మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
Published
Thu, May 2 2024 4:28 PM
బెంగళూరు: లోక్సభ 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించారు. కర్ణాటక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. లైంగిక కుంభకోణంలో బయటపడ్డ హాసన్ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణపై విరుచుకుపడ్డారు. రేవణ్ణ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నేరాన్ని 'సామూహిక అత్యాచారం' అని పిలిచారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడికి బీజేపీ మద్దతు ఇచ్చినందుకు నిందించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసేందుకు సర్క్యులర్ జారీ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర గురువారం తెలిపారు.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎమ్మెల్యే.. మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ కుమారుడు. ఈయన ఏప్రిల్ 26న జరిగిన ఎన్నికల్లో హాసన్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ బరిలోకి దిగారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు.
ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో ఉన్నందున కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఎదుట హాజరు కావడానికి మరో ఏడు రోజులు గడువు కోరారు. కానీ వారు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో నిజమే గెలుస్తుందని రేవణ్ణ ధీమా వ్యక్తం చేశారు.