కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని! | Sakshi
Sakshi News home page

Siddharth: హీరో సిద్ధార్థ్ భావోద్వేగం.. ఇక్కడికి ఇకపై రానంటూ!

Published Tue, Oct 3 2023 4:12 PM

 Actor Siddharth Got Emotional Chinna Movie Event Speech - Sakshi

హీరో సిదార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలారోజుల తర్వాత తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇతడు.. స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తనని, తన సినిమా అవమానించారని చెబుతూ బరస్ట్ అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? సిద్ధార్థ్ ఏం చెప్పాడు?

ఏం జరిగింది?
స్వతహాగా తమిళ నటుడు అయినప్పటికీ పలు సూపర్‌హిట్ తెలుగు సినిమాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటిది గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. చాన్నాళ్ల తర్వాత 'మహాసముద్రం' అనే సినిమాలో నటిస్తే అది ఘోరంగా ఫ్లాప్ అయింది. అలా సక్సెస్ లేక అల్లాడుతున్న సిద్ధార్థ్.. తానే నటిస్తూ, నిర్మిస్తూ 'చిట్టా' అనే సినిమా తీశాడు. గత వారం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో 'చిన్నా' పేరుతో రిలీజ్ చేద్దామని చూస్తే.. సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ బాధపడ్డాడు.

(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!)

సిద్ధార్థ్ కామెంట్స్
'ఇంతకన్నా గొప్ప సినిమా నేను చూడలేదు' అని ఉదయనిధి స్టాలిన్, తమిళంలో నా సినిమాను కొన్నారు. కేరళలోనూ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ నా సినిమా తీసుకున్నారు. కన్నడలో 'కేజీఎఫ్' నిర్మించిన వాళ్లు రిలీజ్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి.. 'సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారు?' అని అన్నారట. నేనో మంచి మూవీ తీస్తే ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. ఆ టైంలో నా దగ్గరకొచ్చి.. మేం మీతో ఉన్నామని ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. వాళ్లకు చాలా థ్యాంక్స్.

నా సినిమాలో అది ఉంది, ఇది ఉందని చెప్పి అడుక్కు తినే బ్యాచ్ కాదు. మీకు సినిమాలపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్‌కి వెళ్లి 'చిన్నా' చూడండి. ఇది చూసిన తర్వాత 'తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం' అనిపిస్తే.. ఇక తెలుగులో ప్రెస్‌మీట్స్ పెట్టను. ఇక్కడికి రాను అని చెబుతూ సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?)

Advertisement
Advertisement