రోజుకో సినిమా చూపిస్తారు..బీ కేర్‌ఫుల్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నమ్మొద్దు: వైఎస్‌ జగన్‌

Published Sat, Mar 30 2019 1:50 PM

YS Jagan Mohan Reddy speech in kurnool district Yemmiganur - Sakshi

సాక్షి, ఎమ్మిగనూరు : ‘‘ఈ అయిదేళ్ల చంద్రబాబు పాలన గురించి అందరూ ఆలోచించండి. అధికారంలోకి వచ్చేముందు చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు ఏం హామీ ఇచ్చారో అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషి అన్నిరకాలుగా అందరినీ మోసం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో చెప్పారు. విడతల వారీగా ఇస్తామని చెప్పి రైతులను మోసపూరిత వాగ్దానాలు చేశారు. మళ్లీ ఎన్నికలు దగ్గర్లో పెట్టుకుని బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. ఇంతగా మోసం చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా?. ఇదే చంద్రబాబు పాలన ఎల్లో మీడియాకు మాత్రం బంగారంలా కనిపిస్తుంది.’’  అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బహిరంగ సభలో ప్రసంగించారు. 

అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా...ప్రజలకు  రోజుకో సినిమా చూపిస్తాయని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ జగన్ సూచించారు.  ఓ వైపు చంద్రబాబు, మరోవైపు ఎల్లో మీడియా కుట్రలు అందరూ చూస్తున్నారని, ఈ కుట్రలు ముందు ముందు ఇంకా పెరిగిపోతాయన్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపిస్తారని, గ్రామాలు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.3వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయిపోతున్నారని, ఆ డబ్బుకు ఆశపడ వద్దని వైఎస్‌ జగన్‌ కోరారు. కొద్దిరోజులు ఓపిక పడితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి... ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ను ఆశీర్వదించాలని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చదవండి....(దోచుకుని దేశంలో ధనిక సీఎం అయ్యారు: వైఎస్‌ జగన్‌)

బాబును నమ్మి రైతులు మోసపోయారు
వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే... ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాలు మాఫీ చేయలేదు. చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు.  రైతులకు కనీస గిట్టుబాటు ధరకూడా రాలేదు. ఈనాడు సర్వం కోల్పోయి అన్నదాతలు రైతులకు చివరకు రైతు బీమా కూడా ఇవ్వలేదు. హెరిటేజ్‌ కోసం రైతులను దోచి దళారులను బాగు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం.  రైతుల రుణాలు 85వేల కోట్ల నుంచి లక్షా 50వేల కోట్లకు పెరిగాయి. ఏపీలో రైతుల అప్పులు ఏస్థాయిలో ఉన్నాయో నాబార్డు నివేదికలు చెబుతాయి. ఇక పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల పథకాన్ని తీసేశారు. అసెంబ్లీలో మేము అడిగిన ప్రశ్నకు ..డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయబోమని అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రలోభాలకు మోసపోకండి. 

కొద్ది రోజులు ఓపికపడితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు. రైతులకు ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి సాయం రూ.12,500. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు. డ్వాక్రా మహిళలకు చెబుతున్నా.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాం. అవ్వా, తాతలకు రూ.3వేల వరకూ పింఛన్‌ ఇస్తాం. పసుపు-కుంకుమ డ్రామాకు మోసపోవద్దు. జగన్ రూ.2వేలు ఇస్తానని చెప్పకుంటే చంద్రబాబు ఇచ్చేవారా? ’ అని సూటిగా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement