పాల్వంచరూరల్ : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యంలో తేమ శాతం 17 లోపే ఉండేలా రైతులు జాగ్రత్త పడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.బాబురావు అన్నారు. మండల పరిధి సోములగూడెంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకొచ్చే ధాన్యంలో తాలు, పొట్టు లేకుండా శుభ్రం చేయాలని సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులు 50 క్వింటాళ్ల లోపు అయితే ఏఈఓ నుంచి, అంతకు మించి అయితే ఏఓ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం సహాయ వ్యవసాయ అధికారి డి.రమేష్, రవికుమార్, శంకర్, సీఈఓ లక్ష్మీనారాయణ, ఏఈఓ సత్యం పాల్గొన్నారు.
ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://tsemrs.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు.