మొసలి కన్నీళ్లు వద్దు  | SC Rejects MP Minister Apology For Communal Remarks Against Col Sofiya Quresh, More Details Inside | Sakshi

మొసలి కన్నీళ్లు వద్దు 

May 20 2025 5:44 AM | Updated on May 20 2025 11:10 AM

SC rejects MP minister apology for communal remarks against Col Sofiya Qureshi

మీ వ్యాఖ్యలతో దేశమంతా సిగ్గుపడుతోంది

మీరు కూడా ఇప్పటికైనా కనీసం సిగ్గుపడండి

బీజేపీ మంత్రి విజయ్‌ షాపై సుప్రీం ఆగ్రహం

మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా చెప్పరా?

కల్నల్‌ ఖురేషీపై వ్యాఖ్యల కేసులో ధ్వజం

ఇంకా దారుణ వ్యాఖ్యలు చేయబోయారు

సమయానికి పదాలు దొరక్క ఆగారంతే

మీలాంటి వాళ్లను ఏం చేయాలో తెలుసు

తీవ్రంగా మండిపడ్డ జస్టిస్‌ సూర్యకాంత్‌

ప్రత్యేక సిట్‌తో దర్యాప్తుకు ఆదేశాలు

న్యూఢిల్లీ: కల్నల్‌ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్‌ విజయ్‌ షా క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘‘న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. మీ క్షమాపణ అలాగే ఉంది. హైకోర్టులో మీరు క్షమాపణలు చెప్పిన వీడియో చూశాం. ఏదో కోర్టు అడిగింది కదా అని చెబుతున్నట్లుగా ఉంది. 

సూటిగా తప్పు ఒప్పుకుంటూ నేరుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. కానీ మీరేం చేశారు? అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటివల్ల ఎవరైనా బాధ పడి ఉంటే అంటూ నానా వంకలూ తిప్పారు. ఇదెక్కడి క్షమాపణ? తప్పు ఒప్పుకునే పద్ధతేనా ఇది? ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు’’ అంటూ తూర్పార బట్టింది. ‘‘నిజాయితీగా, మన స్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? మీ వ్యాఖ్యలతో యావత్‌ దేశం సిగ్గుపడుతోంది’’ అంటూ తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో మంత్రిని అత్యున్నత న్యాయస్థానం గత వారమే తీవ్రంగా మందలించడం, కల్నల్‌ ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించడం తెలిసిందే. 

ఆ మేరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో మంత్రి క్షమాపణలు చెప్పారు. తనపై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌‎పై న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌‎ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి మొసలి కన్నీళ్లు వద్దు. కనుక మీ క్షమాపణలు అవసరం లేదు. మీలాంటి వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’’ అని స్పష్టం చేశారు. 

‘‘మీరో సీనియర్‌ రాజకీయ నాయకుడు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేం చేశారు? కల్నల్‌ ఖురేషీపై వ్యాఖ్యల వీడియో పూర్తిగా చూశాం. మీరు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మరింత అభ్యంతరకర పదజాలం కూడా వాడబోయారు. సమయానికి పదాలు దొరక్క ఆగిపోయారంతే! మన సైన్యం ఘనతను చూసి దేశమంతా గర్విస్తుంటే మీరేమో ఇలాంటి మతిలేని మాటలకు దిగారు. ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు!’’ అంటూ మండిపడ్డారు.

సిట్‌లో మహిళా ఐపీఎస్‌
మంత్రి వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపైన ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. దర్యాప్తు ప్రగతిపై పోలీసులను ప్రశ్నించి వారి సమాధానంపై పెదవి విరిచింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లతో సిట్‌ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్‌ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ‘‘మంగళవారం ఉదయం పదింటికల్లా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటవ్వాలి. ముగ్గురు ఐపీఎస్‌లూ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. ఒక మహిళా ఐపీఎస్‌ ఉండాలి. మే 28లోగా సిట్‌ తొలి నివేదిక సమర్పించాలి’’ అని పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను వెల్లడించిన కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా వర్ణిస్తూ విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించింది.

దేశం ధర్మసత్రం కాదు 
శరణార్థులకు ఆశ్రయం కుదరదు
శ్రీలంకవాసి కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్యలు
శరణార్థులు దేశం వీడాలని ఆదేశం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్‌ ధర్మసత్రమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో ఆశ్రయం ఓ శ్రీలంక శరణార్థి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్‌ ఇప్పటికే 140 కోట్లకు పైగా జనాభాతో సతమతమవుతోంది. శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి దేశం ధర్మసత్రం కాదు’’ అని పేర్కొంది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో అరెస్టయిన శ్రీలంకవాసి పిటిషన్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్‌కు స్వేచ్ఛగా జీవించే హక్కుందని ఆయన తరఫున లాయర్‌ వాదనను జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తోసిపుచ్చారు. ఆ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎల్‌టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో పిటిషనర్‌ 2015లో అరెస్టయ్యాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద దోషిగా తేలడంతో 2018లో పదేళ్ల జైలు శిక్ష పడింది. 

2022లో మద్రాస్‌ హైకోర్టు దాన్ని ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష ముగియగానే భారత్‌ వీడాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. వాటిని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్‌టీటీఈ సభ్యుడిగా పోరాడినందున అక్కడ నన్ను బ్లాక్‌ గెజిటెడ్‌గా ఉంచారు. కనుక శ్రీలంకలో నాకు ప్రాణహాని ఉంది. నా భార్య పలు వ్యాధులతో, కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. 

వారు భారత్‌లోనే స్థిరపడ్డారు. నేను కూడా వారితో పాటు ఇక్కడే ఉండిపోతా’’ అని అభ్యర్థించాడు. శ్రీలంకలో ప్రాణహాని ఉందని వాదించాడు. దానితో జస్టిస్‌ దత్తా పూర్తిగా విభేదించారు. ‘‘అయితే మాత్రం ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కుంది? మరే దేశమైనా వెళ్లండి’’ అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘ఐరాస శరణార్థుల కార్డుల వంటివి ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఉంటే తిప్పి పంపించేయాల్సిందే’’ అని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement