ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.? | Sakshi
Sakshi News home page

చమురు ధరలు పెరుగుతున్నా కేంద్రం వెనుకడుగు

Published Tue, Apr 16 2024 3:13 PM

Prices May Hike Of Petrol And Diesel After Elections In India - Sakshi

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్‌ చమురు ధర 90 యూఎస్‌ డాలర్లకు చేరింది. కానీ భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు మాత్రం స్థిరంగానే ఉ‍న్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్‌ఆన్‌ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. 

దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్‌ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. 

అసలేం జరిగిందంటే..

ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్‌ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇరాన్‌పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు స్పష్టం చేశారు. 

ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్‌, ఇరాన్‌ల మధ్య ఉన్న హార్ముజ్‌ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్‌ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్‌ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్‌ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. 

ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్‌లో భారీ ఎక్స్‌పో.. ఎప్పుడంటే..

ఎన్నికల వేళ ఆచితూచి..

యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement