-
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్లలో ఉంచారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్తోపాటు ఈ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘కేజ్రీవాల్ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్టేకర్గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
ఆ ‘ఆప్’ నేతలు ఎక్కడ? నిరసనలకు ఎందుకు దూరం?
లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటం పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించింది. సీఎంను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని మొత్తం 10 మంది ఎంపీల్లో ముగ్గురు పార్టీ కోసం తమ గొంతు వినిపిస్తుండగా, ఏడుగురు ఎంపీలు ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. కాగా ఆప్కి చెందిన ఏకైక లోక్సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఈ విషయమై ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన పార్టీ నేత సంజయ్సింగ్ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇతనితోపాటు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, ఎన్డీ గుప్తా నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ముఖం చాటేస్తున్న కొందరు కీలక నేతలున్నారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గత నెలలో కంటి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు. ఆయన మార్చి చివరిలో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ లండన్లోనే ఉన్నారని సమాచారం. మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు అండగా ఉండేందుకు అక్కడే కొన్నాళ్లు ఉండాల్సివస్తున్నదని స్వాతి మలివాల్ తెలిపారు. మలివాల్ ఆప్ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హర్భజన్ సింగ్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆప్ ఎంపీ అయినప్పటి పార్టీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై కూడా హర్బజన్ స్పందించలేదు. ఆప్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పేందుకు హర్బజన్ నిరాకరించారు. అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఆప్ ఎంపీ అయిన మిట్టల్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిరసనల గురించి మాట్లాడే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. సంజీవ్ అరోరా పంజాబ్కు చెందిన మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మార్చి 24న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ను కలుసుకున్నారు. అయితే, రాంలీలా మైదాన్లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొనలేదు. లూథియానాలో పార్టీ అసైన్మెంట్తో బిజీగా ఉన్నందున నిరసనలకు హాజరు కాలేకపోయానని అరోరా తెలిపారు. బల్వీర్ సింగ్ పంజాబ్కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ బల్వీర్ సింగ్ కూడా పార్టీ నిరసన ప్రదర్శనల్లో కనిపించలేదు. ఆయనను గైర్హాజరు గురించి ప్రశ్నించగా తాను తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే నిరసనల్లో పాల్గొంటానని తెలిపారు. -
‘సందేశ్ఖాలీ’ అరాచకాలు.. షేక్ షాజహాన్ మళ్లీ అరెస్టు
కలకత్తా: పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ కేసుల్లో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షేక్ షాజాహన్ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం(మార్చ్ 30) అరెస్టు చేసింది. సందేశ్ఖాలీలో భూములు కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో షాజాహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం బసిర్హట్ జైలులో ఉన్న షాజాహాన్ను మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ శనివారం జైలులోనే ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసింది. షాజాహాన్ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ బసిర్హట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సందేశ్ఖాలీ ఆందోళనలకు కారణమయ్యారన్న కారణంతో టీఎంసీ షాజహాన్ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సందేశ్ ఖాలీలో షేక్ షాజహాన్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించన రేఖా పత్ర అనే మహిళకు బీజేపీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో టికెట్ కూడా ప్రకటించింది. ఇదీ చదవండి.. ఇండియా జిందాబాద్ నినాదాలు చేసిన పాకిస్తానీలు -
భర్తలు జైల్లో.. భార్యలు రాజకీయాల్లో..
మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
Delhi liquor scam: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. -
జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన..
-
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది. . ఉత్తర్ప్రదేశ్లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్పూర్లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
కేటీఆర్ కడుపు సల్లగుండాలి...
మల్యాల(చొప్పదండి): పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన. మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది. -
బండ్లగణేశ్కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్ఖాన్ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్కు మద్దతు పలికింది. పాక్లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్ఖాన్ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్గా 'పిచాయా పామ్') -
మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!
సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది. జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది. ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
జార్ఖండ్ సర్కార్ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
ఇమ్రాన్కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్లో ఇమ్రాన్తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు.. సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్ను నిర్బంధంలో ఉంచారు. ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
వేధింపుల కేసులో భారతీయ అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు?
అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ డిపార్ట్మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్గా ఉన్న బాధితుని స్కూల్లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు. భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి, కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement