-
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్లిస్ట్ చేసింది. -
ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది. గత సర్కారు తప్పిదమే! రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి.. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్పై సర్కారు దృష్టిపెట్టనుంది. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
తెలంగాణకు విద్యుత్.. ఎన్టీపీసీ నోఖ్రా ప్రాజెక్ట్ నేడు జాతికి అంకితం
న్యూఢిల్లీ: రాజస్తాన్లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్టీపీసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
18లోగా బకాయిలు చెల్లించకపోతే కరెంట్ కట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన రూ.930 కోట్ల బకాయిలను ఈనెల 18 లోగా చెల్లించని పక్షంలో రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో గడువులోగా బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ ట్రాన్స్ కో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యుత్ సరఫరా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి నిలుపుదల కానుంది. ఉత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్కి సంబంధించిన బిల్లులను నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయాలని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం లేట్ పేమెంట్ సర్చార్జ్ రూల్స్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్రానికి విద్యుత్ ఆపేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నాయి. -
ఇక ఆపండి.. కిషన్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. తెలంగాణలో కరెంట్పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానుకోండి కిషన్ రెడ్డి. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని కిషన్ రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. Telangana’s peak demand is 15500 MWs, this NTPC plant gives 680 MWs to Telangana. Essentially that accounts to only 4% of power that Telangana utilises. @kishanreddybjp Anna … kindly stop spreading lies about how uninterrupted power is given by Central Government. It is the… https://t.co/M4kP42JVOy — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 7, 2023 ఇక, అంతకుముందు కిషన్రెడ్డి ట్విట్టర్ వేదికగా..పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు కవిత కౌంటిరిచ్చారు. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ను 2020 ఏప్రిల్లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
నెలాఖరులోగా గ్రిడ్కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్ను ఈ నెలాఖరులో గా గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను 27 నుంచి గ్రిడ్కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్లో రెండో యూనిట్కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
సాక్షి, అనకాపల్లి/ విశాఖపట్నం: అనకాపల్లిలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీలో కేబుల్ ట్రాక్ విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాంలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 50 అడుగుల ఎత్తులో కేబుల్ ట్రాక్ నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కేబుల్ ట్రాక్ విరిగిపడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్ -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్టాప్లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
కరెంట్కు ‘సెంట్రల్’ ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్గా పేర్కొంటారు. ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్ఎనర్జీ, అంతర్రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ను కేంద్రం కేటాయించదు. ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు. -
హైడ్రోజన్తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో భారీ లోపం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1600 (2x800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ లోపం బయటపడింది. విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల తొలి యూనిట్ నిర్మాణం పూర్తయినా బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్ విఫలం కావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. మరమ్మతుల్లో భాగంగా ఈ గొట్టాలకు లోపాలున్న చోట కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఏకంగా 7,500 చోట్ల వెల్డింగ్ చేస్తున్నారని, ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆలోగా మరమ్మతులు పూర్తయితే మార్చిలో తొలి యూనిట్ ద్వారా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి జరిపి ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి. రీహీటర్ ట్యూబులే కీలకం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో హై ప్రెషర్, ఇంటర్మీడియేటరీ ప్రెషర్, లో ప్రెషర్ టర్బైన్లు ఉంటాయి. బాయిలర్లలో వేడిచేసిన నీళ్లు ఆవిరిగా మారి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత, భారీ పీడనంతో గొట్టాల ద్వారా ‘హైప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశించి దాన్ని తిప్పుతూ మళ్లీ వెనక్కి మళ్లుతుంది. బాయిలర్లోకి తిరిగి చేరే సమయానికి ఆవిరి ఉష్ణోగ్రత 300 సెంటిగ్రేడ్లకు పడిపోతుంది. రీహిటర్ ట్యూబ్స్లో మళ్లీ 600 సెంటిగ్రేడ్లకు వేడెక్కిన తర్వాత ‘ఇంటర్మీడియేటరీ ప్రెషర్ టర్బైన్’లోకి గొట్టాల ద్వారా ఆవిరి ప్రవేశించి దాన్నీ తిప్పుతూ చివరకు ‘లోప్రెషర్ టర్బైన్ ’లోకి చేరుతుంది. అక్కడ చల్లబడిన ఆవిరి మళ్లీ బాయిలర్లోకి నీళ్ల రూపంలో ప్రవేశిస్తుంది. మళ్లీ ఆవిరిగా మారి ‘హై ప్రెషర్ టర్బైన్’లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక లూప్గా జరుగుతుంది. నీళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి. నాసిరకం గొట్టాలతో సమస్యే ఆవిరి టర్బైన్లను తిప్పడం ద్వారా వెలువడే యాంత్రికశక్తిని ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో కీలకమైన ‘రీహీటర్ ట్యూబ్స్’లో నాణ్యత లేకుంటే అవి 600 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర పీడనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. నాసిరకం ముడిసరుకుతో తయారైన గొట్టాలు తరచూ కోతకు గురికావడం, తుప్పుపట్టడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఆవిరి ఉష్ణోగ్రతలు పడిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు. రీహీటర్ ట్యూబ్స్లో వచ్చే సమస్యలతోనే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అధిక శాతం అంతరాయాలు కలుగుతాయి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న గొట్టాలను ఎన్టీపీసీ వినియోగించినా విఫలం కావడంపట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ చేసి మరమ్మతులు చేసినా భవిష్యత్తులో అవి మళ్లీ విఫలమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. రీహీటర్ గొట్టాలకు లీకేజీలతో గత డిసెంబర్లో నిర్వహించాల్సిన తొలి యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ వాయిదా పడింది. నిర్మాణ జాప్యంతో రాష్ట్రంపై భారం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ నుంచి 2020 జూన్లో, రెండో యూనిట్ నుంచి 2020 నవంబర్ నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును 2023 జూలైకు ఎన్టీపీసీ పొడిగించింది. రీహీటర్ ట్యూబ్స్ విఫలం కాకుంటే గత జనవరి నాటికి తొలి యూనిట్, మార్చి నాటికి రెండో యూనిట్ అందుబాటులో కి వచ్చేదని అధికార వర్గాలు తెలిపాయి. వేసవి విద్యుత్ అవసరాల కోసం ప్రస్తుతం రాష్ట్రం ఒక్కో యూనిట్ను సగటున రూ.7.20 ధరకు నిత్యం రూ.60 కోట్ల విలువైన విద్యుత్ను ఎక్ఛ్సేంజీల నుంచి కొంటోంది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తై ఉంటే యూనిట్కు రూ. 5 ధరతో విద్యుత్ లభించేది. దీంతో అధిక ధర విద్యుత్ కొనుగోళ్ల భారం తప్పేదని, ప్రస్తుత ఫిబ్రవరిలోనే రూ.50 కోట్ల మేర ఆదా అయ్యేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎన్టీపీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్ఎఫ్) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది. చదవండి: ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ -
3 గిగావాట్ల సామర్థ్యానికి ఎన్టీపీసీ
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగంలో 3 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నట్టు ఎన్టీపీసీ వెల్లడించింది. రాజస్తాన్లోని బికనీర్ వద్ద నోఖ్రా సోలార్ పీవీ ప్రాజెక్టులో 100 మెగావాట్లు తోడవడంతో డిసెంబర్ 20న ఈ ఘనతను సాధించామని ప్రకటించింది. 2022 జూన్ 24న ఎన్టీపీసీ గ్రూప్ 2 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. 12 రాష్ట్రాల్లో సంస్థ ఖాతాలో 36 ప్రాజెక్టులకుగాను 3,094 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కొత్తగా 4.8 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియలో మరో 7.3 గిగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది ఎన్టీపీసీ లక్ష్యం. -
అమ్మకానికి కోల్ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా సేల్ చేయనున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. 16500 కోట్లు ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ డిజ్ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లో భాగంగా కోల్ ఇండియా,ఎన్టీపీసీ, హిందుస్తాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్, ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ (ఆర్ఐటీఈఎస్) వాటాల్ని ఆఫర్ ఫల్ సేల్కు పెట్టనుంది. 10-20శాతం వాటాల విక్రయం పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. టార్గెట్ రూ.65 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్ఇన్వెస్ట్మెంట్) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)వెబ్సైట్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ చేతిలో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది. -
ఎలక్ట్రిక్గా డీజిల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎన్టీపీసీతో కలసి సంయుక్తంగా కేంద్రం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా భాగం పంచుకోనుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశలో హైదరాబాద్లో నడుస్తున్న 100 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. మరో 2–3 నెలల్లో ఇవి పొగలేని కాలుష్యరహిత వాహనాలుగా నగర రోడ్లపై పరుగుపెట్టనున్నాయి. మలిదశలో మరిన్ని బస్సులను కూడా మార్చనున్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచే క్రమంలో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. కేంద్రం నుంచి కిట్.. ఎన్టీపీసీ నుంచి బ్యాటరీ.. కొత్త ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు కానుంది. అదే ఏసీ బస్సుకు రూ. 2 కోట్ల వరకు వ్యయం చేయాల్సిందే. ఇంత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆర్టీసీ వాటిని సమకూర్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీలు ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాత బస్సులనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ గతంలో ప్రయత్నించింది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డిపోలోని ఓ బస్సును మార్చి పరిశీలిస్తోంది. ఇలా మార్చడానికి కూడా దాదాపు రూ.65 లక్షల వరకు ఖర్చు కానుండటంతో ఆ ప్రక్రియ కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి తీపికబురు అందించింది. స్వయంగా ఈ మార్పిడి ప్రక్రియ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా అందుకు అంగీకరిస్తూ ప్రయోగాత్మకంగా తొలిదశలో 100 బస్సులను కన్వర్ట్ చేసుకోవడానికి ముందుకొచ్చింది. తాజా ప్రాజెక్టు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం కన్వర్షన్ కిట్ కోసం ఒక్కో బస్సుకు రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ కిట్ సరఫరాకు కూడా ఏర్పాట్లు చేయనుంది. ఇక ఎన్టీపీసీ రూ. 40 లక్షల విలువైన బ్యాటరీని సరఫరా చేయనుంది. ఇందుకోసం బ్యాటరీ తయారీ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ఆర్టీసీకి నయాపైసా ఖర్చు లేకుండా ఒక్కో బస్సుకు రూ.60 లక్షల విలువైన పరికరాలు అందనున్నాయి. అద్దె వసూలు చేసుకోనున్న ఎన్టీపీసీ.. ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ అయిన బస్సులను ఆర్టీసీనే నడపనుంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీనే తీసుకోనుంది. కానీ జీసీసీ పద్ధతిలో ఆర్టీసీకి సమకూర్చే బస్సులకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం అద్దె చెల్లిస్తున్నట్టుగా ఈ కన్వర్ట్ అయిన బస్సులకుగాను ఎన్టీపీసీకి నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. బస్సుల చార్జింగ్ ఏర్పాట్లను ఆర్టీసీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ►సాధారణంగా ఒక డీజిల్ బస్సుకు కి.మీ.కు రూ. 20 వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది. ►అదే బ్యాటరీ బస్సుకు ఆ ఖర్చు రూ. 6గానే ఉంటుంది. వెరసి కి.మీ.కు రూ. 14 వరకు ఆదా అవుతుంది. ►కేంద్ర ప్రాజెక్టు వల్ల ఆర్టీసీకి కన్వర్షన్ భారం లేనందున వీలైనన్ని బస్సులను ఎలక్ట్రిక్లోకి మార్చుకొనే వెసులుబాటు కలుగుతుంది. ►ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3 వేలకుపైగా అద్దె బస్సులున్నాయి. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులు, 10 డబుల్ డెక్కర్ బస్సులను, కొన్ని స్లీపర్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. వాటికి చెల్లిస్తున్నట్టుగానే కన్వర్షన్ బస్సులకు కూడా అద్దె చెల్లిస్తుంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారం కాబోదు. -
NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ
పెద్దపల్లి/జ్యోతినగర్: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 1975 నవంబర్ 7న నామకరణం స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దినదినాభివృద్ధి చెందుతూ.. ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది. ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం.. ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది. -
ఎన్టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. -
పెన్నార్కు రూ.1,167 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ సంస్థ పెన్నార్ గ్రూప్ సెప్టెంబర్లో రూ.1,167 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఎన్టీపీసీ రెనివేబుల్ ఎనర్జీ నుంచి కూడా ఆర్డర్ పొందామని పెన్నార్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కూరం వెల్లడించారు. ‘రాజస్తాన్లో ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఏసీ/625 మెగావాట్ల డీసీ సోలార్ పీవీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. డిజైన్, సరఫరా, నిర్మాణం ప్రాతిపదికన పెన్నార్ ఇండస్ట్రీస్ 12.5 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు సంస్థ స్వీకరిస్తుంది’ అని వివరించారు. రిలయన్స్, టీసీఐ లిమిటెడ్, థెర్మాక్స్, టాటా నుంచి సైతం పెన్నార్ గ్రూప్ కంపెనీలు ఆర్డర్లను పొందాయి. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement