ఇటీవల ఎండీ ఇస్మాయిల్ షరీఫ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నగరంలోని ఒక కార్పొరేట్ వైద్య కళాశాలలో ఆయనకు చేసిన శస్త్రచికిత్స వికటించి మృత్యువుతో పోరాడారు. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకోవడానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అయినప్పటికీ ఆయనకు వ్యాధి నయం కాకపోవడంతో మరోసారి శస్త్రచికిత్స అవసరమైంది. ఆరోగ్యశ్రీ నిబంధనల మేరకు ఒకసారి చికిత్స చేసిన వ్యాధికి మరోసారి ఆరోగ్యశ్రీ వర్తించదు. దీంతో శస్త్రచికిత్స చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన ఒక ప్రకటన వరంగా మారింది. ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయాన్ని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం చేసిన ప్రకటనతో ఆయనకు మరోసారి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం కలిగింది.
కుటుంబ సభ్యులకూ లబ్ధి : ఇస్మాయిల్ కుమార్తెకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో హెల్త్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం ద్వారా అమె నెలకు రూ.32 వేలు జీతంగా పొందుతోంది. ఆయన మరొక కుమార్తెకు షాదీ తోఫాగా వివాహ ఖర్చుల నిమిత్తం జగన్ ప్రభుత్వం రూ.లక్ష విడుదల చేసింది. 72 ఏళ్ల వయసు కలిగిన అత్త హుస్సేనీబీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య ఫించన్ కోసం తొక్కని గడప లేదు. ఎంపీటీసీని, ప్రజల వద్దకు పాలనలో అధికారులను, జన్మభూమి కమిటీలను ఎన్నిసార్లు కోరినా వృద్ధాప్య ఫించన్ మంజూరు కాలేదు. అనంతరం 2019వ సంవత్సరంలో వచ్చిన వలంటీర్ వ్యవస్థ ద్వారా వలంటీర్లు ఆయన ఇంటికి నేరుగా వచ్చి హుస్సేనీబీకి పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారు. పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు, భార్యకు చేయూత పథకం ద్వారా రూ.18 వేలు ఏడాదికి జమఅవుతున్నాయని ఇస్మాయిల్ తెలిపారు. జగన్కు ముస్లింలు అండగా నిలవాలని ఆయన కోరుతున్నారు.
ఆయనొక సామాజికవేత్త.. ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఆయన తన ఇంటి వద్దనే వెల్డింగ్ పనులు చేసుకుంటూ 8 మంది సంతానాన్ని చదివించి, ప్రయోజకులను చేసి, కుటుంబ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదే సమయంలో సామాజిక బాధ్యతగా నగరంలోని వివిధ సమస్యలను స్థానిక అధికారులతో పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ తాను అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకున్నది ఆరోగ్యశ్రీయే అని.. కుటుంబం ఆర్థిక చేయూతకు జగన్ పథకాలే దోహదపడ్డాయని చెబుతున్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్. జగన్ జమానాలోనే ముస్లింల పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని, ముస్లింలంతా అబద్ధపు వాగ్ధానాలకు ఆకర్షితులు కాకుండా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ జగన్కు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. – ఏలూరు (ఆర్ఆర్పేట)