-
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
వాట్సప్లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్కాల్స్తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్లో మెసేజ్లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్లో మెసేజ్లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్సైట్కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్సైట్కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్కు వెళ్ళిపోతుంది. యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు! బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. లింక్ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది. ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. మీ డిజిటల్ అకౌంట్స్ పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్ల ద్వారా వచ్చే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
డార్క్వెబ్లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్వెబ్లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా.. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్లు ఓపెన్ చేసి టాస్క్లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్లో డబ్బు కనిపించినా విత్డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్నేరగాళ్లు చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్డ్రా వివరాలు నిత్యం స్క్రీన్పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
'పార్ట్ టైం జాబ్' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్కు వచ్చింది. దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్లో చూపిస్తూ వచ్చాడు. చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం! -
ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు, కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి మీ సిమ్ కార్డు సర్వీస్ నిలివేస్తున్నట్లు, ఆలా జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మోసాలపైన 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DOT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వినియోగదారులకు ఫోన్ చేసి మరి కొన్ని గంటల్లో సిమ్ డీయాక్టివేట్ అవుతుందని, సర్వీస్ నిలిపివేయనున్నట్లు భయపెడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని వివరాలు కావాలని అడుగుతారు. ఇది నిజమే అని నమ్మి వివరాలు వెల్లడిస్తే మోసాలు జరుగుతాయని DOT వెల్లడిస్తూ.. ఎవరూ ఇలాంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఇలాంటి కాల్స్ తరచూ వస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కి ఫిర్యాదు చేయవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ అరికట్టడానికి కొన్ని సంస్థలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైట్లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన యూఎస్ ట్రెజరీ ట్రేడ్లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్దాడికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్బిట్ 3.0 అనే రాన్సమ్వేర్ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్వేర్ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్వేర్లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్లోని స్పామ్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్వేర్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి లాక్బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్కు ప్రత్యేకమైన పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్వేర్ దాడుల్లో 28శాతం లాక్బిట్ ద్వారా జరిగినవేనని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్పాయింట్ నివేదిక చెబుతుంది. -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్మెయిల్తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్వేగస్లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్వేగస్లోని ప్లాస్టిక్సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్కేర్ సెక్టార్కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్లో ఔట్పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
వారానికి జరిగే సైబర్ అటాక్లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్పుర్లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్పుర్కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్లైన్లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ఏంటి.. ఈ యాప్ డౌన్లోడ్ చేశారా !? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే!
భద్రాద్రి: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. లక్కీ డ్రా వచ్చిందని, విలువైన వాహనాలు, వస్తువులు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ పెట్టి ఓటీపీ నంబరు తెలుసుకుని, అకౌంట్లలో నగదు జమ చేయించుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా యాప్లో పెట్టుబడి పెడితే రోజూ కొంత మొత్తం చొప్పున నిరంతరం తిరిగి డబ్బు జమచేస్తామని నమ్మించారు. సుమారు రూ. 2.5 కోట్లు కాజేశారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పలువురు పాక్స్కాన్ యాప్లో పెట్టి ఆర్థికంగా నష్టపోయారు. బుధవారం ఈ యాప్ అకస్మాత్తుగా క్లోజ్ అవడంతో లబోదిబోమంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని దమ్మపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా మూడు నెలల క్రితం పాక్స్కాన్ అనే యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్లే స్టోర్లో అందుబాటులో లేదు. కేవలం లింక్ ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి పంపుకున్నారు. లింక్ ద్వారా యాప్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పలువురు యువకులు పెట్టుబడి పెట్టారు. రూ.500 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టవచ్చని, రూ.500 పెట్టుబడి పెడితే రోజూ రూ.12.50 చొప్పన తిరిగి వస్తాయని, యాప్ లింక్ను వేరొకరికి పంపి పెట్టుబడి పెట్టిస్తే, అందులో 10 శాతం కమీషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. మొదటిలో పెట్టుబడిన పెట్టిన వారికి రోజూ డబ్బులు తిరిగి పంపించారు. దీంతో నమ్మకం కుదిరి వారు మళ్లీ ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వారిని చూసి మరికొందరు యువత కూడా యాప్లో పెట్టుబడి పెట్టారు. ఇలా 250 మంది వరకు పెట్టుబడి పెట్టి, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేసుకున్నారు. కాగా రెండు వారాల క్రితం పెట్టిన పెట్టుబడి మొత్తం 10 రోజుల్లో తిరిగి ఇస్తామని యాప్ ద్వారా ప్రచారం చేయాగా చాలామంది రూ.5 వేల నుంచి రూ. లక్ష చొప్పున రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. పది రోజుల గడిచినా ఎవరికీ తిరిగి రూపాయి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురయ్యారు. ఇంకా తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తుండగా మంగళవారం రాత్రి పాక్స్కాన్ యాప్ను ఆన్లైన్లో పూర్తిగా క్లోజ్ చేశారు. టెక్నికల్ సమస్యగా భావించిన పెట్టుబడి దారులు, వేచిచూసి బుధవారం యాప్ను ఒపెన్ చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదు. దీంతో తాము తీవ్రంగా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. -
ఈ ఒక్క క్లిక్ చేశారో.. మీ ఖాతా ఖాళీ..!
జగిత్యాల: సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరు కోసం వచ్చిన కొత్త యాప్ను క్లిక్ చేయగా.. ఓ వ్యక్తి రూ.1.67 లక్షలు మోసపోయిన సంఘటన పెగ్గెర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడి సెల్ఫోన్ సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరుకు సంబంధించి ఓ యాప్ క్లిక్ చేయాలని సందేశం వచ్చింది. ఆ యువకుడు యాప్ను క్లిక్ చేశారు. మొదటగా రూ.1,250 చెల్లించాలని బ్యాంక్ ఖాతా నంబరు పంపించారు. ఆ యువకుడు రూ.1,250 చెల్లించారు. ఇలా రూ.1.67 లక్షలు చెల్లించాక రుణం మంజూరు కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. -
వ్యక్తిగత డేటా సేఫ్గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్వర్క్పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్వర్డ్లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్వేర్ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్ని అప్డేట్ మోడ్లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్ను చెక్ చేయాలి మీ యాప్లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్సైట్ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
ఓ సైబర్ అపరిచితుడు.. సర్వేయర్లే టార్గెట్గా..!
మహబూబాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు జాబ్స్ పేరిట.. లంచాలు తీసుకున్న వారిని ఏసీబీ కేసు నుంచి తప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి ఓ వ్యక్తి పాల్పడగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని సర్వేయర్గా పని చేస్తున్న కొందరు ఉద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. మోసానికి పాల్పడుతున్న తీరు ఇలా.. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లతో తనకు తాను ఏసీబీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీరు లంచాలు తీసుకున్నారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ సర్వేయర్గా పని చేస్తున్న మల్లయ్యకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు లంచం తీసున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు నుంచి నిన్ను తప్పించేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. అదే రోజు పర్వతగిరి మండలంలో పని చేస్తున్న సర్వేయర్ శ్యామూల్కు అదే వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు నమోదు చేస్తామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని సర్వేయర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పలువురు సర్వేయర్లకు ఫోన్లు చేసి ఏసీబీ కేసుల నుంచి మిమ్మలను తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఇందుకోసం గూగుల్పే, ఫోన్పేలో డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. సందేహం వచ్చిన సదరు ఉద్యోగులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడితో జరిగిన సంభాషణ, ఫోన్ నంబర్ వివరాలు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో సర్వేయర్లను నమ్మించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. సదరు నిందితుడికి డబ్బులు పంపించవద్దని సర్వేయర్లకు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు సమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement