భూమి అంతానికి నాలుగు కారణాలు! | Sakshi
Sakshi News home page

భూమి అంతానికి నాలుగు కారణాలు!

Published Sat, Mar 16 2024 11:53 AM

How Earth Will End, Know Why And When? - Sakshi

పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

‘సూపర్‌ ఖండం’తో పెనుముప్పు
గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్‌ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. 

మనుగడ కోసం పోరాటంలో..
అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం,  అనుకూలత అనేవి జీవులు జీవించడానికి  కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. 

పరిమిత వనరుల మధ్య..
భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి  మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే,  ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. 

వేడెక్కుతున్న మహాసముద్రాలు
వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్‌  రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. 

Advertisement
 
Advertisement