-
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. -
చంద్రబాబూ.. డైలాగులు చెబితే సరిపోదు!
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్దాప్య పెన్షన్లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది. చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు. రైతు భరోసా కింద వైఎస్ జగన్మోహన్రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు. అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా? రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస్పత్రులను వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా? ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట. ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు. చంద్రబాబు టరమ్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్ను.. ఈసీ కోడ్ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. తిరుపతిలో మరో వృద్ధుడు.. తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు. -
ప్రతిపక్షాల తీరుతో మనస్తాపం.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
కృష్ణా: ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్కి అందజేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్ సిమ్స్, డివైస్లు తీసేసుకున్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరిదగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని అన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఉదయం నుంచి తమకు వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
పెళ్లి రోజునా విధులు నిర్వర్తించిన వాలెంటీర్
-
అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ
సాక్షి, అనంతపురం సెంట్రల్: పడిగాపులు.. ఎదురుచూపుల బాధ పోయింది. పొలంలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా అక్కడకు వలంటీర్ ద్వారా పింఛన్ చేరుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అందుకునే జీతం లాగా ఒకటో తేదీనే ఠంచన్గా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, మత్స్యకార, చర్మకార, కల్లుగీత కార్మికులకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. పాదయాత్రలో ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీని జగనన్న ప్రభుత్వం నిలబెట్టుకుంటూ బాసటగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో ఉన్న రూ.2వేల పింఛన్ను దశలవారీగా రూ.3వేలకు పెంచుతామన్న హామీని మూడో ఏడాదీ అమలు చేసింది. రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచిన పింఛన్ను ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణలో పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు తలుపుతట్టి ‘పింఛన్’ అంటూ డబ్బు అందజేశారు. నాడు పింఛన్ కోసం ఎన్ని అగచాట్లు పడ్డామో తలచుకుని.. నేడు ఉన్న చోటుకే వచ్చి ఇస్తున్న పింఛన్ విధానాన్ని బేరీజు వేసుకుని లబ్ధిదారులు అమితానందభరితులయ్యారు. పింఛన్ పెంపుతో తమకు సామాజిక భద్రతతో పాటు గౌరవం మరింత పెంచిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపి.. చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం తిమ్మాపురంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న పింఛన్దారులు జనవరి నెలకు సంబంధించి 2,79,309 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. కొత్తగా 10,143 మందికి పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రూ.77.97 కోట్ల పింఛన్ నిధులు విడుదలయ్యాయి. తొలిరోజు బుక్కరాయసముద్రం 86.52 శాతం, పామిడి అర్బన్ 85.30, నార్పల 84.68, అనంతపురం అర్బన్ 84.20, శింగనమల 83.46, పెద్దవడుగూరు 82శాతం, పుట్లూరు, ఉరవకొండ 81.61శాతం, తాడిపత్రి అర్బన్, గుంతకల్లు అర్బన్, రాయదుర్గం అర్బన్, గుత్తి అర్బన్లో 80 శాతంతో పింఛన్ల పంపిణీలో ముందంజలో ఉన్నాయి. రాప్తాడు 53.78, ఆత్మకూరు 55.19, బ్రహ్మసముద్రం 62.79, రాయదుర్గం 62 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఏడో తేది వరకు ఫింఛన్ల పండుగ ఫింఛన్ రూ.2750కు పెంచడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్తగా మంజూరైన 10,143 పింఛన్లు కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మండల, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. తొలిరోజు 82.03 శాతం మందికి పింఛన్ అందించాం. ఏడో తేదీ వరకు పింఛన్ల పండుగ కొనసాగుతుంది. ఆలోపే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తాం. – నరసింహారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ (చదవండి: ఇంతవరకూ ఓపిక పట్టా.. ఇకపై సహించే ప్రసక్తే లేదు: కేతిరెడ్డి) -
తొలిమెట్టు.. తీసికట్టు!
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్లైన్ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. షెడ్యూలు ఇలా.. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. టీచర్ల కొరతతోనే.. సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయులు లేక ఇన్చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. (చదవండి: ఎన్ఐఏ విస్తృత తనిఖీలు) -
నాట్స్.. డిన్నర్ మీట్ అండ్ గ్రీట్
టెంపాబే, ఫ్లోరిడా: టెంపాబే నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేందుకు నాట్స్ టెంపా బే విభాగం మీట్ అండ్ గ్రీట్ పేరుతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ తమదని భావించి ముందుకొస్తున్న వాలంటీర్ల వల్ల నాట్స్ మంచి గుర్తింపు వచ్చిందని నాట్స్, టెంపాబే నాయకత్వం వాలంటీర్లను ప్రశంసించింది. ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన వరంగల్ ఓయాసిస్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరంజ్యోతి నాట్స్ సేవలను కొనియాడారు. నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలు మధ్య అనుబంధాలు, బాధ్యతలు ఎలా ఉండాలనే దానిపై కూడా చక్కటి దిశా నిర్థేశం చేశారు. టెంపాబేలో సాటి తెలుగువారి కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్న నాట్స్ వాలంటీర్లను నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సత్కరించారు. దాదాపు 100 మందికి పైగా తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని నాట్స్ కుటుంబ బలాన్ని చాటారు. నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్ ప్రసాద్ అరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ తదితరులు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇంటింటికీ రేషన్ అద్భుతం.. కేంద్ర బృందాల కితాబు
కాకినాడ సిటీ/కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని జైపూర్కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ స్టడీస్ (సీడీఈసీఎస్) బృందాలు ప్రశంసించాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం–2013 అమలు తీరు సమగ్ర పరిశీలన, మదింపునకు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ జైపూర్లోని సీడీఈసీఎస్ను థర్డ్పార్టీ మానిటరింగ్ సంస్థగా ఏర్పాటు చేసింది. ఈ సంస్థ బృందాలు తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులతో సమావేశమయ్యారు. కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈ బృందం సభ్యులు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్ కన్సల్టెంట్ కె.గిరిజాశంకర్, సీడీఈసీఎస్ టీమ్ లీడర్ రవిపారీక్ తదితరులు ఇన్చార్జి కలెక్టర్ జి లక్ష్మీశ, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో సమావేశమయ్యారు. ఆది, సోమవారాల్లో కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు అర్బన్ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్లు, చౌకధరల దుకాణాలను పరిశీలించినట్లు తెలిపారు. రేషన్కార్డుదారులతో మాట్లాడి సరుకులు అందుతున్న తీరును తెలుసుకున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తకార్డుల జారీ, పేర్ల చేర్పు, తొలగింపు తదితర సేవలు 21 రోజుల్లోపు ప్రజలకు అందుతున్నాయన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సగటున ఈ సమయం 45 రోజులుగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్యోజన (పీఎంజీకేవై), రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందిస్తుండటం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. రాష్ట్ర పీడీఎస్ కార్డుదారులకు సార్టెక్స్ బియ్యం అందిస్తుండడంపై కార్డుదారులు అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పటిష్ట, ప్రణాళికాయుత వ్యవస్థ ద్వారా జిల్లాలో 16.50 లక్షల రేషన్కార్డుల లబ్ధిదారులకు ప్రతి నెలా ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు అందుతున్నాయని, ప్రజాపంపిణీ వ్యవస్థలో అద్భుత పనితీరుకు గ్రామ, వార్డు వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వడం ప్రశంసనీయమని సీడీఈసీఎస్ నోడల్ అధికారి డాక్టర్ ఉపేంద్ర కె.సింగ్ పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఆయన జేసీ (రెవెన్యూ) ఎస్.రామసుందర్రెడ్డి, డీఎస్వో మోహన్బాబుతో సమావేశమయ్యారు. ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, నంద్యాల మండలాల్లో స్వయంగా రేషన్ షాపులను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడినట్లు చెప్పారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను ఇస్తున్నట్లు వినియోగదారులు చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు అందించే విధానం బాగుందని చెప్పారు. ఇందుకోసం జిల్లాలో 760 మినీ ట్రక్కులను ఏర్పాటు చేసినట్లు జేసీ రామసుందర్రెడ్డి తెలిపారు. సమావేశంలో సీడీఈసీఎస్ అధికారులు అలీబాషా, రామారావు పాల్గొన్నారు. -
ప్రేమవివాహం: పెళ్లికొడుకు ఇంటికి నిప్పు
గుంతకల్లు /అనంత: పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆక్రోశంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లికూతురు బంధువులు నిప్పంటించిన ఘటన నాగసముద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్గా పనిచేస్తోంది. నాగసముద్రం గ్రామానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్ ఇంటర్ వరకూ చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తమ ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు వస్తాయని భావించిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు నూతన వధూవరులను బంధువుల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో పెళ్లికూతురు సుమిత్ర తరఫు బంధువులు కొందరు ఆదివారం సాయంత్రం నాగసముద్రంలోని పెళ్లికొడుకు హేమంత్ ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పివేయడంతోపాటు ఈ ఘటనకు పాల్పడ్డ వారిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు నిప్పంటించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
సర్పంచ్ బరిలో వలంటీర్ సత్యవతి
రాప్తాడు: ఉత్తమ సేవలందిస్తున్న ఓ మహిళా వలంటీర్ను గ్రామస్తులు సర్పంచ్ బరిలో నిలిపారు. వివరాలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన సత్యవతి మండలంలోని ప్రసన్నాయపల్లిలో వలంటీర్ పోస్టుకు ఎంపికైంది. వలంటీర్ ఉద్యోగం రావడంతో సత్యవతి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుండేది. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరవేసేది. ఆమె సేవలను గుర్తించిన మండల స్థాయి అధికారులు ఉత్తమ మండల వలంటీర్ అవార్డును ప్రకటించారు. గ్రామ వలంటీర్గా ఉన్నప్పుడే సత్యవతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందు వరసలో ఉంటుందని గ్రహించిన గ్రామస్తులు ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచ్గా బరిలో దింపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
వలంటీర్ కళ్లలో కారం కొట్టి..
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిరలో దోపిడీ దొంగలు గురువారం ఉదయం బీభత్సం సృష్టించారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా వలంటీర్ పై దాడి చేసి నగదును లాక్కెళ్లారు. వలంటీర్ వీరప్ప కళ్లలో కారం కొట్టి దుండగులు 43 వేల రూపాయలను అపహరించారు. మడకశిర పట్టణంలోని శివపురలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను వెంటనే పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వృద్ధులకు ఆసరా అందించే పింఛన్ల డబ్బును దోచుకోవడానికి మనసెలా వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. దొంగలను పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దోపిడీ నేపథ్యంలో పింఛన్లు పంపిణీ చేసే వలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. (చదవండి: వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి.. ) -
కేంద్రం అవార్డులు; ఏపీ రికార్డుల మోత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోంది. నేరుగా ప్రజల వద్దకే అన్ని సేవలు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రికార్డు స్థాయిలో ఏపీకి పురస్కారాలు దక్కాయి. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థతో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీంతో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో అత్యధిక పురస్కారాలు ఏపీకి దక్కాయి. పరిశుభ్రత విషయంలో రాష్ట్ర ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి. ఏపీకి అవార్డులు రావడం సంతోషకరం: వెంకయ్యనాయుడు -
‘లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి’
-
‘లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తీవ్ర జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులుంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వాలంటీర్లకు తెలపాలని దండోరా వేయించామని పేర్కొన్నారు. మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే కాల్సెంటర్లకు కాల్ చేయాలని జవహర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. 94శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉన్నవారు వాలంటీర్లకు చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. కరోనా పేషెంట్ బంధువులకు వివరాలు తెలిపేందుకు హెల్ప్ డెస్క్ను పెట్టామని ఆయన తెలిపారు. (భారత్: రెండో రోజు 60 వేలు దాటిన కరోనా కేసులు) రాష్ట్రంలో 8.76 శాతం పాజిటివ్ రేటు, 0.89 శాతం మరణాల రేటు ఉందని తెలిపారు. దీని బట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనల్ని అభినందిస్తోందని గుర్తుచేశారు. మూడు, నాలుగు రోజులుపాటు జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ లక్షణాలుంటే పరీక్ష చేయకపోయినా ఆస్పత్రిలో చేరాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాల్ సెంటర్లు పెట్టామని వ్యాఖ్యానించారు. వెంటనే ఆస్పత్రిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చివరిదశలో ఆస్పత్రికి రావడం వలన కాపాడలేకపోతున్నామని అన్నారు. కనీసం ఆరురోజులు ఆస్పత్రిలో ఉంటే ప్రాణాలు కాపాడగలమని చెప్పారు. ఈ విషయంలో డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచామన్నారు. 104ద్వారా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో కూడా నిరంతరం పనిచేసే కాల్ సెంటర్లు పెట్టామన్నారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరేంతవరకు ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశామన్నారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు బాధ్యతగా ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తోందని గుర్తుచేశారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ తప్పని సరిగా ధరించి బయటకు రావాలన్నారు. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 6 నెలలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యూనిసేఫ్ సహాయంతో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 20వేల మంది సిబ్బంది, 10వేల మంది ట్రైనీ నర్సులను కేటాయించామని వెల్లడించారు. అదనంగా వెయ్యి వెంటిలేటర్లు తెప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, యాంటీబాడీస్ సర్వే నాలుగు జిల్లాల్లో మొదలు పెట్టామన్నారు. సీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ బెడ్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 14వేల వరకు ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామన్నారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 70 శాతం చనిపోతున్నారని తెలిపారు. జూనియర్ డాక్టర్లకు జీతాలు పెంచుతామన్నారు. -
అర్బన్ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లో వార్డు వలంటీర్ల నియామకానికి జిల్లా కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నియామకాలకు సంబంధించి నిరుద్యోగ యువత నుంచి సర్కారు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన వారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆయా జిల్లాల్లో గల మున్సిపాలిటీలను ఒక యూనిట్గా తీసుకున్నారు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల ప్రకారం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పట్టణాల్లో 38,68,811 కుటుంబాలు ఉండగా.. ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 77,375 మంది వలంటీర్లను నియమించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా, నియామక ప్రవేశ పరీక్షల కోసం రూ.63.50 లక్షలు, శిక్షణ కార్యక్రమాలకు రూ.6.88 కోట్లను, వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించడానికి ఏడాదికి రూ.486 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల పరిశీలన, 11 నుంచి 25 వరకు మౌఖిక పరీక్ష, ఆగస్టు 1న వలంటీర్లకు సమాచార లేఖ పంపించటం షెడ్యూల్గా నిర్ణయించారు. ఎంపికైన వారికి ఆగస్టు 5 నుంచి 10 వరకు శిక్షణ ఇస్తారు. వారంతా ఆగస్టు 15న విధులను ప్రారంభించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు http://gramavolunteer2.ap.gov.in/GRAMAVAPP/VV/index.html వైబ్సైట్ చూడండి. -
సేవాస్ఫూర్తి
కృష్ణాపుష్కరాల్లో ఐదొందల మంది వలంటీర్ల ఉచితసేవలు కల్కీభగవాన్, రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్ఆర్ యువసేన సేవకులు ఎదుటివారు సాయం అడిగితే చాలు.. క్షణాల్లో ముందుంటారు! రంగాపూర్ ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: పుష్కర ఘాట్ల మెట్లు ఎక్కి దిగలేని వృద్ధులు పుణ్యస్నానాలు కోసం వారిని వెంట తీసుకొస్తారు.. దాహం వేసిందని అడిగితే చాలు క్షణాల్లో గ్లాసు నీళ్లను ఇట్టే తీసుకొచ్చి ఇస్తారు.. వాహనాలను ఎక్కవ పార్కింగ్ చేయాలో చెబుతారు.. ఆకలిగా ఉందని అడిగితే చాలు అన్నదాన ప్రాంగణం ఎక్కడుందో చూపిస్తారు.. సుస్తీ చేసిందని చెబితే చాలు వైద్యచికిత్సలు అందజేసే వైద్యకేంద్రంలో ఎక్కడుందో దారిచూపిస్తారు. నీళ్లలో మునిగిపోకుండా జాగ్రత్తలు చెబుతారు. దైవదర్శనానికి ఎలా వెళ్లాలో సూచిస్తారు.. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లు భక్తి నిరతితో కృష్ణాపుష్కరాలకు వస్తున్న భక్తులకు విశేషసేవలు అందిస్తున్నారు. కేవలం రంగాపూర్ ఘాట్ వద్దే కేవలం 500మంది స్వచ్ఛంద సేవకులు తమ ఉచితసేవలు అందిస్తున్నారు. వారిలో కల్కీభగవాన్, రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్ఆర్ యువసేన సంస్థలకు చెందిన భక్తులు ఉన్నారు. వారి సేవలో వలంటీర్లు తరిస్తున్నారు. భక్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రకతి కాపాడడం, వైద్యసేవలకు తీసుకెళ్లడం, తిరిగి వారి ఇళ్లకు క్షేమంగా పంపించేందుకు పుష్కర సేవకులు శ్రమిస్తున్నారు. సేవే మా అభిమతం మేమంతా కల్కీభగవాన్ సేవామార్గంలో నడుస్తాం. పుష్కర భక్తులకు సేవలందించేందుకు పాలమూరు జిల్లాకు 500 మంది వలంటీర్లు వచ్చారు. రంగాపూర్ ఘాట్ వద్ద 150మంది సేవలు అందిస్తున్నారు. సేవలతో మాకు సంతృప్తి లభిస్తోంది. అన్ని రకాల సేవలందిస్తున్నాం. ముఖ్యంగా నదీనీరు కలుషితం కాకుండా పర్యవేక్షిస్తున్నాం. – బి.రమా, కల్కీభగవాన్ వలంటీర్, ఆదిలాబాద్ భక్తుల సేవలో.. దూరప్రాంతాల నుంచి పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులకు సేవలందించేందుకు ఐదురోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ఘాట్ ప్రత్యేకాధికారుల సూచన మేరకు భక్తులకు కావాల్సిన సేవలందిస్తున్నాం. పుష్కరాలు పూర్తయ్యేవరకు సేవలందిస్తాం. – చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ వలంటీర్, మహబూబ్నగర్ ఐదు నిమిషాల్లో ముందుంటాం.. సహాయం.. అని అడిగి ఐదు నిమిషాల్లో సేవలు అందించేందుకు ముందుకొస్తాం. రెడ్క్రాస్ సొసైటీ తరఫున పుష్కరాల ప్రారంభం నుంచి 150 మంది వలంటీర్లతో కలిసి భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఉదయం 6 నుంచీ రాత్రి 9 గంటల వరకు పుష్కర సేవలోనే ఉన్నాం.. – పోచ రవిందర్రెడ్డి, రెడ్క్రాస్ కార్యదర్శి, వనపర్తి
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
లండన్ చేరుకున్న సీఎం జగన్
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
తప్పక చదవండి
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement