తండ్రి రిక్షా డ్రైవర్.. కూతురేమో మ్యాచ్‌ ఫినిషర్‌! ఎవరీ సజనా? | Sakshi
Sakshi News home page

WPL 2024: తండ్రి రిక్షా డ్రైవర్.. కూతురేమో మ్యాచ్‌ ఫినిషర్‌! ఎవరీ సజనా?

Published Sat, Feb 24 2024 10:14 AM

Who is Sajeevan Sajana? Mumbai Indians All Rounder Who Hit Last-Ball Six On WPL Debut - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌ తొలి మ్యాచే అభిమానులకు అసలైన టీ20 క్రికెట్‌ మజాను అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన ఈ మ్యాచ్‌లో సజీవన్ సజన ‌ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి ముంబైను గెలిపించింది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. ఈ క్రమంలో ముంబై విజయానికి ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఢిల్లీ కెప్టెన్‌ లానింగ్‌ చివరి ఓవర్‌ వేసే బాధ్యతను ఆఫ్‌ స్పిన్నర్‌ క్యాప్సీకి అప్పగించింది. చివరి ఓవర్‌ వేసిన క్యాప్సీ తొలి బంతికే పూజావస్త్రాకర్‌ను పెవిలియన్‌కు పంపంది.

దీంతో ముంబై విజయసమీకరణం చివరి 5 బంతుల్లో 12 పరుగులగా మారింది. ఈ క్రమంలో రెండు బంతికి రెండు పరుగులు రాగా.. మూడో బంతికి అమన్‌జోత్‌ కౌర్‌ సింగిల్‌ తీసి హార్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు స్ట్రైక్‌ ఇచ్చంది. నాలుగో బంతిని హర్మన్‌ ఫోర్‌ కొట్టి లక్ష్యాన్ని 5 పరుగులకు తగ్గించింది.

అయితే అనుహ్యంగా ఐదో బంతికి కౌర్‌ ఔటైంది. దీంతో ఆఖరి బంతికి ముంబై విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన సిక్స్‌ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దీంతో ఎవరీ సజీవన్ సజన అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ సజనా?
28 ఏళ్ల  సజీవన్ సజన కేరళ వాయనాడ్‌లోని మనంతవాడి అనే కుగ్రామంలో జన్మించింది. కురిచియా అనే గిరిజన తెగకు చెందిన సజనకు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. ఆమె తండ్రి ఒక రిక్షా డ్రైవర్. సజన ఈ స్ధాయికి ఎదగడంలో తన తండ్రిది కీలక పాత్ర. ఓ వైపు తను శ్రమిస్తూనే  తన కూమర్తె క్రికెట్‌ వైపు అడుగులు వేయడంలో దోహదపడ్డాడు.

ఇక సజనా దేశీవాళీ క్రికెట్‌లో కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. అదే విధంగా సౌత్ జోన్, ఇండియా-ఏ జట్ల తరపున కూడా ఆమె ఆడింది. కాగా డబ్ల్యూపీఎల్‌ తొట్టతొలి వేలంలో పాల్గోన్న సజనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ డబ్ల్యూపీఎల్‌-2024 వేలంలో ముంబై ఇండియన్స్‌ రూపంలో ఆమెను అదృష్టం వరించింది.

రూ. 10 లక్ష్లల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన సజనను రూ.15 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. మరోవైపు కురిచియా తెగ నుంచి డబ్ల్యూపీఎల్‌లో భాగమైన రెండో క్రికెటర్‌గా సజన నిలిచింది. సజన కంటే ముందు అదే తెగకు చెందిన మిన్ను మణి డబ్ల్యూపీఎల్‌-2023లో భాగమైంది.

Advertisement
 
Advertisement