-
కాంగ్రెస్ విషాదం
గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడల్లా కాంగ్రెస్ పుట్టి మునుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి కాంగ్రెస్లో మళ్లీ భిన్న స్వరాలు కత్తులు దూసుకుంటున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో మొదలుపెట్టి ఒక్కొక్కరే చేస్తున్న వ్యాఖ్యలు చివరకు పార్టీ అధ్యక్ష పదవి వైపు మళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్కు ఘనమైన చరిత్రే వుంది. అక్కడ షీలా దీక్షిత్ నేతృత్వంలో ఆ పార్టీ వరసగా మూడు దఫాలు పాలించింది. అయితే 2013æనుంచి కాంగ్రెస్ క్షీణ దశ మొదలైంది. అక్కడే కాదు... దేశవ్యాప్తంగానే ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, బీజేపీ ఓటమిపై ట్వీట్ చేస్తూ ‘మోసకారులు, డంబాలు పలికేవారూ మట్టికరిచారు’ అనడంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని కీర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి శర్మిష్ట ఊహించని షాక్ ఇచ్చారు. ‘బాగాలేని రాష్ట్రాల్లో పార్టీని రద్దు చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను ఔట్ సోర్సింగ్కి ఇద్దామా?’అని నిలదీశారు. తనను జైలుపాలు చేసిన బీజేపీని గేలిచేయడానికి అవకాశం దొరికొందన్న సంబరమే తప్ప, పరాజయభారంతో ఖిన్నులైవున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతల మనోభావాలను గాయపరుస్తానేమోనన్న ఆలోచన చిదంబరానికి లేకపోయింది. ఢిల్లీ అపజయం సాధారణమైనది కాదు. ఆ పార్టీకి ఇది వరసగా మూడో ఓటమి. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ అంతకు ముందుకన్నా క్షీణించిపోవడం ప్రస్ఫు టంగా కనబడుతోంది. అసెంబ్లీలో సున్నా చుట్టడం ఇది వరసగా రెండోసారి. ఈసారి ఓట్లు నాలుగు శాతం మించలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్కు పడిన ఓట్లు ఒక శాతం కూడా లేవు! ఢిల్లీ పీసీసీకి లోగడ ఇన్చార్జిగా వున్న పీసీ చాకో ఢిల్లీ ఓటమికి చనిపోయిన షీలా దీక్షిత్ను తప్పుబడితే, మరో అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆమె హయాంలో ఎన్నడూ ఇంత హీన స్థితిలో లేదని జవాబిచ్చారు. ఇదంతా సద్దుమణగక ముందే ముంబై పీసీసీ చీఫ్ మిలింద్ దేవరా ఆప్ను, అరవింద్ కేజ్రీవాల్ను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆయనకు అజయ్ మాకెన్ నిష్టూరంగా జవాబిచ్చారు. కేవలం ఎన్నికల్లో ఓటమి సంభవించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఇలా పరస్పర కలహాలతో బజారున పడుతున్నదని అనుకోవడానికి లేదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్లో కూడా పార్టీ పరిస్థితి బాగులేదు. అక్కడ ముఖ్యమంత్రి కమల్నాథ్కూ, ఆ పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియాకూ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరసన ఉద్యమం ప్రారంభిస్తానని జ్యోతిరాదిత్య హెచ్చరించడం, అలా చేయమ నండి చూద్దామంటూ కమల్నాథ్ స్పందించడం ఆసక్తిదాయకంగా మారింది. వారిద్దరిమధ్యా రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పంజాబ్లో గత నెల పుట్టిన తుపాను పర్యవసానంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీసీసీని, జిల్లా కమిటీలను రద్దు చేశారు. ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య సమన్వయం కోసం 11మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా సమస్య తలెత్తినప్పుడల్లా ఏదో ఒకటి చేశామని చెప్పుకోవడానికి తప్ప, మొత్తంగా పార్టీని ఏకతాటిపై నడిపించగల సామర్థ్యం అధినాయకత్వానికి లేకుండాపోయింది. కనుకనే ఈ వివాదం చివరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవివైపు మళ్లింది. నాయకత్వ లేమిని పార్టీ సరిదిద్దుకోవాలంటూ ఎంపీ శశి థరూర్ ఇచ్చిన పిలుపు పెను ప్రకంపనలు సృష్టించింది. అంతక్రితం నాయకత్వం తలెత్తిన ప్రశ్నకు సరైన జవాబును అన్వేషించడం పార్టీకున్న పెద్ద సవాలని షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. మరో సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ వీరితో గొంతు కలిపి పార్టీ ‘చింతన్ బైఠక్’ జరపాలని, సంస్థాగత జడత్వాన్ని వదిలించుకోవాలని పిలుపు నిచ్చారు. అయితే కాంగ్రెస్కు రాహుల్గాంధీ తిరుగులేని నాయకుడని, ఎవరినో ఎన్నుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని ఆయన మద్దతుదార్లు ఒకటికి రెండుసార్లు చెబుతున్నారంటే పార్టీలో నెలకొన్న పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదని, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వీరందరూ మరిచిపోతు న్నారు. పైగా ఫలానా సమయం వరకే ఈ పదవిలో ఉంటానని ఆమె గడువేమీ విధించలేదు కూడా. అయినా అధ్యక్ష పదవి గురించి బాహాటంగా అందరూ మాట్లాడుతుంటే, ఎవరికి వారుగా ఇష్టాను సారం వ్యాఖ్యలు చేస్తుంటే వారిని బతిమాలి నోరు మూయించడం తప్ప పార్టీ నాయకత్వం మరేమీ చేయలేకపోతోంది. కాంగ్రెస్కు గెలుపోటములు కొత్తేమీ కాదు. అధికారానికి దూరంగా ఉండటం గతంలోనూ జరిగింది. వేరే నేతలు పార్టీకి సారథ్యం వహించినప్పుడు అప్పుడప్పుడు సమస్యలు తలెత్తినా, గాంధీ–నెహ్రూ కుటుంబీకులున్నప్పుడు ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం కనబడదు. పార్టీ ఎదుగుదలను కాంక్షించి చిత్తశుద్ధితో పనిచేసేవారిని శంకించి దూరం పెట్టడం, వారికి వ్యతిరేకంగా తమ భజనపరులతో ముఠాలు కట్టించి కలహాలు రేపడం పార్టీ నాయకత్వానికి అలవాటుగా మారాక పార్టీ క్షీణ దశ మొదలైంది. ఒకదాని వెనక ఒకటిగా వచ్చే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పార్టీ మరింత బలహీనపడుతోంది. ఈ ఏడాది రెండు ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీ స్థితి అంతంతమాత్రమే. బిహార్లో ఆర్జేడీతో కూటమి కడితే కొద్దో గొప్పో వస్తాయనుకున్నా, బెంగాల్లో నిరాశ తప్పదు. ఇప్పటికైనా వైఫల్యాలు ఎందుకొచ్చిపడుతున్నాయో చిత్తశుద్ధితో సమీక్షించుకుని, సమర్థులైనవారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది. ఆ తర్వాత ప్రజల విశ్వాసాన్ని పొందడం ఏదో మేర సాధ్యమవుతుంది. -
దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్.. ఆప్ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ కార్యక్రమం చేపడ్తాయి. ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్ రాయ్ వివరించారు. రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. -
మోదీ ఆశీస్సులు కావాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన రాజకీయ ప్రత్యర్థులను క్షమించేశా నన్నారు. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్లతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తనను తాను ఢిల్లీ కొడుకునని చెప్పుకున్నారు. ఈ విజయం తనది కాదని, ప్రతి ఢిల్లీ పౌరుడిదని అన్నారు. గతంలో కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు. ‘హమ్ హోంగే కామ్యాబ్..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపి పాడి కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు. -
‘మఫ్లర్ మ్యాన్’ సందడి ‘క్రేజీ’
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘బేబి మఫ్లర్ మ్యాన్’ సందడి చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘అవ్యాన్ తోమర్’కు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఫంక్షన్కు ఆహ్మనం అందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రామ్లీలా మైదానంలో ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెటర్, మఫ్లర్, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. (‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) ఈవెంట్లో చిన్నారి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్ ఎమ్మెల్యేలు భగవత్మాన్, రాఘవ్ చద్దా, సోమ్నాథ్ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. (వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్) చదవండి : ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు! -
ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు!
కేజ్రీ... హ్యాట్రిక్ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... (చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం) పవన్ కుమార్ చామ్లింగ్ (ఎస్డీఎఫ్) రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24 ఏళ్ల 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్కుమార్ చామ్లింగ్ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్ బహుదూర్ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్ 1992లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు. సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్కుమార్పై ఒక క్రేజ్ని సృష్టించాయి. చామ్లింగ్ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు. సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. జ్యోతిబసు (సీపీఐ–ఎం) రాష్ట్రం: పశ్చిమ బెంగాల్, పదవీ కాలం: 23 ఏళ్ల 137 రోజులు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మాణిక్ సర్కార్ (సీపీఐ–ఎం) రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19 ఏళ్ల 363 రోజులు తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం మాణిక్ సర్కార్. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్ కుటుంబంలో జన్మించిన మాణిక్ సర్కార్ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్ సర్కార్ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది. బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్ సర్కార్ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్ సర్కార్ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) రాష్ట్రం: ఒడిశా, పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కాలంలో జనతాదళ్ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నవీన్ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15 ఏళ్ల 25 రోజులు ఇప్పుడు అందరం కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్. కాంగ్రెస్ డార్లింగ్గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. రమణ్ సింగ్ (బీజేపీ) రాష్ట్రం: ఛత్తీస్గఢ్, పదవీ కాలం: 15 ఏళ్ల 4 రోజులు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్తోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు రమణ్ సింగ్. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్ సింగ్ను ఆప్యాయంగా చావాల్ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్గఢ్ పరిపాలనను రమణీయంగా మార్చాయి. వ్యూహాత్మకంగా నక్సల్స్ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్ సింగ్పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్ సింగ్ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్ సింగ్ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. నరేంద్ర మోదీ (బీజేపీ) రాష్ట్రం: గుజరాత్, పదవీ కాలం: 12 ఏళ్ల 226 రోజులు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. గుజరాత్ మోడల్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్లో అత్యధికమన్న వాదనా ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement