రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌ | Sakshi
Sakshi News home page

రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌

Published Mon, Apr 6 2020 12:23 PM

Rajinikanth And Grylls Into The Wild With Bear Got Second Highest Ratings - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ కలిసి చేసిన వెబ్‌ సిరిస్‌ ‘ఇన్‌టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’. డిస్కవరీ ఛానెల్‌ రూపోదించిన ఈ వెబ్‌ సిరిస్‌ ప్రత్యేక ఎపిసోడ్‌ విడుదలైనప్పటినుంచి సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రియాలిటీ టెలివిజన్‌ షో ప్రీమియర్‌ ఎపిసోడ్‌ మార్చి 23న డిస్కవరీ నెట్‌వర్క్‌(12 ఛానెల్స్‌)లో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ షో రెండో అత్యధిక రేటింగ్‌ సాధించిన రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ ఏడాదిలో అధిక రేటింగ్‌ సాధించిన రియాలిటీ షోగా, అదేవిధంగా రియాలిటీ షోల చరిత్రలోనే అత్యధిక రేటింగ్‌ పొందిన రెండో ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. (రజనీకాంత్ సాహసయాత్ర)

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం.. ‘ఇన్‌టూ ద వైల్డ్‌ బేర్‌ గ్రిల్స్‌’   ప్రీమియర్‌ షోను సుమారు 12.4 మిలియన్ల మంది విక్షించారు. ఇది గత నాలుగు వారాలతో పోల్చితే సుమారు 86 శాతం అధికం. ఈ షోను తమిళ డిస్కవరీ చానెల్‌లో ప్రసారం చేయగా.. అత్యధికమంది విక్షించారు. ఇక తమిళ ఛానెల్స్‌.. కలర్స్‌ తమిళం, రాజ్‌ టీవీ, జయ టీవీ వంటి వాటిలో ప్రసారమయ్యే పలు షోలను రజనీ రియాలిటీ షో వెనక్కి నెట్టింది. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్‌ గ్రిల్స్‌ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. 

కాగా ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అన్నాత్త’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తీసుకురావడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం.

Advertisement
Advertisement