మొయినాబాద్: బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల స్వాగత తోరణం ఈదురు గాలులకు కూలి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జహీరాబేగం(45) మంగళవారం రాత్రి కూరగాయలకు వెళ్తుండగా వేగంగా ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో గ్రామంలో ఇటీవల బీరప్ప బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుద్దీపాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈదురు గాలికి ఆ తోరణం కూలి మహిళపై పడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.