-
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్ స్కాండల్ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.ప్రజ్వల్ లోక్సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. -
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్ నుంచి పార్లమెంట్కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్ 26 నాటి లోక్సభ పోలింగ్కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్డ్రైవ్ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్ సింగ్, ఖజన్ సింగ్ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ హైకోర్ట్ ‘గ్యాగ్’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు. ప్రజ్వల్ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్డ్రైవ్పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్)తో పొత్తునూ, హసన్లో ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు. -
ఇలా టిక్కెట్ ఇచ్చి... అలా రద్దు చేసి..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ లోక్సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్కు టిక్కెట్ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్కు కేటాయించింది. మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్కు 17 సీట్లు మిగిలాయి. -
పూరీ, హసన్ ఆలయాల్లో తోపులాట
పూరీ/హసన్: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుని ఆలయం, కర్ణాటకలో హసన్లో ఉన్న హసనాంబ ఆలయాల్లో శుక్రవారం వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా చోటుచేసుకున్న తోపులాటల్లో 27 మంది వరకు గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రాక మొదలైందని శ్రీ జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. మంగళ హారతి సమయంలో గేట్లు తెరవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుని 10 మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలున్నారని అన్నారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని తెలిపారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైందే తప్ప తోపులాట జరగలేదని పూరీ ఎస్పీ కేవీ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో క్యూలైన్లలోని వారు విద్యుత్ షాక్కు గురై 17 మంది వరకు గాయపడ్డారు. ఇది తోపులాటకు దారితీసింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. బాధితులు చెబుతున్న కరెంట్ షాక్ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
కొంచెం సిగ్గుపడండి.. పాక్ మాజీ ఆటగాడికి షమీ కౌంటర్
వన్డే వరల్డ్కప్లో టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజాకు.. భారత పేసర్ మహ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో బీసీసీఐ, ఐసీసీ కుమ్మక్కై భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నాయంటూ హసన్ రజా నిరాధరమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డీఆర్ఎస్ని తారుమారు చేయడంలాంటి మోసపూరిత కుట్రలతో టీమిండియా విజయాలు సాధిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో రజా వ్యాఖ్యలకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. ఇటువంటి నిరాధరమైన ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలంటూ మండిపడ్డాడు. "ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు కొంచెం సిగ్గుపడండి. ముందు ఆటపై దృష్టిపెట్టండి. వేరొకరి విజయాన్ని ఆస్వాదించండి. అంతేతప్ప మరొకరిని ద్వేషించడం సరికాదు. ఇదేమి లోకల్ టోర్నమెంట్ కాదు. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్కప్. ఇదివరకే మీరు ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తే వసీం అక్రమ్ ఖండించారు. కనీసం మీ సొంత ఆటగాడినైనా నమ్మండి. సొంత డప్పు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు కదా" అంటూ తన ఇనస్టాగ్రామ్ స్టోరీలో షమీ రాసుకొచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో షమీ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. చదవండి: ICC Rankings: మళ్లీ మనోడే నెంబర్ 1.. షాహిన్ ఆఫ్రిదిని వెనక్కినెట్టిన సిరాజ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
శునకాల దొంగలకు కటకటాలు..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): హాసన్ సమీపంలోని హొన్నేనహళ్లి రోడ్డులోని జాగిలాల ఫారంలో విలువైన కుక్కలు చోరీకీ గురయ్యాయి. దివాకర్ అనే వ్యక్తి కుక్కల ఫారంను నడుపుతున్నాడు. ఈ నెల 18 రాత్రి రూ.లక్షన్నర విలువగల రాట్ వీలర్, ల్యాబ్రడార్, గోల్డెన్ రిట్రివర్ జాతుల 4 కుక్కలను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపాడు. ఇంతలో తన వద్ద 4 విలువైన కుక్కలు అమ్మకానికి ఉన్నాయని హోళెనరసిపుర వాసి రోహన్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాడు. అది చూసి దివాకర్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రోహన్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. డబ్బు కోసమే కుక్కలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. చదవండి: వర్షకాలంలో వాటర్ లీకేజీలా .. ఇదుగో పరిష్కారం -
మంటల్లో ప్రైవేటు బస్సు.. తప్పిన ప్రమాదం
సాక్షి, బెంగళూరు : నడుస్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు... బెంగళూరు నుంచి బైందూరుకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ బస్సులో.. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఇంజిన్లో మంటలు ఏర్పడ్డాయి. విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా రోడ్డుపై బస్సును నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై బస్సు నుంచి బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల వస్తువులు సైతం కాలిబూడిదయ్యాయి. మరోబస్సులో ప్రయాణికులను బైందూరుకు తరలించారు. కాగా షార్టుసర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
1,450–1,535 డాలర్ల శ్రేణిలో పసిడి
సమీప భవిష్యత్తులో పసిడి పటిష్టంగా ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. భౌగోళిక ఉద్రికత్తలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనాల మధ్య తెరపడని వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలు పసిడిపై ఇన్వెస్టర్ల మక్కువను పెంచుతున్నాయి. అమెరికా అధ్యక్షుని అభిశంసనపై నెలకొన్న పరిణామాలు కూడా పసిడి ధరను ప్రభావితం చేస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం– పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,480 డాలర్ల దిగువనకు పడిపోదన్నది విశ్లేషణ. ఈ మద్దతూ కోల్పోతే సమీప కాలంలో 1,450 వద్ద గట్టి మద్దతు ఉంటుందని అభిప్రాయం. లాభాల స్వీకరణ పరిస్థితుల్లో... 27వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్నైమెక్స్లో ఒక దశలో 1,540 డాలర్ల స్థాయిని తాకిన పసిడి, చివరిలో 1,500 డాలర్ల దిగువకు (1,495 డాలర్ల వరకు) పడిపోయినా, వెంటనే రికవరీ అయింది. 1,503 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా మాత్రం 20 డాలర్లు తగ్గింది. అయితే లాభాల స్వీకరణ దృష్ట్యా, పసిడి సమీప కాలంలో 1,450 డాలర్లను చూసే అవకాశాలు ఉన్నాయన్నది కొందరి విశ్లేషణ. అయితే ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లకు లాభాలు, భౌగోళిక ఉద్రిక్తతల ఉపశమనం వంటి అంశాలు తోడయితే, వేగంగా 1,350 డాలర్ల శ్రేణికి పడిపోవచ్చు. ఈ స్థాయి పసిడికి అత్యంత కీలకం కావడం గమనార్హం. శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రుహానీ ఒక ప్రకటన చేస్తూ, ఇరాన్పై అన్ని ఆంక్షలూ తొలగిస్తామని, చర్చలు పునఃప్రారంభించడానికి అభ్యంతరం లేదని అమెరికా ఆఫర్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఇదే జరిగితే, బంగారం ధర తిరిగి 1,350 డాలర్లను వేగంగా తాకవచ్చు. అయితే దీనిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. అందువల్ల వచ్చే రెండు వారాలూ పసిడి ధర కదలికలకు కీలకం. -
వైక్కం బయోపిక్లో హనన్
తమిళసినిమా: కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత మాదిరిగానే ఎవరైనా నటి, నటులు కావచ్చు. అదేవిధంగా సాయం చేయడానికి పేద, గొప్పతో పని లేదు. స్పందించే చిన్న హృదయం చాలు. ఏమిటీ ఏదేదో చెబుతున్నారనుకుంటున్నారా? పై మూడింటికి సంబంధం ఉంది. వైక్కం విజయలక్ష్మి వర్ధమాన గాయని. ఈమె మలయాళ చిత్రం సెల్యులాయిడ్ అనే చిత్రం ద్వారా గాయనిగా పరిచయమై ఆ తరువాత తమిళంలోనూ గాయనిగా రాణిస్తున్నారు. ఇందులో విశేషం ఏముందని అనుకోవచ్చు. వైక్కం విజయలక్ష్మి ఒక అంధురాలు. ఆ కొరతను జయించి గాయనిగా పేరు తెచ్చుకుని చాలా మందికి స్ఫూర్తి గా నిలిచారు. ఇక మరో అంశానికి వస్తే ఇటీవల కేరళలో చేపల విక్రయ వ్యాపారం చేస్తూ కళాశాలలో చదువుకుంటున్న హనన్ అనే యువతి గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. సహ విద్యార్థులు సహా పలువురు హనన్ వృత్తిని అవహేళన చేసినా, వాటిని అసలు కేర్ చేయకుండా తాను చేపల వ్యాపారం చేస్తూనే చదువుకుంటాను అని దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఏకంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్నే ఆకర్షించింది. అంతే హనన్ ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన ఆయన ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అలాంటి సమయంలో కేరళ రాష్ట్రం వరద బారిన పడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ ముఖ్యమంత్రే వరద బాధితుల సహాయార్థం చేతనైన సాయం చేయాల్సిందిగా అర్ధిస్తుస్న పరిస్థితి. కాగా రోడ్డులో చేపలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ, మరో పక్క చదువుకుంటున్న హనన్ అందరిని ఆశ్చర్య పరుస్తూ రూ.1.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించింది. సాయం చేయడానికి మంచి మనసు చాలు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? ఇక మూడో విషయానికి వస్తే వైక్కం విజయలక్ష్మి బయోపిక్ చిత్రంగా తెరకెక్కినుంది. ఇందులో ఆమె పాత్రలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మత్స్యకారిణి, విద్యార్థిని హనన్ నటించబోతోంది. ఈమె ఇంతకు ముందే అవరై తేడి సెండ్రన్, అరై కల్లన్ ముక్కాల్ కల్లన్, మిఠాయ్ తెరివు అనే చిత్రాల్లో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. -
సన్మార్గం : మొహర్రం స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి
మొహర్రం అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు హసన్, హుసైన్ (ర అన్ హుం). ముస్లింలకే కాదు. ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన ‘కర్బలా’ దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారి కుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతిసామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు వారు చేసిన కృషి, వేలాది శత్రుసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీరఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టుల, దుర్మార్గులైన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది. ముహమ్మద్ ప్రవక్త నిర్యాణం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో హ. అబూబక్ ్రసిద్ధిఖీ (ర) ఖలీఫాగా (ప్రజాప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హ. ఉమర్ (ర), హ. ఉస్మాన్ (ర), హ. అలీ(ర) గార్లు ఖలీఫాలుగా ఎంపికయ్యారు. వీరి పరిపాలనా కాలంలో న్యాయం, ధర్మం నాలుగుపాదాలపై నడిచాయి. అన్ని రంగాల్లోనూ సమతూకం నెలకొని ఉండేది. ఎలాంటి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు లేకుండా సమన్యాయం, గౌరవమర్యాదలు లభ్యమయ్యేవి. ఈవిధంగా వీరి పరిపాలనాకాలం ప్రపంచ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని సృజించింది. చివరి ఖలీఫా హ. అలీ (ర) తరువాత ప్రజలు యథాప్రకారం తమ ప్రతినిధిగా హ. హసన్ (రజి) గారిని ఎన్నుకున్నారు. కాని కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఆయన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. తరువాతి పరిణామాల్లో యజీద్ తనను తాను రాజుగా ప్రకటించుకుని గద్దెనెక్కారు. గత్యంతరం లేని స్థితిలో అత్యధికులు అతడి రాజరికాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఈవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడలేదు. వాళ్లు ఈ బలవంతపు రాచరికానికి ఎదురు తిరిగారు. ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత హ. ఇమామె హుసైన్ (రజి) భుజస్కంధాలపై పడింది. ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించి కయ్యానికి కాలుదువ్వింది. దాంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు మొదలైంది. శతృవులతో శక్తివంచన లేకుండా పోరాడుతూ ఇమాం పరివార సభ్యులు ఒక్కొక్కరే నేలకొరిగారు. ధర్మ సంస్థాపన కోసం సాగిన ఈ పోరులో చివరకు ఇమాం హుసైన్ (రజి) ఒక్కరే మిగిలారు. అది మొహర్రం మాసం పదవతేదీ. శుక్రవారం. పోరు సాగుతూనే ఉంది. ఒకవైపు నమాజు సమయం మించిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజును విస్మరించని ఆ మహనీయుడు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇమ్మని అడిగారు. అందుకు అంగీకరించిన శత్రుసైన్యం ఇమాం సజ్దా నుండి లేస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించి, యుద్ధనీతికి తిలోదకాలిచ్చి, ప్రార్థనలో ఉన్న ఆ మహనీయుడిని సజ్దా స్థితిలోనే బరిశతో పొడిచి చంపారు. అనంతరం ఆనందంతో చిందులు తొక్కారు. మృతవీరుల తలలను వారి దేహాలనుంచి వేరుచేసి, బరిశలకు, బల్లాలకు గుచ్చి ఎగిరారు, పానకాలు చేసుకుని తాగారు. పలావులు వండుకుని తిన్నారు. ఇదీ క్లుప్తంగా ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన. ఇమాం హుసైన్ (రజి) ఏ విలువల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారో, ఆ విలువల పరిరక్షణ కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. విలువలు మంటగలసిపోతుంటే, పాలనావ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంటే, చూస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్య ప్రియుల లక్షణం ఎంతమాత్రం కాదు. వీటిని సమూలంగా మార్చాలంటే ‘మొహర్రం’ పేరుతో జరిగే అన్ని రకాల దురాచారాలని విసర్జించి, ఇమామె హుసైన్ (రజి) ఏ విలువలకోసం ప్రాణత్యాగం చేశారో ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవలసిందే! - యండి ఉస్మాన్ఖాన్ ఇస్లామీ ధర్మశాస్త్రప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కారమార్గాలు. అందుకని ఇమామె హుసైన్ (రజి) ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. యాజీద్తో చర్చలకోసమని అనుచరులు, కుటుంబంతో కలసి రాజధాని కుఫాకు బయలుదేరారు. కాని మార్గమధ్యంలోనే ‘కర్బలా’ అనే చోట యజీద్ సైన్యం ఇమాం పరివారాన్ని అడ్డగించింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement