
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్, ఏ1 నిందితుడు ప్రభాకర్రావుకు ఊరట లభించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయన పాస్పోర్టును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(SIT) తేల్చి చెప్పింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అడ్వాంటేజ్గా తీసుకోవద్దని.. దేశానికి వచ్చిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్రావుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘నేను 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించాను. నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టారు. పాస్పోర్టు ఇస్తే నేను దేశానికి వస్తాను. విచారణకు సహకరిస్తా. గతంలో అనేకమందికి ఈ కేసులో బెయిల్ ఇచ్చారు’’ అని కోర్టుకు ప్రభాకర్రావు విజ్ఞప్తిని తెలియజేశారు.
ప్రభుత్వం తరఫున వాదనలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ప్రభాకర్ రావు దేశం విడిచి పారిపోయాడు. పరారీలో ఉన్న నేరస్తుడు షరతులు పెట్టడానికి వీల్లేదు. ముందస్తు బెయిల్ ఇస్తానంటేనే, దేశానికి వస్తానని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. ఇదిలాగే కొనసాగితే సాంప్రదాయంగా మారుతుంది. ప్రభాకర్ రావును మేము కచ్చితంగా అరెస్టు చేస్తాం. ఆయన చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాల తీవ్రత తెలిసే , చెన్నై నుంచి అమెరికాకు పారిపోయాడు. కోర్టు అతన్ని ప్రకటిత నేరస్తుడిగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు పిటిషన్కు అసలు విచారణ అర్హత లేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్.. ప్రభాకర్రావుకు ఊరట ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: నేనూ తిక్కదాన్ని.. నాతో పెట్టుకోవద్దు