మెట్రో మార్గాల్లో నో ఫికర్ Metro lines no Fikr | Sakshi
Sakshi News home page

మెట్రో మార్గాల్లో నో ఫికర్

Published Sun, Jun 8 2014 3:09 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Metro lines no Fikr

సాక్షి,సిటీబ్యూరో: మెట్రోరైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు తగ్గి ఇరుకుగా మారినందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు.

శనివారం హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్‌లతో కలిసి మెట్రోరైలు కారిడార్-1 లోని నిరంకారి భవన్, లాజరస్ హాస్పిటల్, లక్‌డికాపూల్-రంగమహల్ జంక్షన్, జాంబాగ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వస్తున్నది వర్షాకాలం అయినందున బారికేడ్లు బలంగా లేకుంటే ప్రమాదాలకు ఆస్కారముం టుందన్నారు.

ప్రజాభద్రత దృష్ట్యా రోడ్ల తవ్వకాలు జరిగిన ప్రదేశాల్లోనూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా  ఉండాల్సిందిగా సూచించారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించాలని, పద్ధతి ప్రకారం రోడ్ల రీకార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని.. తద్వారా వాహనాలు సాఫీగా ప్రయాణించగలుగుతాయని చెప్పారు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని,మ్యాన్‌హోల్స్ రోడ్డు ఎత్తుకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పాదచారుల సదుపాయార్థం కనీసం నాలుగైదు అడుగుల వెడల్పు ఉండేలా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తున్నామంటూ..ఎన్వీఎస్‌రెడ్డిలు ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ తగు సూచనలు చేశారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పి.వెంకటరామిరెడ్డి, జోనల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్, రఘు తదితరులు వీరి వెంట ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement