-
10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.రఘువీర్ 595 మార్కులు, కె.సుప్రియ 595 మార్కులు, ఏపీఆర్ సాయిశ్రీలత, బి.లలితరాణి, కె.సత్యభాస్కర్ 594 మార్కులు, టి.ప్రీతిశరణ్య, ఎం.ఇబ్రహీం 593మార్కులు, కె.అశ్రిత, ఎంవీఎల్ఎ వాత్సల్య, ఎం.గ్రీషశ్రీ, బియు.ప్రసాద్, పి.శ్రీతుల్య, జేవీఎన్ సత్యసాయిదత్త, వై.తేజశ్వి, ఎస్.రంజిత్కుమార్ 592మార్కులు, వై.కృష్ణచైతన్య, ఎల్.వైష్ణవి, సీహెచ్.లోక్ప్రకాష్, ఎస్వీఎస్.శ్రీధర్, డి.చిన్మయి 591మార్కులు సాధించారన్నారు. 590పైన 34మంది విద్యార్థులు, 580పైన 223 మంది విద్యార్తులు, 570పైన 451మంది, 560పైన 642 మంది, 550పైన 779మంది, 500పైన 451మంది , 560పైన 642మంది, 550పైన 779మంది, 500పైన 1108 మంది విద్యార్థులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠ
● నమూనా ఆలయంలో స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ ● పాల్గొన్న దేవదాయ కమిషనర్ అన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరి త్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆల యం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారి పై విశాఖపట్నం – విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మ హోత్సవాలు సోమవారం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠించారిలా.. రత్నగిరిపై స్వామివారి ఆలయంలోని అనివేటి మండపంలో ఉన్న ధ్వజస్తంభానికి ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజస్తంభాన్ని పైకి లేపి ఆలయం ముందు శ్లాబ్కు ఉన్న రంధ్రం ద్వారా నిటారుగా నిలబెట్టి, చివర కలశలు ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠా పూజలను దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ దంపతులు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, నెల్లూరుకు చెందిన దాత దంపతులు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్ర మోహన్ దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం తవ్విన గొయ్యిలో నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు, నవపాషాణాలు వేసి, పూజలు చేశారు. తరువాత భక్తులు కూడా వివిధ నాణేలు, నవరత్నాలు సమర్పించారు. పాత ధ్వజస్తంభం పునాదిలో బయటపడిన 15.4 గ్రాముల బంగారు వస్తువులు, నవరత్నాల ఉంగరం, 850 గ్రాముల బరువైన రాగి రేకును కూడా కమిషనర్, ఈఓ పునాది గోతిలో వేశారు. దేవస్థానంలో డార్మెట్రీ నిర్మించిన దాత పెన్నాడ రాజామణి కూడా నవరత్నాలు, నవధాన్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు జై సత్యదేవ అని భక్తిపారవశ్యంతో నినాదాలు చేస్తూండగా ధ్వజస్తంభాన్ని లాంఛనంగా క్రేన్ సహకారంతో అత్యంత చాకచక్యంగా ఆ గోతిలోకి దించి నిలబెట్టారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభాన్ని తాకేందుకు పలువురు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం యాగశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న అధివాస పూజలు, హోమాల పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. యాగశాల నాలుగువైపులా ప్రతిష్ఠించిన కలశాల్లోని పవిత్ర జలాలతో ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ నిర్వహించి, ప్రధానాలయంలోని స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులు, ధ్వజస్తంభం, భక్తులపై జల్లారు. ఈ కార్యక్రమాల్లో విశ్రాంత వేద పండితులు ముష్టి కామశాస్త్రి, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, వైదిక కమిటీ సభ్యుడు, వ్రత పురోహిత ప్రముఖుడు చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అర్చకులు సుధీర్, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఏఈఓ కృష్ణారావు, డీఈలు, రాంబాబు, ఉదయ్ పర్యవేక్షించారు. ధ్వజస్తంభానికి 20 రోజుల్లో బంగారు రేకు తాపడం చేయించనున్నట్టు దాత తెలిపారు. నమూనా ఆలయంలో.. సరిగ్గా ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన ముహూర్తానికే జాతీయ రహదారిపై రూ.4 కోట్లతో నిర్మించిన నమూనా ఆలయంలో కూడా కలశ ప్రతిష్ఠ, సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఉపాధ్యాయుల రమేష్, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, చైర్మన్ రోహిత్, ఈఓ రామచంద్ర మోహన్లు నమూనా ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించి, పూజలు చేశారు. ఈఈ నరసింహరెడ్డి, డీఈ గుర్రాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పవన్ కల్యాణ్పై చర్మకారుడి పోటీ
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఒక ట్రాన్స్జెండర్ ప్రకటించగా.. తాజాగా ఓ చర్మకారుడు కూడా ఆయనపై పోటీకి సిద్ధమంటున్నాడు. డిగ్రీ చదువుకున్నా కానీ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పట్టభద్రుడిని కాబట్టే చట్ట సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని అంటున్నారు పిఠాపురానికి చెందిన చర్మకారుడు ఏడిద భాస్కరరావు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ వద్ద చెట్టు కింద 20 ఏళ్లుగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి అందరూ పోటీ చేస్తూంటే స్థానికుడిగా బీఏ పొలిటికల్ సైన్స చదువుకున్న తానెందుకు పోటీ చేయకూడదని అనిపించిందన్నారు. అందుకే నాలుగు నెలలుగా నియోజకవర్గ సమస్యలను పత్రికల ద్వారా సేకరించానన్నారు. పిఠాపురంలో ఇప్పుడు పవన్ పరిష్కరిస్తానంటున్న సమస్యలను తాను 4 నెలల క్రితమే గుర్తించానన్నారు. పేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి, ప్రజల సమస్యలు తీర్చాలంటే చట్ట సభలే వేదిక అని తలచి పోటీలో ఉండాలనుకుంటున్నానన్నారు. తనకు తెలిసిన వారందరి మద్దతూ కోరుతున్నానని, చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. ఎలాగైనా పవన్ కల్యాణ్పై గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. త్వరలో తాను కూడా ఓ మేనిఫెస్టో తయారు చేసుకుని, ప్రకటిస్తానని భాస్కరరావు తెలిపారు. -
టెన్త్ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి ముందంజ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు. -
ముహూర్తం కుదిరింది
● కోలాహలంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు ● వేలాదిగా తరలివచ్చిన జనసందోహం ● కాకినాడలో ఆకట్టుకున్న భారీ ర్యాలీలు, గుర్రపు స్వారీలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ ర్యాలీలు.. డప్పు మోతలు.. గుర్రపు స్వారీలు.. జనసందోహంతో కిక్కిరిసిపోయిన రహదారులు.. కార్యకర్తలు, అభిమానుల కేరింతలు.. నామినేషన్ల ప్రక్రియ వేళ.. జిల్లాలో సోమవారం కనిపించిన సందడి వాతావరణం ఇది. నామినేషన్లకు మంచి ముహూర్తం కావడంతో.. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు.. భారీగా తరలివచ్చిన జనసందోహంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వెళ్లి, నామినేషన్లు వేశారు. ఎటుచూసినా జనమే జనం అన్నట్టుగా ఈ కోలాహలం అట్టహాసంగా సాగింది. అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సంప్రదాయంగా వస్తున్న సెంటిమెంట్ను అనుసరించి నామినేషన్లు దాఖలు చేశారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ జెండాల రెపరెపలతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన జనసందోహంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలు వేసింది. ● వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి జె.వెంకటరావుకు అందజేశారు. చంద్రశేఖరరెడ్డి సతీమణి మహాలక్ష్మి కూడా మరో సెట్ నామినేషన్ వేశారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం 10.49 గంటలకు ద్వారంపూడి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సాంబమూర్తి నగర్లోని వైభవ వేంకటేశ్వర ఆలయానికి వెళ్లిన ద్వారంపూడి దంపతులు స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఆనంద భారతి గ్రౌండ్స్ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం నగరంలో భారీ వాహన, బైక్ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. వారిపై అభిమానులు దారి పొడవునా క్రేన్ల పై నుంచి పూలవర్షం కురిపిస్తూ, కేరళ ఛెండా వాయిద్యాలు, డప్పుల మోత, గుర్రపు స్వారీలతో సందడి చేశారు. రాజీనామా చేసిన మహిళా వలంటీర్లు కోకిల రెస్టారెంట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెంట రాగా యువత కేరింతలు కొడుతూ భారీ ర్యాలీతో నగరంలో సందడి చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ● కాకినాడ రూరల్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నామినేషన్ అట్టహాసంగా సాగింది. సెంటిమెంట్గా భావించే కాకినాడ వెంకట నగర్లోని పాత ఇంటి వద్దకు ఉదయం వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కాకినాడ రెండో డివిజన్ వైద్య నగర్లోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు సర్పవరం జంక్షన్ వరకూ భారీ ర్యాలీతో బయలుదేరారు. జనసందోహం వెంట రాగా రూరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్కు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం కన్నబాబు బీసీ, ఎస్సీ, ఓసీల నుంచి ఒక్కొక్కరిని ప్రతిపాదకులుగా సంతకాలు తీసుకుని నామినేషన్ వేశారు. ఆయన వెంట తండ్రి సత్యనారాయణ ఉన్నారు. ● రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పిఠాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ రెండు సెట్ల నామినేషన్లను పిఠాపు రం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి వద్ద దాఖలు చేశా రు. సెంటిమెంట్గా ఎరుపు రంగు చీర, పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకుని నామినేషన్ వేశారు. తొలుత క్యాంపు కార్యాలయంలో పూజ చేసుకుని, పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళుతూ మార్గం మధ్యలో జై గణేష్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా ఆర్ఓ కార్యాలయం వరకూ సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా సాగింది. కార్యక్రమంలో వంగా గీత భర్త విశ్వనాథ్, సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ● పెద్దాపురం టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ని మ్మకాయల చినరాజప్ప, తుని నుంచి ఆ పార్టీ అ భ్యర్థి యనమల దివ్య కూడా నామినేషన్లు వేశారు. ● నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు 5, రెండో రోజు 7, మూడో రోజు 6 నామినేషన్లు దా ఖలు కాగా, నాలుగో రోజైన సోమవారం జిల్లా లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 మంది, కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి నలుగురు కలిపి మొత్తం 18 మంది నామినేషన్లు వేశారు. -
11న జాతీయ లోక్ అదాలత్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించాలని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఆమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి రాజీపడదగిన జాబితాను అధికారులు సిద్ధం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, గవర్నమెంటు ప్లీడరు సీహెచ్వీ ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు. -
విస్తృత తనిఖీల్లో మద్యం పట్టివేత
● 18 మంది అరెస్ట్ ● రూ.2.06 లక్షల నగదు సీజ్ అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అక్రమ రవాణాను పసిగట్టేందుకు దాడులు, తనిఖీల వేగాన్ని మరింత పెంచాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగిన దాడులు, తనిఖీల్లో అక్రమ రవాణాను అడ్డుకుని 18 మందిని అరెస్ట్ చేశారు. నగదు రూ.2.06 లక్షలు సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్లు, స్వాధీనాల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ● అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెంలో నిఘా బృందాలు వాహనాలను తనిఖీ చేసి రూ.2.06 లక్షల నగదును సీజ్ చేశారు. ● ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,220 నగదు సీజ్ చేశారు. 4 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● రామచంద్రపురం, ద్రాక్షారామ, పామర్రు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 18.03 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● అమలాపురం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట ముమ్మిడివరం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 83 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 15.51 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ● ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన ఐ.పోలవరం మండలం మురమళ్ల,పశువుల్లంకలలో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోంచుకునేలా భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు. -
రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండిలా..
● టెన్త్ విద్యార్థులకు ఈ నెల 30 వరకు అవకాశం ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల ● మే 24 నుంచి జూన్3 వరకు పరీక్షలు ● త్వరలో టైమ్ టేబుల్ విడుదల రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునఃమూల్యాంకనం (రీ వెరిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎంకు మాత్రమే ఫీజు చెల్లించాలి ఈ ఏడాది పది పరీక్షలు రాసిన విద్యార్థులు పాసైనా/ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30వ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. శ్రీరీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ ఫలితాలు వచ్చినా, రాకున్నా ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఎంకి మాత్రమే ఫీజును సమర్పించాలి. అన్ని రుసుము చెల్లింపులు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేయాలి. శ్రీసీఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపులు ఆమోదించరు. ముఖ్య సూచనలు అభ్యర్థులు వారి దరఖాస్తులను సంబంధిత పాఠశాల హెచ్ఎంలు అటెస్టేషన్ చేయించి, సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. నేరుగా విజయవాడలోని డీజీఈ కార్యాలయం(ఎస్ఎస్సీ బోర్డు)కు పంపించరాదు. దరఖాస్తులు పోస్టు ద్వారా స్వీకరించరు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రీ వెరిఫికేషన్ అంటే పరీక్ష పేపర్లను తిరిగి మొత్తం మూల్యాంకనం చేయరు. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కిస్తారు. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధ్రువీకరిస్తారు. జవాబు పత్రంలో దిద్దని ప్రశ్నలు ఉంటే దిద్ది మార్కులు కేటాయిస్తారు. స్కానింగ్ చేసిన విద్యార్థి జవాబు పత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రీ కౌంటింగ్ విషయంలో మార్కుల మొత్తం మరోసారి కూడతారు. తప్పుగా కూడి ఉంటే సరి చేసి మార్కులు వేస్తారు. అంతేగాని పేపరు విద్యార్థికి ఇవ్వరు. అడ్వాన్స్ సప్లిమెంటరీ దరఖాస్తు ఇలా.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు త్వరలో ప్రకటించనుంది. వచ్చే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు ప్రతీ పాఠశాల హెచ్ఎం/సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ఫీజును నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించే వీలుంది. శ్రీమే ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50ల అపరాధ రుసుంతో ఫీజును చెల్లించే వీలుంది. నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ కోర్సుల్లో చేరేందుకు నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత హెచ్ఎం స్కూల్ లాగిన్ నుంచి పాఠశాలల వారీగా మార్కుల మెమొరాండం, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్ఈఎస్యుఎల్టీఎస్.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ నుంచి ఫలితాలు, షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు. మార్చి–2024, ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల నామినల్ రోల్ ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచుతారు. ఫీజుల వివరాలు చెల్లించాల్సిన ఫీజులను ఆన్లైన్లో ఆయా పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా చెల్లించాలి. డీడీలు స్వీకరించరు. శ్రీరీ వెరిఫికేషన్ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. శ్రీరీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. -
ఘనంగా సీతారాముల వనవిహారోత్సవం
అన్నవరం: రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వెంట రాగా నవదంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండ దిగువన గార్డెన్ వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రత్యేక సింహసనాలపై సీతారాములను, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వేంచేయించి, పండితులు పూజలు చేశారు. నవదంపతులకు దేవస్థానం అధికారులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం వనవిహారోత్సవం నిర్వహించారు. నేడు శ్రీచక్రస్నానం శ్రీరామ నవమి ఉత్సవాల ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు పవర్హౌస్ వద్ద పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. నదిలో నీరు లేకపోవడంతో స్నానఘట్టాలకు దూరంగా నీరు ఉన్న చోట గుంత తవ్వి, అందులో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 నుంచి వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. -
అదరగొట్టిన అమ్మాయిలు
● ‘పది’ ఫలితాల్లో బాలికలదే పైచేయి ● 83.09 ఉత్తీర్ణత శాతం నమోదు ● గత ఏడాదితో పోల్చితే మరింత పెరుగుదల బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గత నెల 18 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించిన టెన్త్ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 27,671 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 22,993 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 68.02 మాత్రమే కాగా, ఈ ఏడాది అది ఏకంగా 83.09 శాతానికి ఎగబాకడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయబావుటా ఎగురవేయడం గమనార్హం. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి ఫలితం ప్రభుత్వ పాఠశాల అనగానే అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత అనే అభిప్రాయానికి ఈసారి విద్యార్థులు ఫుల్స్టాప్ పెట్టారు. చాలీచాలని గదులు, శిథిలావస్థకు చేరిన భవనాలు, కరువైన కనీస వసతుల వంటి సమస్యలకు గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. మన బడి నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారు. విద్యార్థులకు ఆసక్తి కలిగే రీతిలో బోధనలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు. కాలికి వేసుకునే బూట్ల నుంచి చదువుకునే పుస్తకాల వరకూ అన్నింటినీ విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్ది, ఉచితంగా అందించారు. ఫలితంగా ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సర్కారీ బడుల విద్యార్థులు సగర్వంగా తలెత్తుకున్నారు. తగినన్ని వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందించాలే కానీ.. కార్పొరేట్ స్థాయి చదువులకు తాము ఎందులోనూ తీసిపోమని నిరూపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈసారి అధిక సంఖ్యలో 500కు పైగా మార్కులు సాధించారు. పునర్విభజన అనంతరం ఏర్పడిన కొత్త జిల్లాల్లో రెండోసారి నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే కాకినాడ జిల్లా మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది. ప్రణాళికాబద్ధంగా కృషి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు నమోదు చేయగలిగారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పిల్లి రమేష్ గత ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ పదో తరగతి ఉత్తీర్ణత పెంపుపై దృష్టి కేంద్రీకరించారు. వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నిర్ణయాలు అమలు తీరును పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పాఠశాలల తనిఖీలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) నాగమణి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకత్వం చేశారు. అలాగే జిల్లా పరిషత్ తయారు చేసి, పంపిణీ చేసిన ప్రత్యేక స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని పలువురు హెచ్ఎంలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో 4,678 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరితో పాటు మార్కులు తక్కు వగా వచ్చాయనే అనుమానం ఉన్నవారు పునఃమూల్యంకనం (రీ వెరిఫికేషన్) కోసం ఈ నెల 30వ తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సమష్టి విజయం పదో తరగతి పరీక్షల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారుల సమష్టి కృషి కారణమైంది. విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అందుకనుగుణంగా బోధన చేపట్టాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ జిల్లాలో టెన్త్ ఫలితాలు ఇలా.. పరీక్షలకు రాసిన వారు : 27,671 ఉత్తీర్ణులైన వారు : 22,993 ఉత్తీర్ణత శాతం : 83.09 ఫస్ట్ క్లాస్ : 18,039 సెకండ్ క్లాస్ : 3,479 థర్డ్ క్లాస్ : 1,475 పరీక్షలు రాసిన బాలికలు : 14,079 ఉత్తీర్ణులు : 12,035 బాలికల ఉత్తీర్ణత శాతం : 85.48 పరీక్షలు రాసిన బాలురు : 13,592 ఉత్తీర్ణులు : 10,958 బాలుర ఉత్తీర్ణత శాతం : 80.62 -
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
రూ.8.97లక్షల విలువైన 128.27 గ్రాముల ఆభరణాల స్వాధీనం కొవ్వూరు: వివిధ చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడైన చుక్కపల్లి బాబి అనే ప్రవీణ్కుమార్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుంచి 128.27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. గతంలో కొవ్వూరులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఇంటిలోను, ఆరికిరేవుల గ్రామంలో ఒక రేకుల షెడ్లోను, కుమారదేవం, పోలవరంలోను ఇళ్లల్లో పగటి పూట ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగ దు అపహరించుకుని పో యాడన్నారు. సోమవా రం కొవ్వూరు ఏటిగట్టుపై ఉన్న శివాలయం ఎదురుగా ఉన్న వీధిలో నిందితుడు అద్దెకి ఉంటున్న ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీ సోత్తు విలువ రూ.8,97,190 ఉంటుందన్నారు. నిందితుడు గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన వాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందుతుడిని అరెస్ట్ చేయడంలో ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బంది సహకరించారన్నారు. -
నేత్రపర్వంగా తెప్పోత్సవం
● మేళతాళ మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం ● విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా కాల్పులు ● వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేకువ జామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. స్వామి వారి కల్యాణోత్సవాలు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు శ్రీమాన్ ఖండవల్లి వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వస్తి వచనం, కల్యాణోత్సవ ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం 6 గంటలకు సంకల్పం, ప్రధాన హోమాలు నిర్వహించారు. కేరళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం గౌతమీ గోదావరి నదిలో విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించిన హంస వాహనంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. బాణసంచాకాల్పులు, భక్తజనం గోవింద నామస్మరణ నడుమ స్వామివారు ఉభయ దేవేరులతో గౌతమీ గోదావరిలో విహరించడాన్ని భక్తజనం తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజిపజేశాయి. ఈ కార్యక్రమాలను దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం గౌతమీ గోదావరినదిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. గౌతమీ గోదావరిలో సాగిన స్వామివారి తెప్పోత్సవం -
పదవ తరగతి ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపారని ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్.శృతిరెడ్డి సోమవారం తెలిపారు. విద్యార్థులు గన్ని సాయి సాత్విక్ 596 మార్కులు, వి.యశస్వి, కె.నేహాశ్రీ 595 మార్కులు ఎం.శశిఅస్మిత 594 మార్కులు సాధించారన్నారు. తమ విద్యాసంస్థల నుంచి పరీక్షలకు 1,014 మంది హాజరు కాగా 590కు పైగా 33 మంది, 585కు పైగా 115 మంది, 581కు పైగా 167 మంది మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ ఎస్.వి.రాఘవరెడ్డి అభినందించారు. -
నన్నయ వీక్షిత్ భారత్
రాజానగరం: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. యూనివర్సిటీ 18వ ఫౌండేషన్ డేని పురస్కరించుకుని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన వీక్షిత్ భారత్ థీమ్ కార్యక్రమాలను వీసీ ప్రారంభించారు. శ్రీరాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కానవరం విద్యార్థులు ఉదయం యోగ ఆసనాలు వేయించి, యోగ సాధన ఆవశ్యకతను తెలియజేశారు. మధ్యాహ్నం వీక్షిత్ భారత్ 2047 థీమ్ ఓరియెంటెడ్ డాన్స్, మైమ్, స్కిట్స్లను క్యాపంస్, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించారు. సీటీఆర్ఐ డైరెక్టర్ ఎం.శేషుమాధవ్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆవిర్భావ లక్ష్యాలను నెరవేర్చే దిశగా యువత పయనించాలని సూచించారు. యూజీసీ వీక్షిత్ భారత్ జాబితాలో శ్రీనన్నయశ్రీ వర్సిటీ ఉండటం హర్షణీయమన్నారు. సీఎస్ఐఆర్ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ జి. భగవాన్ నారాయణ రీసెర్చ్ మెథడాలజీపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజిస్టార్ ఆచార్య జి.సుధాకర్, డాక్టర్ ఎన్.శేషారెడ్డి, డాక్టర్ రామచంద్రరాజు, డాక్టర్ సీహెచ్.సత్యనారాయణ, డాక్టర్ రామరాజు ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. -
పవన్ది రాజకీయంలోనూ నటనే
ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు బాబి అమలాపురం టౌన్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఇంతకాలం సినిమాల్లో మాత్రమే నటిస్తారనుకున్నాం. ఆయన రాజకీయాల్లోనూ నటిస్తారని ఆయన స్థిరత్వంలేని మాటలే తేటతెల్లం చేస్తున్నాయని ఏపీ అగ్రిమిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో శుక్రవారం మాట్లాడారు. గతంలో టీడీపీ, బీజేపీని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, లోకేష్లపై ఎన్నో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ నోటితోనే నేడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు సినిమాల్లోని ఆయన నటనను ప్రజలకు గుర్తుకు చేస్తోందని బాబి అన్నారు. వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, ఎంపీ పి.మిధున్రెడ్డిని గోదావరి జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న పవన్కళ్యాణ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చదువుకున్నానని చెప్పే ఆయనకు పిఠాపురంతో పనేంటని బాబి ఎదురు ప్రశ్న వేశారు. గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్గా వైఎస్సార్ సీపీని పర్యవేక్షిస్తున్న మిధున్రెడ్డిని పవన్ కళ్యాణ్కి విమర్శించే అర్హత లేదని చెప్పారు. పావలా పవన్ అంటూ తిట్టిన టీడీపీతోనే అంటకాగుతున్న నీ రాజకీయ పరిణితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని బాబి పేర్కొన్నారు. పోక్సో కేసులో జీవిత ఖైదు గోపాలపురం: పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు గోపాలపురం ఎస్పై కర్రి సతీష్కుమార్ శుక్రవారం తెలిపారు. తూర్పుగోదగోపాలపురం పెద్దగూడెం కాలనీకి చెందిన ముప్పడి సంపత్రావు(75)పై 2017లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద తీర్పు చెప్పినట్లు తెలిపారు. ముద్దాయి సంపత్రావుకు జీవిత కాల శిక్షతో పాటు రూ.వేయి నగదు, బాధితురాలికి రూ.2లక్షల 50వేలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ పోక్సో కోర్డు న్యాయమూర్తి ఉమా సునంద సంచలన తీర్పు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు. 24తో ముగియనున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు ఫీజు చెల్లించేందుకు గడువు తేదీ ఈ నెల 24తో ముగుస్తుందని ఇంటర్బోర్డు ఆర్ఐవో ఎన్ఎస్వీఎల్ నర్సింహం శుక్రవారం తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అదే కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని, ఫలితాలపై సందేహం ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాఫీ పొందేందుకు తగిన రుసుం చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే మొదటి సంవత్సరం పాసైన అభ్యర్థులు వారి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను ఇంప్రూమ్మెంట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వారు ఈ నెల 24 లోగా ఫీజు చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తామన్నారు. -
రెండు నెలల పాటు భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు
ఈఓ తారకేశ్వరరావు రామచంద్రపురం రూరల్: త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 30 వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబా అమ్మవార్ల గర్భాలయాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి అందజేసిన నర్మద బాణ లింగానికి, శ్రీ చక్ర యంత్రానికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకాలు, కుంకుమార్చనలు ఉదయం 10 గంటలకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు స్వామి, అమ్మవార్లకు ప్రతి నిత్యం ఆర్జిత సేవలు, నిత్య కై ంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. -
రూ.8.73 కోట్ల బంగారం, వెండి స్వాధీనం
ధవళేశ్వరం: గ్రామంలోని చెక్పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో గురువారం సాయంత్రం తనిఖీలు చేస్తుండగా బంగారం, వెండి వస్తువులతో వెళుతున్న వ్యాన్ను పోలీసులు గుర్తించారు. అందులో రూ.8.15 కోట్ల విలువైన 1.764 కేజీల బంగారు నగలు, రూ.58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి వస్తువులను గుర్తించారు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్భరత్కు తెలిపారు. రూరల్ తహసీల్దార్ వైకేవీ అప్పారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డి.గోపాలరావు, ధవళేశ్వరం సీఐ జీవీ వినయ్ మోహన్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ అధికారుల సమక్షంలో ఆభరణాల వ్యాన్ను తెరిచారు. రాజమహేంద్రవరంలోని ఒక ప్రముఖ నగల దుకాణానికి వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు వీటిని ట్రెజరీలో భద్రపరిచారని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిలో దూకి యువతి ఆత్మహత్య కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి పడమట భార్గవి(26) దుర్మరణం పాలైంది. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన ఈమె హెచ్డీఎఫ్సీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదు పొందుతోంది. ఎప్పటి మాదిరిగానే బ్యాంకులో ఉద్యోగం నిమిత్తం గురువారం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి వీర వెంకట మల్లేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గోదావరిలో ఎవరో యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అందిన సమాచారంతో వె వెతకగా గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైనట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని వెలికి తీసి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ బాబురావు తెలిపారు. -
రెండో రోజు శాసనసభకు 5, పార్లమెంట్కు 2 నామినేషన్లు
కాకినాడ సిటీ: జిల్లాలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఐదు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) రెండు సెట్లు, కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఒక సెట్, ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ సీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఒక సెట్, తుని నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా లాలం లోవరాజు రెండు సెట్లు, జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకట అప్పారావు అనే నెహ్రూ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నివాస్ వివరించారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారత చైతన్య యువజన పార్టీకి చెందిన అనుష చందక, స్వతంత్ర అభ్యర్థిగా గిడ్ల సింహాచలం ఒక్కొక్క సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు రోజులుగా ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో తొమ్మిది నామినేషన్లు దాఖలు కాగా పార్లమెంట్ నియోజక వర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. -
మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారంపై సీఎం జగన్ భరోసా
● మేమంతా సిద్ధం సభలో మీ బిడ్డ జగన్ వల్లనే ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటని వెల్లడి ● ముమ్మిడివరంలో మాదిరిగా అందరికీ మంచి జరుగుతుందని హామీ కాకినాడ రూరల్: మత్స్యకారులందరికీ ఓఎన్జీసీ పరిహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు పరిహారం కోసం ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటు చేసిందంటే దానికి కారణం మీ బిడ్డ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ రోజు కమిటీ ఏర్పాటయ్యిందని, ఆ కమిటీ రికమండేషన్ ఆధారంగా ప్రతీ మత్స్యకార కుటుంబానికి మంచి జరిగేటట్టుగా మీ బిడ్డ అండగా ఉంటాడని హామీ ఇస్తున్నానన్నారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యను పరిష్కరించి ముమ్మిడివరంలో మత్స్యకారులకు పరిహారం ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ తీరప్రాంతంలో ఓఎన్జీసీ ఒక సిస్మిక్ సర్వేతో 500 కిలోమీటర్ల మేర ఎక్కడా మత్స్యకారులు వేట చేయకూడదని, 35 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ అని ప్రకటించినప్పుడు మత్స్యకారుల ఉద్యమానికి అండగా నిలిచామన్నారు. తాను, సిటీ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత మత్స్యకారుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడడంతోపాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో కమిటీ ఏర్పాటుకు ఓఎన్జీసీ ముందుకు వచ్చిందన్నారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విజయశంఖారావాన్ని తొలిసభలో పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్మోహన్రెడ్డి మళ్లీ ఇప్పుడు నామినేషన్ల పర్వం ప్రారంభమైన వెంటనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మనందరి తరపున థ్యాంక్యూ సీఎం సార్ అని చెబుతున్నానన్నారు. జగనన్నకు, ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటంటే మీతో పోలికే లేని నాయకుడు చంద్రబాబు తన మందీమార్బలాన్ని, మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటుంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటున్నాడని ఇది చాలు మీకు, ఆయనకు ఉన్న పోలిక ఏమిటో అర్థమవుందని సీఎంను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే.. సంక్రాంతికి పప్పుబెల్లాలను చంద్రబాబు పంచిపెడితే, మీరు ఇచ్చే కానుకలు జీవితాలను నిలబెట్టేవి, భవిష్యత్ తరాలకు తల రాత రాసేవన్నారు. ఇంగ్లిష్ మీడియం మొదలుకుని వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాన్ని మీరు సృష్టించారని, ఇంటి స్థలం, వైద్యం, ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు మీరు అందించి చేయూత, భరోసాలాంటివి కూడా అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్నారని సీఎంకు కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రియుడిపై హత్యాయత్నం
దేవరపల్లి: ఒక ప్రియుడి సాయంతో మరొక ప్రియుడిపై హత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యర్నగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇద్దరు ప్రియులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన శీల బుచ్చయ్యతో పాటు మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుండగా ఇద్దరి ప్రియుల మధ్య కక్షలు పెరిగాయి. ప్రియుడు శీల బుచ్చయ్యను అడ్డుతొలగించుకోవడానికి మహిళ మరొక ప్రియుడితో కలిసి పథకం రూపొందించింది. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో బుచ్చయ్యకు ఫోన్ చేసి ఊరు చివర నిర్మానుష్య ప్రాంతానికి రప్పించింది. అక్కడ మహిళ, మరొక ప్రియుడు కలిసి బుచ్చయ్యపై కత్తితో దాడి చేశారు. కుడికాలు చీలమండ, తలపైన, నరికి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం ప్రియుడు, ప్రియురాలు అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో ఉన్న బుచ్చయ్యను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై కె. శ్రీహరిరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
వేతనంతో కూడిన సెలవు మంజూరు
కాకినాడ సిటీ: యానాంలో ఓటు హక్కు కలిగి ఉండి పొరుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక తదితర సంస్థల ఉద్యోగులకు 19వ తేదీ శుక్రవారం యానాంలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసిందని కలెక్టర్ జె.నివాస్ గురువారం తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో యానాంలో మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న జరుగుతుందన్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 135బి ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసిందన్నారు. యానాంలో ఓటు కలిగి కాకినాడ జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ నివాస్ వివరించారు. -
పార్లమెంట్కు ఒకటి, శాసనసభకు నాలుగు నామినేషన్లు
కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు నామినేషన్లు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్ దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అన్నవరం పితాని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ వేశారన్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టేకుమూడి శ్రీనివాసరావు, వినుకొండ వెంకటేశ్వరరావు, మట్ట వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా భవాని శంకర్ప్రసాద్ మెర్ల రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. -
చోరీ కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు
పిఠాపురం: నాలుగు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ పిఠాపురం ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుధారాణి గురువారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2021వ సంవత్సరంలో పిఠాపురం పట్టణంలో వరుస దొంగతనాలు జరిగాయి. పిఠాపురం పట్టణంలో సీతయ్యగారితోట, వైఎస్సార్ గార్డెన్స్, లయన్స్క్లబ్ ఏరియా, పట్టణంలో ఒక లాడ్జి, భీమ్నగర్ వంటి తొమ్మిది చోట్ల వరుస చోరీలు జరిగాయి. దీనిపై నలుగురు బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై బి.శంకరరావు నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుల్లో పెద్దాపురం మండలం ఉలిమేశ్వరానికి చెందిన యండపల్లి సూరిబాబును నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో సూరిబాబుకు ప్రతి కేసులోను ఒక ఏడాది చొప్పున నాలుగు కేసుల్లోను నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసుల్లో ఏపీపీ ఆకుల నాగ లీలా రోజా ప్రాసిక్యూషన్ నిర్వహించగా కోర్టు కానిస్టేబుల్ కరీమ్ కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టారు. -
గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్ల విడుదల
తుని రూరల్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరుగుతుందని కన్వీనర్, ప్రిన్సిపాల్ సీహెచ్ హేమలత ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. 5, 6, 7, 8 తరగతులు, (ఏపీఆర్ఎస్ సెట్ 2024) విద్యార్థులకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. కళాశాలలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీతో ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్ వైబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో అభ్యర్థులు హాల్టికెట్లతో పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలన్నారు. గంట ముందు హాజరు కావాలి గోకవరం: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష జిల్లా ప్రధాన కేంద్రంలో ఈనెల 25న జరుగుతుందని భూపతిపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ బి.రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5, 6, 7, 8వ తరగతులకు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సంబంధిత వెబ్సైట్ ద్వారా హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి
● పెద్దాపురం నుంచి రామేశంపేట వెళుతుండగా ఘటన ● ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం పెద్దాపురం: పెద్దాపురం–రాజమహేంద్రవరం ఏడీబీ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన లాలం సతీష్ (20), విశాఖపట్టణానికి చెందిన బర్రి మాధవకుమార్ (19), శ్రీకాకుళం జిల్లా చిగురువలసకు చెందిన మరో స్నేహితుడు రామచంద్రరావు ముగ్గురూ పెద్దాపురం పట్టణానికి వచ్చారు. తిరిగి మోటార్ సైకిల్పై రామేశంపేటలోని తమ రూముకు వెళుతుండగా వారిని మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టంతో మాధవ్, సతీష్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే కిందపడి మృతిచెందగా మరో యువకుడు నక్కా, రామచంద్రరావు తీవ్ర గాయాల పాలయ్యాడు. బైక్ నీ ఢీకొట్టిన వాహనం ఘటనా స్థలం నుంచి ఆగకుండా వెళ్లిపోయింది. మృతి చెందిన యవకులు రామేశంపేటలో గది అద్దెకు తీసుకుని ఇంజినీరింగ్ చదువుకుంటున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం వివరాల కోసం విచారణ చేపట్టారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. దీనిపై ఎస్సై సురేష్ కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
ఎస్డీఎల్సీఈ ఏడీగా గోపీనాఽథ్
మండల సర్వసభ్య సమావేశం బహిష్కరణ
హామీల అమలుపై నోరువిప్పని ఎమ్మెల్యే ‘దొంతి’
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
భూగర్భ జలాలు పెంపొందించుకోవాలి
మరో 22 డివిజన్లు!
ఏఆర్ఓలు స్ట్రాంగ్రూంలను పరిశీలించాలి
మలివాల్ వాంగ్మూలం నమోదు
తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
Advertisement