-
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
ఇండియాలో ఫ్యాషన్ సీన్ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్లలో టాప్ ఆఫ్ ది ఆల్గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్కి ట్రెండ్స్ని.. కంఫర్ట్ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్గా కనిపించేవారు.అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్ల మేళవింపుతో పర్ఫెక్ట్గా ఉంటుంది.ఫ్యాషన్ మ్యాగజైన్స్లో ఇంటర్న్గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్కీ శలీనా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసింది."డిఫరెంట్ స్టార్స్తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్తో పనిచేయడమంటే ఫ్యాషన్లో కొత్త కాంబినేషన్స్ని ఎక్స్పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్ని ఎక్స్ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ. -
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్లో బిఏ ఇంగ్లిష్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో సోషల్ వర్క్లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే -
Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్గా 2016 అండర్–19 ప్రపంచకప్లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్లో సన్రైజర్స్పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్లో బెస్ట్ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది.ఒకే ఒక లక్ష్యంతో..పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్ను నడిపేవాడు. ఉత్తరాఖండ్లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.మన గిల్లీ..అంతర్జాతీయ క్రికెట్లో ఆడమ్ గిల్క్రిస్ట్ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్బేన్లో వచ్చింది. భారత్కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.మూడు దశల ప్రణాళికతో..రిషభ్ పంత్కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.2022 డిసెంబర్లో పంత్కి జరిగిన రోడ్డు ప్రమాదంఅలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్నెస్పై శ్రద్ధ తీసుకున్నాడు.తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.గాయాల నుంచి కోలుకుంటూలీగ్లో సత్తా చాటి..‘నేను మళ్లీ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్లో 2024లో పంత్ మ్యాచ్లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.బ్యాటింగ్లో పదును, వికెట్ కీపింగ్లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో గతంలోలాగే ర్యాంప్ షాట్లు, స్విచ్ హిట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్కు సరిౖయెన అడ్రస్గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్బాల్లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్లో ఆడాను. గోల్ కీపర్గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
Naila Grewal: నా యాక్టింగ్కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్గా నటించింది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్లోనే. అందుకే యాక్టింగ్కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్స్క్రీన్, స్మాల్స్క్రీన్, వెబ్స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్కి ఒకటే. రీచింగ్లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్లో ధీరజ్ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్షిప్లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్షాప్లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్మేకర్’ టైటిల్కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్ప్రదేశ్లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్షాప్లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
Sarfaraz Khan: 'నాన్నకు ప్రేమతో..' ఆ రికార్డ్ను బ్రేక్ చేసి చూపించాను!
"2009.. ఓ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్లో 439 పరుగుల స్కోరు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ‘సచిన్ రికార్డ్ను బద్దలు కొట్టాలని నాన్న చెప్పాడు. చేసి చూపించాను!’ 2014.. ఐదేళ్ల తర్వాత.. అదే కుర్రాడు ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్–19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 'ఇది ఆరంభం మాత్రమేనని నాన్న చెప్పాడు'. నేను ఇక్కడితో ఆగిపోనని మాటిచ్చాను!" 2024.. మరో పదేళ్లు.. అదే అబ్బాయి భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ‘మా నాన్న కళ్ల ముందు దేశం తరఫున ఆడాలనుకున్నాను.. ఇప్పుడు ఆ కల నెరవేరింది!’ తండ్రి, కోచ్, మెంటర్.. ఏదైనా.. ఆ అబ్బాయి క్రికెట్ ప్రపంచం నాన్నతో మొదలై నాన్నతోనే సాగుతోంది. ఆరేళ్ల వయసులో ఆట మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇప్పుడు భారత సీనియర్ టీమ్కు ప్రాతినిధ్యం వహించే వరకు అన్నింటా, అడుగడుగునా నాన్నే ఉన్నాడు. అపార ప్రతిభావంతుడిగా వెలుగులోకి వచ్చి అద్భుత ప్రదర్శనలతో పై స్థాయికి చేరే వరకు ఈ తండ్రీ కొడుకులు పడిన శ్రమ, పట్టుదల, పోరాటం ఎంతో ప్రత్యేకం. అందుకే అతని అరంగేట్రం క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అతడే సర్ఫరాజ్ ‘నౌషాద్’ఖాన్! భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 311వ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అదే రోజు వికెట్ కీపర్ జురేల్ కూడా అరంగేట్రం చేశాడు. గతంలోనూ తొలి టెస్ట్ సమయంలో ఆటగాళ్లు తమ సంతోషాన్ని ప్రదర్శించి, తమ పురోగతిని గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి టీమిండియా గడప తొక్కినవారూ ఉన్నారు. కానీ సర్ఫరాజ్ తొలి టెస్ట్ రోజున మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సందడి కనిపించింది. గత కొంతకాలంగా దేశవాళీలో అతని ఆటను చూసినవారు, అతన్ని భారత జట్టుకి ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్న వారు.. అతనికి ఆ అవకాశం వచ్చిన రోజున ఊరట చెందినట్లుగా ‘అన్ని విధాలా అర్హుడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘నువ్వు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న, కుటుంబసభ్యులు ఈ ఘనతను చూసి గర్విస్తారు’ అంటూ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించడం.. ‘నేను చూసుకుంటా.. మీరు మీ అబ్బాయి కోసం ఏమేం చేశారో మా అందరికీ బాగా తెలుసు’ అంటూ స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ భరోసానివ్వడం సర్ఫరాజ్ అరంగేట్రం విలువను చాటాయి. కఠోర శ్రమ.. అకుంఠిత దీక్ష.. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత కష్టపడాలి?’ అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ను అడిగితే ‘తట్టుకోలేనంత’ అని జవాబిస్తాడు. ఎందుకంటే ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ఆయన తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు, అతని బాల్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘సర్ఫరాజ్ తన ఫ్రెండ్స్తో ఏనాడూ బయటకు వెళ్లింది లేదు. గాలిపటాలు ఎగరేసింది లేదు. తెల్లవారుజామున లేవగానే ప్రాక్టీస్కు వెళ్లిపోవడం.. గంటల కొద్దీ సాధన చేయడం.. ఇంటికి రావడం.. మళ్లీ సాయంత్రం కూడా ఇదే తరహాలో ప్రాక్టీస్ చేసింది’ అని కొడుకు కోసం తను ప్లాన్ చేసిన దినచర్యను స్వయంగా నౌషాదే చెప్పాడు. రోజుకు దాదాపు 600కు పైగా బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు అతనొక్కడే ఆడేవాడు. ఆరేళ్ల ఆట తర్వాత స్కూల్ క్రికెట్ ద్వారా తొలి సారి సర్ఫరాజ్ పేరు ముంబై క్రికెట్లో వినిపించింది. 439 పరుగుల స్కోరు సాధించి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 12 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనత అతని కష్టాన్ని మరింత పెంచింది. తర్వాత ఐదేళ్ల పాటు సర్ఫరాజ్ను రాటుదేల్చే క్రమంలో ఆ శిక్షణను తండ్రి మరింత కఠినంగా మార్చాడు. తర్వాతి నాలుగేళ్ల పాటు సర్ఫరాజ్ స్కూల్ ముఖమే చూడలేదు. వ్యక్తిగతంగా ట్యూటర్ను పెట్టినా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అతనికి కష్టం విలువ తెలియాలని కొన్నిసార్లు రాత్రిళ్లు భోజనం కూడా పెట్టేవాడు కాదు నౌషాద్. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నింటిలోనూ సర్ఫరాజ్కు తండ్రి మాత్రమే కనిపించేవాడు. తన కోసం కాకుండా తండ్రి కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది. ‘మీ అబ్బాయి ఇదంతా ఇష్టంతోనే చేశాడా? అతను అంతలా కష్టపడ్డాడు.. అతనిలో ఇంకా శక్తి ఉందా? అంటూ నన్ను చాలామంది ప్రశ్నించారు. బయటినుంచి చూస్తే కఠినంగా అనిపించినా అది తప్పలేదు. తన లక్ష్యంపై మరింత ఏకాగ్రత పెట్టేందుకు.. ఇతర విషయాల వైపు దృష్టి మరల్చకుండా చేసేందుకు నేను అనుసరించిన తీరు కరెక్టే. తర్వాత రోజుల్లో మావాడు దాన్ని అర్థం చేసుకున్నాడు అని వాళ్లకు సమాధానం ఇచ్చాను’ అంటాడు నౌషాద్. అయితే కెరీర్ ఆరంభంలో వయసు విషయంలో మోసం చేశాడంటూ ఓవర్ ఏజ్ ఆరోపణలు సర్ఫరాజ్పై వచ్చాయి. చివరకు అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా అతను తప్పు చేయలేదని తేలింది. కానీ ఇది మానసికంగా ఆ పిల్లాడిపై ప్రభావం చూపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను ఇక క్రికెట్ ఆడనంటూ ఏడ్చేశాడు. దాన్నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు 2014లో ముందుగా ముంబై అండర్–19 జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. ఆ వెంటనే భారత్ తరఫున అండర్–19 ప్రపంచకప్లో సర్ఫరాజ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత రెండోసారి అతనికి అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. రెండు వరల్డ్ కప్లలో కలిపి 7 అర్ధ సెంచరీలు సహా 566 పరుగులు సాధించడంతో అతను ఒక స్థాయికి చేరుకున్నాడు. వివాదాలను దాటి తప్పులు సరిదిద్దుకొని.. చదువులో, వ్యాపారంలో లేదా ఏ ఇతర రంగంలోనైనా తాను సాధించలేకపోయిన విజయాలను, ఘనతలను తమ పిల్లలు సాధించాలని కోరుకోవడం.. తమ జీవితంలో మిగిలిన ఆశలు, కోరికలను వారి ద్వారా తీర్చుకొని సంతోషపడటం ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు చేసేదే. నౌషాద్ కూడా అలాంటివాడే. ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్ స్వస్థలం. క్రికెటర్గా కనీస నైపుణ్యం ఉండటంతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ముంబై చేరాడు. అయితే మహానగరంలో ఉపాధి దొరికినా తగిన అవకాశాలు రాక క్లబ్ క్రికెటర్ స్థాయికే పరిమితమయ్యాడు. దాంతో స్థానిక పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒకింత పేదరికంలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకును ఆటగాడిగా తీర్చిదిద్దాలని, ఎలాగైనా పెద్ద స్థాయిలో ఆడించాలనే తపన మొదలైంది అతనిలో. దీని కోసం దేనికైనా సిద్ధమనే కసితో అతను పని చేశాడు. అయితే కొన్ని సార్లు అదుపు తప్పాడు. వరుస తప్పులతో కొడుకు ఇబ్బందులకు పరోక్ష కారణమయ్యాడు. ఎంత బాగా ఆడినా తగిన అవకాశాలు రావడం లేదనే ఆగ్రహంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులతోనే తలపడేందుకు సిద్ధమవడంతో వాళ్లు అతనిపై చర్య తీసుకున్నారు. టీమ్తో ఉన్నా జట్టు కోచ్ కాకుండా మా నాన్న వద్దే శిక్షణ తీసుకుంటానంటూ మొండికేయడంతో సర్ఫరాజ్పైనా హెచ్చరిక జారీ అయింది. సెలక్టర్ల వైపు అభ్యంతరకర సైగలు చేయడంతో రెండేళ్ల పాటు అతని మ్యాచ్ ఫీజులను నిలిపేసింది. ఈ వరుస గొడవలతో ఆగ్రహం చెందిన నౌషాద్ ఇక తన కొడుకు ముంబైకి ఆడడంటూ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు తీసుకుపోయాడు. మూడేళ్లు యూపీ తరఫున ఆడిన తర్వాత కనీస గుర్తింపు రాకపోవడంతో తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది. అద్భుత ప్రదర్శనతో.. ముంబైకి తిరిగొచ్చాక.. ఒక్కసారిగా కొత్త సర్ఫరాజ్ కనిపించాడు. వరుసగా రెండు సీజన్లలో అత్యద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయి రెండుసార్లూ 900కు పైగా పరుగులతో సత్తా చాటాడు. వరుసగా డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి ఒక దశలో 82.83 సగటుతో ఫస్ట్క్లాస్ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో అతని పేరు కనిపించడం విశేషం. కోవిడ్ సమయంలో ముంబైలో ఆడటం సాధ్యం కాకపోతే తన మిత్రుల సహకారంతో యూపీలో వేర్వేరు నగరాలకు వెళ్లి సాధన కొనసాగించాడు. పరుగుల వరద పారిస్తూ.. ముంబై వరుస టోర్నీల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సర్ఫరాజ్. అతని గ్రాఫ్ చూసిన గవాస్కరే.. సర్ఫరాజ్ని భారత జట్టుకు ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినా ప్రతి సిరీస్కూ ఎదురు చూడటం, నిరాశపడటం రొటీన్ అయిపోయింది. అసలు భారత్కు ఆడతాడా అనే సందేహాలూ మొదలయ్యాయి. సహనం కోల్పోతున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ సమయం 2024 ఫిబ్రవరి 15న వచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా ముక్తకంఠంతో సరైన ఎంపికగా అందరూ అభినందిస్తుండగా తీవ్ర భావోద్వేగాల మధ్య సర్ఫరాజ్ తొలి టెస్ట్ ఆడి రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. ‘నాన్న కలను నిజం చేశాను’ అంటూ సర్ఫరాజ్ చెబుతుంటే నౌషాద్ కన్నీళ్లపర్యంతం అయిన దృశ్యం అందరి కళ్లల్లో నిలిచిపోయింది. ఎన్నో ప్రతికూలతలను దాటి ఇక్కడికి చేరిన సర్ఫరాజ్ భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనేదే సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: దేవుడా..! బచ్చన్కి బిడియం ఎక్కువే..! -
ఫన్డే: ఈ వారం కథ: 'లెఫి బొ'
"ఆఫీస్కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక. అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు. ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది. ‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది." అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది. ‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’ ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది.’ ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్ని టీపాయ్ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది. ‘నా పేరు రియాన్. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్.. కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. ‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక. ‘నాకు మొదట కాయ్ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’ ‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక. ‘నేను చెప్పేది నిజం భువీ.’ ‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’ ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’ ‘నా మెమొరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు?’ ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’ ‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక. ‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’ ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’ ‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్. ‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ. ‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స ఎక్స్పర్ట్ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్ వన్ అవర్. ప్లీజ్ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’ ‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది. ‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు. ∙∙ రాత్రి పన్నెండు దాటినా నిషిత్కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో.. అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్ బాక్స్లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్ ఇన్ వన్ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు. ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్నెస్.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు. ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’ ‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ‘గుడ్ చాయిస్ సర్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్’ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి. కాయ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీస్కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్ని బైటికి తీసి, ఎరేజ్ చేయబడిన మెమొరీని రిట్రీవ్ చేసి, మళ్ళా చిప్ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్కి భార్యగా కొనసాగుతోంది. ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది. ‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్. ‘నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక. మరునాడు రియాన్ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు. ‘సారీ.. నేను నా భర్త నిషిత్ని వదిలి రాను’ అంది ఆద్విక. ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’ ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’ ‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’ ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’ ‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+ – సలీం. ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..! -
దేవుడా..! బచ్చన్కి బిడియం ఎక్కువే..!
'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్ యాక్టర్కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..' అభిషేక్ బచ్చన్కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్ రూమ్లో ఉంటే.. రూమ్ సర్వీస్ ఎంత అవసరమైనా.. ఫోన్ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు. ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం! -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్రూమ్లో కంటే ఆర్ట్ రూమ్లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్తో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్లో నా 12 పెయింటింగ్స్లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్తో జాగ్రత్త! -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
'2023 – తెలంగాణ మహిళ!' ఈ ఏడాది స్ఫూర్తి వీరే..
"తమను తాము బాగు చేసుకోవడంతోపాటు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ యేడాది తెలుగు మహిళ నిరూపించింది. విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మహిళను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం. రాబోయే సంవత్సరానికి ప్రేరణగా వీరితో కలిసి మరెన్నో అడుగులు వేద్దాం.!" ఊరంతా బాగు! మూడేళ్లక్రితం వరకు ఒక మామూలు పల్లె అది. కానీ, నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. ఇంటర్మీడియెట్ వరకు చదివిన మీనాక్షి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నియ్యింది. మరుగుదొడ్లు కట్టించడం, తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వాన నీరు ఆ గుంటలో పోయేలా చేసిందామె. వాగుపైన వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలవల శుభ్రత, స్కూల్కు కొత్త భవనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ఏర్పాటు చేయించింది. ఊళ్లో సంపూర్ణ మద్య నిషేధం అమలుతో΄ాటు హరిత హారంలో భాగంగా పదివేల మొక్కలు నాటించి, వాటి బాధ్యతను గ్రామస్తులే తీసుకునేలా చేసింది. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి, పంచాయితీకి లాభం చేస్తోంది. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఊళ్లోనే నర్సరీ ఉంది. ఊళ్లో జరిగే అంగడిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు, తడిచెత్త– ΄÷డి చెత్త విభజనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ΄ాటిస్తున్నారు. ఇన్ని మార్పులు తీసుకు వచ్చిన మీనాక్షిని కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఈ యేడాది స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డ్తో సత్కరించింది. - మీనాక్షి గాడ్గె (సర్పంచ్) భారతజట్టులో స్థానం! భద్రాచల వాసి త్రిష అండర్–19 మహిళల వరల్డ్ కప్ –2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరి, క్రికెటర్గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. చదువు, ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పే త్రిష నవతరపు అమ్మాయిలకు రోల్ మోడల్గా నిలుస్తోంది. - గొంగడి త్రిష (యువ క్రికెటర్) సాహసమే ఊపిరి.. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అన్వితారెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎవరెస్టు శిఖరాన్ని ఐదురోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. పడమటి అన్వితారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లావాసి. ప్రస్తుతం భువనగరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసింది. పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ కోచ్గానూ గుర్తింపు పొందింది. గతంలో సిక్కింలోని రీనాక్, బీసీరాయ్, కిలిమంజారో, లదాక్లోని కడే, ఎబ్బ్రూస్ పర్వతాలు అధిరోహించింది. పర్వతారోహణలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, సవాళ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి, సాధన అవసరం. అన్విత ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - అన్వితారెడ్డి (పర్వతారోహకురాలు) అవగాహనే ప్రధానం జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం నుంచి రేగట్టె వెంకటరమణ ఎంపికయ్యింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డును అందుకొని వార్తల్లో నిలిచింది వెంకటరమణ. ఇంటింటికీ వెళ్లి మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కోవడం, జాగ్రత్తలు సూచించడం, కౌన్సెలింగ్స్ ఇవ్వడం దినచర్యగా చెబుతుంది. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడంలో ముందుండే వెంకట రమణ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. -రేగట్టె వెంకటరమణ (అంగన్వాడీ టీచర్) ప్రైవేటుకు దీటుగా మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నూగూరి అర్చన ఈ యేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో΄ాటు ఆమె సొంత ఖర్చులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటే అందరూ మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. గిరిజన చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్కి ఆటోలు ఏర్పాటు చేసి, మరీ చదువుకు ఊతమిస్తున్నారు. అర్చన విద్యాసేవకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న అర్చన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. - నూగూరి అర్చన (ప్రధానోపాధ్యాయురాలు) ఇవి చదవండి: మనీమంత్ర కవితాగానం -
పుట్టింటికి భారమై.. మెట్టింటికి దూరమై.. జీవితాన్ని యోగవంతం చేసుకుంది!
ఉత్తరప్రదేశ్లోని హపూర్లో పుట్టింది ఫైజా సైఫీ. నలుగురు సంతానంలో పెద్దమ్మాయి. ఫైజా తండ్రి ఫరీదాబాద్లో పనిచేసేవారు. దీంతో ఫైజా కూడా అక్కడే చదివింది. కాస్త పెద్దయ్యేసరికి ‘‘మనం మన సంప్రదాయాలు కచ్చితంగా పాటించాలి’’ అని ఇంట్లో వారు చెప్పేవాళ్లు. వయసుతోపాటు నిబంధనలు పెరిగాయి. తనకు నచ్చని ఆంక్షలు పాటించడానికి ఫైజా ఒకపట్టాన ఇష్టపడేది కాదు. టీనేజ్లోకి రాగానే ‘‘ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండు, ఇలా ఉండు’’ అని చెప్పేవారితో ‘అలా ఎందుకు?’ అని వాదిస్తుండేది.' ‘‘అత్తారింటికి వెళ్లాక పనులన్నీ నువ్వే చేయాలి’’ అని చెప్పినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా.. ఉదయం నాలుగ్గంటలకే లేచి ఇంటిపనులు చేసేది. స్కూలు నుంచి వచ్చాక కూడా ఇంటిపనులు చూసుకోక తప్పేది కాదు. ఇలా పనులు చూసుకుంటూనే 2003లో పదో తరగతి పాసైంది. ఆ తరువాత ఢిల్లీ సంబంధం వస్తే పెళ్లిచేశారు ఫైజాకు. ఇల్లు కాస్తా జైలైంది.. పెళ్లి అంటే ఏంటో తెలియని వయసులో.. తనకంటే బాగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో వివాహం జరిగింది. భర్తకు మూర్ఛరోగంతో పాటు మానసిక సమస్యలు ఉండడంతో కోపం వచ్చినప్పుడల్లా ఫైజాను విపరీతంగా కొట్టేవాడు. దీనికితోడు పుట్టింట్లో ఎప్పుడూ ధరించని బురఖాను అత్తారింట్లో తప్పనిసరిగా వేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో ఫైజాకు జైల్లో ఉన్నట్లు అనిపించింది. రోజంతా గొడ్డు చాకిరి.. అడుగడుగుకీ ఆంక్షలు.. అత్తారింటి బాధలు భరించలేక అమ్మావాళ్ల దగ్గర గోడు వెళ్లబోసుకున్నా.. ‘‘సమాజంలో పరువు, మర్యాదలు..’’ అని చెప్పి నోరు మూయించేవారు. ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది ఫైజా. పిల్లలు పుట్టాక కూడా.. అత్తారింట్లో ప్రసవం అయిన తరువాత వారానికే ఇంటి పనులు ఫైజా నెత్తిన పడ్డాయి. పెద్దకుటుంబం కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రుచిని కోరుతూ తను చేయగలదా.. లేదా..? అని కూడా చూడకుండా ఆమెను వండమని బలవంతం చేసేవాళ్లు. దీంతో ఫైజా నడుము నొప్పి, మైగ్రేన్, థైరాయిడ్, ఆస్తమాల బారిన పడి బాగా నీరసించిపోయింది. తిన్నావా? మందులు వేసుకున్నావా? అని అడిగేవారు ఒక్కరూ లేరు. ఇంత కష్టంలోనూ.. తన రెండున్నరేళ్ల కొడుకుని ప్లేస్కూల్లో దింపడానికి వెళ్లేది ఫైజా. అక్కడ పరిచయమైన టీచర్తో.. తనకు చదువుకోవాలని ఉందంటూ తన ఇంటి పరిస్థితులను వివరించి చెప్పింది. అప్పుడు టీచర్ ప్రైవేటుగా చదువుకోవచ్చని సలహా చెప్పడంతో చదవడం ప్రారంభించింది. పరీక్షలు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి అక్కడనుంచి రాసేది. పెద్దబాబుకి ఐదేళ్లు వచ్చేటప్పటికి రెండో బాబు కడుపులో పడ్డాడు. ఈసారి ఫైజా ఆరోగ్యం మరింత క్షీణించింది. మెడ నొప్పి, హై బీపీ వంటి సమస్యలు తలెత్తాయి. టీవీలో యోగా చూసి.. ఒకరోజు ఫైజా ఆరోగ్యం బాగా క్షీణించడంతో పుట్టింటికి పంపించేశారు. అక్కడ ఆయుర్వేద మందులు వాడడంతో కొంత ఉపశమనం లభించింది. ఆ తరవాత రెండో బాబును ప్రసవించింది. ప్రసవం తరువాత పదిహేనురోజులు పుట్టింటిల్లోనే ఉంది. ఆ సమయంలో ఒకరోజు టీవీలో వస్తోన్న యోగా కార్యక్రమాలను చూసింది. యోగాతో అనారోగ్యాలు నయం అవుతాయని తెలుసుకుని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఎవరికీ తెలియకుండా ఆసనాలు వేసేది. ఆసనాలు వేసేకొద్ది తన ఆరోగ్యం కుదుటపడడం గమనించింది ఫైజా. యోగా గురించి ఇతరులకు సలహాలు ఇస్తుండేది. రహస్యంగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత హిమాలయ యూనివర్శిటీలో యోగా, ఆక్యుప్రెజర్ థెరపీ, ఆయుర్వేదంలో డిప్లొమా చేసింది. ఆ రోజు రానేవచ్చింది! ఫైజా ఎవరికీ తెలియకుండా చదువుకున్నప్పటికీ అత్తారింట్లో అన్నీ తెలిసిపోయాయి. దాంతో ఆమెను కొత్తరకంగా హింసించడం, అకారణంగా చేయి చేసుచేసుకోవడం మొదలు పెట్టారు. ఫైజా భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పి.. రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. అంతటితో ఫైజాకు అత్తారింటితో సంబంధాలు తెగిపోయాయి. పుట్టింటిలో కొన్నిరోజులు ఉన్న తరువాత.. ‘‘నీ వల్ల చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెళ్లిళ్లు కావు. నువ్వు మీ అత్తారింటికి వెళ్లు. అక్కడే సర్దుకుపో’’ అని సతాయించడం మొదలు పెట్టారు ఫైజా తల్లిదండ్రులు. దాదాపు పదేళ్లపాటు అత్తారింట్లో అనుభవించిన నరకాన్ని మళ్లీ ఎదుర్కోవాలనుకోలేదు ఫైజా. తల్లిదండ్రులకు చెప్పినా అర్థం చేసుకోరు. వేరే దారిలేక తన పిల్లలను తీసుకుని ఫరీదాబాద్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ సాయం, మరోపక్క రూమ్మేట్స్ కూడా పిల్లలను ఉంచుకోవడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగంలో చేరింది. యోగా టీచర్గా.. స్కూల్లో టీచర్గా చేరిన ఫైజా యోగా తరగతులు చెప్పేది. అలా చెబుతూ 2013లో ‘ఫైజా యోగా’ పేరుతో సొంతంగా ఇన్స్టిట్యూట్ను పెట్టుకుంది. ప్రారంభంలో రోజుకి యాభైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఐదువందలకు పైకి చేరింది. ఇన్స్టిట్యూట్లో తరగతులేగాక యోగా క్యాంప్స్కూడా నిర్వహిస్తోంది ఫైజా. ఫీజులు చెల్లించలేనివారికి ఉచితంగా యోగా నేర్పించి వారిని యోగా ఇన్స్ట్రక్టర్లుగా మారుస్తోంది. ఫైజా ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ఆమెతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టారు. అలా ఆమె జీవితం యోగవంతం అయింది. ఆరోగ్యంగా.. ఆనందంగా.. 'నాకు ఢిల్లీ, ముంబై, అమెరికా, కువైట్ల నుంచి క్లైంట్లు ఉన్నారు. ఆన్లైన్ తరగతులు చెబుతున్నాను. ఏళ్లపాటు ప్రయత్నించినా గర్భం దాల్చని వారు సైతం నేను అందించే ప్రత్యేకమైన యోగా థెరపీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. నా దగ్గర యోగా నేర్చుకునేవారిలో చాలామంది బీపీ, గుండె సమస్యలు, అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, ఆందోళన, నిరాశా నిస్పృహల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. తమ్ముడు, చెల్లి కూడా నా దగ్గర యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. యోగా నాతోపాటు చాలామందిని ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబెడుతోంది. యోగా వల్లే ఈ రోజు నేను, నా ఇద్దరు కొడుకులు ఆరోగ్యంగా, ఆనందంగా బతక గలుగుతున్నాం. అమ్మాయిలూ.. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరి మీదా ఆధారపడకండి. ఇతరుల మీద ఆధారపడినంత కాలం ఆత్మవిశ్వాసం కోల్పోతారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే.. నాలాగా ఏదైనా సాధించగలుగుతారు.!' – ఫైజా సైఫీ ఇవి కూడా చదవండి: Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా.. -
పదహారు ప్రాయంలోనే సంగీత సు'స్వరా'యల్గా.. జస్లీన్ రాయల్
సుస్వరాయల్ పదహారు సంవత్సరాల వయసులోనే రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను ప్లే చేసే నైపుణ్యం జస్లీన్ రాయల్ సొంతం అయింది. ఆ తరువాత ఒకే సమయంలో మల్టీపుల్ మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ‘పంచి హో జవాన్’ సింగిల్తో సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకుంది. ‘బార్ బార్ దేఖో’ (2015)తో బాలీవుడ్లో కంపోజర్గా బ్రేక్ వచ్చింది. ‘ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మ్యూజిక్ కంపోజర్ అయ్యాను. నా మీద నాకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. కాలేజీ రోజుల్లో అందరూ ప్లాన్ బీ గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా నా మార్గం మ్యూజిక్ మాత్రమే అనుకున్నాను. రియాల్టీ షోలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా తొలిసారి గుర్తింపు లభించింది’ అంటున్న జస్లీన్కు మెలోడీలు అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రయాణమార్గాలలో తట్టే ట్యూన్లను పాటలుగా మలచడం అంటే ఇష్టం. కంపోజర్, సింగర్ అయిన జస్లీన్ రాయల్ తన తొలి ప్రాధాన్యత కంపోజింగ్ మాత్రమే అంటుంది. (ఇవి చదవండి: 'సహస్రనామం' సమ్మోహన విజయం!) -
సౌందర్య మళ్లీ పుట్టిందా !
-
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్తో లాభాలు... ► సౌర విద్యుత్కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
Charles Sobhraj: బికినీ కిల్లర్ నేర చరిత్ర తెలుసా?
ఛార్లెస్ శోభరాజ్.. ఫ్రెంచ్ సీరియల్కిల్లర్. సినిమాలు, న్యూస్ల ద్వారా చాలామందికి ఈ పేరు పరిచయం ఉండే ఉంటుంది. కామెడీ సినిమాల్లోనూ ఈ పేరు రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. కానీ, ఊహాకు కూడా అందనంత కరడుగట్టిన నేరస్తుడు ఇతను. నేరాలు చేయడంలో శోభరాజ్ది ఓ ప్రత్యేకమైన శైలి. నేరం చేశాక దొరక్కుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తాడు. ఆ తీరు ఓ పామును తలపిస్తుంది. అందుకేనేమో అతన్ని ‘ది సర్పెంట్’ అని కూడా పిలుస్తుంటారు. ఇతని చేతిలో బలైన పర్యాటకులు బికినీలో శవాలుగా తేలడంతో.. ‘బికినీ కిల్లర్’గా ఛార్లెస్ శోభరాజ్కు పేరు ముద్ర పడిపోయింది. హ్యాండ్సమ్ లుక్, స్టైలిష్ వేషధారణ, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే ఆ రూపం వెనుక.. ముసుగు గనుక తొలగిస్తే క్రూరమైన స్వభావం బయటపడుతుంది. నమ్మిన్నోళ్లను నట్టేట ముంచుతూ.. తాను మాత్రం చట్టాలకు దొరక్కకుండా తిరగడం ఇతని ప్రత్యేకత. ఆ తప్పించుకోవడం కోసం అతను వేసే స్కెచ్.. సినిమాటిక్గా ఉంటుంది. జైలుకు వెళ్లొచ్చినా.. క్రిమినల్గా తనకు దక్కిన అపకీర్తిని సైతం దర్జాగా ఆస్వాదించిన నైజం అతనిది. సినిమాల్లో చూపించే ప్రొఫెషనల్ కిల్లర్ల పాత్రకు స్ఫూర్తి.. ఛార్లెస్ శోభరాజ్ వ్యక్తిత్వం. 1963 నుంచి 1976 మధ్యకాలంలో నేరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది . 70వ దశకంలో.. పర్వతశ్రేణుల గుండా కాలినడకన సంచరించే పాశ్చాత్య పర్యాటకులనే(Hippie trail)లక్ష్యంగా చేసుకుని నేరాలకు తెగబడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది టూరిస్టులను చంపిన ఈ ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్.. ఒక్క థాయ్లాండ్లోనే 14 మందిని హతమార్చాడు. థాయ్ బాధితుల్లో చాలామంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్ అనే ముద్రపడింది. తండ్రి ఉన్నా లేనట్లే! వియత్నాంలోని సైగాన్(ప్రస్తుతం హో చి మిన్హ్ సిటీ) సువిశాలమైన నగరం. అక్కడ భారత్కు చెందిన వ్యాపారవేత్త శోభరాజ్ హాట్చంద్ భవ్నాని, ఓ దుకాణంలో పని చేసే ట్రన్ లోవాంగ్ ఫున్లకు డేటింగ్ చేశారు. ఈ జంటకు సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డ ఛార్లెస్ శోభరాజ్. ఏప్రిల్ 6వ తేదీన 1944లో జన్మించిన ఆ బిడ్డ పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే ఆ తండ్రి దూరమయ్యాడు. తోడు వదిలేసి వెళ్లిపోవడంతో.. ఛార్లెస్ తల్లి ఫ్రాన్స్కు వలస వెళ్లింది. అక్కడ ఓ ఫ్రెంచ్ ఆర్మీ లెఫ్టినెంట్ను వివాహం చేసుకుంది. అయితే.. ఆ జంటకు పుట్టిన సంతానం కారణంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నారేమో అనే భావనలోకి కూరుకుపోయాడు ఛార్లెస్ శోభరాజ్. మానసికంగా దిగజారి కుంగిపోయాడు. సమాజంపై, బంధాలపై విరక్తి చెందాడు. అలా అతని బుర్రలో టీనేజీ వయసులోనే క్రూర-నేర స్వభావం మొలకలెత్తడం మొదలైంది. యవ్వనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఛార్లెస్ శోభరాజ్.. ఓ చోరీ కేసులో 1963లో తొలిసారి జైలుకు వెళ్లాడు. కానీ, అప్పటికే అతని బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలే నిండిపోయి ఉన్నాయి. దీంతో అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని.. సకల భోగాలు అనుభవించాడు. ఆపై ఓ రిచ్ వలంటీర్తో పరిచయం పెంచుకున్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన ఛార్లెస్ శోభరాజ్.. పిక్పాకెట్ నేరాల నుంచి పెద్ద పెద్ద దందాలతో ప్యారిస్లో బడా క్రిమినల్గా ఎదిగాడు. ఛార్లెస్ శోభరాజ్ హత్యకు పన్నే కుట్రలు సైతం ప్లానింగ్గా ఉంటాయి. బాధితులకు తాగే వాటిలో, తినే వాటిలో విషపు గుళికలు ఇచ్చేవాడు. ఆయుష్షు గట్టిదైతే ప్రాణాలతో బయటపడేవాళ్లు. అలాంటి ఘటనతోనే మరోసారి అరెస్ట్ అయ్యాడు ఛార్లెస్ శోభరాజ్. 1976లో.. కొందరు కాలేజీ విద్యార్థులపై డ్రగ్స్, విషపు గోళీలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వాళ్లంతా ప్రాణాలతో బయటపడడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై నెలలో శోభరాజ్ అరెస్ట్ అయ్యాడు. మరికొద్ది రోజుల్లో శిక్షా కాలం ముగుస్తుందనగా.. పుట్టినరోజు వంకతో జైలు హోం గార్డులకు మత్తు మందు కలిపిన స్వీట్లు పంచి తప్పించుకున్నాడు. ఛార్లెస్ శోభరాజ్(యవ్వనంలో..) ప్రేమ.. పెళ్లి.. దగా యవ్వనంలో ఛార్లెస్ శోభరాజ్ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మొదటిసారి జైలుకు పోయి వచ్చాక.. ప్యారిస్లో విచ్చల విడిగా దోపిడీలు, కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆ సమయంలోనే.. చంతల్ కొంపాగ్నోన్ అనే పర్షియన్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకునే టైంకి.. శోభరాజ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎనిమిది నెలల శిక్ష తర్వాత బయటకు వచ్చి.. కొంపాగ్నోన్ను వివాహంచేసుకున్నాడు. అయితే.. మళ్లీ అరెస్ట్ను తప్పించుకునేందుకు గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. దారిలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రయాణిస్తూ.. టూరిస్టులను దోచుకుని.. చివరికి ముంబైకి చేరుకున్నాడు. అక్కడే కూతురు పుట్టింది. ఉష అనే పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. భార్య కోరిక మేరకు నేరాలకు బ్రేక్ వేసినప్పటికీ.. కార్ల దొంగతనం, స్మగ్లింగ్లు చేసుకుంటూ పోయాడు రహస్యంగా. ఆపై ఈజీ మనీ కోసం గ్యాంబ్లింగ్ వైపు అడుగులు వేశాడు. 1973లో ఢిల్లీ హోటల్ అశోకలో నగల దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. భార్య సహకారంతో అనారోగ్యం డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అయితే గంటల వ్యవధిలోనే తిరిగి వెంటనే పట్టేసుకున్నారు. ఆపై కన్నతండ్రి సహకారంతో జైలు నుంచి విడుదలై.. కాబూల్(అఫ్గనిస్తాన్) పారిపోయాడు. అక్కడ టూరిస్టులను దొచుకుంటూ.. మళ్లీ అరెస్ట్ అయ్యాడు. అక్కడ ఢిల్లీ తరహాలో స్కెచ్ వేసి తప్పించుకోవాలనుకున్నాడు. అనారోగ్యం నటించి.. ఆపై హాస్పిటల్ గార్డులకు మత్తుమందు ఇచ్చి ఎస్కేప్ అయ్యాడు. ఈ క్రమంలో.. భార్యా కూతురిని అక్కడే వదిలేసి ఇరాన్ పరారయ్యాడు. దీంతో చంతల్ కొంపాగ్నోన్ గుండె బద్ధలు అయ్యింది. బతిమాలి బిడ్డను ప్యారిస్కు భద్రంగా పంపించి.. తానూ శిక్షాకాలం పూర్తయ్యాక అక్కడికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె శోభరాజ్ ముఖం కూడా చూడలేదు.. చూడాలనుకోవట్లేదు!. ఇరాన్ నుంచి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో తన బంధువు ఆండ్రె భాగస్వామ్యంతో దోపిడీలు, నేరాలకు పాల్పడ్డాడు. గ్రీస్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. అక్కడా పోలీసుల కళ్లు గప్పి ఆండ్రెను వదిలేసి పారిపోయాడు. ఆపై పలు దేశాలకు దోపిడీలకు, హత్యలకు పాల్పడ్డ శోభరాజ్.. తన నేరాలకు సహకరించేలా అనుచర గణం తయారు చేసుకుని.. సమయం వచ్చినప్పుడు వాళ్లను పోలీసులకు ఇరికిస్తూ.. తాను మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండేవాడు. భారత్లో ఛార్లెస్ శోభరాజ్ 1976 నుంచి 21 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అందుకు కారణం.. ఫ్రెంచ్ టూరిస్టులతో వెళ్తున్న ఓ బస్సులో విషప్రయోగానికి పాల్పడి.. అందులో ఓ ఇజ్రాయెల్ పౌరుడ్ని చంపినందుకు. ఆపై విడుదలై.. పారిస్కు వెళ్లాడు. తిరిగి 2003లో నేపాల్కు చేరుకుని.. జంట హత్యల కేసు, నకిలీ పాస్పోర్ట్ వినియోగం నేరాలకుగానూ జీవిత ఖైదుతో శిక్ష అనుభవించాడు. చివరికి.. డిసెంబర్ 21, 2022న నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అతని విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. 78 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించడం, సత్ప్రవర్తన, దాదాపు శిక్షాకాలం(95 శాతం) పూర్తి చేసుకోవడం కారణాలతో.. విముక్తి కల్పించింది నేపాల్ అత్యున్నత న్యాయస్థానం. కానీ, నేపాలీ పోలీసులు మాత్రం అతని విడుదలకు ససేమీరా అంటున్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో అతన్ని విడుదల చేయాలని చెప్పిందో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2010లో ఇండో-నేపాలీ ఇంటర్ప్రెటర్, యువ లాయర్ నిహిత బిస్వాస్ను జైల్లోనే వివాహం చేసుకున్నాడు. ఆమె ఛార్లెస్ శోభరాజ్ తరపున వాదించిన లాయర్ కూతురు., అంతేకాదు.. వయసులో 44 ఏళ్లు చిన్నది కూడా. ఆకర్షనీయమైన అతని రూపానికి తాను ముగ్ధురాలిని అయ్యానని ప్రకటించుకుందామె. 2017లో గుండె ఆపరేషన్ కోసం రక్తదానం సైతం చేసిందామె. జైలు నుంచి భర్తను విడిపించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాల గురించి.. అంతర్జాతీయ మీడియా తరచూ కథనాలు ప్రచురిస్తూ వచ్చేది. అసలు హత్యలెందుకు? డ్రగ్స్, విషం, మత్తు మందు.. తినే తాగే వాటిల్లో కలిపి నేరాలకు పాల్పడుతుంటాడు ఛార్లెస్ శోభరాజ్. ఆపై చంపేసి.. దోచుకుంటాడు. కొన్ని సందర్భాలు.. చంపిన వాళ్ల ఐడెంటిటీలనే ఉపయోగించుకుని ఊళ్లు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతను 20 మందిని చంపినట్లు చెప్తుంటారు. కానీ, అందులో పదిహేను మాత్రమే అతని ఖాతాలో ధృవీకరణ అయ్యింది. మొత్తంగా అతను 30 హత్యలకు పాల్పడి ఉంటారని ఒక అంచనా. ఈ నేర చరిత అంతటితోనే ఆగిపోలేదు. ఫ్రాన్స్, గ్రీస్, మలేషియా, ఇరాన్, టర్కీ, అఫ్గనిస్తాన్, పాకిస్థాన్, నేపాల్, భారత్, థాయ్లాండ్లో.. నేరాలకు పాల్పడ్డాడు. ఛార్లెస్ శోభరాజ్ నేరచరిత నుంచి బయటకు రాని విషయాలెన్నో. అసలు నేరస్థుడిగా ఎందుకు మారాడు? ఆ నేరాల వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై అతను పెదవి విప్పకపోవడంతో.. ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. ఛార్లెస్ శోభరాజ్ మీద.. నాలుగు బయోగ్రఫీలు, మూడు డాక్యుమెంటరీలతో పాటు మే ఔర్ ఛార్లెస్ పేరిట ఓ హిందీ చిత్రం వచ్చింది. అలాగే.. 2021లో ది సెర్పెంట్ పేరుతో బీబీసీ/నెట్ఫ్లిక్స్ వాళ్లు ఎనిమిది భాగాలుగా తీసిన డ్రామా సిరీస్ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
వైఎస్సార్సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్.. కూటమిలో లేదు!
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement