-
దేశంలో లైబ్రరీ విలేజ్ ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?
పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెబుతుంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఉత్తరాఖండ్లోని అందమైన పర్వత లోయల మధ్య పుస్తక ప్రపంచం ఉంది. 17,500కు మించిన పుస్తకాల సేకరణ ఇక్కడ కనిపిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్త్యముని బ్లాక్లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్గా పేరు పొందింది. ఇందుకు ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్స్టేలు కూడా ఉన్నాయి. 2023, జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థుల తమ తరగతులు ముగిసిన తర్వాత లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకూ వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. -
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? పుస్తకాలు మనిషికి మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇష్టపడతారు. మన దేశంలో లైబ్రరీలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్ రాజధాని లండన్లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. -
అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!
నా వాలెట్ లో అత్యంత విలువైన వస్తువు నా లైబ్రరీ కార్డు అని తెలుసుకున్నా ! : లారా బుష్ ( అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్ గారి సతీమణి ) నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నా మనసులో పదేపదే మెదిలిన ప్రశ్న ‘ అమెరికాలో ఉన్నదేమిటి ఇండియాలో లేనిదేమిటి ? ’ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించింది, చాలామంది మనవాళ్లయితే కూర్చున్న సీట్ ముందున్న టివీల్లో వరసగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ, అదే తెల్లవాళ్ళు ఎక్కువ మంది పుస్తక పఠనం చేస్తూ కాలక్షేపం చేయడం. పాశ్చాత్యులకున్నంత ‘ బుక్ రీడింగ్ ’ అలవాటు మనకు లేదనేది వాస్తవం. ఆ దేశంలోని గ్రంథాలయాలను చూసినప్పుడు కూడా ఇలాంటి తేడానే నాకు స్పష్టంగా కనబడింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ( 1971 ) నేను ఎక్కువగా వెళ్ళింది కోఠి సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం . ఆ తర్వాత కాలంలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ , ఆఫ్జల్ గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అప్పట్లో సెక్రటేరియట్ ఎదురుగా నున్న బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ వంటి వాటికి. వాటితో పోల్చుకున్నప్పుడు అమెరికాలోని ఏ చిన్న పట్టణానికి వెళ్లినా అక్కడ విశాలమైన భవనాల్లో, వేల పుస్తకాలతో , కూర్చొని చదువుకోడానికి అన్ని సౌకర్యాలున్న పబ్లిక్ లైబ్రరీలు చూడవచ్చు. అందులోనే జిరాక్స్ , wifi, చిన్నపాటి కేఫ్లు ఉండడం వల్ల బయటికి పోవాల్సిన అవసరం రాదు. ప్రతి లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేక సెక్షన్ పెట్టడం విశేషం. ఎంతోమంది గృహిణులు తమ పిల్లలను లైబ్రరీలో దింపేసి నిశ్చింతగా షాపింగ్ వంటి పనులకు వెళ్ళిరావడం గమనించాను. అక్కడ పనిచేసే లైబ్రరియన్లు ఎంతో ఓపికతో మనకు కావలసిన పుస్తకం దొరకడం లేదంటే వచ్చి వెతికి పెట్టడం చూసాను. లైబ్రరీ సభ్యత్వ కార్డు ఉంటే చాలు పుస్తకాలు తీసుకెళ్లడం, డ్రాప్ బాక్స్ సౌకర్యం వల్ల వాటిని రిటర్న్ చేయడం సులభం. అక్కడి గ్రంధాలయ ఉద్యోగులు చేసే మరో అదనపు సేవ లైబ్రరీకి విరాళంగా వచ్చే పాత పుస్తకాలు అమ్మడం. లాస్ ఎంజెలిస్ టొరెన్స్ పబ్లిక్ లైబ్రరీలో నేనలా కొన్న పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవి Chronicle of the World (1988 edition, 1300 pages) ఆదిమానవుడి నుండి ఆధునికుల వరకు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు సంవత్సరాలవారిగా ఎన్నో ఫోటోలతో సహా వివరణలున్నది. Literature ( Reading Reacting Writting ) 1991 edition , 2095 pages. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా! అని Oxford , American Heritage వంటి డిక్షనరీలు కూడా కోనేశాను. ఒక్కో పుస్తకానికి నేను చెల్లించినవి 2-4 డాలర్లు మించలేదు. అవి కూడా ఇంట్లో నున్న చిల్లర నాణాలన్నీ తీసుకెళ్లి ఇచ్చినా విసుక్కోకుండా , లెక్కపెట్టుకొని తీసుకున్న లైబ్రేరియన్ లకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ సందర్బంగా కొన్ని బార్న్స్ అండ్ నోబెల్ వంటి ప్రైవేట్ పుస్తక విక్రయశాలలకు కూడా వెళ్లి చూసాను. కొనుగోలుదారులకు వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా తక్కువేం కాదు, కొత్తకొత్త పుస్తకాలు అక్కడా కూర్చొని చదువుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టకపోవడం విశేషం. వాళ్ళ దగ్గర నేను కొన్నవి తక్కువ. ఎంపిక పేర చదివినవే ఎక్కువ. అయితే నాకు వచ్చిన చిక్కల్లా అమెరికాలో నేను అలా సేకరించిన పుస్తకాలను ఇండియాకు తేవడంలోనే. మనవాళ్లలో ఎక్కువ మంది లగేజీ బట్టలు, వస్తువులతో నింపేస్తారు కానీ.. పుస్తకాలు తీసుకురావడానికి ఆసక్తి చూపించరు. ఏం చేద్దాం మరీ.? వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్ అర్థమవ్వాలంటే మాత్రం..!) -
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
విజ్ఞాన సంపదను పంచడమే ‘కూరెళ్ల’ లక్ష్యం
రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు. నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు. విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు. మాతృభాషను మరవొద్దు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. గవర్నర్చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్రెడ్డి, ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. -
ఖమ్మం నగరంలో కుప్పకూలిన గ్రంథాలయం
-
మేడ్చల్, బాచుపల్లి ZPHSలో లైబ్రరీ ప్రారంభం
-
డల్లాస్లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్బండ్పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురంలో ‘బ్రౌన్’ శాఖ ఏర్పాటు చేయాలి
కడప కల్చరల్: డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో నిర్మించిన సీపీ బ్రౌన్ గ్రంథాలయం శాఖను అనంతపురంలోనూ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్రావు సూచించారు. జానమద్ది అనంతపురం జిల్లాకు చెందినవారని, అందువల్ల అక్కడ కూడా బ్రౌన్ గ్రంథాలయ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) జయంతిని పురస్కరించుకుని జానమద్ది 11వ వార్షిక సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవం ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత, ఆకాశవాణి విశ్రాంత అధికారి నాగసూరి వేణుగోపాల్కు జానమద్ది పురస్కారాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్రావు ప్రదానం చేశారు. స్వయంకృషి, సాహిత్యాభిలాష, సామాజిక దృష్టి జానమద్ది ప్రత్యేకతలని, భావితరాలకు వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జస్టిస్ దుర్గాప్రసాద్రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జానమద్ది సాహితీసేవ భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయాన్ని సాహిత్యంతోపాటు కళానిలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కవి యలమర్తి మధుసూదన ‘తెలుగు భాషా ప్రాశస్త్యం–పద్య వైభవం’పై స్మారకోపన్యాసం చేశారు. పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ తాను కడపలో పనిచేసిన సమయంలో బ్రౌన్ గ్రంథాలయం, జానమద్దితో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులను జానమద్ది సాహితీపీఠం తరఫున సన్మానించారు. విజయవాడ దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జానమద్ది సాహితీపీఠం ట్రస్టీ విజయభాస్కర్, కార్యదర్శి యామిని, డాక్టర్ వైపీ వెంకటసుబ్బయ్య, జానమద్ది కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. -
బిడ్డ జ్ఞాపకార్థం.. గుర్తుగా లైబ్రరీ..
నిర్మల్: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ అర్ధంతరంగా దూరమైంది. తనలాగే సమాజానికి వైద్యసేవలందిస్తుందని డాక్టర్ను చేస్తే.. తానే ముందుగా వెళ్లిపోయింది. ఆ బిడ్డను మర్చిపోని తండ్రి ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన బిడ్డలా పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని, సామాజిక సేవలో భాగమయ్యారు. తన కుమార్తె ‘కావేరి’ పేరిట జిల్లాకేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు అప్పాల చక్రధారి అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన బిడ్డను తలచుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు సేవలందిస్తున్నారు. 2017 నుంచే గ్రంథాలయం.. జిల్లాకేంద్రంలోని డాక్టర్స్లైన్, తిరుమల థియేటర్ ఎదురుగా గల తన నివాసంలోనే 2017లో కావేరి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దినపత్రికలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ వచ్చారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉంచారు. దాదాపు ఆరేళ్ల కాలంలో ఇక్కడ ప్రిపేరవుతున్న వారిలో పదులసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చక్రధారి చెబుతున్నారు. మరింత అధునాతనంగా.. తన కూతురు ఎప్పుడూ నిర్మల్లో అన్నిరకాల సౌకర్యాలతో ఆస్పత్రి, లైబ్రరీ ఇలా అన్నీ ఉండాలని కోరుకునేదని డాక్టర్ చక్రధారి పేర్కొన్నారు. ఆమె కోరిక మేరకే ఆస్పత్రి, కావేరి కుటీరాన్ని నిర్మించారు. ఈమేరకు అధునాతన లైబ్రరీని సిద్ధం చేశారు. ఏడాది క్రితం తన ఇంటిని పూర్తిగా కూల్చేశారు. అందులో ఉన్న లైబ్రరీని డాక్టర్స్లైన్లోనే వేరే భవనంలో కొనసాగించారు. అదేస్థానంలో అధునాతనంగా, పూర్తిసౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థులు, అభ్యర్థులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో తను ఉండాల్సిన ఇల్లు కంటే ముందే లైబ్రరీ భవనాన్ని పూర్తిచేయించారు. నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇవీ.. సౌకర్యాలు రాష్ట్రంలోనే పూర్తి ఉచితంగా అధునాతన సౌకర్యాలతో ఉన్న ఏకై క లైబ్రరీగా కావేరి గ్రంథాలయాన్ని చె బుతుంటారు. ఇందులో విశాలమైన గదుల్లో రీడింగ్ రూములున్నాయి. అన్ని దినపత్రికలు, పోటీపరీక్షల పూర్తి మెటీరియల్ ఉంది. పాఠకులు, అభ్యర్థులు కో రితే వెంటనే సంబంధిత మెటీరియల్ తెప్పించి ఇ స్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములు న్నాయి. మాక్టెస్టులు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి హైస్పీడ్ ఇంటర్నెట్తో అధునాతన కంప్యూటర్ల గది ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాసుల కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. పాఠకులు, అభ్యర్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్హాల్ నిర్మించారు. చాలా సంతృప్తినిస్తోంది నా బిడ్డ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థులు లబ్ధి పొందడం, ఉద్యోగాలు సాధించడం చాలా సంతృప్తినిస్తోంది. ప్రిపరేషన్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించాం. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త మెటీరియల్ తెప్పిస్తున్నాం. – డాక్టర్ చక్రధారి, కావేరి లైబ్రరీ చైర్మన్ -
ఆ పుస్తకం 100 ఏళ్లకు.. లైబ్రరీకి తిరిగి చేరుకుంది!
లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్లోని మసాచుసెట్స్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్లోని మసాచుసెట్స్లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు "ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ" అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది. కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది. (చదవండి: అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది!) -
81 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం.. 17వ పేజీలో ఏమున్నదంటే..
ఇటీవల ఒక లైబ్రరీకి ఎవరో ఒక పుస్తకాన్ని తీసుకురాగా అక్కడి స్టాఫ్ దానిని చూసి అవాక్కయ్యారు. ఆ పుస్తకం 81 ఏళ్ల క్రితం ఇష్యూ చేసినది కావడం విశేషం. సిబ్బంది ఆ పుస్తకాన్ని తెరవగా, అక్కడున్న విచిత్రమైన మెసేజ్ చూసి తెగ ఆశ్చర్యపోయారు. పుస్తకప్రియులు లైబ్రరీలకు వెళుతుంటారు. కొందరు అక్కడే కూర్చుని చదువుకుంటారు. మరికొందరు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకుంటారు. అయితే ఆ పుస్తకాలను రిటర్న్ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. అది దాటితై ఫైన్ విధిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు తాము తీసుకువెళ్లిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో అప్పగించరు. ఇటీవల ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942,మార్చి 30 నాడు ఇష్యూ చేసినది కావడం విశేషం. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఉదంతం అమెరికాలోని వాషింగ్టన్లో గల ఎబర్డీన్లో చోటుచేసుకుంది. ఇది చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి! పాత సామానులలో దొరికింది లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్ నార్డాఫ్ అండ్ జేమ్స్ నార్మన్ హాల్ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ’’ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని పేర్కొన్నారు. పేజీ నంబరు-17లో.. కిరో7 న్యూస్ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్ రాశాడు..‘‘ ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను’’ అని రాసివుంది. దీని అర్థం ఏమిటంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. లేటు ఫీజు విధిస్తే.. లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్లు(సుమారు రూ.40 వేలు) అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. బహుమతిగా భావించి.. ఆ పేస్బుక్ పోస్టులో లైబ్రరీ ప్రతినిధి.. ఈ ఉదంతం నుంచి మనం ఒక విషయం తెలసుకోవాలన్నారు.. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకమైనా దుమ్ము, ధూళి బారిన పడి ఉంటే, దానిని వెంటనే లైబ్రరీకి తిరిగి ఇవ్వండి. మేము వాటిని బహుమతులుగా భావించి, ఆ పుస్తకం తీసుకుని వెళ్లినవారికి ఎటువంటి ఫైన్ వేయబోమని తెలిపారు. చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా! -
AP: జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
120 మందికి.. ఒకే టాయిలెట్
నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది. సరిపోని గదులు వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం. – రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు నివేదించాం లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం -
ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్కు ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. కేరళలోని కన్నూరులో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పంపారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3న సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. సమావేశాలను కేరళ సీఎం విజయన్ ప్రారంభించనుండగా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు. -
గ్రంథాలయాల తీరు తెన్నులపై తానా ప్రపంచ సాహిత్య వేదిక చర్చ విజయవంతం
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 30న అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్లో నిర్వహించిన “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం - నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే 41వ సాహిత్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమణ్ళ శ్రనివాస్ ఈ సభను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా.అయాచితం శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలలో గ్రంథాలయరంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. విశిష్ట అతిథులుగా - అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం - గుంటూరు, వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణ; గాడిచర్ల ఫౌండేషన్ - కర్నూలు, అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర; శ్రీ రాజరాజ నరేంద్రాంద్ర భాషానిలయం - వరంగల్, కార్యదర్శి కుందావజ్ఞుల కృష్ణమూర్తి; సర్వోత్తమ గ్రంథాలయం - విజయవాడ, కార్యదర్శి డా.రావి శారద; శారదా గ్రంథాలయం - అనకాపల్లి, అధ్యక్షులు కోరుకొండ బుచ్చిరాజు; శ్రకృష్ణ దేవరాయ తెలుగు భాషానిలయం - హైదరాబాద్, గౌరవ కార్యదర్శి తెరునగరి ఉడయతర్లు; సీ.పీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం - కడప నిర్వాహకులు డా.మూల మల్లిఖార్జున రెడ్డి; విశాఖపట్నం ఫౌర గ్రంథాలయం - విశాఖపట్నం, గ్రంథాలయాధికారి ఎం. దుర్గేశ్వర రాణి; పౌరస్వత నికేతనం గ్రంథాలయం-వేటపాలెం నిర్వాహకులు కే.శ్రీనివాసరావు; గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం - రాజమహేంద్రవరం అభివృద్ధి కారకులు డా. అరిపిరాల నారాయణ తమ తమ గ్రంథాలయాల స్థాపన, వాటి చరిత్ర, వర్తమాన స్తితి, ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ సహకారలేమి, ఎదుర్కుంటున్న సవాళ్ళు, భవిష్య ప్రణాళిక మొదలైన అంశాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రహెద్ తోటకూర మాట్లాడుతూ - “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం - నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే అంశంపై చర్చ ఈనాడు చాలా అవసరం అని, నేటి గ్రంథాలయాలే రేపటి తరాలకు విజ్ఞ్జాన భాండాగారాలని, వాటిని నిర్లక్ష్యం చెయ్యకుడదన్నారు. వాటిని పరిరక్షించి, పెంపొందించే క్రమంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపి అవసరమైన నిధులు సమకూర్చాలని తెలిపారు. దీనికి వివిధ సాహితీ సంస్థల, ప్రజల సహకారం, మరీ ముఖ్యంగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి ప్రవాస భారతీయల వితరణ లోడైతే అద్భుతాలు సృస్టించవచ్చని అన్నారు”. -
ఎట్టకేలకు తిరిగిచ్చారు.. 84 ఏళ్లకు గ్రంథాలయానికి చేరిన పుస్తకం
లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు. ఇంగ్లండ్లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు. అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది. -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
రాక రాక ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అయినా పుస్తకం రాదు, కుర్చీ ఉండదు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: రాకరాక ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫలితం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు. పోటీలో నెగ్గేందుకు పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వారికి కావాల్సిన పుస్తకాలు లభించక ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో లేక... మార్కెట్లో కొనుగోలు చేసే శక్తి లేక ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో చదువు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. సిద్ధమయ్యేదెలా.. వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనుండా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు ప్రతిరోజు 700 మందికి పైగా యువతీ, యువకులు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండడం, 2016–17కు ముందు సిలబస్ పుస్తకాలే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజా పుస్తకాలు లేకపోతే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాలని భావించగా గ్రంథాలయంలో పుస్తకాలు లేక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జూన్ నుంచి వరుసగా పరీక్షలు జరగనుండడంతో కావాల్సిన పుస్తకాలను వెంటనే తెప్పించే ఏర్పాటుచేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అసౌకర్యాలతో సహవాసం గ్రంథాలయంలో సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేక, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తుండడంతో ఉక్కపోత నడుమే అభ్యర్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇక బెంచీలు సరిపోకపోవడంతో కొందరు కింద కూర్చుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి కుర్చీలు తెచ్చుకుంటున్నారు. అలాగే, పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండడంతో క్యూ కట్టాల్సి వస్తోంది. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే తొలగించారు. అలాగే, పలు సందర్భాల్లో తాగునీటికి కూడా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లా గ్రంథాలయం ఎదుట ఆందోళన ఖమ్మం గాంధీచౌక్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు తెప్పించాలనే డిమాండ్తో మంగళవారం నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనకు దిగారు. గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడుతూ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోగా ఫ్యాన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దీనికి మరుగుదొడ్ల సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. కనీస వసతులు కూడా లేవు.. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. చుట్టాల ఇంట్లో ఉంటూ నిత్యం గ్రంథాలయానికి వస్తుండగా, లేటెస్ట్ పుస్తకాలు అందుబాటులో లేవు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్ కూడా లభించటం లేదు. దీనికి తోడు మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. – అశోక్, కల్లూరు అవసరమైన పుస్తకాలు తెప్పించాలి పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తెప్పించాలి. బయట పుస్తకాలు కొనే స్థోమత లేని వారే గ్రంథాలయానికి వస్తారు. కానీ ఇక్కడ అవసరమైన పుస్తకాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నాం. దీనికి తోడు ఇతరత్రా సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి. – సుజాత, కాకరవాయి, తిరుమలాయపాలెం మండలం చదవండి: పోటీ పరీక్షల కోసం.. నిరుద్యోగ యువతకు యాప్ -
పుట్టింటికి నడిచొచ్చిన పుస్తకం
మనకు కల ఒకటుంటుంది మన పని మరొకటుంటుంది బాధ్యతల బరువుంటుంది. తప్పక చేయాల్సిన విధి ఇంకొకటుంటుంది. ఇన్నింటి మధ్య కలను బతికించుకుంటూ వెళ్లాలనే తపన ఉంటే అది మమతా సింగ్ అవుతుంది. ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ వాసి మమత. అగ్రసర్ అనే గ్రామంలో పుట్టింది. చదువు, పెళ్లి రీత్యా ఏళ్ల క్రితమే ఊరు వదిలి నగరానికి చేరుకుంది. చదువు పూర్తయ్యింది. పెళ్లి అయ్యింది. ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలయ్యింది. పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలి. ఏం చేయాలి.. ?! ఆలోచనలు తెగలేదు. పుస్తకాలంటే తనకు ఇష్టం. పుస్తకం ఇచ్చిన జ్ఞానం అన్నింటినుంచి మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది అనిపించింది. ఆ పుస్తకాన్ని పుట్టిన ఊళ్లోని ప్రజలకు చేరువ చేయాలనుకుంది. ‘పుస్తకాల పురుగు’ అని స్నేహితులు అంటుంటే విని నవ్వి ఊరుకునేది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని తను పుట్టి పెరిగిన ఊరికి టీచర్గా వెళ్లడమే కాదు, అక్కడివాళ్లకు లైబ్రరీని కానుకగా ఇచ్చింది. వీటి గురించి మమతను కదిలిస్తే పుస్తకం తనకిచ్చిన గొప్ప జీవితం గురించి చెబుతారామె... ‘‘నా చిన్నతనంలో అమ్మ పుస్తకాలను పరిచయం చేసింది. పుస్తకాల మీద నాకున్న మక్కువ వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు సేకరించాను. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూసి, లైబ్రరీని ఏర్పాటు చేయచ్చు కదా అని నా ఫ్రెండ్ అన్నప్పుడు ఆ సలహా నచ్చింది. అది ఊళ్లో అయితే బాగుంటుందనిపించింది. నా దగ్గరున్న 1200 పుస్తకాలతో ఊళ్లో చిన్న లైబ్రరీని ప్రారంభించాను. సిగరెట్, మద్యం కోసం డబ్బు ఖర్చుపెట్టే జనం రెండు రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడతారని నాకు తెలుసు. అందుకే ఉచితంగా పుస్తకాలను అందుబాటులో ఉంచాలనుకున్నాను. ఇప్పుడు 4,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఏర్పాటు చేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు స్నేహితులు ఇచ్చారు. కంప్యూటర్ వంటి పరికరాలు మా కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే, ముందు ఈ ప్రక్రియ అంత సులభం కాలేదు. అడ్డుగా నిలిచిన ఇనుపగోడ కుల, లింగ వివక్షత అనేవి ప్రజల మనసుల్లో బలంగా ఉండిపోయాయి. మరోవైపు అట్టడుగు వర్గాల వాళ్లు గ్రంథాలయానికి రావడానికి వెనుకాడుతున్నారు. లైబ్రరీకి ‘సావిత్రీబాయి పూలే’ పేరు పెట్టడంతో జనం రావడమే లేదు. నేను ఆ ఊరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలుచుకో లేదు, ఇందులో నాకేవిధమైన వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఊళ్లో జనాల్ని పుస్తకాలతో అనుసంధానించాలనుకున్నాను. కానీ, ఊళ్లో కొందరు పెద్దలకు ఇది నచ్చలేదు. నా కుటుంబంలో నా సోదరుడు, అతని భార్యనే నాకు ఇనుపగోడగా అడ్డు నిలిచారు. దీనిని పడగొట్టడానికి నేను పెద్ద ప్రయత్నమే చేశాను. ఈ పనిలో నా పిల్లల నుండి కూడా నాకు మద్దతు లభించింది. ఇప్పుడు దగ్గరలోని మరో రెండు గ్రామాల్లోనూ గ్రంథాలయ శాఖలు ఏర్పడ్డాయి. పెరిగిన మహిళల సంఖ్య ప్రభుత్వ టీచర్గా ఉద్యోగనియామకానికి నేను పుట్టిపెరిగిన ఊరిని ఎంచుకున్నాను. దీనికి అమ్మనాన్నలు, అత్తమామలు ఇద్దరి మద్దతు లభించింది. లైబ్రరీ ఏర్పాటుకు కూడా! కానీ, గ్రామస్థులకు సమస్య అయ్యింది. కూర్చొని పుస్తకాలు చదవగలిగే లైబ్రరీ లాంటి ప్రదేశం ఒకటుంటుందని వారికి తెలియదు. మొదట్లో పుస్తకాల దుకాణం అనుకున్నారు. పోటీ పరీక్షల పుస్తకాల నుంచి నోట్బుక్స్ వరకు కావాలని వారు అడుగుతున్నప్పుడు ‘ఇది స్టేషనరీ దుకాణం కాదు, లైబ్రరీ అని, ఇక్కడ చదవడానికి పుస్తకాలు అందుబాటులో అదీ ఉచితంగా ఉంటాయని చెప్పాను. మెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది. పాత టైరుతో అటూ ఇటూ పరిగెత్తే పిల్లలు, గొడవపడే పిల్లలు అప్పుడప్పుడు రావడం మొదలయ్యింది. ఇప్పుడు పిల్లలే కాదు మహిళలు కూడా లైబ్రరీలో చదువుకోవడానికి వస్తుంటారు. ఈ లైబ్రరీలో అన్ని వయసుల వారికీ పుస్తకాలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో చిన్నపిల్లలే కాదు టీనేజర్లు కూడా లైబ్రరీలో కూర్చొని పుస్తకాల గురించి చర్చించుకునేవారు. ఈ పుస్తకాలు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేర్పడమే కాకుండా వారి హృదయాలను సున్నితంగా మార్చుతున్నాయి. నేర్పిన ఒంటరి ప్రయాణం పద్దెనిమిదేళ్ల వరకు నేను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఒంటరిగా రోడ్డు దాటింది లేదు. ‘తక్కువ మాట్లాడు, సున్నితంగా మాట్లాడు, అందరి మాటల్ని విను, దుపట్టాను పక్కకు జరగనీకు’ ఇలా చాలా మంది పెద్దవాళ్లు చెప్పిన సలహా ప్రకారం మంచి అమ్మాయి చేసేదంతా నేను చేశాను. కానీ, బంధువులందరిలోనూ ఏదో ఒక లోపం కనిపించడం నేను చూశాను. సమాజం ఇచ్చిన మంచి అమ్మాయి స్లాట్లో నన్ను నేను సరిపెట్టుకోవడంలో విసిగిపోయాను. జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని పుస్తకాల ద్వారా తెలుసుకున్నా, అన్నదమ్ముల కారణంగా వ్యక్తిత్వం బలపడింది. నా భర్త ప్రోత్సాహం వల్ల నా భయాలన్నింటినీ జయించి తొలిసారి ఒంటరి యాత్రకు వెళ్లాను. అండమాన్ నికోబార్ వరకు ఒంటరిగా నడిచాను. పుస్తకాలు సంతోషపరుస్తాయి. ప్రయాణం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఈ పర్యటన నాకు నేర్పింది. జీవితంలో చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, వాటితో దృఢంగా నిలబడే ఓపిక మనకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇతరులు చెప్పేదానికంటే మీ హృదయ స్వరం వినడం, మీరు నిర్ణయించుకున్న మార్గంలో నడవడం చాలా ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. నేను అదే చేశాను. నా పుస్తకాల ప్రపంచంలో నా గ్రామాన్ని మొత్తం చేర్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కల సంపూర్ణమైందన్న భావన నాకు కలిగింది’’ అంటారు మమతాసింగ్. -
కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం
చిక్కడపల్లి: నగరంలో శిథిలస్థితికి చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ పేర్కొన్నారు. ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న, పద్మజ మాట్లాడుతూ.. నగరంలో గ్రంథాలయాలను పాఠకుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్తో పాటు నగరంలోని 82 గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, ఇకపై ప్రతి నెలా ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది గ్రంథాలయాల అభివృద్ధి, జీత భత్యాలు తదితర వాటికి దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సమావేశంలో సభ్యులు వాసుదేవ్రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మోదీ నోట.. కూరెళ్ల మాట
రామన్నపేట/సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ‘మన్కీబాత్’ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరును ప్రస్తావించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య స్వగ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తమ ఇంట్లో 2013లో 70 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. అనంతరం ఆచార్య కూరెళ్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమార్తెలు, దాతల సహకారంతో పాత ఇంటిస్థానంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. సాహితీవేత్తలు, ఉన్నత విద్యనభ్యసించే వారితో పాటు పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే కూరెళ్ల విఠలాచార్య సేవాతత్పరత గురించి ప్రధానమంత్రి మాటల్లోనే .. నా ప్రియమైన దేశ ప్రజలారా.. మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతులతో సుసంపన్నమైనది. ఆ ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనడానికి కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్యగారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కూరెళ్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. తర్వాత విఠలాచార్య తెలుగు అధ్యాపకుడు అయ్యారు. అనేక సృజనాత్మక రచనలు చేశారు. ఆరేడు సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన స్వంత పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు సహకరించటం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో గల ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన కృషితో స్ఫూర్తి పొంది ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో ఉన్నారు. ప్రధాని ప్రశంస మధురానుభూతి పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టు చేయాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇంటిని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంగా మార్చాను. కవులు, రచయితలు వివిధ సంస్థల సహకారంతో 2 లక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్కీబాత్లో నా ప్రయత్నాన్ని ప్రశంసించడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలుస్తుంది. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య -
103 ఏళ్ల పురాతన చరిత్ర
వేటపాలెం(ప్రకాశం): 103 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా వేటపాలెం సారస్వత నికేతన్ గంథాలయం గుర్తింపు పొందింది. పాతతరంలో ఎందరినో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధిన ఘనత సారస్వత నికేతన్కు ఉంది. 103 ఏళ్ల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించింది. గ్రంథాలయంలో ఉన్న గాంధీజీ చేతి కర్ర గ్రంథాలయం ఆవిర్భావం.. 1918 అక్టోబర్ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ బావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శేష్టి ప్రోత్సా హంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్ 18 తేదీన మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది. 1923లో పెంకుటింటిలో ఉన్న గ్రంథాలయం అమూల్యగ్రంథాలు.. రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాల ను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటలుగా భద్రపరచడం జరిగింది. గ్రంథాలయంలోని విజిటర్స్ పుస్తకంలో మహాత్మాగాంధీజీ స్వహస్తాలతో రాసిన ఒపీనీయన్ పరిశోధనా కేంద్రం.. తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతూ వస్తుంది. దేవ వ్యాప్తంగా ఉన్న వివి« ద విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విష యసేకరణ చేస్తుంటారు. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాల యాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శించి వెళుతుంటారు. నేటికీ తగ్గని ఆదరణ.. ప్రసార మాధ్యమాలు, ఇంటర్ నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈనాటికీ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధా నంగా సివిల్స్ గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు, గ్రంథాల యంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పీహెచ్డీ చేసేవారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తుంటారు. రాష్ట్రంలో వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని వైఎస్సార్ లైఫ్టైం ఎచీవ్ మెంట్కి ఎంపికచేశారు. -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్రెడ్డి, సర్పంచ్, వెల్లంకి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement