-
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిరంజన్ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్షాకు తన కుమార్తె నేహా హీరేమత్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్ హిరేమఠ వెల్లడించారు -
ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ప్రధాని మౌనమేలారేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్లో పేర్కొన్నారు.అక్కడుంది మీ ప్రభుత్వమే కదాప్రియాంక గాంధీ ట్వీట్పై మంగళవారం ఉదయం అమిత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు. విచారణకు బీజేపీ డిమాండ్ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.పరువు పోతుందంటూకాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.రేవణ్ణను రప్పిస్తాంమరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
కాంగ్రెస్లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు
బెంగళూరు: లోక్సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్లో చేరారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్పూర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేశారు. ఈ నెల ప్రారంభంలో మాలికయ్య గుత్తేదార్ తన సోదరుడు నితిన్ వెంకయ్య గుత్తేదార్ను బీజేపీలోకి చేర్చుకోవడంతో గుత్తేదార్ కలత చెందారు.పలు నివేదికల ప్రకారం, కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే .. శారదామోహన్ను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. శారదా మోహన్ శెట్టి 2013 నుండి 2018 వరకు ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె బీజేపీలోకి మారారు. కాగా, మల్లిఖార్జున్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి ఈసారి లోక్సభ ఎన్నికల్లో కలబురగి (గుల్బర్గా) నుంచి పోటీ చేస్తున్నారు. -
కాంగ్రెస్లోకి బీజేపీ ఎంపీ
కర్ణాటక బీజేపీకి భారీ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కొప్పల్ ఎంపీ కరాడి సంగన్న గుడ్బై చెప్పారు. బుధవారం కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాండ్య, కోలార్లలో పార్టీ లోక్సభ అభ్యర్ధుల తరుపున ప్రచారం జరపనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ కరాడి సంగన్న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కాగా, ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సంగన్నకు మొండి చేయి చూపించింది. ఆయన బదులు బసవరాజ్ క్యావటూర్ను లోక్సభ అభ్యర్ధిగా బరిలోకి దించింది. దీంతో అలకబూనిన సంగన్న తాజాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. -
బీజేపీ మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసింది: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్కు కమలం పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. సిద్ధరామయ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడుగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ, బీజేపీ వారి ప్రయత్నం వృథా అయింది’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు గెలువకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వీడరు. నా నాయకత్వంలోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కొనసాగుతుంది’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు.. సీఎం సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ ఎస్ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ‘సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ఆయన పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయలు చెప్పటం వదిలేసి.. బీజేపీపై నకిలీ ఆరోపణల చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు బదలు.. ఎన్నికల తర్వాత సీఎం కుర్చి కోసమే ఆలోచిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
మరోసారి ఇన్ఫోసిస్ దాతృత్వం.. రూ.33 కోట్లు విరాళం
బెంగళూరు: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (CCITR) సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్ కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీసీఐటీఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీసు దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. -
200 స్థానాలు కూడా కష్టమే.. బీజేపీపై ప్రియాంక్ ఖర్గే సెటైర్లు!
బెంగళూరు : ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు కూడా గెలవదని, రాష్ట్రంలో ఎనిమిది సీట్లు కూడా దాటదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే చెబుతోంది. అంతర్గత పోరుతో రాష్ట్ర బీజేపీ పద్నాలుగు,పదిహేను సీట్లలో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. కమలం ఎనిమిది లోక్సభ స్థానాలు దాటడం కష్టమేనని’ జోస్యం చెప్పారు. ఇన్ని అబద్దాలా? కర్ణాటకకు కరువు సాయం విషయంలో హోం మంత్రి అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించిన ఖర్గే.. కరువు సాయం కోరుతూ సీఎం సిద్ధరామయ్య ‘ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రి (సహాయం కోరుతూ)తో భేటీ అవ్వడం అబద్ధమా? ఐఎంసీటీ (ఇంటర్ మినిస్ట్రీరియల్ కేంద్ర బృందం) కర్ణాటకలో సర్వే చేసి కేంద్రానికి నివేదిక సమర్పించడం అబద్ధమా? ఆ తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశాన్ని నిర్వహించి, కర్ణాటకలో కరువును అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లిఖితపూర్వకంగా ప్రశంసించడం అబద్ధమా? అని ప్రశ్నలు సంధించారు. అమిత్ షా ఎందుకు ఇలా అబద్దాలు ఆడుతున్నారోనని అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. . కరువుపై కాంగ్రెస్ రాజకీయం కాగా, మంగళవారం బెంగళూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా కర్ణాటకలో కరువు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని,ఈ అంశం ఎన్నికల సంఘం వద్ద ఉందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంక్ ఖర్గే స్పందించారు. -
కేరళ సీఎం విజయన్ కూతురిపై ఈడీ కేసు
న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేశాయి. వీణా విజయన్ కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రూ.1.72 కోట్ల చెల్లింపులు కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి, వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఒప్పందం మేరకు ఎటువంటి సేవలు అందించనప్పటికీ 2017- 2018 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్.. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కి రూ.1.72 కోట్ల చెల్లింపులు జరిపింది. ఐటీ అధికారుల సోదాలతో వెలుగులోకి అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు (Interim Board) సీఎంఆర్ఎల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదావీలకు సంబంధించిన పలు ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్ఎఫ్ఐఓ వాణి విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్పై విచారణ చేపట్టింది. ఈ విచారణకు వ్యతికేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం ఎక్సాలాజిక్ పిటిషన్ను కొట్టి వేసింది. తాజాగా ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు అవాస్తవం ఇదే అంశంపై ఈ ఏడాది జనవరి అసెంబ్లీ సమావేశాల్లో కేరళ సీఎం పనిరయి విజయన్ స్పందించారు. తన భార్య పదవీ విరమణ నిధులతో తన కుమార్తె కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. -
నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది
బెంగళూరు, సాక్షి : రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్సభ సీటును హెగ్డేకి ఇవ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇలా అనంత్ కుమార్ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్ ఠాకూర్, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. -
నేనూ ట్రోల్స్కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
బీజేపికి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి?
సాక్షి, బెంగళూరు : లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిలో ఒక నేత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం, కేంద్ర మంత్రి డీవీ సదానంద్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 224 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన కమలం కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే, త్వరలో జరగబోయే 28 లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుని కాంగ్రెస్కు చెక్ పెట్టాలని భావిస్తున్న కషాయ దళానికి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం జయ్ ప్రకాష్ హెగ్డే కొద్ది రోజుల క్రితం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, కేజే జార్జ్ సమక్షంలో బైందూరు మాజీ ఎమ్మెల్యే సుకుమార్ శెట్టి, ముదిగెరె మాజీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామితో పాటు కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన కోర్గి జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్లో చేరారు. గతంలో ఉడిపి చిక్కమగళూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలపుపొందిన హెగ్డే ఈ సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిందని కాంగ్రెస్ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. మాజీ సీఎం సదానంద్ గౌడ సైతం తాజాగా మాజీ సదానంద్ గౌడ సైతం పార్టీని వదిలి వెళ్లడంపై బీజేపీలో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి వైసీకే వడియార్పై కాంగ్రెస్ తరుపున మైసూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్న సదానంద్ గౌడ బీజేపీకి రాజీనామా, కాంగ్రెస్లో చేరిక, ఏ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అంశాలపై మరో రెండ్రోరోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్కు లోక్సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరువయ్యారు. దీంతో చేసేది లేక పలువురు మంత్రులనే లోక్సభ ఎన్నికల బరిలోకి దించేలా వారిని బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందంటూ పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలని పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు. స్క్రీనింగ్ కమిటీ తర్వాతే క్లారిటీ అయితే లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుందని ఆయన..మంత్రుల్లో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలనే చర్చలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే అంగీకరిస్తారో వారినే లోక్సభ ఎన్నికల బరిలోకి దింపుతామని, నేటి సమావేశం (స్క్రీనింగ్ కమిటీ) తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరమేశ్వర చెప్పారు. ఢిల్లీకి జాబితా కాగా, అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.‘మేము సాయంత్రం సమావేశం అవుతున్నాం. అభ్యర్థిని ప్రకటించే హక్కు మాకు లేదు. ప్రతిపాదనల్ని ఢిల్లీకి పంపుతాం. కేంద్ర ఎన్నికల కమిటీ అక్కడ సమావేశమవుతుంది.మా సిఫార్సును ఆమోదించొచ్చు. లేదంటే తిరస్కరించొచ్చు. జాబితాలో కొత్త పేర్లను చేర్చొచ్చు’ అని చెప్పారు. తొలిజాబితాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్ తొలి జాబితాలో కర్ణాటకలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ తొలి జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించలేదు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. చదరపు అడుగు 7వేల నుంచి రూ.10 వేలకి పెరిగింది
అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని పెంచింది. దీంతో బెంగళూరులో అపార్ట్మెంట్ ధరలు 10-20 శాతం పెరిగాయి. శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలు గరిష్ట స్థాయిలో పెరుగుదల కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గైడెన్స్ వ్యాల్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆస్తి విక్రయాన్ని రిజిస్ట్రేషన్ చేసే కనీస ధరను సూచిస్తుంది. దీనిని కొన్ని రాష్ట్రాల్లో సర్కిల్ రేట్ అని పిలుస్తారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోని సబర్బన్ ప్రాంతాలైన యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, కేఆర్ పురం ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారీగా పెరిగిన చదరపు అడుగు ధర రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని 20-30 శాతం సవరించింది. ప్రాంతాన్ని బట్టి, ఐటీ కారిడార్లలో ఇది 50 శాతానికి చేరుకోవచ్చని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ప్రస్తుతం యలహంకలో ఒక అపార్ట్మెంట్ చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండేది..ఇప్పుడు అది కాస్తా రూ.11,500కి పెరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండగా ఇప్పుడు రూ.10,000కు విక్రయిస్తున్నారు. కేఆర్ పురంలో అపార్ట్మెంట్ ఖరీదు చదరపు అడుగుకు రూ.5,500 నుంచి రూ.500-1000 పెరిగింది. ఎంజీ రోడ్లో 5కిలోమీటర్ల మేర ప్రాపర్టీ ధరలు లొకేషన్ ఆధారంగా చదరపు అడుగుకు రూ. 12,000-30,000. సీబీడీ ప్రాంతంలోని ప్రధాన ప్రాంతాలలో ఒకటైన లావెల్లే రోడ్లో ధరలు చదరపు అడుగు రూ. 20,000-22,000 ఉండగా.. గతంలో చదరపు అడుగుకు రూ.18,000కి పెరిగాయి. ఇందిరానగర్లో ప్రాపర్టీ ధరలు కనీసం రూ.10,000-20,000కి చేరాయి. సమానమైన ఇళ్ల ధరలు బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో మార్గదర్శక విలువ, వాస్తవ ప్రాపర్టీ ధరల మధ్య వ్యత్యాసం దాదాపు 40-50 శాతం ఉండగా..శివార్లలో ఇది దాదాపు 30 శాతం ఉందని స్థానిక రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. చాలా ప్రదేశాలలో మార్గదర్శక విలువ ఇప్పటికే మార్కెట్ విలువలో 40 శాతం కంటే తక్కువగా ఉంది. అందువల్ల, సర్కిల్ రేట్ల పెరుగుదల ప్రధాన ప్రదేశాలలో ధరలలో అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే శివారు ప్రాంతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది అని రియల్టీ కార్ప్స్ డైరెక్టర్ సునీల్ సింగ్ తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.లక్షకి పెరిగింది పెరిగిన గైడెన్స్ విలువ కొన్ని ప్రాంతాలలో ఇళ్లను కొనుగులో చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని రియాల్టీ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎక్కువగా మధ్యతరగతి, లోయర్ ఎండ్ బడ్జెట్ గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై ప్రభావం చూపుతుంది. 14 శాతం పెంపు వారి ఖర్చులను రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచుతుంది’ అని సింగ్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం గైడెన్స్ విలువను చివరిసారిగా పెంచింది కానీ కోవిడ్-19 సమయంలో తగ్గించింది. రెవిన్యూ శాఖ వివరాల ప్రకారం, పెరుగుదలకు ప్రధాన కారణాలలో అంతకంతకూ తరిగిపోతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని, కాబట్టే ప్రాపర్టీ గైడెన్స్ వ్యాల్యూ ధరని పెంచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. -
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్కు ‘కర్ణాటక’ కిక్!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దూకుడుగా ముందుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి ఫలితాలు రాష్ట్రంలోనూ పునరావృతమవుతాయనే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు.. ఎన్నికలు జరిగే వరకు ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్లలో ఈ నెల 25న భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న ఈ సభకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పాటు ఇతర కీలక నేతలను ఆహ్వానించనున్నారు. పీపుల్స్ మార్చ్లో భాగంగా రాష్ట్రంలో మూడు చోట్ల సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగా గత నెలలో మంచిర్యాలలో సత్యాగ్రహ సభను నిర్వహించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇప్పుడు జడ్చర్లలో రెండో సభను నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన సరూర్నగర్ స్టేడియంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేతలు.. జడ్చర్ల సభకు భారీ ఎత్తున కేడర్ను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు కల్లా 50 మంది వరకు అభ్యర్థుల ఖరారు! మరోవైపు అభ్యర్థుల ఖరారులోనూ కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. వీలున్నంత మంది అభ్యర్థులను 6 నెలల ముందే ప్రకటించడం ద్వారా ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశాన్ని కల్పించాలని చాలామంది నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 45–50 మంది అభ్యర్థులను ఈ ఏడాది ఆగస్టు కల్లా ప్రకటించే అవకాశముందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మరిన్ని డిక్లరేషన్లు యూత్ డిక్లరేషన్కు మంచి స్పందన రావడం, దీనిపై ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేసే పరిస్థితి లేకపోవడంతో మరిన్ని డిక్లరేషన్లకు టీపీసీసీ సిద్ధమవుతోంది. మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డిక్లరేషన్లు ప్రకటిస్తామని, తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు చేసే మేలు గురించి వాటిల్లో వివరిస్తామని సరూర్నగర్ సభలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వచ్చే నెలలో మహిళా, బీసీ డిక్లరేషన్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళా డిక్లరేషన్కు సోనియాగాంధీని, బీసీ డిక్లరేషన్కు దేశంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని, తద్వారా కేడర్లో ఉత్సాహం నింపాలని, ప్రజలకు మరింత భరోసా కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకుగాను సోనియా, రాహుల్లలో ఒకరి అపాయింట్మెంట్ కోసం టీపీసీసీ నేతలు ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు. చేరికలపై ప్రత్యేక దృష్టి ఇతర పార్టీల నుంచి వీలైనంతగా వలసలు ప్రోత్సహించాలని టీపీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను రేవంత్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. వారు పార్టీలో చేరేందుకు తానే ఇబ్బందిగా ఉన్నట్టయితే పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ చేరికల కమిటీని పరిపుష్టం చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీకి ఇప్పటికే జానారెడ్డి చైర్మన్గా ఉండగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జీవన్రెడ్డి లాంటి నేతలకు కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. వీరు కాంగ్రెస్ను వీడిన వారితో, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారితోనూ త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్టు సమాచారం. చదవండి👉 ఫ్లాష్బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి!
రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ (మొత్తం 224 సీట్లు) 16వ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరుగుతున్న నేపథ్యంలో ఈ దక్షిణాది రాజ్యంపై నేడు అందరి దృష్టి పడింది. ఐటీ రంగంలో భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు ఇంజన్ మాదిరి పనిచేస్తూ.. టెక్నాలజీ కేంద్రంగా కర్ణాటకను ముందుకు తీసుకుపోతోంది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తర్వాత నాలుగో అత్యంత ధనిక భారత రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. 247.38 బిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తితో (జీఎస్టీడీపీ) కర్ణాటక పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పొడవైన సముద్రతీరం, అరేబియా సముద్రం తీరం వెంబడి ఆధునిక రేవు పట్టణాలు, నగరాలు అభివృద్ధిచెందడం కూడా ఈ మూడో అతిపెద్ద దక్షిణాది రాష్ట్రం (ఏపీ విభజనతో ఈ స్థానం దక్కింది) ప్రగతికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, ఇంకా రాయలసీమ జిల్లాలవాసులకు తమిళనాడు రాజధాని చెన్నై మాదిరిగానే బెంగళూరు, ఇతర కర్ణాటక పట్టణాలు, నగరాలు వలస వచ్చి స్థిరపడడానికి అనువైన ప్రాంతాలుగా మారాయి. బెంగళూరు, తుమకూరు తదితర ప్రాంతాలు అందించే వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలు లక్షలాది మంది తెలుగు ప్రజలను అక్కడకు రప్పిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వ్యక్తులు ఐదారుగురు వరకూ వివిధ పార్టీ తరఫున కర్ణాటక శాసనసభకు కిందటి రెండు మూడు ఎన్నికల్లో గెలవడం సాధారణ విషయంగా మారింది. దక్షిణాదిన లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య రీత్యా చూస్తే తమిళనాడు తర్వాత (39) అత్యధిక స్థానాలు ఉన్నది ఈ రాష్ట్రంలోనే (28). తెలుగు, కన్నడ లిపుల మధ్య పోలికలు ఉండడమేగాక, గతంలో రెండు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఒకే తీరున నడిచాయి. 1978 నుంచి 2004 వరకూ ఒకే సమయంలో ఏపీ, కర్ణాటక ఎన్నికలు 1978 జనవరిలో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయిన రెండు నెలలకే ఉమ్మడి ఏపీ, కర్ణాటకలో ఒకేసారి జరిగిన ఈ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో కొత్తగా హస్తం గుర్తుతో వచ్చిన కాంగ్రెస్ (ఐ) రెండు చోట్లా విజయం సాధించింది. అలాగే ఐదేళ్ల తర్వాత 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏపీ, కర్ణాటకలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అయితే 2004 వరకూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం విశేషం. కాని, 2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన కర్ణాటక 12వ శాసనసభ రాజకీయ అస్థిరత వల్ల నాలుగేళ్లకే రద్దవడంతో ఈ రెండు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కాలం వ్యత్యాసంతో జరగడం ఆనవాయితీగా మారింది. అలాగే కిందటిసారి తెలంగాణ అసెంబ్లీకి ఆరు నెలలు ముందుగానే 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరిపించడంతో ఇప్పుడు మొదట వేసవిలో (మే నెలలో) కర్ణాటకలో, శీతాకాలంలో (డిసెంబర్) తెలంగాణలో, వచ్చే ఏడాది ఏప్రిల్–మేలో ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత 30 ఏళ్లలో సంభవించిన రాజకీయ పరిణామాల వల్ల ఇలా మూడు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఆరు నెలల తేడాతో వరుసగా మూడు వేర్వేరు సందర్భాల్లో జరిగే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో మాదిరిగానే లక్షలాది మంది తెలుగువారు అన్ని రంగాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన రాష్ట్ర్రం కావడంతో కర్ణాటక రాజకీయాలపై తెలుగునాట ఎనలేని ఆసక్తి వ్యక్తమౌతోంది. మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాది రాజకీయాల ప్రభావం విస్తరించిన కర్ణాటక ప్రజల తీర్పు ఎలా ఉంటుందా అని ఓట్లు లెక్కించే మే 13 కోసం తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. 2004 ఎన్నికల నుంచీ కర్ణాటకలో ఏ పార్టీకీ సాధారణ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీలే ఏర్పడుతూ వస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాతైనా ఈసారి రెండు ప్రధాన జాతీయపక్షాల్లో ఏదో ఒక పార్టీకి కనీస మెజారిటీకి అవసరమైన సీట్లు వస్తాయా? రావా? అనేదే నేడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
కర్ణాటక బ్యాంక్ : రూ.1.75 లక్షల కోట్లు !
మంగళూరు: కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 17.69 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉంది. శతాబ్ది సంవత్సరం కావడంతో రూ.1,75,000 కోట్ల టర్నోవర్పై అంచనాతో ఉన్నట్టు బ్యాంక్ సీఈవో, ఎండీ ఎంఎస్ మహాబలేశ్వర తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కర్ణాటక బ్యాంక్ శాఖల సిబ్బందితో మంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి వర్చవల్గా ఆయన మాట్లాడారు. 2023–24 సంవత్సరానికి బ్యాంక్ ప్రణాళికలను వారితో పంచుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి టర్నోవర్ 7.63 శాతం వృద్ధితో రూ.1,48,694 కోట్లు (ప్రాథమిక వివరాల ప్రకారం) ఉందని, డిపాజిట్లు రూ.87,362 కోట్లుగా, అడ్వాన్స్లు (రుణాలు) రూ.61,326 కోట్లుగా ఉన్నట్టు వివరించారు. బ్యాంక్ కాసా రేషియో 32.97 శాతానికి చేరినట్టు తెలిపారు. రుణాలు, ఆస్తుల పరంగా స్థిరమైన వృద్ధిని గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్టు మహాబలేశ్వర చెప్పారు. ఆస్తుల, అప్పుల మెరుగైన నిర్వహణతోపాటు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని సమర్థంగా అధిగమించినట్టు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18తో కర్ణాటక బ్యాంక్ నూరవ సంవత్సరాలోకి అడుగు పెట్టడం గమనార్హం. గడిచిన సంవత్సరానికి కర్ణాటక బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు బ్యాంక్ ఈడీ శేఖర్ రావు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో నిర్వహణ రేషియోలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు. -
ఇవే నా చివరి ఎన్నికలు... రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతా
మైసూరు: నేను పోటీ చేసే చివరి ఎన్నికలు ఇవే. తరువాత పోటీ చేయను. రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతానని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికలో తాను పుట్టి పెరిగిన ఊరు అయిన వరుణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం మైసూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో తాను చాముండేశ్వరి నియోజకవర్గంలో పోటీ చేయగా, కొంచెం అనుమానం ఉండడంతో, బాదామిలోనూ పోటీకి దిగినట్లు చెప్పారు. ఈసారి ఎలాంటి అనుమానం లేదని, వరుణలో గెలుస్తానని అన్నారు. కాగా గత ఎన్నికలప్పుడు కూడా సిద్దరామయ్య ఇవే నా చివరి ఎన్నికలని చెప్పడం గమనార్హం. -
బళ్లారి సిటీ టికెట్ ఎవరికో? పోటీలో నారా భరత్రెడ్డి!
సాక్షి,బళ్లారి: మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తొలి జాబితాలో ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి ఆరుగురికి టికెట్లు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఐదుగురికి, ఒకరు మాజీ ఎమ్మెల్యేకు టికెట్ ఖరారు చేశారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, కంప్లి నుంచి గణేష్లకు టికెట్ ఖరారు కాగా, విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భీమానాయక్, హడగలి నుంచి పరమేశ్వర నాయక్, విజయనగర నుంచి మాజీ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్పలకు టికెట్ ఖరారు చేశారు. ఆరు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు కాగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. బళ్లారి నగరం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో తుది జాబితాలో అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బళ్లారి సిటీ టికెట్ ఎవరికో? బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు పోటీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో ప్రముఖంగా టచ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారా భరత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, మాజీ జెడ్పీ మెంబర్ అల్లం ప్రశాంత్, మాజీ మంత్రి ఎం.దివాకర్బాబు పేర్లు పరిశీలనలో ఉన్నా, వీరిలో ఇద్దరి పేర్లను మాత్రమే హైకమాండ్ మరీ ముఖ్యంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తెరపైకి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేయాలని స్వయానా పోటీలో ఉన్న మాజీ మంత్రి దివాకర్బాబు ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో బళ్లారి సిటీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందో ఇప్పట్లో తేలే అంశం కాదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా ఖరారు కాని స్థానాలివే హరపనహళ్లి నియోజకవర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దివంగత ఎంపీ ప్రకాష్ కుమార్తె టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిరుగుప్ప నియోజకవర్గం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు తీవ్ర పోటీ పడుతుండగా పేరును ఖరారు చేయలేకపోయారని తెలుస్తోంది. కూడ్లిగి నియోజకవర్గం నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో. బీజేపీ తరపున ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారో వేచి చూసి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. -
కర్ణాటకలో ఏబీసీ క్లీన్టెక్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు
బెంగళూరు: పునరుత్పాదక విద్యుత్ రంగ దిగ్గజం యాక్సిస్ ఎనర్జీ గ్రూప్లో భాగమైన ఏబీసీ క్లీన్టెక్ తాజాగా కర్ణాటకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 50,000 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించి ఇన్వెస్ట్ కర్ణాటక 2022 కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్తో వచ్చే 10 ఏళ్లలో 5,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుందని ఏబీసీ క్లీన్టెక్ సీఎండీ రవి కుమార్ రెడ్డి తెలిపారు. జీరో కార్బన్ ఎకానమీగా ఎదిగేందుకు, స్థానిక ఎకానమీకి తోడ్పాటు అందించేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సమతౌల్యమైన అభివృద్ధి సాధనకు, భవిష్యత్ తరాలకి సురక్షితమైన.. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించేందుకు పునరుత్పాదక శక్తి ఒక్కటే మార్గమని కర్ణాటక అదనపు చీఫ్ సెక్రటరీ ఈవీ రమణా రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పొందిన రాష్ట్రంగా కర్ణాటక నిల్చినట్లు ఆయన వివరించారు. హైదరాబాదీ సంస్థ యాక్సిస్ ఎనర్జీ, అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటైన బ్రూక్ఫీల్డ్ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ గా ఏబీసీ రెన్యువబుల్స్ను ఏర్పాటైంది. ఇది ప్రస్తుతం 2 గిగావాట్ల పైగా సామర్థ్యమున్న ప్రాజెక్టులను నిర్మిస్తోంది. -
మూన్లైటింగ్కు పాల్పడుతున్న ఉద్యోగులకు భారీ షాక్!
మూన్లైటింగ్ అంశంపై ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్న టెక్ కంపెనీలకు ఐటీ శాఖ మంత్రి మద్దతు పలికారు. మూన్లైటింగ్ విషయంలో ఉద్యోగుల తీరు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేసి ఉద్యోగాలు చేయాలనుకుంటే తమ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఒకటి మించి ఎక్కువ ఉద్యోగాలు (మూన్లైటింగ్) చేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రముఖ టెక్ దిగ్గజాలు విమర్శిస్తున్నాయి. మూన్లైటింగ్కు పాల్పడటం అనైతికమని, ఉద్యోగులు సంస్థ నిబంధనలకు లోబడి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. ఈ తరుణంలో టెక్ సంస్థలకు కర్ణాకట ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ అండగా నిలిచారు. ఆఫీస్లో ఉద్యోగంతో పాటు ఫ్రీల్సాన్ వర్క్ చేయడం మోసం. ప్రొఫెషనల్స్ అలా చేయాలనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లండి’ అని సూచించారు. “ఒక విధాన పరంగా, నైతికంగా మూన్లైటింగ్ను ఎలా అనుమతించవచ్చు? మూన్లైటింగ్కు పాల్పడడం న్యాయం కాదు. ఇది అక్షరాలా మోసం” అంటూ ఉద్యోగానికి మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. "మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు? మీరు సూపర్మెన్నా ఏమిటీ? మీకు కుటుంబాలు లేవా? అని అన్నారు. కాగా దేశంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రోల ప్రధాన కార్యాలయాలు బెంగళూరు కేంద్రంగా కార్యకాలాపాలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేరే చోటికెళ్లి పనిచేసుకోండి బెంగళూరు టెక్ సమ్మిట్ను ప్రమోట్ చేయడానికి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. టెక్ పరిశ్రమ మూన్లైటింగ్ వంటి పద్ధతుల్ని అనుమతించకూడదని, ఆఫీసు వేళలకు మించి చేసే వర్క్లకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వదని అన్నారు. “ఇక్కడ (మూన్లైటింగ్ కోసం) ఖాళీ లేదు. మీకు అంత డిమాండ్ ఉంటే, వేరే చోట పని చేయండి’ అని పేర్కొన్నారు. చదవండి👉 ‘చేస్తే చేయండి..లేదంటే పోండి’ -
నేను కీలుబొమ్మను కాదు.. కర్నాటక సీఎం సంచలన వ్యాఖ్యలు
శివాజీనగర: రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం నూతన ముఖ్యమంత్రి అన్వేషణలో ఉందనే వార్తలను కర్నాటక సీఎం బసవరాజ బొమ్మై తోసిపుచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, రానున్న ఎన్నికలు తన నేతృత్వంలోనే జరుగుతాయని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ పూర్తి సహకారం ఇచ్చిందని, పరిపాలనలో ఏ సీనియర్ నాయకుల జోక్యం లేదని, తాను ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప ప్రతిరోజు పరిపాలనలో మార్గదర్శనం చేస్తారు, అంతే తప్ప నిత్యం వేలు పెడతారనే విమర్శలు నిరాధారమైనవని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ, హత్య, అల్లర్లకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానలే కారణమని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ చేసే అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంట్రాక్టర్ల సంఘం నేతలందరూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మార్పిడి చట్టం అవసరమని, పార్టీ ఎమ్మెల్యే తల్లి మతం మారింది. అందువల్ల ఈ చట్టం అనివార్యమైందని, చట్టం వచ్చాక మత మార్పిళ్లు తగ్గాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు -
నాన్వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?
కర్నాటకలో నాన్–వెజ్ రాజకీయం భగ్గుమంది. మడికెరిలో మాంసాహార భోజనం చేసి, ఆలయ దర్శనానికి వెళ్తే తప్పేముంది అని సీఎల్పీ నేత సిద్దరామయ్య చెప్పడంపై అధికార బీజేపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఇక మడికెరిలో జరిగిన గుడ్ల దాడిని ఖండిస్తూ త్వరలో అక్కడ ధర్నా చేస్తానని హస్తం ప్రకటించడం కూడా వేడెక్కించింది. మొత్తానికి గుడ్లు, నాన్ వెజ్ ఇప్పుడు రాజకీయాలకు ఘాటైన మసాలాను కలిపాయి. మైసూరు/ శివాజీనగర: టిప్పు సుల్తాన్ దండయాత్ర చేసినప్పుడే కొడగు ప్రజలు భయపడలేదు, సిద్దరామయ్య వస్తే భయపడతారా? అని మైసూరు–కొడగు ఎంపీ ప్రతాపసింహ అన్నారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడగులో గుడ్ల దాడి జరిగిందని మళ్లీ కొడగును ముట్టడిస్తామని, అక్కడ భారీ ధర్నా చేస్తామని సిద్దరామయ్య చెబితే ఎవరూ భయపడబోరన్నారు. కొడగు ప్రజలను హత్య చేసిన టిప్పు జయంతిని నిర్వహించిన సిద్దరామయ్యను కొడగు ప్రజలు ఎలా క్షమిస్తారన్నారు. సిద్దరామయ్య భార్య చాముండేశ్వరి అమ్మవారికి భక్తురాలు, ఆమె కూడా మాంసం తిని ఆలయానికి వెళ్తారా? అనేది చెప్పాలన్నారు. పంది మాంసం తిని మీ స్నేహితుడు, ఎమ్మెల్యే అయిన జమీర్ అహ్మద్ ఇంటికి వెళ్తారా? అని మండిపడ్డారు. మాంసాహారం తిని పూజలకు వెళ్లారు మైసూరు నగర మాజీ మేయర్ రవికుమార్ మాట్లాడుతూ 2017లో దసరా వేడుకల్లో సిద్దరామయ్య మాంసాహార భోజనం చేసి చాముండేశ్వరి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాడని, ఇది నిజమని అన్నారు. లలిత మహాల్ ప్యాలెస్లో జిల్లా యంత్రాంగం శాకాహార, మాంసాహార భోజనాలను ఏర్పాటు చేయగా, ఆయన మాంసాహారం తిని వచ్చి పూజలకు వెళ్లారన్నారు. మొండితనం వద్దు: విజయేంద్ర సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహార స్వాతంత్య్రం ఉంది. అయితే మాంసం తిని దేవాలయానికి వెళతానని చెప్పడం మొండితనం, ఇటువంటి వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర సీఎల్పీ నేత సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. సోమవారం శిరహట్టిలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక సంస్కృతి సంప్రదాయముంది. మత నిష్ట ఉంది, ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదు. మాంసం తిని గుడికి వెళతానని చెప్పడాన్ని నేనొక్కన్నే కాదు రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు అని అన్నారు. ప్రజలపై యుద్ధం చేస్తావా: విశ్వనాథ్ కొడగులో భారీ ధర్నా చేయాలని సిద్దరామయ్య యోచించడం తగదని, దీనిని విరమించుకోవాలని బీజేపి ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ అన్నారు. రాజకీయ నాయకుల పైన ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు ఇలా ఏవి దొరికితే అవి వెయ్యడం సహజమన్నారు. అలాగని ప్రజల మీద యుద్ధం చేయ్యడం సరికాదని, కాబట్టి ధర్నాను మానుకోవాలని సూచించారు. శుక్రవారం టెన్షన్ కాగా, వచ్చే శుక్రవారం మడికెరి ఎస్పీ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేయనుంది. అదే రోజు మరోచోట బీజేపీ జాగృతి సమావేశం జరపనుంది. దీంతో కాఫీ సీమలో టెన్షన్ నెలకొంది. పందిమాంసం తిని వెళ్తారా: యత్నాళ్ సిద్దరామయ్యకు ధైర్యముంటే పంది మాంసం తిని, మసీదుకు వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ సవాల్ విసిరారు. సోమవారం విజయపురలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నిచోట్ల మాంసాహారం తిని ఆలయాలకు వెళ్లొచ్చు, కొన్నిచోట్ల వెళ్లడం నిషిద్ధం. దేవాలయానికి మాంసం తిని వెళ్లకూడదా? అని సిద్దరామయ్య ప్రశ్నించడం దేవున్ని నమ్మే ఆస్తికుల మనసుకు బాధ కలిగించింది. ఆయనకు ధైర్యముంటే పంది మాంసం తిని మసీదుకు వెళ్లాలి అని సవాల్ చేశారు. -
కిరాతకం: ప్రేమిస్తున్నానని వెంటపడి ఆమెపై..
యశవంతపుర: ఐటీ సిటీలో కొంతకాలంగా వినిపించని యాసిడ్ దాడి మళ్లీ తెర మీదకు వచ్చింది. సుంకదకట్టలో ఒక యువతిపై దుండగుడు యాసిడ్ దాడి చేశాడు. స్థానిక ముత్తూట్ ఆఫీసులో ఓ యువతి (23) పని చేస్తోంది. నాగేశ్ అనే యువకుడు రోజూ ఆమె వెంటపడి ప్రేమించాలని అడిగేవాడు. గురువారం ఉదయం 8:30 సమయంలో కూడా అదే మాదిరిగా ఆఫీసు వద్దకు వచ్చి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ప్రేమించనని చెప్పడంతో నిన్ను ప్రేమించను, నా వెంట పడొద్దు అని ఆమె ఛీ కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో దుండగుడు ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న సీసాలో నుంచి యాసిడ్ను ఆమెపై గుమ్మరించి పరారయ్యాడు. బాధను తట్టుకోలేక యువతి రక్షించాలని కేకలు వేసింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతి గొంతు, కాలు సహా శరీరంలో 40 శాతం గాయాలైనట్లు వైద్యుడు కార్తీక్ తెలిపారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కామాక్షిపాళ్య పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి యాసిడ్ దాడిని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఇది ఒక అమానవీయ ఘటన. నిందితునిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించాను, బాధితురాలికి మెరుగైన చికిత్సలను అందిస్తామన్నారు. అతన్ని వదలొద్దు: యువతి తనపై దాడి చేసిన నాగేశ్ను వదలవద్దని బాధిత యువతి డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు విచారించారు. అతన్ని మాత్రం వదలద్దు, సరైన శిక్ష పడాలి అని ఆమె అన్నారు. ముత్తూట్లో క్యాషియర్గా పని చేస్తున్నట్లు తెలిపింది. కాగా, యాసిడ్ పోసి పరారైన నిందితుడు నాగేశ్ కోర్టు వద్దకు వెళ్లి లాయర్ను కలిశాడు. ఆపై అతని ఫోన్ స్విచాఫ్ అయిందని పోలీసుల విచారణలో బయట పడింది. ఇది కూడా చదవండి: ఆటోలో యువతిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి..
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం
12, 13 తేదీల్లో మద్యం బంద్
No Headline
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్
‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఓటుహక్కు వినియోగించుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం తగదు
ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement