూకత అవసరం. ‘మరణించడానికి గల హక్కు’ కాస్తా కొందరు స్వప్రయోజనపరుల వల్ల ‘బాధ్యత’గా మారిపోయే ప్రమాదం ఉంది. ఆస్తులపై కన్నేసి, లేదా చాకిరీ తప్పించుకునేందుకు అంతిమ దశలో ఉండేవారి చేత బలవంతంగా కారుణ్య మరణానికి అనుమతించాలన్న పత్రాలపై సంతకాలు చేయించే ప్రబుద్ధులు కూడా అక్కడక్కడ ఉంటారు. కనుక అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే అనుమతి మంజూరు చేయటం అవసరం. -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
అవినాశ్ బెయిల్ రద్దుకు సుప్రీం నో..
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ముసుగులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి తదితరులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ, పలు పిటిషన్లతో పదే పదే కోర్టుల మెట్లు ఎక్కుతున్న డాక్టర్ సునీతకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్రెడ్డితో పాటు పలువురి బెయిల్ను రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసింది: సీబీఐ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, వివేకా కేసులో దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. ఈ కేసులో ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జ్షీట్ను సైతం కింది కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇకపై ఎలాంటి తదుపరి దర్యాప్తు అవసరం లేదని విన్నవించారు. సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ రద్దు అవసరం లేదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో ‘సెక్షన్ 207’ ప్రక్రియ పూర్తికి నిర్దేశం దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందితులకు కేసు చార్జ్షీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేయడానికి సంబంధించిన ‘సీఆర్పీసీ సెక్షన్ 207’ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా కేసు ట్రయల్ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పునఃదర్యాప్తు పేరుతో వివేకా హత్య కేసు విచారణను అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ప్రత్యర్థుల కుట్రలో సునీత పావుగా మారారన్న విమర్శల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టు విచారణ ఇక్కడెందుకు.. సిద్ధార్థ లూథ్రాకు ప్రశ్న విచారణ సందర్భంగా సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలను ఆయన పదే పదే ధర్మాసనం ముందు లేవనెత్తారు. ‘మా వద్ద కేసుకు సంబంధించిన కీలక మెటీరియల్ ఉంది.. దాన్ని పరిశీలించి బెయిల్ రద్దు చేయండి’ అంటూ లూథ్రా వాదించే ప్రయత్నం చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్ తీవ్రంగా స్పందించారు. ఏమిటిది.. మీరు సుప్రీంకోర్టులోనే కేసు ట్రయల్ (విచారణ) నిర్వహించాలనుకుంటున్నారా?’ అంటూ లూథ్రాను సూటిగా ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు పరిధిలో జరగాల్సిన విచారణను ఇక్కడికి ఎందుకు తెస్తున్నారంటూ లూథ్రా తీరును తప్పుబట్టారు. ఇలా పదే పదే పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. -
ఆ ముగ్గురిని పక్కన పెట్టండి
న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో అభ్యంతకర అధ్యా యాన్ని చేర్చడానికి కారకులైన ముగ్గురు నిపు ణుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వారితో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించరాదని కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ఈ పుస్తకంలో చేర్చడం సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎన్ఈసీఆర్టీ లీగల్ స్టడీస్కు సంబంధించి పాఠ్యప్రణాళికను ఖరారు చేయడానికి న్యాయ రంగానికి చెందిన నిపుణులతో ఒక కమిటీని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ జడ్జి, ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు ప్రఖ్యాతలున్న ఒక న్యాయవాది ఉంటే బాగుంటుందని సూచించింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (భోపాల్)తో సంబంధం ఉన్నవారైతే ఇంకా మంచి విషయం అవుతుందని ఉద్ఘాటించింది. ఎనిమిదో తరగతి మాత్రమే కాకుండా, ఉన్నత తరగతుల పాఠ్యప్రణాళికను ఈ కమి టీ ఖరారు చేస్తుందని వెల్లడించింది. వివాదా స్పద అధ్యయాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినో నేతృత్వంలో టెక్ట్బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ప్రొఫె సర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లకు భారత న్యాయవ్యవస్థ గురించి సహేతుక మైన జ్ఞానం లేదని, 8వ తరగతి విద్యార్థుల ముందు భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా, తెలిసి కూడా వాస్తవాలను తప్పుగా చూపించారని మేము సందేహించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు’’ అని స్పష్టంచేసింది. తదుపరి తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక తయారీ, పాఠ్యపుస్తకాల ఖరారులో ఆ ముగ్గురిని ఎందుకు భాగస్వాములను చేయాలని ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు.. ఆ ముగ్గురు నిపుణులను తక్షణమే పక్కనపెట్టాలని ఆదేశించింది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధలుతో సంబంధం ఉన్న బాధ్యతలు అప్పగించకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులో సవరణ కోరుతూ ముగ్గురు నిపుణులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వివరణ ఇవ్వొచ్చని ధర్మాసనం పేర్కొంది. దుష్ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలివ్వండి వివాదాస్పద చాప్టర్ను తిరగరాస్తున్నామంటూ ఎన్సీఈఆర్టీ డెరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. చాప్టర్–4ను మొత్తం తిరగరాయాలని, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించి, ఆమోదించేదాకా ఆ చాప్టర్ను ప్రచురించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నేషనల్ సిలబస్, టీచింగ్ టెర్నింగ్ మెటేరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ)ను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి పరోక్షంగా సూచించింది. వివాదాస్పద చాప్టర్పై ఫిబ్రవరి 26న తాము ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సోషల్ మీడియా వేదికలు, వ్యక్తుల వివరాలు తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తప్పుడు పనులు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్యప్రణాళిక తయారీలో కనీసం ఒక న్యాయ నిపుణుడికి కూడా అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.విమర్శను నియంత్రించడం లేదు దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు సమీక్షకు అతీతం అని తాము చెప్పడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన, నిర్మాణాత్మక విమర్శను తాము నియంత్రించడం లేదని స్పష్టంచేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సమగ్రంగా సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఈ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగించడాకి బదులు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకే అప్పగిస్తే తాము ప్రశంసిస్తామని పేర్కొన్నారు. తటస్థ, స్వతంత్ర నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. వివాదానికి కారకులైన ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండదని ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేపే వైస్ చాన్సలర్గా నియమిస్తే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకే వెంటనే పక్కన పెట్టాలని తేల్చిచెప్పింది. -
హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విచారణలో సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 11, 2026) తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న రాణా పాసివ్ యూతనేషియా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసుగా నిలిచింది. ఇక ఈ కేసు తుది తీర్పు విచారణకు ముందు సుప్రీం కోర్టు హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసింది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించినట్లు తెలుస్తోంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు. తాజాగా, అత్యున్నత న్యాయ స్థానం పాసివ్ యూతనేషియాకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. -
వివేకా కేసులో సునీతకు చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. -
స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి
ఎంపవర్మెంట్ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే. ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!→ ఎన్ఎఫ్హెచ్ఎస్–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి. -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
మా సచ్ఛీలత రుజువైంది
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు తీర్పును ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (57) స్వాగతించారు. తాను, ఆప్ నేత మనీశ్ సిసోడియాతో పాటు తమ పార్టీ కరడుగట్టిన నిజాయితీకి మారుపేరని ఈ తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరపాలి. బీజేపీకి 10 సీట్లకు మించి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా’’అంటూ సవాలు విసిరారు! తీర్పు సమయంలో కేజ్రీవాల్ కోర్టులోనే ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. సిసోడియా ఆయన్ను ఓదార్చారు. అనంతరం కేజ్రీవాల్ గద్గద స్వరంతో మాట్లాడారు. ‘‘కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో అన్ని వ్యవస్థలూ నిరంతర దాడికి గురవుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి తీర్పు ఇవ్వడం ద్వారా జడ్జి గొప్ప సాహసం ప్రదర్శించారు’’అంటూ అభినందించారు. తనపై నమోదైన కేసును స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్రగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఆప్ను రాజకీయంగా అంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘నా నిజాయితీపై, పరువు ప్రతిష్టలపై తప్పుడు కేసుతో దాడి చేశారు. దేశంలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జైలుపాలు చేశారు. ఆప్ అగ్ర నేతలు ఐదుగురిని జైల్లో పెట్టారు. మాపై ఇష్టానికి బురదజల్లారు. టీవీల్లో నిరంతరం చర్చలు జరిపారు. కానీ ఇదంతా పూర్తిగా తప్పుడు కేసని ఇప్పుడు రుజువైంది. దేవుడు మాతో ఉన్నాడని నేనెప్పుడూ చెబుతూ వచ్చాను. ఇన్నేళ్లలో నేను సంపాదించుకున్నది నిజాయితీ ఒక్కటే’’అన్నారు. అధికారం కోసం దేశంతో, రాజ్యాంగంతో ఆటలాడొద్దని మోదీకి హితవు పలికారు. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కాలుష్యం, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలెన్నో ఉన్నాయి. వాటిని పరిష్కరించి అధికారంలోకి రండి’’అని సూచించారు. మద్యం కుంభకోణం అభియోగాలకు సంబంధించి తమపై ఈడీ కేసులను కూడా కొట్టేయాలని కోర్టును కోరతామని అనంతరం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు. మోదీకి ఏకైక అవకాశం... నన్ను చంపించడమే! జైలు నుంచి వచ్చాక తాను మౌనం వహించానని మాయమైపోయానని చాలామంది అన్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ‘‘నేను రాజకీయ నాయకున్ని కాదు. నేతలకు తోలు మందంగా ఉంటుంది. తిట్టినా పట్టించుకోరు. కానీ నన్ను అవినీతిపరుడంటే, జైల్లో పెడితే, నా కుటుంబాన్ని ఎద్దేవా చేస్తే కచ్చితంగా బాధపడతాను. అందుకే నా నిర్దోషిత్వం దేశానికి రుజువయ్యేదాకా మౌనం వహించాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నా హృదయం మీదినుంచి పెద్ద భారం తొలగిపోయింది’’అన్నారు. ‘‘మోదీ నాపై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించారు. జైల్లో పెట్టించారు. అయినా నన్నేమీ చేయలేకపోయారు. ఇక మోదీకి మిగిలిన ఆప్షనల్లా ఒక్కటే. నన్ను చంపించడం! లేదంటే నన్ను తట్టుకోవడం ఆయన వల్ల కాదు’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆనందోత్సాహాలు తీర్పు అనంతరం కేజ్రీవాల్కు ఆయన నివాసంలో ఘనస్వాగతం లభించింది. భార్య సునీతను, పిల్లలను హత్తుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీలో 5, ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీగా గుమిగూడారు. హోలీ ముందే వచ్చిందంటూ డప్పులు మోగిస్తూ, మిఠాయిలు పంచుతూ, చిందులేస్తూ సందడి చేశారు. కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తన భర్త నిజాయితీకి మారుపేరని సునీత అన్నారు. కొనసాగనున్న ఈడీ దర్యాప్తు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ‘‘ఇది స్వతంత్ర దర్యాప్తు. ఈ కేసులో ఇప్పటికే విశ్వసనీయమైన ఆధారాలు లభించాయి. కుంభకోణం తాలూకు మొత్తాలను ఎక్కడెక్కడికి ఎలా తరలించిందీ, వాటితో ఏమేం చేసిందీ ఇప్పటికే వివరంగా పొందుపరిచాం’’అని వారు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం ఈడీ తనంత తానుగా క్రిమినల్ కేసు పెట్టలేదు. పోలీస్, సీబీఐ ఇతర చట్టపరమైన సంస్థల ఫిర్యాదు ఆధారంగానే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా 2022 ఆగస్టు 22న ఈడీ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు ప్రకారం ప్రాథమిక కేసులో నిందితునికి విముక్తి లభిస్తే దాని ఆధారంగా నమోదైన మనీలాండరింగ్ కేసు కొట్టివేతకు గురైనట్టే. దీనిపై ఈడీ అభ్యంతరం లేవనెత్తుతోంది. మనీ లాండరింగ్ కేసులను స్వతంత్ర కేసులుగా పరిగణించాలని, ప్రాథమిక కేసు తీర్పుతో వాటిని ముడిపెట్టొద్దని వాదిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటిదాకా 8 చార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో 40 సంస్థల పేర్లను పేర్కొంది. కుంభకోణానికి కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ నేతలు తదితరులతో కలిసి ఈ కుట్రకు తెర తీశారని ఆరోపించింది. కేజ్రీవాల్, సిసోడియా సహా 18 మందిని అరెస్టు చేసింది.స్వాగతించిన విపక్షాలు న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తదితరులు నిర్దోషులంటూ కోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. మోదీ సర్కారు తప్పుడు ప్రచారానికి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి తీర్పును చెంపపెట్టుగా అభివరి్ణంచాయి. బీజేపీ మాత్రం ఈ అంశంపై ప్రజలు ఎప్పుడో రాజకీయ తీర్పు వెలువరించారంటూ స్పందించింది. ఊహించిన స్క్రిప్టే: కాంగ్రెస్ ‘‘బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు. అవసరార్థం ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే పాము వంటిది. కాంగ్రెస్ను ఓడించేందుకు ఎంతకైనా దిగజారుతుంది. గుజరాత్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్ వంటి అవసరార్థ భాగస్వామ్య పార్టీ నేతలపై కేసులన్నీ క్రమంగా తెరచాటుకు వెళ్లిపోతాయి. ఇదంతా ఊహించిన స్క్రిప్టే’’ – కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: బీజేపీ ‘‘మద్యం కుంభకోణానికి సంబంధించి పలు సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. మద్యం విధానం సరైనదే అయితే విచారణ మొదలవగానే ఎందుకు రద్దు చేసినట్టు? దీనిపై న్యాయప్రక్రియ ఇంకా ముగియలేదు. రుజువుల్లేవని మాత్రమే కోర్టు చెప్పింది. వాటిని కేజ్రీవాల్, సిసోడియా నాశనం చేశారని సీబీఐ ఇప్పటికే పలుమార్లు పేర్కొంది. ఈ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు ఇప్పటికే రాజకీయ తీర్పు ఇచ్చేశారు. మీడియా ముందు కల్లబొల్లి ఏడ్పుల డ్రామాతో సానుభూతి పొందాలన్న కేజ్రీవాల్ ప్రయత్నాలు ఫలించబోవు. ఆయన బాలీవుడ్కు వెళ్తే మంచిది!’’ – ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవన్యాయవ్యవస్థే సుప్రీం ‘‘న్యాయవ్యవస్థే సుప్రీం. కనుక కోర్టు తీర్పును అంతా అంగీకరించాలి. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పాత్రపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పుకు ముందు చేసినవి. ఆయన ఇకపై తన గురించి, సొంత పార్టీ గురించి కాకుండా సమాజం గురించి, దేశం గురించి పని చేయాలి’’ – సామాజిక కార్యకర్త అన్నాహజారే ‘‘ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఎంతలా దురి్వనియోగం చేస్తోందో ఈ తీర్పు మరోసారి చాటుతోంది. విపక్ష నేతలను తప్పుడు కేసులతో వేటాడుతున్నందుకు నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలి. – సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ రాజకీయ ప్రతీకార క్రీడలో ఎలా పావులుగా మారుతున్నాయో చెప్పేందుకు ఇది మరో నిదర్శనం. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిని అందుకు పూర్తిస్థాయిలో బాధ్యులను చేయాలి. ఆ మేరకు నిబంధనలు రూపొందాల్సిన అవసరముంది.’’ – సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా‘‘తప్పుడు మద్యం కేసు వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎంతో నష్టపోయింది. కనుక అక్కడ తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఈడీ, సీబీఐతో పాటు రాజ్యాంగ వ్యవస్థలను కూడా బీజేపీ చెరబడుతోంది. అవి ప్రధాని కార్యాలయం చెప్పినట్టల్లా ఆడుతున్నాయి.’’ – ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘‘అంతిమంగా సత్యమే గెలుస్తుందనేందుకు ఈ తీర్పు మరో నిదర్శనం. – పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ‘‘రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది. మేం అవినీతిపరులమని రుజువు చేసేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా సత్యమే గెలిచింది.’’ – ఆప్ నేత మనీశ్ సిసోడియా ‘‘చివరికి సత్యమే గెలిచింది. మద్యం కేసు విచారణ సందర్భంగా మా పారీ్టపై విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగాయి. ఆప్ నిప్పులాంటి పార్టీ అని అంతిమంగా తేలింది.’’ – ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి ఎప్పుడేం జరిగిందంటే... 2021 నవంబర్: నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం. 2022 జూలై: అందులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ఆదేశాలు. ఆగస్టు: మద్యం కుంభకోణంపై కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ. సెపె్టంబర్: మద్యం విధానాన్ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం. 2023 మార్చి 8: కవితకు ఈడీ సమన్లు. 2023 అక్టోబర్: మనీ లాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్కు ఈడీ సమన్లు 2024 మార్చి 15: హెదరాబాద్లో కవితను అరెస్టు చేసిన ఈడీ. మార్చి 21: కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ. మే 10: లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. జూన్ 20: కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు. జూన్ 21: ఈడీ అభ్యర్థన మేరకు బెయిల్ను సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. జూన్ 25: కేజ్రీవాల్ బెయిల్పై స్టే విధించిన హైకోర్టు. జూన్ 26: జైల్లో ఉన్న కేజ్రీవాల్ను లాంఛనంగా అరెస్టు చూపించిన సీబీఐ. జూలై 12: ఈడీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్. సీబీఐ కేసు నేపథ్యంలో జైల్లోనే కేజ్రీవాల్. జూలై 17: సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్. ఆగస్టు 5: సీబీఐ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు. ఆగస్టు 12: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్. ఆగస్టు 27: కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు. సెప్టెంబర్ 11: కేజ్రీవాల్ కస్టడీని సెపె్టంబర్ 25 దాకా పొడిగించిన ఢిల్లీ కోర్టు. సెప్టెంబర్ 13: కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్. 2026 ఫిబ్రవరి 12: మద్యం కుంభకోణం కేసులో విచారణ ముగించి తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ కోర్టు. ఫిబ్రవరి 27: కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మొత్తం 23 మంది నిందితులూ నిర్దోషులని కోర్టు తీర్పు. -
కేంద్రానికి తలనొప్పి.. కోర్టుకు పెనుభారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ట్రిబ్యునళ్ల వ్యవస్థ పనితీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండటం లేదని, అవి ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’(ఎవరికీ సంబంధం లేని ప్రాంతం)గా తయారయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం–2021ను కొట్టివేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీకాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్పై గురువారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది. మీరు తెచ్చిందే.. మీకే తలనొప్పి కోర్టు విచారణలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘ట్రిబ్యునళ్లను సృష్టించింది కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి అవి ఇప్పుడు మీకు తలనొప్పిగా, మాకు పెద్ద భారం (లయబిలిటీ)గా పరిణమించాయి. రెండు మూడు ట్రిబ్యునళ్లు మినహా మిగతావి వెలువరిస్తున్న ఉత్తర్వులను చూస్తుంటే.. అవి ఏమాత్రం జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోందని’వ్యాఖ్యానించారు. ఎంతటి చెత్త వ్యవస్థను సృష్టించాం..? ఓ కీలక ట్రిబ్యునల్లో పనిచేస్తున్న సభ్యుడి తీరుపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ‘టెక్నికల్ మెంబర్’ఏకంగా తాను ఇవ్వాల్సిన తీర్పు లను జ్యుడీషియల్ సభ్యులతో రాయించడం లేదా బ యటి వ్యక్తులకు ‘ఔట్సోర్సింగ్’ఇవ్వడం చేస్తున్నారని సీజేఐ తప్పుబట్టారు.‘అతడికి ఎంతటి ధైర్యం? సరైన సమయం చూసి అతడిని కచ్చితంగా సాగనంపుతాం. కోర్టులపై భారాన్ని తగ్గించుకోవాలన్న ఆత్రుతలో మనం ఎంతటి అస్తవ్యస్తమైన వ్యవస్థను సృష్టించుకున్నామో కదా’అని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే, టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టీడీశాట్)లో చైర్పర్సన్ లేనప్పుడు టెక్నికల్ మెంబర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంస్థాగత సంక్షోభం తలెత్తకుండా చూడాలని, టెక్నికల్ మెంబర్ ఒక్కరే ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని జస్టిస్ బాగ్చి కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్ సభ్యులకు ఉండాల్సిన కనీస అర్హతలపైనా ధర్మాసనం పెదవి విరిచింది. పర్యావరణ చట్టాలు, వాణిజ్య చట్టాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు.. నాలుగేళ్లలో ఆయా అంశాల్లో నిపుణులు ఎలా అయిపోతారని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం జాతీయ ప్రయోజనాలకే విరుద్ధమని, చక్కదిద్దేందుకు కొత్త యంత్రాంగం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. -
వివాదాస్పద పాఠ్య పుస్తకంపై నిషేధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యానాలతో రూపొందించిన ఒక చాప్టర్తో ముద్రితమైన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిషేధం విధించింది. భవిష్యత్తులో దేశవిదేశాల్లో ఈ పుస్తకాన్ని పునర్ముద్రించడంగానీ ఆన్లైన్లో డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడం లాంటివి చేయకూడదని జాతీయ విద్యా పరిశోధన శిక్షణమండలి(ఎన్సీఈఆర్టీ), కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘కరప్షన్ ఇన్ ది జ్యుడీషియరీ’, ‘ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ అవర్ సొసైటీ’అంశాలతో ముద్రితమైన ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్(వాల్యూమ్2)’8వ తరగతి సాంఘికశాస్త్ర పాఠ్య పుస్తకాన్ని ఏ పాఠశాలకు పంపిణీచేయొద్దని, ఇప్పటికే పంపిణీ అయిన పుస్తక ప్రతులన్నింటినీ వెంటనే సీజ్ చేసి, వెనక్కి తెప్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంఛోలీల ధర్మాసనం ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. పుస్తకం తుది ఆమోదం, ముద్రణకు బాధ్యులుగా పేర్కొంటూ ఎన్సీఈఆర్టీకి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అత్యంత వివాదాస్పద, అభ్యంతరకర చాప్టర్ను పుస్తకంలోకి జొప్పించి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, అందులోని పాఠశాల విద్యావిభాగ కార్యదర్శికి కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. బుల్లెట్ దించి రక్తం చిందించారు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించాక విచారిస్తూ సీజేఐ సూర్యకాంత్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘న్యాయవ్యవస్థకు అవినీతి మరకలు అంటిస్తూ న్యాయవ్యవస్థ మీదకు వాళ్లు బుల్లెట్ ప్రయోగించారు. బుల్లెట్ గాయంతో ఈరోజు న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. న్యాయవ్యవస్థకు అత్యున్నత సారథిగా ఇందుకు కారకులెవరో కనిపెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. కారకులను న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టాల్సిందే. కఠిన శిక్ష పడాల్సిందే. ఈ అంశంలో లోతైన దర్యాప్తు జరగాలి. అసలు ఇలాంటి పాఠ్యపుస్తకం ఒకటి ప్రచురితమైందని వార్తపత్రికల్లో ఆరి్టకల్ చదవగానే షాక్కు గురయ్యా. ఇలాంటి ప్రచురణ నిజంగానే వచ్చిందా అని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ద్వారా వాకబు చేయించా. ఇది నిజమని తెలిసి హుతాశులమయ్యాం. తప్పుపై పశ్చాత్తాపం చెందాల్సిందిపోయి ఎన్సీఈఆర్టీ తన చర్యను సమరి్థంచుకునే ప్రయత్నంచేశారు. ఇది నిజంగా అత్యంత నిర్లక్ష్యపూరిత, బాధ్యతారహిత, ఉల్లంఘనీయ చర్య. పుస్తకంలోని అంశాలను మేం పరిశీలించాక పక్కా ప్రణాళికతో న్యాయవ్యవస్థ పరువును మంటగలపాలని కంకణం కట్టుకున్నట్లు కని్పస్తోంది. ఈ చాప్టర్ను పొరపాటున ప్రచురించినట్లుగా ఏ కోశాన కని్పంచట్లేదు. న్యాయవ్యవస్థను కుంభకోణాలమయంగా చిత్రించే దుస్సాహసం చేశారు’’అని సీజేఐ అన్నారు. అందరి పేర్లూ ఇవ్వండి.. ‘‘ఈ చాప్టర్ను ఎవరు లిఖించారు? ఆమోదించింది ఎవరు? చాప్టర్పై విస్తృత చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? ఆ సమావేశం తాలూకు మినిట్స్ను, సంబంధిత ఒరిజినల్ రికార్డులను మాకు సమరి్పంచండి. ఈ పాఠ్యపుస్తకాన్ని రచించిన రచయితల పేర్లు, ముసాయిదా అధ్యాయం రూపకల్పనకు బాధ్యులైన అధికారుల వివరాలు ఇవ్వండి’’అని ధర్మాసనం ఎన్సీఈఆర్టీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ దినేశ్ ప్రకాశ్ సక్లానీని ఆదేశించింది. దీంతో పాఠశాల విద్యా శాఖ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలి్పంచుకుని విద్యాశాఖ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పారు.ప్రధాని మోదీ అసంతృప్తి.. పాఠ్యపుస్తంలోని అంశాలు వివాదాస్పదమవడంతో ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఢిల్లీలో కేంద్రప్రభుత్వ నిర్ణయాలపై తుది ఆమోదం కోసం జరిగిన కేబినెట్ భేటీలో పాఠ్యపుస్తకం అంశం ప్రస్తావనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాల్సిన అవసరం ఏమొచి్చంది?. మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఇలాంటి విషయాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? అసలు ఇలాంటి చాప్టర్ను పెట్టాలని ఎవరు నిర్ణయించారు? ఇలాంటి అంశాలు పాఠశాల స్థాయి దాకా చేరాలని నిర్ణయించిందెవరు? పాఠ్యాంశాలను రూపొందించి ఆమోదించిందెవరు?’’అని మోదీ ఆరాతీసినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎన్సీఈఆర్టీ ‘‘పాఠ్యాంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో తప్పు ఎక్కడ దొర్లింది? విషయంపై అంతర్గత సమీక్ష జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి అనుచితాలు పునరావృతంకాకుండా అడ్డుకుంటాం’’అని ఎన్సీఈఆర్టీ తెలిపింది.కించపరిచే ఉద్దేశం మాకు లేదు: ధర్మేంద్ర ప్రధాన్ ‘‘జరిగినదానికి నేనెంతో బాధపడుతున్నా. న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఈ అంశంలో దర్యాప్తు జరిపించి చాప్టర్ రూపకల్పన, ఆమోదానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విషయం తెలియగానే పాఠ్యపుస్తకాన్ని ఎవరికీ అందుబాటులోలేకుండా నిలువరించాం’’అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జంషెడ్పూర్లో మీడియాతో అన్నారు. -
తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారిని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు అయిన విషయం ఫిర్యాదు దారుడికి కూడా తెలియడం లేదన్నారు. తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు, దురుద్దేశపూర్వకంగా నమోదు చేసే క్రిమినల్ కేసులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిల్పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం విచారణ చేపట్టింది. తప్పుడు కేసుల వివరాలను తెలపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిరపరాధుల జీవితాన్ని రక్షించాలి ఆరి్టకల్ 32 కింద దాఖలైన ఈ పిల్లో అంశాలు ఇలా ఉన్నాయి. ‘తప్పుడు కేసులను అరికట్టేందుకు పరిపాలనా భద్రత చర్యలు తీసుకోవాలి. నిరపరాధుల జీవితం, స్వేచ్ఛ, గౌరవాలను రక్షించాలి. నిజమైన కేసుల కంటే తప్పుడు కేసుల వల్లనే న్యాయవ్యవస్థపై భారం పడుతోంది. భూ వివాదాలు వంటి సివిల్ కేసులు కొన్ని సందర్భాల్లో.. ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద క్రిమినల్ కేసులవుతున్నా యి. ఫలితంగా గ్రామీణ వాతావరణం ఇబ్బ ందికరంగా ఉంటోంది’అంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. రోజూ దేశంలో తప్పుడు కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థలపై ఉందని ఆమె పేర్కొన్నారు. విమర్శలకు భయపడం నిరపరాధులను రక్షించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘కోర్టు ఈ అంశంపై ఆదేశాలు ఇస్తే.. ప్రజల హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు రావొచ్చనే విషయాన్ని కూడా మేం గమనించాం’అని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తాము ఎవరో చేసే విమర్శలకు భయపడమని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని గ్యాగ్ చేస్తున్నారని అంటున్నారు, అలా చేస్తున్నారని మేం భయంతో ఉండాలా?’అంటూ ప్రశ్నించారు. కొందరు దురి్వనియోగం చేసి మాయవుతామంటే ఎలా అని పేర్కొన్నారు. ‘ఇటువంటి కేసుల విషయంలో సమాజం అవగాహనతో ఉండాలి, పక్కవారి మౌలిక హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి, సోదరభావం పెంపొందించాలి’అంటూ సీజేఐ చెప్పారు. విమర్శల కారణంగా న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని పట్టించుకోకుండా ఉండబోమని ఈసందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు సూచనలు విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ‘పోలీసు స్టేషన్లు, కోర్టు ప్రాంగణాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద తప్పుడు కేసులపై శిక్షలకు సంబంధించిన వివరాలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు సమయంలో ఆరోపణలు నిజమని అఫడవిట్ లేదా లిఖితపూర్వక హామీ తీసుకోవాలి. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సమాచారంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బీఎన్ఎస్–2023లోని సంబంధిత నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. పిటిషన్ ప్రకారం చట్టాల్లో శిక్షల నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి దురి్వనియోగాన్ని నిరోధించే పరిపాలనా వ్యవస్థ లోపించడం వల్ల సమస్య కొనసాగుతోంది, దీనిని పరిష్కరించేందుకు సిద్దపడాలి’అంటూ నోటీసుల్లో పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఈ పిటిషన్పై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఫిర్యాదుదారుడికే తెలియకుండా కేసు? కొన్నిసార్లు అసలు ఫిర్యాదు దారుడికి కూడా తెలియకుండా నకిలీ సంతకాలతో కేసులు నమోదవ్వడం అత్యంత దుర్మార్గమని సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పేద వ్యక్తికి తన పేరుతో కేసు నమోదైందన్న విషయం కూడా తెలియదు. డబ్బు, అధికార ప్రభావంతో దుర్వినియోగం జరుగుతోంది’అంటూ మండిపడ్డారు. ‘ఇటీవల ఓ మహిళ స్వయాన కోర్టుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడు తమ కేసులో భాగస్వామి కాదు’’అంటూ చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు డబ్బు లేదా శక్తి ప్రభావం లేకుండా జరుగుతాయా?’అంటూ సీజేఐ ప్రశ్నలు సంధించారు. -
పాఠం – గుణపాఠం
పాఠ్యపుస్తకాల్లో కొన్నిటిని తొలగించటం, మార్చటం... అవి వివాదాస్పదం కావటం గత కొన్నేళ్లుగా కనబడుతోంది. కానీ ఈసారి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి పిల్లల కోసం కొత్తగా విడుదల చేసిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ఏకంగా న్యాయవ్యవస్థపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ వైనంపై మీడియాలో కథనం రావటం, వెనువెంటనే సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించి నోటీసులు జారీచేయటం వంటి పరిణామాలతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు సంస్థ హడావిడిగా ప్రకటించింది. అసలు దీన్ని వెలువరించటంలోనే బోలెడంత బాధ్యతా రాహిత్యం కనబడుతుంది. ఈ పుస్తకం తాలూకు తొలి భాగం గత జూలైలో విడుదలైంది. వివాదాస్పదమైన ఈ రెండో భాగం విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా తీరిగ్గా సోమవారం విడుదలైంది. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేయటమైనా, స్వల్ప వ్యవధిలో అవగాహన చేసుకుని పిల్లలు పరీక్ష రాయటమైనా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు జాతీయ పాఠ్య ప్రణాళిక అమరిక(ఎన్సీఎఫ్) మార్గదర్శకాల పరిధిలో రూపొందగా, కొత్త పాఠ్య పుస్తకాలకు 2020లో కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) ఆధారం. పాఠ్య పుస్తకాల రచన తాడుపై నడక వంటిది. ఆ విన్యాసం తొట్రు పడకుండా,తొందర లేకుండా, అడుగడుగూ అంచనా వేసుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి. సమ తౌల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. సమాచారాన్ని పోగేయటం పాఠ్యరచన అనిపించుకోదు. తాము ఏ తరగతి పిల్లల కోసం రచిస్తున్నామో, వారి వయసెంతో, మానసిక స్థాయి ఏమిటో అవగాహన ఉండాలి. నిష్పాక్షికత దాని ప్రాణం కావాలి. వాస్తవాన్ని ప్రతిబింబించే గణాంకాలను ఆధారంగా చేసుకోవాలి. మతం, కులం, జెండర్ వగైరా అంశాల్లో సున్నితంగా ఆలోచించాలి. సందర్భ శుద్ధి లేని ఉటంకింపులు తప్పుడు అభిప్రాయం కలిగిస్తాయన్న ఎరుక ఉండాలి. కానీ ఈ పాఠ్యాంశ రచనలో అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్నట్టు కనబడుతోంది. అది చదివితే వస్తునిష్ఠ కన్నా స్వీయ ఆలోచనలకూ, అభిప్రాయాలకే ప్రాధాన్యమిచ్చారన్న సంశయం కలుగుతుంది. అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి జాడ్యాలు న్నాయి. అదే సమయంలో వాటిని ప్రక్షాళన చేసేందుకు అంతర్గత దిద్దుబాటు యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. తమ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవటం కన బడుతుంది. అవి చాలినంతగా లేకపోవచ్చు. వాటిని నిష్పాక్షిక దృష్టితో చర్చిస్తే వేరుగా ఉండేది. కానీ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మాటెత్తకుండా న్యాయ వ్యవస్థ మాత్రమే ఇలాంటి క్లేశాలతో నిండివున్నదని చెప్పడం విద్యార్థుల్లో ఎలాంటి అభిప్రాయం కలగ జేస్తుందన్న ఆలోచన పాఠ్య రచయితలకు లేకుండా పోయింది. రాజ్యం ఏ విధంగా పని చేస్తుంటుందో, భిన్న వ్యవస్థలు ఏ పరమార్థం కోసం ఏర్పడ్డాయో పన్నెండేళ్ల పిల్లలకు చెప్పవలసి ఉండగా న్యాయవ్యవస్థ ఒక్కదాని గురించే చర్చిస్తూ అది అవినీతిమయం అయిందనీ, దిద్దుబాటు చర్యలు లేనేలేవన్న అభిప్రాయం కలగజేస్తే పిల్లల్లో ఒక విధమైన నిరాశకు దారితీయదా? ఆ పుస్తకాన్ని పిల్లలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులు సైతం చదువుతారు. ఇష్టానుసారం రచించిన ఇలాంటి పాఠ్యాంశాలు అంతిమంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ కలిగిస్తాయని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించటం ఇందువల్లనే! ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పనితీరైనా పరిశీలనకూ లేదా విమర్శకూ అతీతం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం కించపరచాలని చూడటం క్షమార్హం కాదు. నిజానికి న్యాయవ్యవస్థకు సంబంధించి ఇంతవరకూ ఉన్న పాఠ్యాంశం అది పనిచేసే తీరునూ, ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి అది చేస్తున్న కృషినీ అందుకుసంబంధించిన కేసుల ప్రస్తావనతో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఆ వ్యవస్థకెదురవుతున్న సవాళ్లను వివరించింది. దాన్ని అపభ్రంశం చేయటం తప్ప కొత్త పాఠ్యాంశం సాధించిందేమిటి? జవాబుదారీతనం లేకుండా, చిత్తశుద్ధి కలికానికైనా కనబడకుండా చేసే రచనలు అనర్థదాయకమని ఇప్పటికైనా ఎన్సీఈఆర్టీ తెలుసు కోవటం మంచిది. -
జార్ఖండ్ సీఎం సోరెన్కు ఊరట
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. చట్టవిరుద్ధమైన మైనింగ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన సమన్లకు ఉద్దేశపూర్వకంగా స్పందించలేదని పేర్కొంటూ ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ పదేపదే తనకు సమన్లు జారీ చేస్తుండడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సోరెన్పై దర్యాప్తునకు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈడీకి నోటీసు జారీ చేసింది. అంతకముందు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ వాదనలు వినిపించారు. ఏడుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సోరెన్ స్పందించలేదని, ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చాలావరకు పూర్తయ్యిందని, ఒకే ఒక్క సాక్షిని ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఈడీ చాలా ఫిర్యాదులు చేస్తున్నట్లు వార్తా పత్రికల్లో చదివామని, ముందుగా వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. -
న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం సహించం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి అత్యధికమవుతోందంటూ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’అనే అంశాన్ని జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో అవినీతి, పెండింగ్ కేసులు, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలతో కొత్త పుస్తకం రూపొందించారని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానంలో ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు తక్కువచేసేలా పాఠ్యపుస్తకంలో వ్యాఖ్యానాలు ఉన్నాయని, ఈ అంశాన్ని తక్షణం విచారణకు స్వీకరించాలని లాయర్లు చేసిన అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంఛోలీల ధర్మాసనం పరిశీలించింది. పాఠ్యపుస్తకంలోని ఆ చాప్టర్లో ‘న్యాయమూర్తులు కోర్టులోనేకాదు వాటి వెలుపల సైతం నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలి’అని హితబోధ చేస్తూ వ్యాఖ్యానాలు పొందుపరచడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయవ్యవస్థను, న్యాయవ్యవస్థ సమగ్రతను మసకబార్చే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా మేం అనుమతించబోం. ఈ విషయాన్ని సుమోటో స్వీకరిస్తాం. న్యాయవ్యవస్థను అపకీర్తిపాలుజేసే చర్యలను అడ్డుకుంటా’’అని వ్యాఖ్యానించారు. చాలా కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి.. ‘‘ఈ పాఠం విషయం తెల్సి నాకు బార్ నుంచి బెంచ్దాకా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి నాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. అవినీతి అనేది ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉందా? ఇంకా ఏ వ్యవస్థలోనూ లేదా?. ఇటువంటి బోధనల వలన చిన్నారుల్లో న్యాయవ్యవస్థపై గౌరవం పోతుంది’’ అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూమోటోగా వెంటనే స్వీకరించాలని సిబల్ కోరగా సీజేఐ ‘‘ఈ ఒక్కరోజు ఆగండి. ఈ విషయంలో యావత్ న్యాయవ్యవస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. న్యాయవ్యవస్థలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈసమస్యను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని, ఈవ్యవహారంపై ఇప్పటికే సూమోటాగా కేసును నమోదుచేయాలని ఆదేశించా’’అని సీజేఐ తెలిపారు. ‘‘ఉద్దేశపూర్వకంగా పా ఠ్యాంశాన్ని చేర్చినట్లుగా ఉంది. పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇంతకుమించి మేం వ్యాఖ్యానించబోం. ఏదేమైనా ఇలాంటి కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’’అని లాయర్లతో సీజేఐ అన్నారు. మేము చాలా బాధపడ్డాం ‘‘న్యాయవ్యవస్థను అవమానక రీతిలో చిత్రించిన కొత్త పాఠ్యాంశాన్ని చూసి మేం చాలా కలత చెందాం’’అని న్యాయవాదులు సింఘ్వీ, సిబల్ ధర్మాసనం ఎదుట చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థలో అవి నీతి ఉందంటూ విద్యార్థులకు బోధించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం’’అని సిబల్ అన్నారు. ‘‘పాఠ్యపుస్తకంలోని అంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూ త్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’అని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ స్వాగతించారు. యూటర్న్ తీసుకున్న ఎన్సీఈఆర్టీ సర్వోన్నత న్యాయస్థానం సహా పలు హైకోర్టుల జడ్జీలు, న్యాయవాదులు, పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్సీఈఆర్టీ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. తమ వెబ్సైట్ నుంచి వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. వివాదాస్పద అంశాలను తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే పుస్తకాల ముద్రణ పూర్తయినప్పటికీ వాటిని తొలగించి మళ్లీ కొత్తగా ముద్రించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని బోధించాలా వద్దా అనే విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఢిల్లీలోని పలు పాఠశాలల యాజమాన్యాలు బుధవారం వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన విషయ నిపుణులను రప్పించి అసలు వీటికి తుది అనుమతులు ఇచ్చిందెవరు అనేది తేల్చేందుకు ఎన్సీఈఆర్టీ అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ ప్రసాద్ సాక్లానీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పాఠ్యాంశంపై మోదీ సర్కార్ సైతం అసంతృప్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టులో సుమారు 81 వేలు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా, సబార్డినేట్ కోర్టులో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో అవినీతి మేటవేసిందని, జడ్జి పోస్టుల భర్తీ సవ్యంగా జరగకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటోందని ఆ పాఠ్యాంశంలో పొందుపరిచిన విషయం విదితమే. -
విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు (Hate Speech), సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులు లేదా వ్యవస్థలు ఏవైనా సరే.. ప్రసంగాలు, మీమ్స్, కార్టూన్లు లేదా మరే ఇతర మాధ్యమాల ద్వారా.. ఏదైనా ఒక సమాజాన్ని కించపరచడం అనేది రాజ్యాంగబద్ధంగా అంగీకారం కాదని స్పష్టం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. #BREAKING #SupremeCourt declares - "It is constitutionally impermissible for anybody, be it the State or non-state actors, through any medium, such as, speeches, memes, cartoons, visual arts etc. to vilify and denigrate any community""It will be violative of the Constitution… pic.twitter.com/1GNinQKAfc— Live Law (@LiveLawIndia) February 25, 2026మతం, భాష, కులం లేదా ప్రాంతం ఆధారంగా ఏ ఒక్క సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో మీమ్స్, ఫొటోల ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం పెరిగిపోతున్నదని, ఇటువంటి చర్యలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా సరే ఈ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని సమర్థిస్తానని ప్రమాణం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన వారు, బాధ్యతారహితంగా మాట్లాడటం ఏమాత్రం చెల్లదని హెచ్చరించింది. సాధారణ పౌరుల కంటే కూడా ప్రజాప్రతినిధులపై ఈ బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారు చేసే వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి సమాజాన్ని అవమానపరిచే చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, డిజిటల్ రూపంలో ఉన్న మీమ్స్, కార్టూన్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. -
ఎన్సీఎల్ఏటా విధివిధానాలకు కట్టుబడతాం
న్యూఢిల్లీ: ప్రకటనల సంబంధిత డేటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోప్యత, అంగీకార నిర్దేశకాలను వర్తింపజేస్తామని సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ విషయంలో ఎన్సీఎల్ఏటా విధివిధానాలకు కట్టుబడతామని పేర్కొన్నాయి.ఎన్సీఎల్ఏటా నిర్దేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థలు పెట్టుకున్న పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం విచారణ జరిపింది. ట్రిబ్యునల్ నిర్దేశాలను మార్చి 16 కల్లా అమలు చేయాలని మెటా, వాట్సాప్ నిర్ణయించినట్టు వాటి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. దాంతో వాట్సాప్, మెటా పిటిషన్లను పరిష్కరించినట్టు భావించాలని ధర్మాసనం పేర్కొంది.ప్రైవసీ పాలసీ ఉల్లంఘనకు సంబంధించి వాట్సాప్కు సీసీఏ గతంలో రూ.213.14 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. డేటా షేరింగ్ పేరిట పౌరుల భద్రతతో ఆటలాడటాన్ని అనుమతించబోమని ఫిబ్రవరి 3న మెటా, వాట్సాప్లను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. చదవండి: ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్ -
2018కి ముందు కేసుల పునర్వీచారణ కుదరదు
న్యూఢిల్లీ: ఎన్హెచ్ఏఐ చట్టం కింద భూ సేకరణ, నష్టపరిహారాలకు సంబంధించి 2018కి ముందు కేసుల పునఃపరిశీలన సాధ్యపడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్హెచ్ఏఐ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. ఎన్హెచ్ఏఐ చట్టం కింద సేకరించిన రైతుల భూమికి పరిహారం, వడ్డీ చెల్లించాలన్న నిర్ణయం గత ఉదంతాలకు కూడా వర్తిస్తుందంటూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ‘‘అలాగైతే మాపై ఏకంగా రూ.32 వేల కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతుంది. కనుక ఈ నిర్ణయాన్ని ఇకపై తలెత్తే వివాదాలకు మాత్రమే వర్తింపజేయాలి’’అని కోరింది. అలా చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14లో పేర్కొన్న సమానత్వపు హక్కుకు విఘాతమే అవుతుందంటూ ఈ విజ్ఞప్తిని అప్పట్లో న్యాయస్థానం తిరస్కరించింది. దానిపై ఎన్హెచ్ఏఐ పెట్టుకున్న రివ్యూ పిటిషన్పై సీజేఐ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 2019 నాటి తీర్పును ఫిబ్రవరి 4 నాటి విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం సమర్థించింది. దీనిపై వాదనలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ ఉదంతానికి సంబంధించి అభ్యంతరాలేమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమరి్పంచాలని ఇరు వర్గాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
హిట్ సాంగ్ క్రెడిట్ వారిదే.. ఒప్పుకున్న ఏఆర్ రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన "వీర రాజా వీర" సాంగ్ వివాదం ముగిసింది. పోన్నియన్ సెల్వన్-2 మూవీలోని ఈ పాట క్రెడిట్ను జూనియర్ డాగర్ బ్రదర్స్కు ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఆయన అంగీకరించారు. ఈ పాట డాగర్వాణి సంప్రదాయ శివస్తుతి నుంచి తీసుకున్నారని తమ పూర్వీకులు ఆలపించిన ఈ పాటను తమకు క్రెడిట్ ఇవ్వలేదని ఉస్తాద్ ఫయాజ్ వాసిఫుద్దీన్ డాగర్ (Ustad Faiyaz Wasifuddin Dagar) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆ సంప్రదాయానికి చెందిన కుటుంబ సభ్యులకు క్రెడిట్ ఇవ్వడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. దానిని తాజాగా ఏఆర్ రెహమాన్ అంగీకరించారు. 5వారాలలోపు అన్ని సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లలోనూ వారి పేరు చేర్చి క్రెడిట్ ఇవ్వాలని ఆదేశించింది. -
ఎస్ఐఆర్ కోసం జ్యుడీషియల్ అధికారులను నియమించండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను(జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు) నియమించాలని కలకత్తా హైకోర్టుకు స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఆయా జ్యుడీషియల్ అధికారులు పరిశీలిస్తారని పేర్కొంది. ఎస్ఐఆర్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న రగడ పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరమని పేర్కొంది. ఇరుపక్షాల మధ్య అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ దురదృష్టకరమైన బ్లేమ్ గేమ్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సాఫీగా జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ సక్రమంగా పూర్తికావడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. వేర్వేరు కారణాలు, నిబంధనల వల్ల ఓటు హక్కు కోల్పోయే జాబితాలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలనకు, ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించాలని పేర్కొంది. అంతకు మించి మరో మార్గం లేదు ఎస్ఐఆర్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడ్ ‘ఎ’అధికారులను నియమించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగాలంటే కొందరు జ్యుడీషియల్ అధికారులను, మాజీ న్యాయమూర్తులను నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ను ఆదేశించింది. అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి ర్యాంకు ఉన్న జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలని సూచించింది. అంతకంటే మరో మార్గం కనిపించడం లేదని పేర్కొంది. పేరు, వయసు వంటి వ్యత్యాసాల వల్ల ఓట్లు కోల్పోయే జాబితా ఉన్న వ్యక్తుల పెండింగ్ క్లెయిమ్లను వీరంతా క్షుణ్నంగా పరిశీలిస్తారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేని పక్షంలో జ్యుడీషియల్ అధికారులను నియమించడం.. లేదా ఎన్నికల సంఘమే ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను నియమించుకోవడం మినహా మరో మార్గం లేదని తేలి్చచెప్పింది. జ్యుడీషియల్ అధికారులకు తగిన భద్రత కలి్పంచాలని పోలీసులను ఆదేశించింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అనుమతి ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ముందుగా నిర్ణయించిన డెడ్లైన్ ప్రకారమే ఈ నెల 28వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడానికి ఎన్నికల సంఘానికి అనుమతి మంజూరు చేసింది. అవసరమైతే తర్వాత అనుబంధ జాబితాలు విడుదల చేయవచ్చని సూచించింది. ఫిబ్రవరి 28 తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చవచ్చని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే తేదీ వరకూ కొత్త పేర్లను చేర్చి, అనుబంధ జాబితాలు విడుదల చేసినా ఎలాంటి అభ్యంతరం ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ శనివారం ఒక సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల సంఘం అధికారి, అడ్వొకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకరించడానికి జ్యుడీషియల్ అధికారులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. -
పనిచేయని ‘కల్తీ’ కుతంత్రం! సొంత కమిటీ షురూ!
సాక్షి, అమరావతి: శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా.. ‘కల్తీ నెయ్యి’ వివాదంలో చిక్కుకున్న చంద్రబాబు పెనుగులాడుతున్నారు. హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బయటపడడం, నెయ్యి కాంట్రాక్టు కోసమే పవిత్రమైన తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి ‘కల్తీ’ మరక అంటించినట్లు బట్టబయలు కావడంతో బాబు అండ్కో కు కళ్లు బైర్లు కమ్మాయి. తమ కుట్ర బయటపడిపోవడం, మండలిలో ప్రతిపక్షం రోజూ చర్చకోసం పట్టుబడుతుండడం అధికార పక్షానికి మింగుడుపడడం లేదు. దాంతో ముందే వేసుకున్న పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకాన్ని ఆపాదిస్తూ తాము చేసిన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు సొంతంగా ఏకసభ్య కమిటీ ఏర్పాటుచేసే కుట్రను చంద్రబాబు పట్టాలెక్కించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, చంద్రబాబుకు ఎంతో అనుకూలమైన అధికారిగా పేరుతెచ్చుకున్న దినేశ్కుమార్ని ఈ కార్యానికి ఎంచుకోవడం గమనార్హం. టీటీడీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగుతున్నా... కూటమి ప్రభుత్వం తమ సొంత కమిటీని ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. అంతేకాదు ఆ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ అసలు పన్నాగాన్ని బయటపెట్టాయి.సిట్ లేఖ ముసుగు... రాజకీయ కక్ష సాధింపే లొసుగుఅప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి(ఎఫ్ఏసీవో) బాలాజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సీబీఐ నేతృత్వంలోని సిట్ కొద్ది కాలం క్రితం రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. టెండర్ల ప్రక్రియను అమలు చేయడంలో వైఫల్యాలపై వారి నుంచి వివరణ తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ లేఖను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. తమ రాజకీయ కక్ష సాధింపునకు సిట్ లేఖను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏకసభ్య కమిటీ పరిధిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టెండర్ల ప్రక్రియ వ్యవహారాలపై దినేశ్ కుమార్ కమిటీ టీడీడీ అధికారులతోపాటు కమిటీ సభ్యులను కూడా పిలిచి విచారించ వచ్చని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దీనిని చూస్తే కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర అర్ధం కావడం లేదూ? జంతు కొవ్వు కలవలేదన్న క్లీన్ చిట్ తట్టుకోలేక కూటమి కొత్త కుతంత్రంలడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ముఠా దుష్ప్రచారం బెడిసికొట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ కొత్త కుతాంత్రానికి తెరతీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ స్వతంత్ర సిట్ తమ చార్్జషీట్ను నెల్లూరు న్యాయస్థానానికి ఇటీవల సమర్పించింది. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని అందులో స్పష్టం చేసింది. నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్ను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ల్యాబరేటరీలలో సీబీఐ పరీక్షించింది. హర్యానాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ల్యాబ్లు ఆ శాంపిల్స్ను నిశితంగా పరీక్షించి వాటిలో జంతు కొవ్వు లేనే లేదని తేల్చిచెప్పాయి. ఆ రెండు ల్యాబ్ల నివేదికలను పొందుపరుస్తూ మరీ సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో చార్్జషీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సాధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కూడా సీబీఐ చార్్జషీట్ పరోక్షంగా స్పష్టం చేసింది. వైవీ సుబ్బారెడ్డిగానీ ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఎవర్నీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చకపోవడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో లడ్డూ ప్రసాదం ముసుగులో చంద్రబాబు చేసిందంతా రాజకీయ దుష్ప్రచారమేన్నది నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదానికి కళంకం ఆపాదించేందుకు తెగబడతారా అని జాతీయస్థాయి మీడియా, విశ్లేషకులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు తమ కుట్రను కొనసాగించేందుకే ఏక సభ్య కమిటీని తెరపైకి తెచ్చారు. అందుకే నెయ్యి టెండర్ల ప్రక్రియకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులను కూడా విచారించే అధికారం ఈ కమిటీకి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ సమగ్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన చార్్జషీట్కు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే సుప్రీం కోర్టునే ధిక్కరిస్తోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇక 45 రోజుల హై డ్రామా..లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార రాద్ధాంతం మరో 45 రోజులపాటు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టీటీడీ నెయ్యి టెండర్ల ప్రక్రియపై టీటీడీ కమిటీ సభ్యులు, ఇతర అధికారులను విచారించేందుకు ఏకసభ్య కమిటీకి 45 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే నెయ్యి నాణ్యత అంశంతోపాటు టెండర్ల ప్రక్రియపై సీబీఐ సిట్ దర్యాప్తు చేసే నివేదిక సమర్పించింది. కాగా మళ్లీ ఏకసభ్య కమిటీ టెండర్ల ప్రక్రియపై విచారణకు ప్రభుత్వం అనుమతించడం విడ్డూరంగా ఉంది. తద్వారా పలువురు అధికారులు, నెయ్యి సరఫరా డెయిరీ ప్రతినిధులు, ఇతరులను విచారణ పేరుతో వేధించడమే ప్రభుత్వ లక్ష్యం. తాము కోరినట్టు వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. మద్యం విధానంపై అక్రమ కేసులో ఇదే రీతిలో బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి అక్రమ కేసులతో వేధిస్తున్న విషయం తెలిసిందే. అదే రీతిలో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబ్దద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని అధికారులు, డెయిరీ ప్రతినిధులను బెదిరించేందుకు ఏక సభ్య కమిటీ రూపంలో అవకాశం కల్పించింది. అనుకున్నట్టు నివేదిక ఇప్పించుకోవాలన్నదే ప్రభుత్వ మొదటి లక్ష్యం. అనంతరం ఆ నివేదిక ఆధారంగా పోలీసులతో అక్రమ కేసు నమోదు చేయించి వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్నది అసలు లోగుట్టు. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారాన్ని సాగదీస్తూ ఉండాలన్నది చంద్రబాబు ఉద్దేశం. తమ రాజకీయ కుట్రల కోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం, సంప్రదాయాలపై విష ప్రచారం చేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే తెగబడుతున్నారన్నది సుస్పష్టం. -
ఉచితాలు కాదు.. ఉద్యోగావకాశాలు కల్పించండి
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉచిత పథకాల సంస్కృతిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఉచితాలు కాదు.. ఉద్యోగావకాలు కల్పించాలని సూచించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ అందించాలనే డీఎంకే ప్రతిపాదనపై తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలిలతో కూడిన సుప్రీంకోరు ధర్మాసనం విచారించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయడానికి బదులుగా ఇలా ఉచితాలు పంపిణీ చేస్తే ఎలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచిత పంపిణీలతో దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, అందరికీ ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇవ్వడానికి బదులుగా రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలని ధర్మాసనం పేర్కొంది. ‘దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ చర్యలో భాగంగా మీరు అందించాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ భరించగల వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా, అందరికీ పంపిణీ చేయడం ఎలాంటి విధానం?’ అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ‘రాష్ట్రాలు ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి కృషి చేయాలి. ఉచిత ఆహారం, ఆపై ఉచిత సైకిల్, తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తూ పోతే, ఆపై ఎవరు పని చేస్తారు. అసలు పని సంస్కృతి ఏమైపోతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంతా.. ఫిబ్రవరిలోనే
సాక్షి,సిటీబ్యూరో/మణికొండ: అప్పట్లో తెలుగునాట కలకలం సృష్టించిన సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. 24 ఏళ్ల ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలన్నీ ఫిబ్రవరిలోనే జరగడం యాదృచ్ఛికం. 2002లో.. నగరంలోని తార్నాకలో ఉండే ప్రత్యూషకు సహా విద్యార్థి, సిద్ధార్థరెడ్డితో పరిచయం ప్రేమకు దారి తీసింది. 1998లో ‘రాయుడు’ చిత్రంతో ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2002 నాటికి ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. సిద్ధార్థ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న పంజగుట్టలోని బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను సిద్ధార్థ తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే హైదర్గూడలో ‘ఆర్గానోఫాస్ఫేట్’ పురుగుల మందు ఖరీదు చేసి కూల్డ్రింక్లో కలిపి తెచ్చాడు. దీన్ని ఇద్దరూ కారులోనే తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. 2004లో.. ఈ ఉదంతంపై పంజగుట్ట పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, ఇతర పరిణామాల ఆధారంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, సిద్ధార్థతో పాటు అందులో ప్రమేయం ఉన్న వాళ్లు హత్య చేసి కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ప్రత్యూషది ఆత్మహత్యగా తేలి్చన సీబీఐ.. అందుకు ప్రేరేపించిన సిద్ధార్థపై అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సెషన్స్ కోర్టు 2004 ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష విధించింది. 2026లో.. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పట్లో సవాల్ చేయడంతో సెషన్స్ కోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ, జరిమానాను పెంచుతూ 2011 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సరోజినీ దేవి, శిక్ష విధించడాన్ని సిద్ధార్థ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అతడి పిటిషన్ను తోసిపుచి్చంది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థను ఆదేశించింది. ఇలా ఈ కేసులో 2002 ఫిబ్రవరి– 2026 ఫిబ్రవరి మధ్య 24 ఏళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఒకే ఫైలు.. ఒకే సంతకం.. వేర్వేరు న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఒకే ఫైలు.. ఒకే సంతకం.. కానీ ఆ ఫైలును ఆమోదించిన నాటి గనులశాఖ మంత్రి, అంతకుముందు పనిచేసిన కార్యదర్శి ఇద్దరూ ఈ కేసు నుంచి విముక్తి పొందారు. వారెవరూ విచారణ ఎదుర్కోవడం లేదు. కానీ.. వారికింద పనిచేసిన నన్ను మాత్రమే టార్గెట్ చేసి, ఇంకా విచారణ ఎదుర్కోవాలనడం ఎక్కడి న్యాయం?’ అని సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో తనపై ఉన్న అభియోగాలను కొట్టేయాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ధర్మాసనం ఎదుట శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో శ్రీలక్ష్మి ని బలిపశువును చేశారని, అసలు నిర్ణయాధికారం ఉన్నవారు బయటపడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో మొదట 9 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. ఇందులో అప్పటి గనులశాఖ మంత్రి (సబితా ఇంద్రారెడ్డి), అప్పటి ప్రభుత్వ కార్యదర్శి (కృపానందం) తదితరులున్నారని చెప్పారు. కోర్టుల ద్వారా వారు ఈ కేసు నుంచి బయటపడ్డారని గుర్తుచేశారు. ‘బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే శ్రీలక్ష్మి ఈ ఫైలును డీల్ చేశారు. నిర్ణయాధికారం ఉన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సేఫ్గా బయటపడగా.. కేవలం ఒక అధికారిణిని మాత్రమే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడం వివక్ష చూపడమే’ అని పేర్కొన్నారు. ఒకే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న ఇతరులకు ఊరట లభించినప్పుడు శ్రీలక్షి్మకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.కేంద్రం చెప్పిందే చేశాం.. ఉల్లంఘన జరగలేదు ఓఎంసీకి మైనింగ్ లీజులు ఇచ్చే సమయంలో.. ప్రభుత్వ ఉత్తర్వులో క్యాప్టివ్ మైనింగ్ (సొంత పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఖనిజాన్ని వాడుకునే) అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే శ్రీలక్ష్మి తొలగించి అక్రమాలకు పాల్పడ్డారన్న సీబీఐ ప్రధాన ఆరోపణపై న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జాతీయ ఖనిజ విధానం ప్రకారం.. మైనింగ్ లీజుల్లో క్యాప్టివ్ వంటి షరతులు విధించకూడదని, అది నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. కేంద్రం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన అధికారిణిని.. నిబంధనలు ఉల్లంఘించారని నిందించడం విడ్డూరం’ అని చెప్పారు. ఐరన్ ఓర్ మేజర్ మినరల్ అయినందున, లీజుల కేటాయింపులో తుది నిర్ణయం కేంద్రానిదేనని, రాష్ట్రం కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుందని తెలిపారు. అంతేగాక అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటే లంచం అడిగి తీసుకోవడం, తద్వారా లబ్ధి పొందినట్లు ఆధారాలుండాలని చెప్పారు. కానీ శ్రీలక్ష్మి విషయంలో ఎక్కడా డబ్బు చేతులు మారినట్లుగానీ, ఆమె ఖాతాల్లోకి నగదు వచ్చినట్లుగానీ ఆధారాలు లేవని తెలిపారు. నీరజ్ దత్తా కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. కేవలం ఆరోపణల ఆధారంగా అవినీతి ముద్ర వేయలేమని సిద్ధార్థ దవే చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి సోదరి భర్త (రాకేష్బాబు) 2005–09 మధ్య ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని, దీనివెనుక క్విడ్ ప్రో కో ఉందన్న కోణంలో విచారణ జరిగిందని తెలిపారు. సాక్షుల జాబితాలోని ఎల్.డబ్ల్యూ–8 వాంగ్మూలం ప్రకారం డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసిందని, అధికార దుర్వినియోగం (సెక్షన్ 13(1)(డీ)) జరిగిందని చెప్పారు. సాంకేతిక అంశాలను ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం.. కేసు విచారణ దశలో ఉన్నందున తాము ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్లలేమని, సాక్ష్యాధారాలను ఇక్కడ పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ లేవనెత్తిన సమాన న్యాయం, కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సాంకేతిక అంశాలన్నీ ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ట్రయల్ కోర్టులో ఈ వాదనలను వినిపించుకునే స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని పేర్కొంటూ విచారణను ముగించింది. -
సిద్ధార్థ్రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్నర్దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్డ్రింక్లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
ఎవరీ ప్రత్యూష.. 2002 ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
సినీ తారలు కూడా సాధారణ మనుషులే. వాళ్లకు బాధలు ఉంటాయి. అయితే ఆ బాధలను కప్పిపుచ్చుకుని స్క్రీన్ మీద అందాలతో, నవ్వులతో అభిమానులను అలరిస్తుంటారు. అందరిలాగే తారల జీవితాల్లోనూ ఎవరికీ తెలియని వేదనలు, విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి హృదయవిదారక కథే నటి ప్రత్యూషది. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే ప్రేమ పోటుకు బలైపోయింది. ఈ విషాద ఘటన జరిగి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత సుప్రీం కోర్టు నేడు(మంగళవారం) తన తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.అలా సినిమాల్లోకి.. ప్రత్యూష సొంతూరు భువనగిరి. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉండేది. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని గోల్ పెట్టుకొని..ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకు సిద్ధార్థరెడ్డితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇంటర్ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వెళ్లగా.. సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అప్పట్లో జరిగిన ‘మిస్ లవ్లీ స్మైల్’ పోటీలో ప్రత్యూష్ పాల్గొని.. విజయం సాధించింది. దీంతో ఆమెకు 1998లో ‘రాయుడు’ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అది రిలీజ్ అయిన తర్వాత ప్రత్యూషకు వరుస అవకాశాలు వచ్చాయి. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని.. ఇలా నాలుగేళ్ల కెరీర్లో తెలుగు, తమిళ్లో కలిసి 12 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.ఫిబ్రవరి 23న ఏం జరిగింది?ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సిద్ధార్ధ్తో స్నేహాన్ని కంటిన్యూ చేసింది. కొంతకాలం పాటు బాగానే ఉన్నా..తర్వాత విబేధాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఓ బ్యూటీ పార్లర్లో ప్రత్యూష, సిద్ధార్థ్ కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ కూల్డ్రింక్లో విషయం కలుపుకొని తాగారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రేమికుల ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముగించే సమయంలో కీలక విషయం బయటకు వచ్చింది.ఆత్మహత్యా? హత్యా?ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ఎవరో ఆమె గొంతు నులిమి చంపారని ఓ ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం చేసిన విచారణలో ప్రత్యూషది ఆత్మహత్యేనని తేలింది. పురుగులమందు కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరం కింద సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ శిక్షను మూడేళ్లకు కుదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని కూడా సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు. అయితే సుప్రీంలో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు లొంగిపోవాల్సిదేంటూ మంగళవారం సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. -
నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటీషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు.చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నాలుగు వారాల్లో లొంగిపోవాలిసీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్కెళ్లింది. పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది.అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్ కాల్.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్లో ఉన్న శిరికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్ చేసినా సరే ప్రత్యూష ఫోన్ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.ప్రత్యూష పోస్ట్మార్టమ్ప్రత్యూష పోస్ట్మార్టమ్ నిమ్స్లో జరిగిందని ప్రత్యూష తల్లి చెప్పారు. 'సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.పాయిజన్ ఎందుకు తీసుకుందో..ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను.ప్రత్యూష సినిమా విశేషాలుసినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్. -
పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సహజీవన ఘటనలపై సర్వోన్నతన్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులే. బంధం ఎంత గాఢమైనదైనా సరే పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవడందాకా ఎందుకు వెళ్తున్నారో మాకైతే అర్థంకావట్లేదు. మేము పాతకాలం మనుషులమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆచితూచి అడుగులేయాలి’’అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే? నిందితుడు 2022లో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా 30 ఏళ్ల మహిళకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే నిందితుడికి అప్పటికే వివాహమైంది. ఆ విషయాన్ని దాచిపెట్టి, సదరు మహిళతో ఢిల్లీలో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను తనతో పాటు దుబాయ్కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా సాన్నిహిత్య వీడియోలను రికార్డ్ చేశాడు. పెళ్లి గురించి అడిగితే ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా బాధితురాలిని కాదని 2024 జనవరి 19వ తేదీన నిందితుడు పంజాబ్లో మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడు ప్రయతి్నంచగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అతను బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మీకెందుకు అంత చనువు? సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ’పెళ్లికి ముందు ఎంత చనువున్నా సరే, వారు అపరిచితుల కిందే లెక్క. ఒకవేళ ఆ మహిళకు పెళ్లి, సాంప్రదాయంపై అంత పట్టింపు ఉంటే, పెళ్లి కాకుండానే అతనితో దుబాయ్ ఎందుకు వెళ్లింది?’అని ప్రశ్నించారు. ‘నేటి కాలంలో ఇలాంటి కేసులు చూస్తుంటే మాకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. యువత జాగ్రత్తగా ఉండాలి’అని హితవు పలికారు. మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా అని ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా ‘పెళ్లి చేసుకోవాలనుకోవడం వేరు. పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోవడం వేరు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఇద్దరి అంగీకారంతో కొనసాగిన శారీరక బంధంలా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ‘పరస్పర సమ్మతితో కొనసాగిన ఇలాంటి కేసుల్లో విచారణలు జరిపి, దోషులుగా తేల్చి జైలుకు పంపడంలో హేతుబద్ధత లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే బాధితురాలికి నిందితుడు తగు నష్టపరిహారం ఇవ్వాలి’అని జస్టిస్ నాగరత్న సూచించారు. ఇద్దరూ మాట్లాడుకుని వివాదపరిష్కారానికి అవకాశాన్ని పరిశీలించాలని కేసును బుధవారానికి వాయిదా వేశారు.చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయను? -
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. -
‘శబరిమలకు మహిళలు’.. తుది విచారణకు ‘సుప్రీం’
శబరిమల: కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వుల ఆధారంగా ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తన తుది వైఖరిని తెలియజేస్తూ, మార్చి 14 లోగా లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.గతంలో ఈ కేసును ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేయడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల దశలో కూడా న్యాయపరమైన ప్రశ్నలను ప్రధాన ధర్మాసనానికి నివేదించే అధికారం కోర్టుకు ఉంటుందని 2020 ఫిబ్రవరిలోనే తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో ఈ అంశంపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. 2020లో రూపొందించిన ఏడు ప్రధాన న్యాయపరమైన ప్రశ్నల ఆధారంగానే ప్రస్తుత విచారణ సాగనుంది.అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసు కోసం కోర్టు షెడ్యూల్ను ప్రకటించింది. ఏప్రిల్ 7 నుండి 9 వరకు రివ్యూ పిటిషన్లను సమర్థించే వారి వాదనలను వింటారు. అనంతరం ఏప్రిల్ 14 నుండి 16 వరకు ఆ పిటిషన్లను వ్యతిరేకించే వారి వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 21న ప్రత్యుత్తరాల విచారణ చేపట్టి, ఏప్రిల్ 22 నాటికి అమికస్ క్యూరీ తుది వాదనలతో ప్రక్రియను ముగించాలని కోర్టు భావిస్తోంది. ఈ కేసు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శబరిమలలో మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేరళలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. తాజా విచారణ కేవలం శబరిమలకే పరిమితం కాకుండా.. మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్తులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, దావూదీ బోహ్రా కమ్యూనిటీలోని వివాదాస్పద ఆచారాల వంటి కీలక అంశాలను కూడా ప్రస్తావించనుంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
‘Need Ten Minutes’ : సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి గెలిచిన 19 ఏళ్ల అథర్వ్
ఢిల్లీ: ఫోమో, గోట్, వైబ్, బెట్..ఇవి జెన్జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్, విత్ డ్యూ రస్పెక్ట్, లెర్న్డ్ కౌన్సిల్, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు, అసోసియేట్ లాయర్లు, జూనియర్ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట టెన్ మినిట్స్ మోర్ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్, నీట్ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్ పొందినట్లు అతను గమనించాడు.ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్ జస్టిస్ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్లో అతనికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.ఇదే అంశంపై జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్ వాదనలతో ముగ్ధులైన జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
ఆ విద్యార్థికి హాల్ టిక్కెట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నుద్దేశిస్తూ అభ్యంతరకర మీమ్ను ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు ఆరోపణలున్న ఓ పదో తరగతి విద్యార్థిని పరీక్షలు రాయనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అతడికి వెంటనే హాల్ టిక్కెట్ జారీ చేయాలని కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సరి్టఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ)ని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ విద్యారి్థ(13) గతేడాది తమ స్కూలు ఉపాధ్యాయులపై అభ్యంతరకరమీమ్ను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. విషయం స్కూలు యాజమాన్యం దృష్టికి వచి్చంది. ఈ విషయమై సారీ చెప్పేందుకు ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడిని స్కూలు నుంచి బహిష్కరించింది. అతడి తండ్రి మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా, స్కూలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గతేడాది నవంబర్లో ఆదేశాలిచి్చంది. దీనిపై అతడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ విద్యార్థి ఇప్పటికే సీఐఎస్ఈఈలో నమోదై ఉన్నందున పరీక్షలు రాయనివ్వాలని సూచించింది. లేకుంటే అతడు విద్యా సంవత్సరం నష్టపోతాడని తెలిపింది. ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు గాను హాల్ టిక్కెట్ జారీ చేయాలని సీఐఎస్సీఈని ఆదేశించింది. ఆ బాలుడికి తోటి విద్యార్థులతో కాకుండా వేరే గదిలో పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయవచ్చని స్కూలు యాజమాన్యానికి సూచించింది. అంతేకాకుండా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్యూపీడబ్ల్యూ (సామాజిక ఉపయోగకరమైన ఉత్పాదక పని) సబ్జెక్టులకు పాఠశాల స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనాన్ని నిర్వహించాలని, ఆ మార్కులను బోర్డుకు సమరి్పంచాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. ‘ఆ విద్యారి్థని సంస్కరించేందుకు, అంతర్గత పరివర్తన తెచ్చేందుకు ప్రయతి్నంచాల్సిన పాఠశాల యాజమాన్యం, అతడిని తొలగించడం ద్వారా దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. అతడిని సన్మార్గంలో పెట్టే బాధ్యత కలిగిన పాఠశాల..అతడిపై చెడ్డ బాలుడనే ముద్ర వేసింది’అంటూ ధర్మాసనం ఈ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించింది. బాలలు సాధారణంగా ఇటువంటి ప్రవర్తనను తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేర్చుకుంటారని ధర్మాసనం అభిప్రాయపడింది. మతపరమైన విద్వేషాలను, అందుకు సంబంధించిన అంశాలను ప్రేరేపించే మీమ్స్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని స్పష్టం చేసింది. -
CJIకి సుప్రీం కోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ
న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయిఅవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్ వీఎస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు.గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు. -
వైకల్య పింఛను రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: ఓ జవానుకు అందజేయాల్సిన వైకల్య పింఛనును ప్రభుత్వం నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వైకల్య (డిజెబిలిటీ పెన్షన్) పింఛను ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని స్పష్టం చేసింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కని ప్రకటించింది. పింఛను అందజేయడంలో వివక్ష చూపడం లేదా తగ్గించడం వంటి చర్యలు సరికాదని తలంటింది. ఓ మాజీ సైనికోద్యోగికి వైకల్య పింఛను అందించాల్సిందేనంటూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. వైకల్య పింఛను ప్రభుత్వమిచ్చే దానం కాదు, అది దేశ సేవలో చేసిన త్యాగానికి దక్కిన గుర్తింపని తెలిపింది. ‘పింఛను ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా కాదు. గత సేవలకు ప్రతిఫలంగా చెల్లించే వాయిదా వేసిన వేతనం. నిర్ణీత నిబంధనలు పూర్తి చేసిన తర్వాత, అది ఒక స్థిరమైన, చట్టపరంగా అమలు చేయదగిన హక్కుగా మారుతుంది. పింఛను ప్రయోజనాలు ఆస్తి హక్కు వంటివి. చట్టపరమైన అధికారం లేకుండా వీటిని ఆపేయడం, తగ్గించడం, రద్దు చేయడం సాధ్యం కాదు’అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన యజమానిగా ఉండాలని, దేశం కోసం పనిచేసిన వారికి ప్రయోజనాలు అందించే విషయంలో నిష్పక్షపాతంతో, సమానత్వంతో వ్యవహరించాలని ఉద్బోధించింది. ఒక ప్రయోజనాన్ని విధానం ద్వారా గుర్తించి, న్యాయస్థానం ధ్రువీకరించినప్పుడు, అమలు విషయంలో వివక్ష చూపరాదని పేర్కొంది. న్యాయపరమైన తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల ద్వారా మాజీ సైనికులకు చెందాల్సిన పింఛనును నిరాకరించడమంటే ఆస్తిని లాక్కోవడమే అవుతుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 300ఏని ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. వైకల్య పింఛను హక్కు చాలా విలువైంది, ఒకసారి అది అర్హమైనదిగా తేలితే, బకాయిలు సహా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. -
సినిమా పేరు మార్చండి.. లేదా రిలీజ్ చేయకండి!
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సరి్టఫికేషన్(సీబీఎఫ్సీ)కి, సినిమా నిర్మాత నీరజ్ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి నటించిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్ సమాజ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అతుల్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్ వేశారు. సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్ఖోర్(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్పై గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు. ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది. -
మనోజ్ బాజ్పేయీ సినిమాకు సుప్రీం షాక్.. పేరు మార్చాల్సిందే!
మనోజ్ బాజ్పేయీ తాజా చిత్రం ‘ఘూస్ఖోర్ పండత్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేరు మార్చనిదే విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నీరజ్ పాండే, రితేశ్ షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. ఇందులో మనోజ్.. అజయ్ దీక్షిత్ అనే అవినీతీ పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా పేరు, మనోజ్ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై బ్రహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపిపివేయాలంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు.. టైటిల్ మార్చిన తర్వాత విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశించింది. ‘సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టి ఓ వర్గం ప్రజలను తక్కువ చేసి చూపే అధికారం ఎవరీకీ లేదు. వెంటనే పేరు మార్చాలి. కొత్త టైటిల్ని కోర్టుకు తెలిపిన తర్వాత విడుదల చేయాలకు అనుమతి ఇస్తాం’ అని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పాటు చిత్రంలో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని హామీ ఇస్తూ నిర్మాతలు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్ను మార్చే యోచనలో ఉంది. -
ఆధారాల్లేకుండా వేటు వేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒక చిన్న ఉద్యోగిపై అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో విధులకు హాజరు కాని పాపానికి, ఫోర్జరీ ముద్రవేసి ఉద్యోగం నుంచి తొలగించిన కరీంనగర్ కోర్టు అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆరోపణలు తీవ్రమైనవి అయినప్పుడు.. విచారణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలని హితవు పలుకుతూ, సదరు ఉద్యోగిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి ధర్మాసనం తీర్పు వెలువరించింది.అసలేం జరిగిందంటే?కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కె.రాజయ్య అనే వ్యక్తి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్నారు. 2017 ఆగస్టులో కడుపునొప్పి, జ్వరం కారణంగా ఆయన 4 రోజులపాటు విధులకు హాజరు కాలేదు. అనధికారికంగా డుమ్మా కొట్టారంటూ అధికారులు మెమో ఇవ్వగా.. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నానంటూ రాజయ్య ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ను సమర్పించారు. అయితే, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్కు కోర్టు నోటీసులు పంపగా.. ఆయన మాట మార్చారు. ’ఆ లెటర్ హెడ్ నాదే కానీ, ఆ సర్టిఫికెట్ నేను ఇవ్వలేదు.. ఎవరో నా లెటర్ హెడ్ దొంగిలించి ఫోర్జరీ చేశారు’ అంటూ డాక్టర్ చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. కేవలం ఆ డాక్టర్ మాటలను నమ్మిన విచారణాధికారి.. రాజయ్య ఫోర్జరీ చేశాడని నిర్ధారించారు. ఫలితంగా 2018లో రాజయ్యను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాజయ్య తెలంగాణ హైకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. హైకోర్టు కూడా అధికారుల చర్యను సమర్థించింది.రబ్బరు స్టాంపే సాక్ష్యంరాజయ్య అప్పీల్ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. రికార్డులను తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించింది. డాక్టర్ కోర్టు నోటీసు తీసుకున్నప్పుడు వేసిన రబ్బరు స్టాంపు, రాజయ్య సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్పై ఉన్న రబ్బరు స్టాంపు రెండూ ఒకేలా ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. ఒక ఉద్యోగి జీవితాన్ని నాశనం చేసేంత పెద్ద శిక్ష వేస్తున్నప్పుడు.. కనీసం చేతిరాత నిపుణుడితో ఎందుకు సరిచూడలేదని అధికారులను ప్రశ్నించింది. కేవలం డాక్టర్ మాట నమ్మి, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఫోర్జరీ అని ఎలా తేలుస్తారని మండిపడింది. రాజయ్యను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని... ఉద్యోగం తొలగించిన నాటి నుంచి నేటి వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలు మూడు వారాల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. అంతేగాక రాజయ్యను ఉద్యోగంలో కొనసాగించాలని స్పష్టంచేసింది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదన్న సుప్రీం కోర్టు
-
‘చెరిపేసే’ హక్కు ఏమిటి?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా వారి గోప్యతను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ‘చెరిపివేత హక్కు’(రైట్ టు బీ ఫర్గాటెన్–ఆర్టీబీఎఫ్)కు సంబంధించి ఆసక్తికరమైన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీనిప్రకారం వ్యక్తులు తమపై ఆన్లైన్లో ఉన్న కంటెంట్ను తొలగించాలని కోరేందుకు హక్కు ఉంటుందా అన్న అంశాన్ని తేల్చాలంటూ ఒక పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ కేసులో నిరపరాధిగా విడుదలైన ఒక వ్యక్తి తాలూకు విచారణ ప్రక్రియకు సంబంధించిన కంటెంట్ను ఆర్టీబీఎఫ్ కింద పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మీడియా సంస్థ దీన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఇది నూతన యుగం. కనుక గోప్యత హక్కులో భాగంగా ఆర్టికల్ 21లో పేర్కొన్న ఆర్టీఈఎఫ్, ఆర్టికల్ 19లో పేర్కొన్న మీడియా స్వేచ్ఛ హక్కులను సంతులనం చేయాల్సిన అవసరముంది’’అని ఈ సందర్భంగా పేర్కొంది. అసలు ఆర్టీబీఎఫ్ను, దాని పరిధిని నిర్దిష్టంగా నిర్వచించాలన్న పిటిషన్పై విచారణ జరిపేందుకు అంగీకరించింది. మార్చి 16లోగా స్పందించాల్సిందిగా టూ సదరు వ్యక్తికి, పిటిషన్లు దాఖలు చేసిన ఇతర మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఏమిటీ కేసు? ఒక క్రిమినల్ కేసులో నిర్దోíÙగా తేలిన ఓ, వ్యక్తి విచారణ ప్రక్రియకు సంబంధించి మీడియా సంస్థల్లో తనపై వెలువడ్డ వార్తలు తదితరాలన్నింటినీ ఆన్లైన్ డొమైన్ల నుంచి తొలగించాలంటూ దిగువ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఇండియన్ కానూన్ అనే ఆన్లైన్ పోర్టల్ దాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు కూడా కూడా సదరు వ్యక్తికే అనుకూలంగా 2025 డిసెంబర్ 18న తీర్పు వెలువరించింది. దాంతో మీడియా సంస్థ సుప్రీం గడప తొక్కింది. అనంతరం పలు ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి. ఆన్లైన్ న్యూస్కు ఆర్టీబీఎఫ్ వర్తించదని ఇండియన్ కానూన్ పోర్టల్ తరఫున సీనియర్ న్యాయవాది అర్వింద్ దాతార్ ఈ సందర్భంగా వాదించారు. ఈ విషయంలో ఢిల్లీ తీర్పును హైకోర్టు మద్రాస్, రాజస్తాన్, పంజాబ్–హరియాణా హైకోర్టులు ప్రమాణంగా పరిగణించి అభిప్రాయాలు వెల్లడించాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో, పరువునష్టం కేసుల్లో తీర్పుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సదరు తీర్పును ప్రమాణంగా పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. గోప్యత హక్కులో చరిత్రను చెరిపేసే హక్కు భాగం కాదని 2017 నాటి చరిత్రాత్మక కె.ఎస్.కుప్పుస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని దాతార్ గుర్తు చేశారు. ‘‘మీడియా సంస్థలు ఒకే వార్తను పదేపదే చూపిస్తే పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఆర్టికల్ 19, 21లలో దేన్ని వర్తింపజేయాలి?’’అని ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. పత్రికల్లో ఒకసారి ప్రచురితమయ్యే వార్త ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఆయన గుర్తు చేశారు. కనుక వార్తాంశాన్ని చెరిపేయడం సాధ్యపడదని బదులిచ్చారు. ‘‘ఆ పరిస్థితిలో సదరు వార్త సజీవంగానే ఉండిపోతుంది. అలాంటప్పుడు చెరిపేసే హక్కు పరిస్థితి ఏమిటి?’’అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి సంబంధించి వార్తాంశాలను తాము తొలగించినట్టు దాతార్ తెలిపారు. అయితే నిర్దిష్ట కాలం గడిచాక ఏ వార్తాంశమైన ఆర్కైవ్స్లోకి వెళ్లి ఉండిపోతుందని బదులిచ్చారు. పైగా ఇలాంటి వార్తాంశాల నుంచి సదరు వ్యక్తి పేరునే పూర్తిగా తొలగిస్తే ఆ ఉదంతానికి సంబంధించిన కథనమంతా కనుమరుగైనట్టేనని ఆందోళన వెలిబుచ్చారు. పౌరులకు సమాచారం అందుకుండా చేసేందుకు ఈ రోజుల్లో గోప్యత పేరిట అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయని జస్టిస్ భూయాన్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీబీఎఫ్ను చరిత్రను చెరిపేసే పనిముట్టుగా వాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వీలు కల్పింంచిందని దాతార్ ఆరపించారు. కనుక దాని రాజ్యాంగబద్ధత, అమలు పరిధి తదితరాలను స్పష్టంగా నిర్వచించాలని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ‘‘విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలు మర్నాడు మీడియాలో వార్తలుగా మారుతున్నాయి. అనంతరం కోర్టులు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నంత మాత్రాన సదరు వార్తా కథనాలను కూడా తొలగించగలమా?’’అని ప్రశ్నించారు. ‘‘ఈ సోషల్ మీడియా యుగంలో కొన్ని విషయాలకు సంబంధించి తమను అంతా మర్చిపోవాలని వాంఛించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏమైనా ఇది ఆసక్తికరమైన అంశమే. దీన్ని లోతుగా పరిశీలిస్తాం’’అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.గతంలోనూ ‘సుప్రీం’ఆందోళన చెరిపేసే హక్కు (ఆర్టీబీఎఫ్) అమలు తీరుతెన్నులపై గతంలో కూడా సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీని ప్రకారం కోర్టు తీర్పులను పబ్లిక్ డొమైన్ నుంచి తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా, దారుణంగా ఉంటాయని 2024లో ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. -
3 వారాల్లో తేల్చాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మె ల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరో సారి డెడ్ లైన్ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీద్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. మున్సిపల్ ఎన్నికలతో ఆలస్యం: సింఘ్వీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ‘అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన రెండు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల స్పీకర్ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలోగా లేదా అంతకంటే ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది..’ అని చెప్పారు. 16 నెలలుగా ఏం చేస్తున్నారు?: మోహిత్ రావ్ సింఘ్వీ వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది మోహిత్రావ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ’గత 16 నెలలుగా ఈ వ్యవహారాన్ని స్పీకర్ కార్యాలయం తొక్కిపెడుతోంది. స్పీకర్ స్వయంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిపారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?..’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కోర్టులను రీల్స్ కోసం వాడుకోవద్దు విచారణ సందర్భంగాన్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్ సంజయ్ కరోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ’రీల్స్’ రూపంలో పోస్ట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’న్యాయస్థానాలను రీల్స్ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. బాధ్యతాయుతమైన ఆఫీసర్లుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు..’ అని హితవు పలికారు. -
నీట్–పీజీ అర్హత స్కోర్ను ఎందుకు తగ్గించారు?
న్యూఢిల్లీ: నీట్–పీజీ 2025–26కు క్వాలిఫయింగ్ కటాఫ్ పర్సంటైల్ను భారీగా తగ్గించడంపై వివరణ ఇవ్వాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం ఎదుట శుక్రవారం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. పీజీ స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పేందుకు కఠినమైన నిబంధనలు అవసరమన్నారు. ప్రత్యేకమైన కారణాలుంటే తప్ప, పీజీ ప్రవేశాలకు అర్హత మార్కులను తగ్గించరాదన్నారు. స్పందించిన ధర్మాసనం..‘సీట్లను ఖాళీగా వృథా ఉంచరాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, ప్రవేశాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అందుకే కటాఫ్ను తగ్గించాల్సి వస్తోంది. అయితే, సీట్లను ఖాళీగా ఉంచరాదనే నెపంతో ప్రమాణాల విషయంలో రాజీ పడటం తగదన్న వాదనలున్నాయి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని మనం వెదకాలి’అని అభిప్రాయపడింది. ఈ అంశంపై సరైన పరిష్కారంతో ముందుకు రావాలని ఎన్బీఈఎంఎస్ను ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. నీట్ పీజీ–2025 ప్రవేశాల్లో 18 వేలకు పైగా పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో, బోర్డు రిజర్వుడు కేటగిరీల అభ్యర్థుల అర్హత పర్సంటైల్ను 40 నుంచి సున్నాకు తగ్గించింది. దీనర్థం 800కు గాను మైనస్ 40 స్కోరు సాధించిన అభ్యర్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశమేర్పడింది. అదేవిధంగా, జనరల్ కేటగిరీ నీట్ పీజీ అభ్యర్థుల అర్హత స్కోరును 50 నుంచి 7కు తగ్గించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లకు భంగం కలిగించడమేనంటూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 4వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్పై సుప్రీంకోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది.బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల విచారణకు సమయం పొడిగించాలని స్పీకర్ తరఫున సంఘ్వీ కోర్టును కోరారు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. మరో మూడు వారాల సమయం ఇచ్చింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే, గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. -
తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. తక్షణమే ఎంప్యానెల్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా అర్హులైన అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ ఎంపిక విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ వాదనలు వినిపిస్తూ.. ‘తెలంగాణలో 2017లో మాజీ డీజీపీ అనురాగ్ శర్మ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ డీజీపీ కోసం ప్రతిపాదనలు పంపలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2025 ఏప్రిల్లో జాబితా పంపింది. ఇంత జాప్యం జరిగినందున, దీనిపై స్పష్టత కావాలి’అని చెప్పారు. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? యూపీఎస్సీ వాదన విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా స్పందించారు. ’తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మీరు పిటిషన్ వేశారు సరే.. ఒకవేళ మీ వాదనను అంగీకరించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తే, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అక్కడ యాక్టివ్ డీజీపీ లేకుండా పోతారు కదా? పిటిషన్ వేసే ముందు ఈ పరిణామం గురించి యూపీఎస్సీ ఎందుకు ఆలోచించలేదు?’అని నిలదీశారు. రాష్ట్రం మూడు నెలల గడువు పాటించనప్పుడే.. యూపీఎస్సీ ఎందుకు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాక సాకులు చెప్పడం సరికాదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో నియామక ప్రక్రియను నిలిపివేస్తే అది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి సహకరించినట్లవుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెగ్యులర్ డీజీపీలను నియమించకుండా, యాక్టింగ్ (ఇన్చార్జి) డీజీపీలతో పాలన సాగిస్తున్న విధానంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల వలలో మీరు (యూపీఎస్సీ) పడకండి. అసలు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డీజీపీలు ఉండటం ఇష్టం లేదు. తమకు నచ్చినట్లుగా వ్యవహరించే, తమకు అనుకూలంగా ఉండే యాక్టింగ్ లేదా తాత్కాలిక డీజీపీలే వారికి కావాలి. అందుకే ఈ జాప్యమంతా’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. యూపీఎస్సీకి కోర్టు ధిక్కరణ అస్త్రం ప్రకాశ్ సింగ్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన అధికారులను కొనసాగించేందుకు నియామకాల్లో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని, దీనివల్ల అర్హత, మెరిట్ ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. డీజీపీ పదవీ విరమణకు ముందే రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని, ఒకవేళ రాష్ట్రాలు సకాలంలో స్పందించకపోయినా, జాప్యం చేసినా.. ఇకపై యూపీఎస్సీ నేరుగా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయొచ్చని స్పష్టం చేసింది. రాజకీయ ప్రాధాన్యతలతో కాకుండా.. అధికారుల సరీ్వస్ రికార్డు, సీనియారిటీ, మెరిట్ ఆధారంగానే డీజీపీ ఎంపిక జరగాలని తేల్చిచెప్పింది. -
అనురాగ్ ఠాకూర్కు ఊరట
న్యూఢిల్లీ: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భారత క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చంటూ 2017లో ఇన ఆదేశాలను సవరించింది. అప్పటి ఆదేశాలను సవరించాలంటూ ఠాకూర్ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేసు నేపథ్యమిదీ.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం సహా బోర్డు పనితీరులో పారదర్శకత తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలంటూ అప్పట్లో బీసీసీఐ చైర్మన్గా ఉన్న అనురాగ్ ఠాకూర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం నియమించిన లోథా కమిటీ కొన్ని సూచనలతో బోర్డుకు నివేదిక అందించింది. వీటిని బోర్డు అమలు చేయలేదు. పైపెచ్చు, తమది స్వతంత్ర సంస్థగా ప్రకటించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్పర్సన్ శశాంక్ మనోహర్కు బీసీసీఐ చైర్మన్గా ఉన్న ఠాకూర్ ఓ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. అనంతరం దీనిపై, సుప్రీంకోర్టుకు బీసీసీఐ చైర్మన్ ఠాకూర్ తప్పుడు అఫిడవిట్ సమరి్పంచారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సీరియస్గా తీసుకుంది. తమ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచారంటూ, ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. అయితే, ఠాకూర్ స్వయంగా న్యాయస్థానానికి హాజరై, బేషరతు క్షమాపణలు చెప్పడంతో శాంతించింది. అయితే, బోర్డు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పదవి నుంచి తక్షణమే వైదొలగాలంటూ ఠాకూర్కు 2017 జనవరిలో ఆదేశాలింది. ఠాకూర్ వాదన ఇదే.. కోర్టు ఆదేశాల మేరకు బోర్డు పదవికి, కార్యకలాపాలకు దూరంగా ఉండబట్టి 9 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. తనపై విధించిన నిషేధాన్ని ఇకనైనా ఎత్తివేయాలని కోరారు. జీవితకాలం నిషేధంగా అప్పటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనలేదని తెలిపారు. బోర్డు చైర్మన్ హోదాలో అప్పట్లో చోటుచేసుకున్న అన్ని పరిణామాలకు తానే బాధ్యత వహించాల్సి వందని పేర్కొన్నారు. నేరానికి తగిన శిక్ష.. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో ప్రపోర్షనాలిటీ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం సరైందని భావిస్తున్నామంది. ‘వాస్తవానికి న్యాయస్థానం ఠాకూర్పై జీవితకాల నిషేధాన్ని విధించాలని అనుకోలేదు. కేసులోని వాస్తవాలు, పరిస్థితులను బట్టి కఠినమైన నిషేధం విధించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. పరిపాలనాపరమైన లోపానికి జీవితకాలం పాటు పదవులకు దూరం చేయడం అతి అవుతుంది’అని ధర్మాసనం పేర్కొంది. 2017లో ఇచి్చన ఆదేశాలు ఆ సమయానికి అవసరమైనవే తప్ప, శాశ్వతం కాదన్న ధర్మాసనం.. ఠాకూర్ తిరిగి బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. -
జనంపై ‘సర్’ బుల్డోజర్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే సక్రమంగా జరగట్లేదని, పనిఒత్తిడితో బూత్ లెవల్ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, బాధితులను ఢిల్లీకి తీసుకొచ్చి బెంగాల్ అంశాన్ని హస్తిన వేదికగా చర్చనీయాంశంగా మార్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఈ అంశంపై నేరుగా సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు స్వయంగా వినిపించారు. ఐదు నిమిషాలు సమయం ఇస్తే సూటిగా, స్పష్టంగా తమ వాదనలను విన్పిస్తానని మమత కోరగా ధర్మాసనం ఏకంగా 15 నిమిషాల సమయం కేటాయించడం విశేషం. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా స్వయంగా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో రాష్ట్ర కేసును వాదిస్తుండటంతో ఆమె వాగ్ధాటిని వినేందుకు న్యాయవాదులు సీజేఐ కోర్టురూమ్లోకి ఎగబడ్డారు. ఈ ఘటనకు సర్వోన్నత న్యాయస్థానం వేదికైంది. ఈసీ ఒక వాట్సాప్ కమిషన్..తమ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ, మొస్తారీ బానూ, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియాన్, దోలాసేన్లు వేసిన పిటిషన్పై తానే స్వయంగా వాదనలు విన్పించేదుకు అనుమతించాలంటూ ఇప్పటికే మమత ఇంటులాక్యుటరీ పిటిషన్ వేశారు. దీంతో మమతను వాదనలకు కోర్టు అనుమతించింది. మమత తన వాదనల సందర్భంగా ఎన్నికల కమిషన్ను వాట్సాప్ కమిషన్గా అభివర్ణించారు. ‘‘ ఈసీ ఒక వాట్సాప్ కమిషన్. ఉన్నతాధికారులకు కీలక నిర్ణయాలను వాట్సాప్లలో పంపిస్తోంది. మా రాష్ట్రంలో అక్ర మంగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎన్నికల నేపథ్యంలోనే మా రాష్ట్రాన్ని ఈసీ లక్ష్యంగా చేసుకుంది. ఓటర్లపై ఈసీ ‘ఎస్ఐఆర్’ బుల్డోజర్తో తొక్కిస్తోంది. ఎస్ఐఆర్ పేరిట బూత్ లెవల్ అధికారులను ఈసీ అధికా రాలు వేధిస్తున్నారు. వేధింపులు, పని ఒత్తిడితో పెద్దసంఖ్యలో బీఎల్ఓలు ఆత్మహత్యచేసుకున్నారు. రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి. ఈ కేసులో న్యాయం కోసం మొదట్నుంచీ మా లాయర్లు శతథా పోరాడుతున్నారు. అయినాసరే మాకు ఎక్కడా న్యాయం దక్కట్లేదు. నేను కూడా కట్టుబానిసను. సాధారణ కుటుంబం నుంచి వచ్చా. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడట్లేను. రాష్ట్ర ఓటర్ల ఓటింగ్ హక్కుల కోసం పోరాడుతున్నా. ఇదే విషయమై ఇప్పటికే ఆరు సార్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకుంటూ లేఖలు రాశా. అయినాసరే ఎలాంటి స్పందన రాలేదు. స్పెల్లింగ్లో చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపి కోట్లాది ఓట్లను తొలగించొద్దు. ఇతర డాక్యుమెంట్లు అడక్కుండా ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో ఆధార్కార్డ్ను గుర్తింపుకార్డుగా అంగీకరించండి’’ అని మమత కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం స్పందించింది. ‘‘మీరు చేస్తున్న వాదనల్లో నిజం ఉంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఫిబ్రవరి 9వ తేదీ(సోమవారం)కల్లా మీ స్పందన తెలపాలని ఎలక్షన్ కమిషన్కు, పశ్చిమబెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి నోటీసులు జారీచేసింది. బీఎల్ఓలు, ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లతో సున్నితంగా వ్యవహ రించాలని, వాళ్లకు నోటీసులు జారీచేసే ముందు ఆలోచించాలని ఈసీకి ధర్మాసనం సూచించింది. కేసు విచారణ సోమవా రానికి వాయిదా వేశారు.ఎందుకింత తొందర?‘‘ఎస్ఐఆర్ సర్వేను సమగ్రంగా, సంపూర్ణంగా చేయాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ హడావుడి గా కేవలం మూడునెలల్లో ముగించాలని ఎందుకు నిర్ణయించారు? ఇదే సమయంలో రాష్ట్రంలో పండగ సీజన్ ఉంది. పంటల సాగు నడుస్తోంది. అంతా బిజీగా ఉండే సమయంలో హడావిడిగా ఎస్ఐఆర్ ముగించాలని ఎందుకు భావిస్తున్నారు?’’ అని మమత వాదించారు. వేధింపులతో బీఎల్ఓలు చనిపోతున్నారని మమత వాదించగా ఎలక్షన్ కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కలగజేసుకుని ‘‘ ఉద్దేశపూర్వకంగా మమత సర్కార్ తక్కువ పనితనం ఉన్న 80 మంది గ్రేడ్–2 అధికారులను మాకు సహాయకులుగా అందించింది’’ అని వాదించారు. దీనిపై మమత మాట్లాడారు. ‘‘ ఈసీ నిబంధనల్లో పేర్కొన్న మేరకే తగు రాష్ట్ర ఆఫీసర్లను ఈసీ కోసం కేటాయించాం’’ అని బదులిచ్చారు. మళ్లీ ద్వివేది మాట్లాడబోగా మమత చేతులు జోడించి ‘‘ జడ్జిగారు దయచేసి మమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వండి’’ అని వేడుకున్నారు. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘‘మమత ఇంతదూరం వచ్చిందే మాట్లాడేందుకు. అయినా నిజమైన ఓటరు పేరు ఖచ్చితంగా ఓటర్లజాబితా తుది లిస్ట్లో ఉండాల్సిందే. తుది జాబితా నుంచి ఏ ఒక్క అమాయకుడిని పేరు తొలగింపునకు గురికావొద్దు’’ అని అన్నారు. ఇంగ్లిష్ స్పెల్లింగ్లో తప్పులుంటే కూడా నోటీస్లు ఇస్తున్నారని శ్యామ్ దివాన్ వాదించగా కోర్టు ‘‘ఇంగ్లిష్ అంటేనే స్పెల్లింగ్ తప్పులమయం’’ అని ఒక బెంగాళీ సామెతను గుర్తుచేశారు. తెలుపురంగు చీర, నలుపు రంగు శాలువా ధరించి న్యాయవాదులు, పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది కల్యాణ్ బెనర్జీలతో వచ్చిన మమతను చూసేందుకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పలు కేసుల పిటిషనర్లు ఎగబడ్డారు. -
దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్
-
యువతను రెచ్చగొట్టారు
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని కేంద్రం ఆరోపించింది. పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్లలో మాదిరిగా జెన్ జెడ్ నిరసనలకు పిలుపునిచ్చారని పేర్కొంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండేందుకు గాను ఆయన మహాత్మాగాంధీ ప్రసంగాలను ఉపయోగించుకున్నారని తెలిపింది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద వాంగ్చుక్ను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరవింద్ కమార్, జస్టిస్ పీవీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులను ఎలాంటి విచారణ లేకుండా గరిష్టంగా 12 నెలలపాటు నిర్బంధించే హక్కు అధికారులకు ఉంటుంది. కేంద్రం, లద్దాక్ యంత్రాంగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్రాన్ని వాళ్లు అని, లద్దాఖ్ ప్రజలను మనం అని వేరుగా చూపిస్తూ మాట్లాడారని వాంగ్చుక్ ప్రసంగించే వారని ఆయన పేర్కొన్నారు. గతంలో జమ్మూ కశీ్మర్లో వచ్చినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండం చేపట్టాలంటూ డిమాండ్ చేశారన్నారు. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు కలిగిన లద్దాఖ్ ప్రాంతం అత్యంత సున్నితమైందన్న మెహతా..అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను తప్పనిసరిగా గణనలోకి తీసుకోవాలని కోరారు. ‘ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ వాంగ్చుక్ నిర్బంధానికి ఆదేశాలు జారీ చేశారు. మేజి్రస్టేట్ ఆదేశాల మేరకు డీఐజీ స్థాయి అధికారి ముందుగా వాంగ్చుక్ వద్దకు వెళ్లి ఆయన ప్రసంగాల వీడియోలను, ఇతర ఆధారాలను చూపారు. నిర్బంధంలోకి తీసుకునేందుకు గల కారణాలను వివరించారు’అని ధర్మాసనానికి మెహతా తెలిపారు. మేజి్రస్టేట్ కృత్రిమ ఆధారాలతోనే వాంగ్చుక్ను నిర్బంధించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాంగ్చుక్ చేసిన ప్రసంగాలను విన్న అధికారులు, ఆ వీడియోలను తయారు చేసి మేజి్రస్టేట్ ముందుంచారని వివరించారు. మంగళవారం కూడా ఈ కేసులో వాదనలు కొనసాగనున్నాయి. జోథ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వాంగ్చుక్ అరబ్ దేశాల్లో మాదిరిగా తిరుగుబాటును లేవదీసేందుకు ప్రయత్నించినట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ జనవరి 29వ తేదీన ఒక ప్రకటన వెలువరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు తనకుందని అందులో పేర్కొన్నారు. కొన్ని ఎంపిక చేసిన వీడియోలను చూపు తూ అధికారులు వాంగ్చుక్ నిర్బంధాన్ని సమరి్థంచుకుంటున్నారంటూ ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. వాంగ్చుక్ నిర్బంధం చట్ట విరుద్ధం, ఏకపక్ష చర్య..ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని గీతాంజలి అంగ్మో ఆరోపిస్తున్నారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ప్రకటించాలంటూ గతేడాది సెప్టెంబర్లో జరిగిన నిరసనల్లో నలుగురు చనిపోగా, 90 మంది వరకు గాయపడ్డారు. అల్లర్లకు వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ రెండు రోజుల తర్వాత అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోవడం తెల్సిందే. -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్నెట్లో సాక్షి చానెల్ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీ చానెల్ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే.. టీడీశాట్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను టీడీ శాట్ విచారణ జరపనుంది. టీడీశాట్ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం. -
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్భూషణ్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులో ఏప్రిల్ 21న తదుపరి విచారణ జరగనుంది. -
యూజీసీ కొత్త రూల్స్కు ‘సుప్రీం’ బ్రేక్.. ఎందుకో తెలుసా?
ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు-2026 వివాదంలో చిక్కుకున్నాయి. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఎలా పెద్దదైంది? దీనిని కేంద్రం ఎలా సమర్థిస్తుందో చూద్దాం.. ఏమిటీ నిబంధనలు?ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ ‘సమానత్వ(ఈక్విటీ) కమిటీ’ల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. కులం, మతం, లింగం, వికలాంగత, జాతి వంటి వివక్షలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్రత్యేక సెల్లు పని చేస్తాయి. ఇంతకు ముందు.. 2012 నిబంధనలను రద్దు చేసి, మరింత విస్తృతమైన, కఠినమైన నియమాలు అమలు చేయబడతాయి. ఇందులో హెల్ప్లైన్లు, కఠినమైన బాధ్యతా ప్రమాణాలు వంటి నిబంధనలు ఉంటాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమానత్వ చర్యలు, ఫిర్యాదు పరిష్కారాలపై UGCకి నివేదికలు సమర్పించాలి.రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ(ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను జనవరి 13వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. అభ్యంతరాలు దేనికి? సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చని.. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా ఈ నిరసన సెగ తాకింది. దీనికి నిరసనగా పార్టీకి కొందరు బీజేపీ నేతలు, ఓ సీనియర్ బ్యూరోక్రాట్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏముంది?మరోవైపు, రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోని 3(సి) విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీలు సైతం దీనిని అదనపు బాధ్యతలుగా చూస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కమిటీ ప్రతినిధుల మధ్య విభేదాలు పెరిగే అవకాశంపై ఆందోళన పిటిషన్లో వ్యక్తం చేశారు.తాత్కాలికంగా ఎందుకు నిలిపివేసింది?బిల్లులోని కొన్ని నిబంధనలను సుప్రీం కోర్టు గురువారం తాత్కాలికంగా నిలిపివేసింది. దీని అమలుకు స్వేచ్ఛా, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కేంద్రం ఏం చెబుతోంది?కొత్త నిబంధనల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎవరూ వేధింపులకు గురికారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.UGC బిల్లు 2026 ప్రధానంగా ఉన్నత విద్యాసంస్థల్లో కుల ఆధారిత వివక్షతో పాటు ఇతర రకాల వివక్షను నివారించడానికి రూపొందించబడిందని అంటున్నారాయన. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించే చారిత్రాత్మక అడుగు అని మద్దతుదారులు అంటున్నారు. విద్యా నిపుణులు ఇది వ్యవస్థలోని అడ్డంకులను తొలగించి, సమానత్వాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.మొత్తంగా.. ఈ బిల్లు మార్జినలైజ్డ్ కమ్యూనిటీలకు రక్షణ కల్పించడమే లక్ష్యం అయినప్పటికీ.. దాని అమలు విధానం, దుర్వినియోగం అవకాశాలు, కొత్త విభజనల భయం కారణంగా వివాదం చెలరేగింది. -
జడ్జీల బదిలీల్లో ప్రభుత్వ జోక్యం
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు, కొలీజియం నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనకర పరిణామం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగకరమన్నారు. ‘‘ఇటీవల జస్టిస్ అతుల్ శ్రీధరన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ విన్నపం మేరకే జరిగిందని నాటి ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) ప్రభావం ఉందని దీంతో స్పష్టమవుతోంది’’ అని జస్టిస్ భూయాన్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించేలా ఉత్తర్వులను ఇచి్చనంతమాత్రానే హైకోర్టు జడ్జిని బదిలీ చేస్తారా? ఇవి న్యాయవ్యవస్థ స్వతంత్రతకే గొడ్డలి పెట్టు కాదా? కొలీజియం విధానం సమగ్రతను ఇవి దెబ్బ తీసినట్లు కాదా? హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా ఉండరాదు’’ అని కుండబద్దలు కొట్టారు. -
‘సుప్రీం’కు అసాధారణ అధికారం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలను ఇచ్చిందని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ పేర్కొన్నారు. తన ముందు పెండింగ్లోని ఏదైనా కేసులో సంపూర్ణ న్యాయం అందించేందుకు అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేసే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందన్నారు. అయోధ్య వివాదం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులతోపాటు విడాకుల కేసుల్లో న్యాయస్థానం దీన్ని వినియోగించుకుందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందంటూ అయోధ్య కేసును ప్రస్తావించారు. నేరం బహిరంగంగా జరిగినా బాధ్యత నిర్ధారణ, శిక్ష విధింపులో తీవ్రమైన జాప్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. న్యాయం చేయడమే కాదు, న్యాయ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కోర్టులపై ఉందన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఆయన ‘(అ)సంపూర్ణ న్యాయం? 75 ఏళ్ల సుప్రీంకోర్టు’అనే పుస్తకంపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ‘సుప్రీం’పాత్రను చెబుతుంది.. రాజ్యాంగం అమల్లోకి వచి్చన 75 ఏళ్ల సందర్భంగా సుప్రీంకోర్టు పనితీరు, పాత్ర, సవాళ్లను ఇందులో ప్రస్తావించినట్లు జస్టిస్ మురళీధర్ చెప్పారు. పలు కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తన రాజ్యాంగ బాధ్యతలను ఎంత సమర్థవంతంగా నిర్వర్తించిందో తెలియజేయడానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖుల వ్యాసాలు, ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు చెప్పారు. తీర్పుల ప్రస్తావనతోపాటు కొన్నిసార్లు అవసరమైన చర్య తీసుకోవడంలో విఫలమైందా.. లేదా.. అన్న సున్నిత విమర్శలు, ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కోర్టు ప్రభావమే కాకుండా న్యాయ నియామకాల్లాంటి అంతర్గత, పరిపాలనా సవాళ్లను కూడా ఇందులోని వ్యాసాలు ప్రతిబింబిస్తాయన్నారు. సాయినాథ్, ప్రొఫెసర్ బక్షి, ప్రముఖ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, మీనాక్షి ఆరోరా లాంటి వారి రచనలను ఆయన ప్రస్తావించారు. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు న్యాయ విద్యలో సమూల మార్పు రావాల్సి ఉందని జస్టిస్ మురళీధర్ చెప్పారు. జాతీయ స్థాయి విద్యాసంస్థలున్నా.. నాణ్యమైన వాదనలు వినిపించే నిపుణులైన న్యాయవాదులను అందించడం లేదన్నారు. సుదీర్ఘమైన వాదనలతో కాకుండా నాణ్యమైన వాదనలతో కోర్టు సమయం వృథా కాదని, సత్వర న్యాయానికి దోహదం చేస్తుందన్నారు. యువ న్యాయవాదులు దీన్ని అలవర్చుకోవాలన్నారు. హైబ్రిడ్ విచారణలు ఆశించదగిన పరిణామమని చెప్పారు. కొన్నిసార్లు బెంచ్ల మధ్య తీర్పుల్లో వ్యత్యాసం ఉండొచ్చంటూ తాజా ‘ఆరావళి’తీర్పును గుర్తుచేశారు. తీర్పులు నల్లేరుపై నడక కాదని, అయోధ్య, శబరిమల.. లాంటి కేసుల విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థ రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు లోనైందన్నారు. న్యాయమూర్తులు స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి విహరించలేరని, అయినా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కిందిస్థాయి కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో విచారణ కొనసాగాలని, కక్షిదారులకు తమ కేసు వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. జడ్జిలు రాజకీయాల్లో చేరడంపై లోతైన చర్చ అవసరమన్నారు. న్యాయ సంస్కరణలు అవసరం ఎలక్రో్టరల్ బాండ్లు, నోట్ల మారి్పడి, ఆర్టికల్ 370, పెగాసస్ స్పైవేర్.. లాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరు సరికాదని జస్టిస్ మురళీధర్ అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు ఆలస్య తీర్పు కారణంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. వేగవంతమైన విచారణ, బెయిల్ మంజూరు అంశాలను ప్రస్తావించిన ఆయన ట్రయల్ సత్వరం పూర్తి చేయాలని, దీని కోసం న్యాయ సంస్కరణలు తేవాలని నొక్కిచెప్పారు. సీరియస్, నాన్–సీరియస్ కేసులుగా విభజించుకుని కీలకమైనవి కాకుంటే వెంటనే తీర్పులివ్వాలన్నారు. అవినీతి అనేది అన్ని వ్యవస్థల్లో మాదిరి న్యాయ వ్యవస్థలోనూ ఉందని, పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రత్యేక చట్టం చేయాలని సూచించారు. 1984లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మురళీధర్ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు మారారు. 2006లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023లో పదవీ విరమణ చేశారు. -
‘గీతం’కు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్ట విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టంచేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేర్వేరుగా లేఖలు రాశారు. పేదల గుడిసెలు తొలగించి.. పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా? అదే అధికారులు విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని, వీధి వ్యాపారుల బళ్లను పోలీసు బలగాల సహాయంతో పొక్లెయిన్లు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరొక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్దీకరణ చేయడానికి చూస్తున్నారని పత్రికల్లో వార్తలు చూశానని తెలిపారు. ఈ విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దారు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఏ నియమం కింద ఇటువంటి క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనల్లో బీఎస్వో (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్)24 కింద గానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571 కింద గానీ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగపాల్ సింగ్ (కేస్ నంబర్ 1132/2011) కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఈఏఎస్ శర్మ ఆ లేఖలో స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం రూ.22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తే, సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అసైన్డ్ భూములను గీతం కొనుగోలు చేసింది గతంలో గీతం సంస్థ రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ప్రైవేటు సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావని అవి ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
హైకోర్టుకు క్షమాపణ చెప్పండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తితో పరుషంగా మాట్లాడిన లాయర్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఆ లాయర్ క్షమాపణను సానుభూతితో స్వీకరించాలని హైకోర్టుకు కూడా సూచించింది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకు సంబంధించిన కేసును లాయర్ మహేశ్ తివారీ హైకోర్టులో వాదిస్తున్నారు. కనెక్షన్ తిరిగి ఇచ్చేందుకు రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని క్లయింట్ తరఫున ఆయన ప్రతిపాదించగా, మొత్తం బకాయిలో 50 శాతం చెల్లించడం తప్పనిసరంటూ గత తీర్పులను న్యాయమూర్తి రాజేశ్ కుమార్ ఉదహరించారు. చివరకు రూ.50వేలు డిపాజిట్ చేయాలనే నిబంధనతో సమస్య పరిష్కారమైనప్పటికీ, వాదనల సమయంలో మాటామాటా పెరిగింది. లాయర్ తివారీ తీరు సరిగా లేదంటూ జస్టిస్ కుమార్ జార్ఖండ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆగ్రహించిన మహేశ్ తివారీ.. ‘నేను ఇలాగే వాదిస్తా..హద్దు మీరకండి’అంటూ కోర్టు హాలులో న్యాయమూర్తితో వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ చౌహాన్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం లాయర్ తివారీకి ధిక్కారణ నోటీసు పంపింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. లాయర్ తివారీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదన వినిపించారు. తన క్లయింట్ అప్పటి ఘటనపై పశ్చాత్తాపం చెందుతున్నారని, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గౌరవ న్యాయమూర్తిని అగౌరవపర్చాలని గానీ, కోర్టు కార్యకలాపాలకు అవరోధం కలి్పంచాలని గానీ ఆయన ఉద్దేశం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం ధిక్కారం నోటీసు ఇచి్చన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట తివారీ క్షమాపణ చెబితే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ వేయాలంది. దీనిని సానుభూతితో పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. అదేసమయంలో లాయర్ ప్రవర్తనను ధర్మాసనం ఆక్షేపించింది. ‘జడ్జిల ఎదుట ఆయనే స్వయంగా హాజరై వివరణ ఇవ్వొచ్చు కదా? మూర్ఖత్వానికి తగు ఫలితం స్వయంగా అనుభవించాల్సిందే. అతడినే వివరణ ఇచ్చుకోనివ్వండి. అక్కడా గుడ్లు ఉరమాలని అనుకుంటే... ఉరమనీయండి. అతడిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ప్రశాంతంగా పూజలు.. నమాజ్
ధార్: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల–కమాల్ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణంలోని ఒక ప్రాంతంలో హిందువులు వసంత పంచమిని పురస్కరించుకుని పూజలు నిర్వహించగా, ముస్లిం మరోచోట నమాజ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి హిందువులు పూజలు మొదలుపెట్టారు. సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. నగర వ్యాప్తంగా 8 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. భోజ్ ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించి, అఖండ పూజను ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, ప్రశాంత వాతావరణానికి భంగం కలగలేదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక్ మిశ్రా తెలిపారు. నగరంలోని ప్రతి వీధిలోనూ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ మయాంక్ అవస్థి చెప్పారు. సామాజిక మాధ్యమ వేదికలపైనా ఓ కన్నేసి ఉంచామన్నారు. 11వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరిరక్షిస్తోంది. 2003లో ఏఎస్ఐ ఇచి్చన ఆదేశాల ప్రకారం భోజ్శాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ముస్లిం ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వసంత పంచమి శుక్రవారం రోజే రావడంతో గురువారం ఇరువర్గాలకు అనుకూలంగా ఉండేలా పూజలు, నమాజ్ చేసుకునేందుకు ఏర్పా ట్లు చేయాలని ఆదేశించడం తెల్సిందే. భవ్య సరస్వతీ ఆలయం నిర్మిస్తాం: వీహెచ్పీ వివాదాస్పద భోజ్శాల సముదాయంలో బ్రహా్మండమైన సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ప్రకటించింది. చట్ట పరమైన ప్రక్రియను పూర్తి చేసుకున్నాక 2034కల్లా ఆలయ నిర్మాణ కలను సాకారం చేస్తామని తెలిపింది. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాత విగ్రహాన్ని తిరిగి తీసుకువచి్చ, ఆ ఆలయంలో ప్రతిíÙ్ఠస్తామని వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన ఆలయం మాదిరిగానే ఇది కూడా ఉంటుందన్నారు. శుక్రవారం ఆయన భోజ్శాలలో జరిగిన సరస్వతీమాత పూజకు హాజరైన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ‘భోజ్శాలలో వాగ్దేవి ఆలయం 1034లో నిర్మితమైంది. ఆలయ ప్రతిష్ట జరిగి ఇప్పటికి 992 ఏళ్లు పూర్తయ్యాయి. 2034కల్లా వెయ్యేళ్లు అవుతాయి. అప్పటి కల్లా చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అయోధ్య రామాలయం మాదిరిగా భవ్య సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించుకోవాలి’అని అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. లండన్ నుంచి వాగ్దేవి విగ్రహాన్ని భారత్కు తిరిగి తేవాలని ఈ సందర్భంగా పలువురు సాధుసంతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ మాదిరిగానే వాగ్దేవి కారిడార్ను ఏర్పాటు చేయాలన్నారు. -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
భోజ్శాలలో పూజలు, నమాజ్కు ఓకే
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల–కమల్ మౌలా సమీదు వద్ద పూజల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి రోజు(శుక్రవారం) హిందువులు అక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల దాకా నమాజ్ చేసుకోవచ్చని సూచించింది. ముస్లిం వర్గం నుంచి నమాజ్లో పాల్గొనేవారి పేర్ల జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయాలని ఆ వర్గాన్ని ఆదేశించింది. భోజ్శాల కాంప్లెక్స్ వద్ద పూజలు, ప్రార్థనలు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించుకుంటామని హిందువులు విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వినతిని మన్నించింది. పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సూచించింది. ‘‘భోజ్శాల కాంపౌండ్లో వద్ద నమాజ్కు ఎంతమంది హాజరవుతారో తెలుసుకొని దాన్నిబట్టి ప్రత్యేక స్థలం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో వారు అక్కడ నమాజ్ చేసుకోవచ్చు. అలాగే హిందువులు సంప్రదాయ పూజలు చేసుకోవడానికి అక్కడ ప్రత్యేక స్థలం కేటాయించాలి. హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు, ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి వీల్లేదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పూజలు, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. సందర్శకులకు ఉచితంగా పాసులు మంజూరు చేసే అంశం పరిశీలించాలి’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏమిటీ భోజ్శాల? 11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇది వాగ్దేవి(సరస్వతి) మందిరంగా కొలుస్తుంటారు. భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఈ కట్టడాన్ని పరిరక్షిస్తోంది. మరోవైపు ముస్లింలకు కూడా ఇది పవిత్రమైనదే. దశాబ్దాల క్రితమే కమల్ మౌలా మసీదుగా ప్రకటించారు. నిత్యం నమాజ్ చేస్తుంటారు. 2003 ఏప్రిల్ 7న ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. భోజ్శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవాలి. ఈసారి వసంత పంచమి శుక్రవారం రావడంతో సందిగ్ధత నెలకొంది. పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లింలు యథాతథంగా నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలంటూ మసీ దు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు భోజ్శాల–కమల్ మౌలా మసీదు వద్ద ఒకేరోజు పూజలు, నమాజ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ముస్లిం వర్గం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు కమల్ మౌలా నమాజ్ ఇంతెజామియా కమిటీ చీఫ్ జులీ్ఫకర్ పఠాన్ చెప్పారు. శుక్రవారం శాంతియుతంగా నమాజ్ చేసుకోవాలని ముస్లింలను కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగి్వజయ్ సింగ్ స్వాగతించారు. ఇది కూడా చదవండి: karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్ -
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
ఇంకెంత ఎండబెడతారు?
న్యూఢిల్లీ: చండీగఢ్లోని ప్రఖ్యాత సుఖ్నా చెరువు దుస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వెలిబుచ్చారు. ‘సుఖ్నా లేక్ కో ఔర్ కిత్నా సుఖావొగే? (ఆ చెరువును ఇంకెంత ఎండబెడతారు?)’ అంటూ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ మాఫియా ఆ చెరువును చెరబట్టిందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. నేతలు, అధికారులు కూడా వారితో చేతులు కలిపి చెరువును సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుఖ్నా చెరువుకు సంబంధించి 1995 నుంచి పెండింగ్లోలో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అడవులు, చెరువులకు సంబంధించిన కేసులు హైకోర్టులకు వెళ్లకుండా నేరుగా ఇలా సుప్రీం గడప తొక్కుతుండటం ఏమిటంటూ విస్మయం వెలిబుచ్చింది. -
మీడియా ముందు పోలీసులేం మాట్లాడాలో నిర్ణయించండి
న్యూఢిల్లీ: విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రజలు, మీడియా సమక్షంలో పోలీసులు ఏ మేరకు ప్రస్తావించాలో, ఏ అంశాలను మాత్రమే వెల్లడించాలో తెలిపే నియమావళిని రూపొందించాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత మూడు నెలల్లోపు ఈ మేరకు నిబంధనావళిని తయారుచేయాలని జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సూచించింది. ఈ మేరకు జనవరి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులోని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న, విచారణ దశలో ఉన్న కేసులపై మీడియా ఎదుట పోలీసులు కీలక విషయాలతోపాటు అనవసర విషయాలనూ ప్రస్తావిస్తున్నారని, ఈ ధోరణికి అడ్డుకట్టవేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కోర్టు సూచనలుచేసింది. ‘‘కోర్టుకు సహాయకుడు(అమికస్ క్యూరీ)గా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కేంద్ర ప్రభుత్వం, విదేశాలు అవలంబిస్తున్న విధానాలకు అనుగుణంగా ‘పోలీస్ మాన్యువల్ ఫర్ మీడియా బ్రీఫింగ్’ను తయారుచేశారు. దీనిని మీరు ఒకసారి పరిశీలించండి. బాగుంటే దీనిని మీరూ అనుసరించండి. లేదంటే కొత్తగా మరోటి తయారుచేసుకోండి. కొత్త మాన్యువల్ను ఆ తర్వాత రెండు వారాల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి’’అని కోర్టు ఆదేశించింది. శంకరనారాయణన్ తయారుచేసిన ఈ 60 పేజీల మాన్యువల్లో నాలుగు భాగాలున్నాయి. దర్యాప్తుకు ఎలాంటి భంగం కల్గించకుండా, నష్టం వాటిల్లకుండా, కీలక అంశాలు బయటకు పొక్కకుండా, క్లుప్తంగా విషయాలను మీడియాకు పోలీసులు చెప్పొచ్చని మాన్యువల్ పేర్కొంది. -
సుప్రీంకోర్టు విచారిస్తుండగా... ఇక్కడ ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఒకే రోజు 40 కుక్కలు చంపారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కుక్కలకు సంబంధించిన కేసులన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నందున ఇక్కడ విచారణ చేపట్టడం సబబు కాదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైదరాబాద్ శివార్లలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లోపల, చుట్టుపక్కల 40 వీధి కుక్కలను సామూహికంగా చంపిన ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది రిషిహాస్రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వర్సిటీ లోపల, వెలుపల కుక్కలను బంధించి చంపుతున్నారు. నందిగామ మండలం తహసీల్దార్, మోడల్లకుడ గ్రామ పంచాయతీ సర్పంచ్, విశ్వవిద్యాలయ అధికారుల ఆదేశాల మేరకు కుక్కలను పట్టుకుని చంపారన్నారు. ఒకేరోజు దాదాపు 40 కుక్కల చంపిన బాధ్యులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేలా నందిగామ ఎస్హెచ్వోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తే, విచారణ జరిపే వరకు కుక్కలను చంపకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా 40 కుక్కలను చంపారనేందుకు సోషల్ మీడియా తప్ప ఇతర ఆధారాలున్నాయా అని జస్టిస్ మొహియుద్దీన్ ప్రశ్నించారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది ఈ మరణాల గురించి తనకు తెలియజేశారని, గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీనిని ధ్రువీకరించారని న్యాయవాది బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిల్లో లేవనెత్తిన సమస్యలు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ‘వీధి కుక్కలకు సంబంధించిన సాధారణ సమస్యల’పరిధిలోకి వస్తాయని పేర్కొంది. పిటిషన్ను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జంతు సంక్షేమ బోర్డును వీలైనంత త్వరగా పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి, చట్టప్రకారం నిర్వహించకుంటే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (ఇండియా) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జంతు సంక్షేమ చట్టాలకు అనుగుణంగా అన్ని పెంపుడు జంతువుల దుకాణాలు, కుక్కల పెంపకం కేంద్రాలను వెంటనే తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బోర్డు మొదట 2019లో ఏర్పాటు చేశారని, దాని పదవీ కాలం 2022లో ముగిసిందన్నారు. చట్టాలు కఠినంగా అమలు కావాలంటే పర్యవేక్షణ కమిటీకి నాయకత్వం వహించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నారు. 2025, జనవరిలో బోర్డుకు అనధికార సభ్యుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ మేరకు చర్యలు చేపట్టలేదన్నారు. జంతు సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని, అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటివరకు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
వివేకా కేసు.. ఇంకో పదేళ్లు పడుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ సమయంలో జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని పాక్షికంగా ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని.. ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదని పిటిషన్ ద్వారా సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు‘‘ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు. ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా?. ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడానికి మరో పదేళ్లు పడుతుంది. సిబీఐ ఈ విషయంలో తన వైఖరి తెలియజేయాలి. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సీబీఐ వైఖరి ఆధారంగా ఈ కేసులో మేము నిర్ణయం తీసుకుంటాం. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి ?. తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్ని అంశాలను మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉంటుంది’’ -
‘తాటాకు చప్పుళ్లకు భయపడం’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హరీష్రావుకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పరిణామంపై హరీష్ రావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెట్టా. సాయంత్రం తొమ్మిదిగంటల సమయంలో హైదరాబాద్లోని నా నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను నా నియోజకవర్గం సిద్ధిపేటలో పలు కార్యాక్రమాల్లో పాల్గొన్నాను. అయినప్పటికీ.. చట్టం మీద గౌరవంతో హైదరాబాద్కు వచ్చా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను. అక్రమాలు, బొగ్గు, భూస్కాం, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ నోటీసులు కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హై కోర్టు, సుప్రీం కోర్టులో కొట్టేశారు. అయినా మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా?’అని ప్రశ్నించారు. -
పండుగలప్పుడు ఛార్జీల పెంపా?
న్యూఢిల్లీ: పండుగల రద్దీని అవకాశంగా తీసుకుని విమాన ప్రయాణ ఛార్జీలను అమాంతంగా పెంచేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చార్జీలను ఆకస్మిక పెంచి విమానయాన సంస్థలు సాగిస్తున్న దోపిడీపై జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా పెంచుతున్న చార్జీలు, అదనపు రుసుములను నియంత్రించడానికి తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మేం ఈ విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటాం. కుంభమేళా, ఇతర పండగల సమయాల్లో ప్రయాణి కులను ఎలా దోచుకుందీ చూశాం. తాజాగా, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్, జోథ్పూర్లకు చార్జీలను ఆకస్మికంగా పెంచేశారు’అని ధర్మాసనం పేర్కొంది. విమాన ప్రయాణ చార్జీల్లో పారదర్శకత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్పై గతేడాది నవంబర్ 17వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం..కేంద్రం, డీజీసీఏ తదితరులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ కోరడంతో ధర్మాసనం తదుపరి విచా రణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు గతంలో 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండగా ప్రైవేట్ విమానయాన సంస్థలు దాన్ని 15 కిలోలకు ఏకపక్షంగా తగ్గించి వేశాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమాన చార్జీలను, ఇతర అదనపు రుసుములను సమీక్షించేందుకు గానీ, గరిష్ట పరిమితిని నిర్ణయించేందుకు గానీ అధికారం ఏ వ్యవస్థకూ లేకపోవడంతో విమానయాన సంస్థలు వివిధ రూపాల్లో ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. -
మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరట
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/తిరుపతి రూరల్: మద్యం అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయనకిచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అదనపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునంటూ సీఐడీ సిట్కి రెండు నెలల గడువునిచ్చింది. ఆ తరువాత ఆ అదనపు కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు మోహిత్కు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వక జాప్యానికి తప్ప.. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. మోహిత్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే నెలల తరబడి సమయం తీసుకున్న ప్రాసిక్యూషన్, ఇప్పుడు అదనంగా మరో రెండు నెలల సమయం కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా ‘ఇంకా పరిశీలించాల్సిన అంశాలు ఉన్నాయి‘ అని చెప్పడం విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘మైదానంలో క్రీడాకారుడు ఎలాగైతే ఆటను సాగదీయాలని చూస్తాడో, ఇక్కడ ప్రాసిక్యూషన్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది.’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కేవలం విచారణను కాలయాపన చేసేందుకే ప్రాసిక్యూషన్ పదేపదే వాయిదాలు, సమయం కోరుతోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలులో సిట్ జాప్యం మద్యం కేసులో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ గత ఏడాది అక్టోబర్ 7న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మోహిత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోహిత్రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్ 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మోహిత్ ముందస్తు బెయిల్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను గత ఏడాది డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఆ రోజున కేసు విచారణకు రాగా, కౌంటర్ దాఖలుకు సిట్ మరో నెల రోజుల సమయం కోరింది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ మరో రెండు నెలల సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మోహిత్రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి ఉత్తుర్వులు జారీ చేసేంత వరకు పొడిగించింది. సిట్ కోరినట్లు కౌంటర్ దాఖలుకు రెండు నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
సుప్రీం కోర్టులో వర్మకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో.. జస్టిస్ యశ్వంత్వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. గతేడాది మార్చిలో.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా యశ్వంత్ వర్మ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక గదిలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఆపై ఈ అంశంపై దర్యాప్తునకు అంతర్గత త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది. లోక్సభ స్పీకర్ జడ్జెస్ (Inquiry) Act, 1968 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చట్టబద్ధం కాదని వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. అయితే.. లోక్సభ సెక్రటేరియట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కమిటీ చట్టబద్ధమేనని కారణాలతో సహా వివరించారు. వాదనలు విన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం జనవరి 8వ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ జస్టిస్ వర్మ పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. -
తెలంగాణ స్పీకర్కు సుప్రీం కోర్టు అల్టిమేటం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. మరో ముగ్గురిని విచారణ జరపాల్పి ఉందని నివేదించారు. ‘‘ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైంది. నాలుగు వారాల సమయం ఇవ్వండి విచారణ పూర్తి చేస్తాం’’ అని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా?. స్పీకర్ వారిని ఇప్పటికీ విచారించడం లేదు. మూడు నెలలకు పైగా గడిచిపోయాయి. ప్రతిసారి విచారణకు గడువు పెంచమని అడుగుతున్నారు’’ అని వాదించారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ తరఫు లాయర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.. ‘‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి. లేకుంటే పరిణామాలు ఉంటాయి’’ అని స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వీ కోరారు. అయితే రెండు వారాల్లోపురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు అల్టిమేటంతో ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
స్పీకర్ కాదన్నారు.. ‘సుప్రీం’ ఏమంటుందో?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి వాళ్ల నుంచి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. శీతాకాల విడిది తర్వాత ఇవాళ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం పిటిషన్ను విచారణ జరపనుంది. ఫిరాయింపుల పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ తరఫు లాయర్లు ఇవాళ్టి విచారణ సందర్భంగా వాదించే అవకాశం ఉంది. -
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది. Will Supreme Court allow euthanasia for man in coma for 13 years? Verdict todayIndia allows passive euthanasia ( withdrawing life support) recognising the right to die with dignity while active euthanasia remains illegal Parents of harsh have sought passive euthanasia from… pic.twitter.com/AfTaaQhrzj— Sneha Mordani (@snehamordani) January 15, 2026 -
ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి
ఢిల్లీ: కోల్కతా ఐప్యాక్ కార్యాలయం ఘటన కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలకు దిగింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని.. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల వినిపించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం దీనిని తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి?. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్లు.. అధికారుల ఫోన్లను లాక్కున్నారు. ఆధారాలను దొంగింలించారు. ఆ సమయంలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆమె వెంట ఉన్నారు. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారు. కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారు. హైకోర్టలో మా తరఫు లాయర్ను వాదించకుండా అడ్డుకున్నారు. కోర్టు హాల్లో ఆయన మైక్ కట్ చేశారు అని సోలిసిటర్ జనరల్ వాదించారు. అయితే..సోదాలు జరిపేందుకు రెండేళ్లు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని కోల్కతా ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఈ హడావిడి ఎందుకు? అని ప్రశ్నించింది. అయితే.. సోలిసిటర్ జనరల్ వాదనలను నిశితంగా విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా? అని వ్యాఖ్యానించింది. ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి. కేసు మొత్తాన్ని సమగ్రంగా విచారణ జరపాలి అని అభిప్రాయపడింది.జనవరి 8వ తేదీన కోల్కతాలోని సాల్ట్లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంతో పాటు ఢిల్లీలోని నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు.. కోల్కతా ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ అంటోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్కు చెందిన ‘ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రై.లి.’కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు. అయితే ఈడీ తమ విధులకు ఆమె ఆటంకాలు కల్పించారని కోర్టును ఆశ్రయించగా.. మరోవైపు బీజేపీ రాజకీయంగానూ విమర్శలకు దిగింది. -
సుప్రీం కోర్టులో విజయ్ సినిమాకు భారీ ఎదురు దెబ్బ
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
Harish Rana: హరీష్ భవిష్యత్తుపై దేశం కళ్లన్నీ సుప్రీం వైపే!
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ ఉపసంహరించాలా? కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా) అనుమతించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సుప్రీం లైఫ్ సపోర్ట్ చికిత్స ఉపసంహరణకు ఆమోదిస్తే.. 2018లో చట్టబద్దత తర్వాత మన దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన మొదటి కేసు ఇది అవుతుంది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. ఆగస్టు 20,2013. రాఖీ పండుగ. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ తన హాస్టల్ నాలుగవ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు.ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైకల్యం ఏర్పడింది. హరీష్కు చికిత్స చేసిన వైద్యుడు మొదట్లో అతను కళ్ళు తెరవలేకపోయాడని, అవయవాలను కదల్చలేకపోయాడని చెప్పాడు. అప్పటి నుండి, హరీష్ శాశ్వతంగా మంచానికే పరిమితమయ్యాడు.ఓ వైపు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్క్లేవ్లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్కు మకాం మార్చారు.రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ హరీష్ ఆరోగ్యం కుదట పడలేదు. దీంతో చేసేది లేక తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా.. జూలై 2024లో కారుణ్య మరణం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు హరీష్ వెంటిలేటర్పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్ (శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్ (ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల అభ్యర్థనను తిరస్కరించింది. నవంబర్ 2024 అప్పటి సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్పై ఆధారపడటం లేదని పేర్కొంది. అయితే, కేంద్రం హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది.డిసెంబర్ 2025 సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం హరీష్కు చికిత్స అందిస్తుంది. ప్రైమరీ, సెకండరీ మెడికల్ బోర్డులు హరీష్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని, కోలుకునే అవకాశం చాలా తక్కువేనని నివేదించాయి. మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్థీవాలా ధర్మాసనం.. ఇది చాలా బాధాకరమైన నివేదిక. హరీష్ను ఇలాగే ఉంచలేం’ అని అన్నారు.తీర్పును నేటికి (జనవరి16,2026) వాయిదా వేశారు. జనవరి 13న న్యాయమూర్తులు హరీష్ తల్లిదండ్రులను కలుసుకుని వారి వేదనను విన్నారు. ఇవాళ హరీష్ కేసులో తీర్పును వెలువరించనుంది. ఇది దేశంలో పాసివ్ యూతనేషియా చరిత్రలో కీలక మలుపు అవుతుంది. -
వీధికుక్కల బెడద తీరేదెలా?
మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు. జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి. వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది. అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు. ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి. -
వేర్వేరు తీర్పులు.. ఎటూ తేలని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17-ఏ
సాక్షి, ఢిల్లీ: అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A' రాజ్యాంగ బద్ధతపై ఎటూ తేలలేదు. ఈ సెక్షన్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వేర్వేరు తీర్పులు ఇచ్చింది. జస్టిస్ విశ్వనాథన్ ఈ సెక్షన్ను సమర్థించగా, జస్టిస్ నాగరత్న దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ అంశాన్ని తగిన బెంచ్కు(స్పెషల్) బదిలీ చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే, ఆ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదు. అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరం. సెక్షన్ 17ఎ రాజ్యాంగబద్దమే. అయితే లోక్ పాల్ లేదంటే లోకాయుక్త అనుమతి ఉండాలి::జస్టిస్ విశ్వనాథన్ సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోంది. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు::జస్టిస్ నాగరత్నసెక్షన్ 17 ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్ గురించి గతంలోనూ విచారణ జరిగింది. అంతెందుకు స్కిల్స్కాం కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపే అంశంలో ఈ సెక్షన్ కీలకంగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. 17A-చట్టం పూర్వాపరాలు…2018 లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17-A అనే కొత్త సెక్షన్ను చేర్చింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే..17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసంది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు లేదు.a) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి(b) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి.(c) నేరము జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి అయితే.. ►ఏసీబీ ట్రాప్తో పాటు సంఘటన స్థలంలోనే నేరం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ►ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగిన సమయంలో సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి. ఈ గడువు మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉంది.చంద్రబాబు కేసులో జరిగింది ఇదే.. స్కిల్ కేసులో నాడు(సెప్టెంబర్ 9, 2023) తనను గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు గనుక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని.. మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను వేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం.. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని చంద్రబాబు కేసులో సీఐడీ వాదించింది కూడా. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందే నేరం జరిగిందని సీనియర్ న్యాయవాది రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదు. అలాగే.. చంద్రబాబు కేసుకు 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి’ అని సుప్రీం కోర్టుకు గుర్తు చేశారు. ఇదిలా ఉండగానే.. ఏపీ సీఐడీ ఈ కేసులో ఆధారాల్లేవని చెప్పడంతో.. ఏసీబీ కోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసిన సంగతి తెలిసిందే. -
సివిల్ దావా వేయండి
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఆర్టీకల్ 32 (రిట్ పిటిషన్) కింద విచారించలేమని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటే అన్ని సాక్ష్యాధారాలతో కూడిన ‘సివిల్ సూట్’దాఖలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్తగా దావా వేసుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ప్రస్తుత పిటిషన్పై విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముగించింది. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఏపీ వాటా 484 టీఎంసీలే.. అంతకు మించి వాడకూడదు: సింఘ్వీ అంతకుముందు సాగిన విచారణలో ఆద్యంతం తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఏపీకి కేటాయించింది 484 టీఎంసీలే. అది వరద నీరైనా సరే అంతకుమించి వాడుకునే హక్కు ఆ రాష్ట్రానికి లేదు. కానీ ఏపీ ప్రభుత్వం 484 టీఎంసీలకు మించి నీటిని మళ్లించుకోవడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బచావత్ అవార్డు 1979–80 ప్రకారం వరద జలాల పేరుతోనైనా సరే దీనికి మించి ఒక్క చుక్క నీటిని మళ్లించినా అది చట్టవిరుద్ధమే. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు, గోదావరి బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధం’అని సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. వాస్తవాలు తేలాల్సిందే: సీజేఐ సింఘ్వీ వాదనలను విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆర్టీకల్ 32 కింద నేరుగా రిట్ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ముడిపడి ఉంది. ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు? ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత? అన్నది తేలాలి. సాక్షులను విచారించాలి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు. మీరు సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గం’అని ధర్మాసనం సూచించింది. అందుకు వీలుగా ప్రస్తుత పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ ‘ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ, జల వివాదం. డిస్మిస్ అనే పదం వాడితే మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందన్నట్లుగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. పిటిషన్ను ఉపసంహరించుకుంటాం.. ‘డిస్పోజ్’చేసినట్లు ఉత్తర్వులివ్వండి’అని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. పిటిషన్ను డిస్మిస్ చేయకుండా ఉపసంహరణకు అనుమతిస్తూ ‘డిస్పోజ్’చేసింది. చట్టప్రకారం తగిన పరిష్కారం కోసం, లేవనెత్తిన అన్ని అభ్యంతరాలతో ‘సివిల్ సూట్’వేసుకునేందుకు తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్లో లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సివిల్ సూట్లోనూ ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది. -
25 ఏళ్లు జైల్లో ఉన్నట్లు ఎలా చెప్పగలిగారు?
న్యూఢిల్లీ: జైలులో 25 ఏళ్లు గడిపినందున విడుదల చేయాలంటూ గ్యాంగ్స్టర్ అబూసలేం పెట్టుకున్న అర్జీపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్నను సంధించింది. వాదనను రుజువు చేసుకున్న పక్షంలో, జైలు నుంచి విముక్తి కలి్పస్తామని అతడికి స్పష్టం చేసింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న అబూ సలేం పోర్చుగల్కు పారిపోయాడు. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం భారత ప్రభుత్వం అతడిని 2005 నవంబర్ 11వ తేదీన తిరిగి తీసుకువచ్చింది. అప్పట్లో పోర్చుగల్ కోర్టు అతడి అప్పగింతకు కొన్ని షరతులను విధించింది. అందులో, అబూ సలేంకు మరణశిక్ష విధించరాదు, జైలు శిక్ష 25 ఏళ్లకు మించరాదనేవి కీలకంగా ఉన్నాయి. తన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, విడుదల చేయాలంటూ అతడు వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 2005 నుంచి జైలులో ఉంటున్నప్పుడు 2026 నాటికి 25 ఏళ్లవుతాయని ఎలా లెక్కగట్టారు? అని ప్రశ్నించింది. పోర్చుగల్లో జైలులో ఉన్న రెండేళ్ల కాలాన్ని, స్రత్పవర్తనకు గాను శిక్ష తగ్గింపులను కలుపుకుంటే 25 ఏళ్లు అవుతాయని సలీం అంటున్నాడని అతడి లాయర్ చెప్పారు. అయితే, టాడా కింద అరెస్టయిన సలేంకు మహారాష్ట్ర చట్టాల ప్రకారం శిక్షాకాలంలో ఎటువంటి తగ్గింపు ఉండదని ధర్మాసనం పేర్కొనగా.. నిబంధనల కాపీని చూపిస్తామని సలేం న్యాయవాది తెలిపారు. సంబంధిత జైలు నిబంధనలతో రెండు వారాల్లోగా పిటిషన్ వేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ముంబైకి చెందిన బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో ప్రత్యేక టాడా కోర్టు సలేంకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ 2015లో తీర్పు ఇవ్వడం గమనార్హం. -
బెంగాల్లో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ఈడీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. -
టీనేజీ బంధాల రక్షణకు... రోమియో–జూలియట్ క్లాజ్
న్యూఢిల్లీ: బాలలను లైంగిక వేధింపుల బారినుంచి కాపాడేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం విచ్చలవిడిగా దురి్వనియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. నిజమైన టీనేజీ ప్రేమ బంధాలను దీని బారినుంచి కాపాడేందుకు చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్ను జోడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు, పోక్సో కేసుల్లో బెయిల్ దశలోనే బాధితుల వైద్యపరమైన వయసు నిర్ధారణకు హైకోర్టులు ఆదేశించజాలవని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం. ‘‘మా తీర్పు తాలూకు కాపీని కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి పంపండి. నిజమైన టీనేజీ ప్రేమలకు రక్షణగా నిలిచేలా పోక్సో చట్టానికి రోమియో–జూలియట్ క్లాజ్ను చేర్చడమే గాక ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకోజూసే వారిని శిక్షించే ఏర్పాటు కూడా చేయాల్సిందిగా సూచించండి’’అని సుప్రీంకోర్టు రిజి్రస్టార్ను ఆదేశించింది. ఓ మైనర్ రేప్ కేసులో నిందితునికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. -
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వాదనలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉన్నాయని అభివర్ణించింది.ప్రజా ప్రదేశాలలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు ఉత్తమమైన విధానం కాకపోవచ్చని షర్మిలా వాదించారు. తన వాదనలకు మద్దతుగా ఠాగూర్ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చారు. వాస్తవదూరంగా ఆలోచిస్తున్నారు : సుప్రీంకొన్నేళ్లుగా ఎయిమ్స్లో స్నేహపూర్వకంగా ఉంటున్న కుక్క 'గోల్డీ' గురించి ఉదాహరించారు. కొన్ని కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అయితే దూకుడుగా ప్రవర్తించే వాటిని ముందుగా ఒక కమిటీ గుర్తించాల్సి ఉంటుందని, కుక్కల ప్రవర్తనను పరిశీలించేందుకు కమిటీ ఉండాలని, దూకుడుగా ఉండే కుక్కలకు, సాధారణ కుక్కలకు మధ్య తేడాను చూడాలంటూ షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అలాగే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి సైన్స్ మనస్తత్వశాస్త్రం సహాయం అవసరమని ఠాగూర్ తన పిటిషన్లో అన్నారు. ABC నియమాలు ఫూల్ప్రూఫ్ కాకపోవచ్చు, కాబట్టి దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదించారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు ఒక్కొక్కటిగా ఖండించింది.ఆసుపత్రులలో కుక్కల్ని కీర్తించడానికి ప్రయత్నించవద్దు అంటూ సుప్రీం గట్టిగానే వాదించింది. ఆ కుక్కను ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకు వెళ్తున్నామా? వీధుల్లో తిరిగే ఏ కుక్కకైనా పేలు ఉంటాయి. అలాంటి వాటిని థియేటర్లలోకి అనుమతిస్తే ఇన్ఫెక్షన్లు, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు అర్థమవుతోందా? మీవాదనల వెనుకున్న వాస్తవికత ఏమిటో మే మీకు తెలియజేస్తాంఅంటూ మండిపడింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!చెవులకు రంగులుమరోవైపు ప్రజలను కరిచిన కుక్కలను గుర్తించడానికి కాలర్ల (చెవులకు)కు రంగులు వేయాలని ఠాగూర్ తరపు న్యాయవాది సూచించారు. జార్జియా అర్మేనియా వంటి దేశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సూచనపైనా కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశాల జనాభా ఎంత? సుప్రీంకోర్టు ఆ వాదనను కూడా కొట్టిపారేసింది.సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కల్పించుకుని కమిటీలో నిపుణులు లేకుండా వచ్చిన ఆరావళి విషయంలో వచ్చిన తీర్పు ఉదహరించారు.. "న్యాయ జోక్యం అనేది ఖాళీలు ఉన్న అంతరాలలో మాత్రమే తప్ప, శాసనసభ ఉద్దేశపూర్వకంగా చట్టం చేయకూడద’’ని అనుకున్న విషయాల్లో కాదన్నారు.ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?దాడిచేసే వారి మీద కేసు పెట్టుకోండికుక్కలకు ఆహారాన్నదిస్తున్న మహిళలపై దాడులు, దుర్భాషలాడుతున్న వారి గురించి సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి లేవనెత్తినప్పుడు, కూడా సుప్రీం ఇదే వ్యాఖ్యాచేసింది. ప్రజలు ఎవర్నైనా, ఎలా అయినా అవమానించవచ్చు. మమ్మల్ని కూడా అంటున్నారు. అలాంటి వాళ్లమీద చర్య తీసుకోండని సూచించింది. ఫీడర్ వ్యతిరేక విజిలెంట్స్" మహిళలపై దాడి చేస్తున్నారని, అధికారులు దాని గురించి మౌనంగా ఉన్నారని పావని ఆరోపించారు. ఇలాదేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. హర్యానాలో, సొసైటీలు బౌన్సర్లను నియమించుకుని మరీ దాడిచేస్తున్నాయన్నారు. దీనికి వీధి కుక్కల సమస్యలతో సంబంధం లేదని సుప్రీం స్పష్టం చేసింది. స్ట్రీట్ డాగ్స్ అంశంపై, సూచనలు ఉంటే, ఇవ్వవచ్చు అని చెబుతూ మహిళలపై దాడి చేస్తున్నవారిపై FIR దాఖలు చేయండి. హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు పేర్కొంది.వీధుల నుండి ప్రతి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు చికిత్స చేయాలని ఆదేశించిందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసెస్నుంచి కుక్కల్ని తొలగించడం వల్ల ప్రభుత్వానికి రూ.26,800 కోట్ల వరకు ఖర్చవుతుందని సుప్రీంకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
రాజ్యసభ చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ వ్యవహరించకూడదా?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి లేనప్పుడు ఆయన విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తుండగా రాజ్యసభ చైర్మన్ లేని వేళ ఆయన అధికారాలను డిప్యూటీ చైర్మన్ ఎందుకు చలాయించరాదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మల ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. తనపై వచి్చన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపే అధికారం పార్లమెంటరీ కమిటీకి లేదని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. న్యాయమూర్తు(విచారణ)చట్టం–1968 ప్రకా రం.. స్పీకర్కు లేదా రాజ్యసభ చైర్మన్కు మాత్రమే న్యాయమూర్తిపై ప్రవేశపెట్టే తీర్మానాన్ని తిరస్కరించే– అనుమతించే అధికారం ఉంటుందని జస్టిస్ వర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉండగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడటం తీవ్ర సంచలనం రేపింది. ఈ పరిణామం అనంతరం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ వర్మ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రొహత్గి, సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. చైర్మన్ లేని సమయంలో, ఆయనకున్న విచక్షణాధికారాలను డిప్యూటీ చైర్మన్ చలాయించలేరన్నారు. వాదనలు విన్న ధర్మాసనం అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత పక్షాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కాలుష్యం కోరలు తీసేదెలా?
సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్లూ, సల్ఫేట్లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి. నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు. అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి. ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది. సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి. -
అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు
-
మగవాళ్ల మూడ్.. నటి వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం. వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్వుడ్ క్వీన్గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
‘దర్యాప్తు జరగాల్సిందే.. ఎఫ్ఐఆర్లు కొట్టేయడం కుదరదు’
సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని గంపగుత్తగా ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్లపై ఆరు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కోరింది.అలాగే, ప్రతివాదులను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లపై, పెండింగ్లో ఉన్న దర్యాప్తులపై ఎలాంటి పిటిషన్లను హైకోర్టు స్వీకరించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చట్టాలను మార్చకుంటే పాత చట్టాలు అమల్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధక చట్టం కింద పలువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. -
కుక్కల కంటే పిలుల్ని పెంచుకోండి
సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల కేసు విచారణ ఇవాళ ఎటు నుంచి ఎటో పోయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో పిల్లుల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వీధుల్లోని అన్ని కుక్కలను తరలించమని తాము ఆదేశించలేదని.. కేవలం సంస్థలు, కార్యాలయాల నుండి మాత్రమే తరలించమన్నామని స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ‘‘కుక్కలను పెంచుకునే కంటే పిల్లుల్ని పెంచుకోండి. ఎలుకల్ని నియంత్రించడంలో పిల్లులు సహాయ పడుతాయి. కాబట్టి కుక్కలను పెంచే కంటే పిల్లులను పెంచుకోవడానికి ప్రోత్సహించాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే.. వీధి కుక్కల తొలగింపు విషయంలో నియమాలను పాటించాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.విచారణలో భాగంగా.. పట్టణాల్లో జంతువుల నియంత్రణ అంశంపై వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్(యానిమల వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తరఫున) కుక్కల అంశంతో పాటు ఎలుకలు, పిల్లుల గురించి ప్రస్తావించారు. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రువులు. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే.. పిల్లుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడవి ఎలుకలను తింటాయి కదా” అని జస్టిస్ మెహతా సరదాగా వ్యాఖ్యానించారు. వీధి కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సుమోటో విచారణ కొనసాగుతోంది. సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదిస్తూ.. ఏబీసీ (Animal Birth Control) నియమాలు అమలు చేయడం.. స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడం.. సరైందని వాదించారు. పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.సీనియర్ అడ్వకేట్ కృష్ణన్ వేణుగోపాల్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ABC అమలు చేయడానికి రూ.1,600 కోట్లు అవసరమని, ఐదు మంత్రిత్వ శాఖలు కలసి పని చేయాలని సూచించారు. అయితే.. ప్రస్తుతం కేవలం 66 ABC కేంద్రాలు మాత్రమే ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 5.2 కోట్ల వీధికుక్కలన్నాయనే అంచనాలున్నాయని, అదే సమయంలో వెటర్నరీ డాక్టర్లకు పెద్ద స్థాయిలో శిక్షణ అవసరమని పేర్కొన్నారు.బీజేపీ నేత విజయ్ గోయల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ABC నియమాలు కుక్కల జనాభాను తగ్గించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. హింసాత్మక కుక్క(violent dog) అనే పదానికి నిర్వచనం స్పష్టంగా లేదని, ఢిల్లీలో ఒకే కుక్క వరుసగా ముగ్గురిని కరిచిన ఉదాహరణను చూపించారు. తమ హెల్ప్లైన్కు ఇప్పటివరకు 20,000 పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.కోర్టు ఆందోళనదేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి అని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. - మున్సిపల్ సంస్థలు, స్థానిక సంస్థలు ABC నియమాలను సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వీధుల్లో జంతువుల ఉనికి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోందని గమనించినట్లు తెలిపింది. తదుపరి వాదనలు రేపు కూడా జరగనున్నాయి. -
5.25 కోట్ల కుక్కలు, రోజుకు రూ. 61.81 కోట్లు
న్యూఢిల్లీ: వీధికుక్కల అంశంలో వ్యతిరేక, అనుకూల వాదనలతో దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారిస్తోంది. విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం జాతీయ రహదారులపై కలిగే భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావించింది. ఈ సందర్భంంగా సీనియర్ న్యాయవాది, NALSAR హైదరాబాద్ తరపున వాదించిన KK వేణుగోపాల్ కీలక వ్యాఖలు చేశారు. యూనివర్శిటీ జంతు న్యాయ కేంద్రం జంతు సంరక్షణలో మాస్టర్స్ కోర్సు , PG డిప్లొమాను నిర్వహిస్తుందని, హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కలిగి ఉందని కోర్టుకు తెలిపారు. అతని బృందం దేశవ్యాప్తంగా కుక్కల జనాభా, ఆశ్రయ అవసరాలతో సహా గతంలో సమర్పించని గణాంకాలను వెలికితీసింది, మౌలిక సదుపాయాలు మరియు నిధులలో అంతరాలను ప్రస్తావించారు.నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలిచట్టబద్ధమైన నియమాలను సవరించే వరకు లేదా పక్కన పెట్టే వరకు, సుప్రీంకోర్టు వాటిని విస్మరించలేదని వేణుగోపాల్ నొక్కిచెప్పారు. దీర్ఘకాలంగా ఉన్న పద్ధతులను మార్చే ముందు నిపుణుల సలహా అవసర మన్నారు. ABC నియమాలు, ఇతర చట్టబద్ధ నియమాలను పాటించడం ప్రాధాన్యంగా ఉండాలన్నారు.ఈ విషయంలో కోర్టుకు మార్గనిర్దేశం చేయడానికి విజయవంతమైన రాష్ట్రాల నుండి పశుసంవర్ధక శాఖల అధిపతులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని వేణుగోపాల్ సమర్పించారు. ప్రస్తుత చట్టం ప్రకారం వీధి కుక్కలను వాటి అసలు స్థానాలకు తిరిగి ఇవ్వాలని, మరియు అదే స్థలంలో విడుదల చేయడాన్ని నిరోధించే ప్రస్తుత ఉత్తర్వు చట్టబద్ధమైన నియమాలను ఉల్లంఘిస్తుందని ఆయన వాదించారు.వేణుగోపాల్ పాఠశాలల్లోని సదుపాయల లేమిని వేణుగోపాల్ ఎత్తిచూపారు, 194,412 పాఠశాలల్లో విద్యుత్, సరైన మరుగుదొడ్లు , తాగునీరు లాంటి కనీససౌకర్యాలు లేవని నివేదించారు. కుక్కలను నిరోధించేందుకు కంచెలు నిర్మించమని వీటిని కోరడం అవాస్తవికమని ఆయన వాదించారు. సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుక్కల నిర్వహణ ప్రోటోకాల్లను అమలు చేయడంలో ఉన్న సవాళ్లకు ఇది నిదర్శనమన్నారు.5.25 కోట్ల వీధి కుక్కలుభారతదేశంలో దాదాపు 5.25 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వేణుగోపాల్ ధర్మాసనానికి తెలియజేశారు. ఒక్కో సౌకర్యానికి 200 కుక్కల చొప్పున వాటిని ఉంచడానికి, 77,347 షెల్టర్లు అవసరమవుతాయి, ఒక్కొక్కటి ఒక్కో కుక్కకు 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఒక కుక్కకు ఆహారం ఇవ్వడానికి రోజుకు రూ.40 ఖర్చవుతుందని, అంటే 1.54 కోట్ల కుక్కలకు ఆహారం ఇవ్వడానికి రోజుకు రూ.61.81 కోట్లు అవసరమవుతుందని, ఇది సమస్య యొక్క స్థాయిని వివరిస్తుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కుక్క కరిచే మూడ్లో ఉందని ఎలా తెలుస్తుంది : సుప్రీంకోర్టు -
కుక్క కరిచే మూడ్లో ఉందని ఎలా తెలుస్తుంది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వీధి శునకాలకు సంబంధించిన విచారణలో సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ సమస్య కుక్క కాటుకు మాత్రమే పరిమితం కాదని ధర్మాసనం పేర్కొంది. సైకిళ్ళు , మోటార్ సైకిళ్లపై ప్రజలను వెంబడించే కుక్కలు సమానంగా ప్రమాదకరమని , తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొంది. వీధి కుక్కలను తొలగించడంపై అభ్యంతరంపై బెంచ్ స్పష్టత కోరింది. ఈ అంశాన్ని మరింత నొక్కి చెబుతూ, సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించడంలో ఉన్న వ్యతిరేకతను వివరించాలని బెంచ్ న్యాయవాదిని కోరింది. కుక్క కరిచే మూడ్లో ఉన్నప్పుడు దాని మనసులో ఏముందో మనం చదవలేం కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకేనివారణే ఉత్తమమైన మార్గమని, అయితే కుక్కలను కాల్చి చంపాలని సూచించడం లేదని, వాటిని ఆశ్రయాలకు మార్చాలని బెంచ్ నొక్కి చెప్పింది. మున్సిపల్ సంస్థలు జంతు జనన నియంత్రణ నియమాలను కఠినంగా అమలు చేయడం వల్ల పర్యవేక్షణతో క్రమంగా సంఖ్యలు తగ్గుతాయని కూడా పేర్కొంది. లక్షలాది కుక్కలకు ఆహారం ఇవ్వడం యొక్క సాధ్యాసాధ్యాలను బెంచ్ ప్రశ్నించింది.అలాగే ABC (యానిమల్ బర్త్ కంట్రోల్) నియమాలు , చట్టాలను పాటించేలా చూడటం కోర్టు పాత్ర అనిజస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. పాటించని రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.దీనిపై తన వాదనను వినిపిస్తూ కుక్కలను తొలగించడం వల్ల పట్టణ సమస్యలు మరింత తీవ్రమవుతాయని, భారతదేశం వంటి దేశంలో చెత్త డంపింగ్, మురికివాడలు విస్తృతంగా ఉన్న చోట, వీధి కుక్కలను తొలగించడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమవుతాయని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హెచ్చరించారు. పట్టణ పర్యావరణ వ్యవస్థలలో కుక్కలు పాత్ర పోషిస్తాయని మరియు ఆకస్మిక తొలగింపు ఊహించని పరిణామాలను సృష్టించవచ్చని ఆయన వాదించారు ABC, CSVR (వంధ్యీకరణ–టీకాలు వేయడం,విడిచిపెట్టడం) లాంటి చర్యల ద్వారా వీటి సంఖ్యన పరిమితం చేయవచ్చని కూడా సిబల్ ప్రతిపాదించారు. దీన్ని విజయవంతంగా పరీక్షించారనీ, కుక్కల్ని నిర్మూలించడం కాకుండా, వాటి జనాభాను నియంత్రించాలన్నారు. అలాగే వీధి కుక్కలను షెల్టర్లలోకి మార్చడం శారీరకంగా అసాధ్యం, ఆర్థికంగా అసాధ్యమైనదని సిబల్ సుప్రీంకు తెలిపారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి శాస్త్రవేత్తలు మరియు డొమైన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సిబల్ సుప్రీంకోర్టును కోరారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.కాగా తమ వద్ద విచారణలో ఉన్న కేసుకు అనుబంధంగా కుప్పలుతెప్పలుగా అనుబంధ పిటిషన్లు, దరఖాస్తులు వచ్చిపడుతున్నాయని సుప్రీం వెల్లడించింది. సాధారణంగా చూస్తే మనుషులకు సంబంధించిన ఏ కేసులో కూడా ఇన్ని అప్లికేషన్లు రాలేదేమో. కుక్కల విషయంలో పిటిషన్లు పోటెత్తు తున్నాయి. ఇలాంటి అప్లికేషన్లు బుధవారం కూడా వస్తాయేమో. అన్నీ కలిపి బుధవారమే కేసును విచారిస్తాం’’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీధి శునకాలకు సంబంధించిన కేసును జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం విచారిస్తోంది. -
పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్ఓ) పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నెలవారీ వేతనం రూ.15 వేలకు మించిన వారికి పీఎఫ్ పథకం వర్తించదన్నది తెలిసిందే. దీన్ని గత 11 ఏళ్లుగా సవరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ నవీన్ ప్రకాశ్ నౌటియాల్ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెలవారీ వేతనం 15 వేలకు మించితే పీఎఫ్ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతన మొత్తమే రూ.15 వేలకు మించి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 15 వేల పరిమితి వల్ల పీఎఫ్ పథకం తాలూకు సామా జిక సంక్షేమ ఫలాలు చాలామంది అర్హులైన చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో, పీఎఫ్ వేతన పరిమితి పెంపుపై 4 నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయ మూ ర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ధర్మాసనం సోమ వారం తీర్పు వెలువరించింది. తమ తీర్పు కాపీని జత పరు స్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి విన తిపత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్కు సూచించింది.ఉపసంఘమే చెప్పినా: పీఎఫ్ పథకం లబ్ధిదారుల గరిష్ట వేతన పరిమితి పెంపుపై నిర్దిష్ట నియమ నిబంధనలేవీ లేవు. దాంతో దాని సవరణ విషయంలో ఒక క్రమమంటూ లేకుండా పోయింది. ఒకసారి 12 ఏళ్లకు, మరోసారి 13, 14 ఏళ్లకు గరిష్ట వేతన పరిమితిని సవరించారు. పైగా ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం, ఆర్థిక సూచనలను కూడా పెద్దగా పరిగణనలోకి తీసు కోవడం లేదన్నది సామాజిక కార్యకర్తల ఆరోప ణ. దీనివల్ల అర్హులైన చిరుద్యోగులెందరో పీఎఫ్ పథకం ఫలాలకు దూరమవుతున్నారని నౌటియాల్ తన పిటిషన్లో ఆవేదన వెలిబుచ్చారు. -
ఖలీద్, ఇమామ్లకు నో బెయిల్
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇచ్చేది లేదని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ వీఎన్ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాము లుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్ల బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్ పిటిషన్ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ ఇస్తున్నాం’’ అని సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. 11 షరతులు విధించిన కోర్టుఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్పోర్ట్లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్ మార్గ్ పోలీస్స్టేషన్కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్ నంబర్, ఈమెయిల్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.వీళ్లది కీలక పాత్ర..‘‘ ఉమర్ ఖలీద్, ఇమామ్లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్యూ వాట్సాప్ గ్రూప్ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్ 13వ తేదీన ఖలీద్ను అరెస్ట్చేశారు. ఈ కేసులో బెయిల్ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా గత ఏడాది డిసెంబర్లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువర్చింది. సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్లు తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.అదృష్టం లేదంతే బెయిల్ తిరస్కృతిపై ఖలీద్ తండ్రి ఆవేదన న్యూఢిల్లీ: ఉమర్ ఖలీద్కు బెయిల్ రాకపోవడంపై అతని తండ్రి ఎస్క్యూఆర్ లియాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ తీర్పు కాపీ అందరికీ అందుబాటులోనే ఉంది. దీనిపై నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఖలీద్ విషయంలో మాకు అదృష్టం లేదంతే. ఇది నిజంగా దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. ఇకపై ఇదే నా కొత్త జీవితం.. తీర్పుపై ఖలీద్ సహచరిణి బానోజ్యోత్స్న లాహిరి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అతనికి బెయిల్ రాకపోయినా తన తోటి వాళ్లు బెయిల్పై విడుదల అవుతున్నందుకు ఖలీద్ సంతోషం వ్యక్తం చేశాడని బానోజ్యోత్స్న వెల్లడించారు. ‘‘ బెయిల్ కనీసం వాళ్లకయినా వచి్చందికదా. సంతోషం. నాకెంతో తృప్తిగా ఉంది’’ అని ఖలీద్ అన్నారు. దీనికి స్పందనగా ‘‘ నేను రేపు వచ్చి జైలులో నీతో ములాఖత్ అవుతాను’’ అని జ్యోత్స్న సమాధానం ఇచ్చారు. దీనికి స్పందనగా ఖలీద్ ‘‘ మంచి పని. వచ్చేసెయ్. ఇకపై ఇదే నా కొత్త జీవితం’’ అని వ్యాఖ్యానించాడు. ఆయనకు 15 సార్లు ఎలా?ఉమర్ ఖలీద్, ఇమామ్ల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు వెలువ ర్చిన తీర్పుపై విపక్ష నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పె ట్టారు. ‘‘ వీలైనంత వరకు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకే చూడాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి అనే సూత్రం అందరికీ ఒకేలా వర్తించబోదని నేడు సుప్రీం తీర్పుతో అర్థమైంది. ఈ కేసులో విచారణ ఇంకా మొదలుకాలేదు. అయినాసరే కఠిన ఉపా చట్టం కింద ఉమర్ఖలీద్ను ఐదేళ్లుగా కారాగార చీకటికొట్టంలో పడేశారు. ఇది విచారణకు ముందే జైలుశిక్ష అమలుచేయడం కాదా?. మహిళా భక్తులపై రేప్, హత్య కేసులో 2017లోనే 20 ఏళ్ల శిక్షపడిన డేరాసచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్కు మరోసారి తాత్కాలిక జైలుశిక్ష నిలుపుదల(పెరోల్) అవకాశం కల్పించారు. ఇప్పటికి ఆయన ఇలా 15 సార్లు పెరోల్మీద బయటికొచ్చాడు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా. ఒకరు(ఖలీద్) నిరవధికంగా జైళ్లో మగ్గిపోతుంటే మరొకరు(గుర్మీత్ బాబా) బయట డిమాండ్కు తగ్గట్లు ఎప్పటికప్పుడు జైలు నుంచి సెలవుల మీద విడుదలై సంతోషంగా గడుపుతున్నారు’’ అని జాన్ బ్రిటాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీర్పును బీజేపీ స్వాగతించింది. సత్యమేవ జయతే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం తీర్పుపై సంతోషం వ్యక్తంచేశారు. -
మధ్యవర్తిత్వమే మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు. మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం. ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు పరిష్కార మార్గాలు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. -
ఢిల్లీ అల్లర్ల కేసులో ‘సుప్రీం’ కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులు, విద్యార్థి సంఘాల నేతలు ఉమర్ ఖాలీద్, శార్జీల్ ఇమామ్కు బెయిల్ తిరస్కరించింది. అలాగే.. మరికొందరికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు తీర్పు ఇచ్చారు.ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర పన్నారని ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్లపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ట్రయల్ ఆలస్యం బెయిల్ ఇచ్చేందుకు ఆధారం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జాతీయ భద్రత అంశంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో నిందితుల బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని నిర్ణయించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహమ్మద్ షకీల్ఖాన్, షాబాద్ అహ్మద్లకు మాత్రమే ఊరట లభించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖాలీద్, ఇమామ్ల విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని.. అల్లర్లలో వీళ్లిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్లిద్దరూ ఏడాది తర్వాతే బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. అల్లర్ల నేపథ్యం..కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లను UAPA (Unlawful Activities Prevention Act) కింద అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దీర్ఘకాలిక కస్టడీ.. విచారణ ఆలస్యం, ట్రయల్ ప్రారంభం కాని పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావిస్తూ బెయిల్ కోరగా.. అల్లర్లకు ప్రణాళికాబద్ధంగా సహకరించారని, ఇది దేశ భద్రతకు ముప్పు అని పోలీసులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్కు షాక్
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి హరీష్రావు పాత్రను విచారించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారి రాధా కిషన్ రావు తన ఫోన్ టాప్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. దానిని కొట్టేయాలని హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పూ ఇచ్చింది. ఆ వెంటనే.. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం పిటిషన్ ఆ పిటిషన్ను కొట్టేసింది. అయితే హరీష్రావుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం సరికాదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరోసారి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అయితే.. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పులో జోక్యానికి జస్టిస్ బీవీ నాగరత్న నిరాకరించారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను ఆమె కొట్టేశారు.నవీన్రావును కలవనున్న హరీష్!ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావును సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఆ పార్టీ నేతలతో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నవీన్రావు వాంగ్మూలం ఆధారంగా కీలక వ్యక్తులను విచారించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ నవీన్రావుతో హరీష్రావు భేటీ అవుతారని, విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటారని తెలుస్తోంది. -
అవసరంలో ఉన్నవారికి న్యాయం అందాలి
పట్నా: న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయం కోరి వచ్చినవారి పట్ల దయతో మెలగాలని అన్నారు. సమాజం మెరుగుపడాలంటే అవసరంలో ఉన్నవారికి కచ్చితంగా న్యాయం అందాలని స్పష్టంచేశారు. అవసరార్థుల పట్ల న్యాయ వ్యవస్థ మొగ్గుచూపాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. యువ న్యాయవాదులు కెరీర్ను నిర్మించుకొనే క్రమంలో సున్నితత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని పేర్కొ న్నారు. పూర్తిగా పనికి బానిసగా మారితేనే వృత్తిలో విజయం సాధిస్తామని చాలామంది యువ లాయర్లు నమ్ముతుంటారని తెలిపారు. చేసే పనే జీవితంగా మారిపోతే ఇతరుల సహానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. న్యాయం కోసం వచ్చిన కక్షిదారులకు దయతో సేవ చేయడమే పరిమావధి కావాలని న్యాయ వాదులకు కావాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. న్యాయం చేకూర్చడం పవిత్రమైన బాధ్యత ‘‘న్యాయం అనేది న్యాయాన్ని పొందగలిగే ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే కాకుండా.. న్యాయం తప్పనిసరిగా అవసరమైన వారికి కూడా సులువుగా అందాలి. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి న్యాయవాదులు తమ శక్తియుక్తులు, నైపుణ్యాలు ఉపయోగించాలి. అదొక పవిత్రమైన బాధ్యత. ఇక్కడ నేర్చుకున్న న్యాయశాస్త్రాన్ని ప్రజలు మేలు చేసేలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో న్యాయం దక్కడం లేదు. అలాంటివారి కోసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఎవరికి న్యాయం అవసరమో వారికి న్యాయం అందించడం కర్తవ్యం కావాలి. లిటిగేషన్, ప్రజాసేవ, విద్యా రంగం, జ్యుడీషియల్ సర్వీసు.. ఇలా ఏ మార్గంలో నడిచినా సరే న్యాయ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసం పెంచేలా చిత్తశుద్ధితో పని చేయాలి. గొంతు విప్పలేని అసహా యకులకు గొంతుకగా మారడానికి నైపు ణ్యాలు ఉపయోగిస్తే వారి గౌరవాన్ని కూడా పెంచినట్లు అవుతుంది. చదుకున్న చదు వుకు సార్థకత లభిస్తుంది’’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పట్నా హైకోర్టు ప్రాంగణంలో ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జస్టిస్సూర్యకాంత్ పునాది రాయి వేశారు. ఇందులో ఆడిటోరియం, ఐటీ బిల్డింగ్, పరిపాలన భవనం, బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఆసుపత్రి వంటివి ఉన్నాయి.సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి దేశంలో సైబర్నేరాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ శనివారం పట్నా శివారులోని పొతాహీలో బిహార్ జ్యుడీషియల్ అకాడమీ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిజిటల్ అరెస్టు గురించి గతంలో ఎప్పుడూ వినలేదని, ప్రస్తుతం అలాంటి చూడాల్సి వస్తోందని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి, సొమ్ము లూటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నారు. సైబర్ నేరాల కారణంగా మన దేశంలో జనం వేలాది కోట్ల రూపాయలు కోల్పోవడం తనకు షాక్కు గురి చేసిందని చెప్పారు. వృద్ధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆధునిక కాలంలో కొత్త కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలని, అందుకోసం శిక్షణ పొందాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
ఉరితీసే దాకా విశ్రమించం: బాధితురాలు
ఉన్నావ్: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. -
ఆరావళి ‘ఎత్తు’ వివాదంలో కీలక మలుపు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు. అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది. అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.స్వాగతించిన పర్యావరణ నిపుణులుగత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..
-
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై నాలుగు వారాల్లో బదులు ఇవ్వాలని సెంగార్ను అందులో కోర్టు ఆదేశించింది. ‘‘ఈ కేసులో జీవిత ఖైదు పడ్డ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు. ఓ కానిస్టేబుల్ పబ్లిక సర్వెంట్ అయినప్పుడు.. ఓ ఎమ్మెల్యే మాత్రం కాదా?.. ఈ కేసులో ఆ బెయిల్ ఇచ్చింది కూడా ఉత్తమ జడ్జీలే. మేం కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం కదా. ఇంతకీ ఎవరు పబ్లిక్ సర్వెంట్లు?’’ అంటూ సెంగార్ తరపు వాదించిన లాయర్లు సిద్ధార్థ దవే, హరిహరన్లను జస్టిస్ సూర్యకాంత ప్రశ్నించారు. ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి బీజేపీ నేత కుల్దీప్ సెంగర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేలాడు. అయితే ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులను ఆశ్రయించినా.. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో బాధితురాలు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఈ కేసు.. హైప్రొఫైల్ కేసుగా గుర్తింపు దక్కించుకుంది. అయితే కేసు దర్యాప్తులో ఉండగానే.. బాధితురాలి తండ్రి సెంగార్ మనుషుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆపై ఆమె అనూహ్యంగా ప్రమాదానికి గురికాగా.. సురక్షితంగా బయటపడింది. అయితే ఆమె ఇద్దరి బంధువులు మాత్రం ప్రమాదంలో మరణించారు. ఈ యాక్సిడెంట్ కూడా సెంగార్ జరిపించాడనే అభియోగాలు నమోదు అయ్యాయి. 2018లో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు విచారణ యూపీ ట్రయల్ కోర్టు ఢిల్లీ కోర్టుకు మారింది. 2019 డిసెంబర్లో దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. అయితే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. సెంగార్కు పోక్సో చట్టం వర్తించదని చెబుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే.. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలాయి. బాధిత కుటుంబం దేశరాజధానిలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అదే సమయంలో.. యూపీ ఎన్నికల నేపథ్యంలో సెంగార్ కమ్యూనిటీ ఓట్ల కోసమే ఆయన్ని విడిపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విమర్శలు తలెత్తారు. ఈ పరిణామాల నడుమ.. సీబీఐతో పాటు బాధితురాలి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. -
ఉన్నావ్ కేసు.. విచారణ వేళ ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరగనుంది. ఈ కేసులో దోషిగా తేలిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.ఈ బెయిల్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిని కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో సెంగార్కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోతున్నారు. బాధితురాలి భద్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో సెంగార్ తరఫు వాదనలు ఎలా ఉండనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది.


