● పెద్దాపురం నుంచి రామేశంపేట వెళుతుండగా ఘటన
● ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
పెద్దాపురం: పెద్దాపురం–రాజమహేంద్రవరం ఏడీబీ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన లాలం సతీష్ (20), విశాఖపట్టణానికి చెందిన బర్రి మాధవకుమార్ (19), శ్రీకాకుళం జిల్లా చిగురువలసకు చెందిన మరో స్నేహితుడు రామచంద్రరావు ముగ్గురూ పెద్దాపురం పట్టణానికి వచ్చారు. తిరిగి మోటార్ సైకిల్పై రామేశంపేటలోని తమ రూముకు వెళుతుండగా వారిని మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టంతో మాధవ్, సతీష్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే కిందపడి మృతిచెందగా మరో యువకుడు నక్కా, రామచంద్రరావు తీవ్ర గాయాల పాలయ్యాడు. బైక్ నీ ఢీకొట్టిన వాహనం ఘటనా స్థలం నుంచి ఆగకుండా వెళ్లిపోయింది. మృతి చెందిన యవకులు రామేశంపేటలో గది అద్దెకు తీసుకుని ఇంజినీరింగ్ చదువుకుంటున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం వివరాల కోసం విచారణ చేపట్టారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. దీనిపై ఎస్సై సురేష్ కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.