●రాలుతున్న పూత, పిందెలు ●తేనె మంచు పురుగు సోకడంతో ఆందోళన
మామిడి రైతుకు గడ్డుకాలమొచ్చింది. పూత, కాత కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రత, తెగుళ్లతో అంతా రాలిపోతుంది. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. –మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా 2,600 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిలో సింహభాగం బంగినిపల్లి రకం సాగు చేశారు. కాగా మామిడికి పూత ఏటా డిసెంబర్ నెలాఖరున వస్తుండగా ఈ ఏడాది జనవరిలో వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన నెల రోజుల ముందే పూత వచ్చింది. తోటలకు తేనె మంచు తెగులు సోకి 50 శాతానికి పైగా పూతరాలి పోయిందని రైతులు వాపోతున్నారు. ఉద్యానవనశాఖ అధికారుల సూచనలు పాటించిన రైతులకు కొంతమేర పూత నిలబడి కాత కాసింది. అయితే ఎండల తీవ్రతతో కాత రాలిపోతుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి మామిడిని రక్షించుకునేందుకు నీటి తడులు అందించాల్సి ఉండగా బోరు బావుల్లో నీటి ఊటలు అడుగంటి పోయాయి.
దిగుబడిపై తీవ్ర ప్రభావం
అధికారిక లెక్కల ప్రకారం ఎకరం మామిడి తోట లో 20 క్వింటాళ్ల దిగుబడి రావాలి. అప్పుడు సదరు రైతుకు ఎకరం మామిడి తోటపై రూ. 30 నుంచి రూ. 40 వేల ఆదాయం వస్తుంది. ఎండల తీవ్రత, తెగుళ్ల కారణంగా పెద్ద మొత్తంలో పూత, కాత రాలిపోగా 25 శాతం మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎకరాకు 20 క్వింటాళ్ల మామిడి దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి నెలకొంది.
మార్కెట్లో మంచి డిమాండ్
మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మామి డి కాయలను టంకర (ఆంచూర్) చేసి విక్రయిస్తారు. ఈ మా ర్కెట్ నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. క్వింటాల్ టంకర విలువ రూ.25 వేల నుంచి రూ. 35 వేల వరకు టంకర నాణ్యతను బట్టి మార్కెట్లో ధర పలుకుతుంది. దా నిని వ్యాపారులు కొనుగోలు చేసి ఫౌడర్ తయా రు చేసి ప్యాకెట్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారు. దీనిని అక్కడ కూరల్లో వాడుతారు.
ఈ ఏడాది నష్టమే..
తొగిట శివారులో 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఏటా కాయలను విక్రయిస్తాను. గతేడాది రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత నిలబడడం లేదు. ఎండకు రాలిపోతుంది. రూ.50 వేలకు అడుగుతున్నారు. ఈడబ్బులు పిచికారీ చేసిన మందులకు కూడా సరిపోదు. చెట్లకు నీటి తగులు పెడదామంటే బోర్లలో నీరు తగ్గిపోయింది. – భూమాగౌడ్, మామిడి రైతు
ఎండల తీవ్రతతోనే..
మామిడి పూత డిసెంబర్ నెలాఖరుకు రావాల్సి ఉండగా జనవరిలో వచ్చింది. దీంతో తేనె మంచు తెగులు సోకి పూత రాలిపోయింది. మందులు పిచికారీ చేసిన తోటలకు కొంత మేర కాత వచ్చింది. ప్రస్తుతం ఎండల తీవ్రతతో రాలిపోతుంది. దీంతో మామిడిి గణనీయంగా తగ్గింది.
– నర్సయ్య, హర్టికల్చర్ అధికారి మెదక్