చదువు పేరుతో సహజీవనం..! | love couple ends life in tamilnadu | Sakshi
Sakshi News home page

చదువు పేరుతో సహజీవనం..!

Jun 4 2025 12:08 PM | Updated on Jun 4 2025 2:59 PM

love couple ends life in tamilnadu

రక్తగాయాలతో ప్రియురాలు మృతి 

ఉరి వేసుకున్న స్థితిలో ప్రియుడు 

ఐసీఎఫ్‌ సమీపంలో కలకలం  

సాక్షి, చెన్నై: సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట మధ్య వివాదం ప్రేమోన్మాదానికి దారి తీసింది. రక్తగాయాలతో ప్రియురాలి మృతిచెందగా, ఉరి వేసుకున్న స్థితిలో ప్రియుడి మృతదేహం బయట పడింది. ఐసీఎఫ్‌ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. చెన్నై ఐసీఎఫ్‌ సమీపంలోని రాజీవ్‌గాందీ నగర్‌లో కొంత కాలంగా ఓ జంట చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తామిద్దరం భార్యభర్తగా వీరు పరిసర వాసులకు చెప్పుకుంటూ వచ్చారు. 

ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడి మృతదేహం ఉరివేసుకుని శవంగా వేలాడుతుండడాన్ని పొరుగున ఉన్న వారు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లోపల గడియపెట్టి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా రక్తగాయాలతో యువతి మరణించి ఉండడం, అక్కడే యువకుడు కిటికీకి ఉరి వేసుకుని మృతిచెంది ఉండడం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఆ ఇంట్లో లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డుల ఆధారంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించారు. ఈకేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాలను కీల్పాకం మార్చురీకి తరలించారు.  

చదువు పేరుతో సహజీవనం 
మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్టు వర్క్‌ పేరిట వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాశ్, అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బీఏ, ఆకాష్‌ బీఎస్సీ చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్టు వర్క్‌ పేరిట చెన్నైకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. 

ఐసీఎఫ్‌ ఆవరణలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాభర్తలా సహజీవనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి, కళాశాలకు వెళుతూ వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. గత పది రోజులుగా  ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండడం ఇరుగు పొరుగు గమనించారు. అయితే గొడవ ఎందుకు జరిగింది, అందుకు గల కారణాలు బయటకు రాలేదు. సోమవారం కూడా వీరు గొడవపడినట్టు తెలిసింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి, ఆ తర్వాత భయంతో ఆకాశ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. 

ఈ సమాచారం అందుకున్న ఆకాశ్, అభినయ బంధువులు, కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇరు తరఫు బంధువులను, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు చదువుల్లో రాణిస్తూ ఉండడంతోనే ప్రాజెక్టు కోసం చెన్నైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ జంట సహజీవనం పేరిట ముందుకు సాగి చివరకు ఉన్మాదంతో కూడిన వివాదం రూపంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement