'ఆ నిర్మాత పారితోషికం ఇవ్వలేదు'.. టాలీవుడ్ హీరోయిన్! | Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు.. ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదు: రాజ్‌ తరుణ్ హీరోయిన్

Published Mon, Feb 5 2024 9:17 PM

Actress Malvi Malhotra Accuses Vikram Bhatt Of Non-Payment Of Dues - Sakshi

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ భామ మాల్వీ మల్హోత్రా. ఆ తర్వాత హిందీలో హోటల్ మిలాన్ చిత్రం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు  తెలుగు, మలయాళం సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వీ పలు వీడియో ఆల్బమ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ సరసన తిరగబడరా సామీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా మాల్వీ మల్హోత్రా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేశారని ఆరోపించారు. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో పనిచేశానని తెలిపారు. ఈ పాటకు ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆల్బమ్‌లో నటించినందుకు విక్రమ్ తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మాల్వీ మల్హోత్రా ఆరోపించింది. పారితోషికం కోసం విక్రమ్‌కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది.

మాల్వీ మాట్లాడుతూ.. 'నేను విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా ఆల్బమ్ సాంగ్‌ కోసం పనిచేశా. అప్పడే నేను దక్షిణాదిలో సినిమా షూట్లతో బిజీగా ఉన్నా. అయినప్పటికీ విక్రమ్‌ భట్‌ ఆయన నిర్మాణంలో ఒక పాట చేయమని నన్ను సంప్రదించారు. నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కేటాయించా. ఎందుకంటే వారిని నేను పూర్తిగా విశ్వసించా. కానీ ఆ తర్వాత నాకు పెండింగ్‌లో డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్‌లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా మరే ఇతర ఆర్టిస్ట్‌ కూడా ఇలా మోసపోకూడదని దీన్ని షేర్ చేస్తున్నా" అని వెల్లడించింది. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందించింది. ఆ డబ్బులు విషయం గురించి తనకు తెలియదని.. అందుకే దానిపై నేను ఏం మాట్లాడదలచుకోలేదని చెప్పింది. 

Advertisement
Advertisement