ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి! | Sakshi
Sakshi News home page

Punjab: ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!

Published Sat, Apr 20 2024 7:23 AM

Fight Between Prisoners in Punjab - Sakshi

పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘర్షణలో గగన్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ హరీష్‌, సిమ్రాన్‌ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్‌లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు  ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు.

Advertisement
Advertisement