గేమ్‌ చేంజర్‌.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం | Sakshi
Sakshi News home page

IPL 2024: గేమ్‌ చేంజర్‌.. అతడు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేది!

Published Tue, Apr 2 2024 7:24 PM

IPL 2024 Game Changer MI Will Be Praying That: Gavaskar on Suryakumar

IPL 2024- MI Vs RR: ఐపీఎల్‌-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్‌. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్‌ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.

అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌ ఓడిపోయింది.

ఈ మూడింటిలో టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్‌ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్‌ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘‘ముంబై ఇండియన్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సేవలను కచ్చితంగా మిస్‌ అవుతోంది. సూర్యకుమార్‌ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు.

అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్‌ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్‌ గేమ్‌ చేంజర్‌’’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో సునిల్‌ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు.

కాగా ముంబై ఇండియన్స్‌ టాపార్డర్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ అయిన ఈ టీమిండియా స్టార్‌.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు.

ఇక గత సీజన్‌లో రోహిత్‌ శర్మకు బదులు కొన్ని మ్యాచ్‌లలో సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్‌లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం.

చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి జట్టుగా

IFrame

Advertisement

తప్పక చదవండి

Advertisement