రంగంలోకి డ్రోన్‌లు.. పోలింగ్‌ బూత్‌లలో పటిష్ట నిఘా | Sakshi
Sakshi News home page

Uttarakhand: రంగంలోకి డ్రోన్‌లు.. పోలింగ్‌ బూత్‌లలో పటిష్ట నిఘా

Published Thu, Apr 4 2024 1:52 PM

Uttarakhand Police to monitor booths in remote areas through drones - Sakshi

డెహ్రాడూన్‌: రానున్న లోక్‌సభ ఎన్నికలకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తున్నారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలు, వాటి సమీప పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక్కడ మొత్తం 5 లోక్‌సభ స్థానాలున్నాయి. అన్నింటికీ ఏప్రిల్‌ 19న మొదటి దశలో పోలింగ్‌ జరగనుంది.

"2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్‌లు, పరిసర ప్రాంతాలను ఉత్తరాఖండ్ పోలీసులు డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షిస్తారు" అని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉత్తరాఖండ్‌లోని క్లిష్ట భౌగోళిక పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలు, నిఘా, ఫోటో, వీడియోగ్రఫీ వంటి వాటి కష్ట సాధ్యమని పేర్కొంది.

ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా నిఘాను పర్యవేక్షించనున్నారు. ఈ డ్రోన్లు పంపిన ప్రత్యక్ష దృశ్యాలను స్కాన్ చేయడానికి రాష్ట్ర పోలీసులు తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను కూడా ప్రారంభించారు. "డ్రోన్ పంపిన చిత్రాలు, వీడియోలను ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు గుర్తించిన వెంటనే ఆ సమాచారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎన్నికల కార్యకలాపాల కేంద్రానికి వెళ్తుంది" అని రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌ వివరించింది.

Advertisement
 
Advertisement