వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? | Sakshi
Sakshi News home page

Shrangi Rishi Ashram: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?

Published Sun, Jan 7 2024 8:54 AM

Shrangi Rishi Ashram People Uncle Calls lord Ram - Sakshi

ఆ గ్రామంలోనివారికి శ్రీరాముడు మామ అవుతాడు. దీని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. ఆగ్రాలోని రుంకటా పరిధిలోని సింగనా గ్రామంలో శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. అయోధ్యలో 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు.

శృంగి మహర్షి అలనాడు దశరథ మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లి పుత్రకామేష్టి యాగం చేశాడు. సింగనా గ్రామ ప్రజలు శ్రీరాముడిని ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. శ్రీరాముడిని వారు మామగా పిలవడానికి కారణం ఉంది. దశరథ మహారాజు కుమార్తె శాంతకుమారికి శృంగిమహర్షితో వివాహం జరిగింది. శ్రీరాముని సోదరి శాంతకుమారి వివాహానంతరం ఈ ప్రాంతానికి వచ్చినందున వారు శ్రీరామునితో బంధుత్వం ఏర్పరుచుకుని, మామా అని సంబోధిస్తుంటారు. 

సింగన గ్రామంలో యమునా నది ఒడ్డున శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. కుమారుడు పుట్టాలనే కోరికతో శృంగి ఋషి ఆశ్రమానికి ఎవరైనా వస్తే వారి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. శృంగి మహర్షి ​​అయోధ్యకు వెళ్లి, పుత్రకామేష్టి కోసం యాగం చేసిన దరిమిలా రామలక్షణ భరత శత్రుఘ్నలు జన్మించారు. 

శృంగి మహర్షి ఆశ్రమానికి చెందిన మహంత్ నిరంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ ఆశ్రమంలో శృంగి మహర్షి తపస్సు చేశారని, ఈ శృంగి మహర్షి తపోభూమి ఎంతో శక్తివంతమైనదని అన్నారు. అయోధ్యలో
జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోనివారంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించనున్నారు. 
 

Advertisement
Advertisement