సీఎం జగన్‌ హత్యకు కుట్ర జరిగింది : రిమాండు రిపోర్టు | Shocking Facts Revealed In Remand Report Of A1 Accused Satish In CM YS Jagan Stone Hit Case - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ హత్యకు కుట్ర జరిగింది : రిమాండు రిపోర్టు

Published Thu, Apr 18 2024 5:49 PM

Cm Jagan Stone Hit case: Accused Satish Remand Report - Sakshi

సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌

కచ్చితంగా హత్య చేసేందుకు కుట్ర జరిగింది

ముఖ్యమంత్రి కోసం పక్కాగా స్కెచ్‌ గీసుకున్నారు

కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లో విస్తుపోయే విషయాలు

పొలిటికల్‌ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడి

ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో గుర్తించిన పోలీసులు

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఏ1 నిందితుడు సతీష్‌ రిమాండ్‌ రిపోర్టు బయటకు వచ్చింది. దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలన్న దురుద్ధేశం ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్‌ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్‌కు గాయం మాత్రమే అయిందన్నారు.

సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్‌ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్‌ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్‌ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కుట్ర ఎలా జరిగిందంటే?

  • ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.
  • ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.
  • ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడు
  • సింగ్ నగర్‌ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్‌ చేశాడు
  • సీఎం జగన్‌ వచ్చే వరకు ఎదురు చూశాడు
  • దాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడు
  • ప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడు
  • నిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయి
  • సీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయి
  • ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉంది
  • ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాం
  • సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం
  • 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశాం

నిందితుడికి రిమాండ్‌

సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కు రిమాండ్ విధించింది కోర్టు. పోలీసులు నిందితుడిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ & మెట్రో పొలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా.. న్యాయస్థానం సతీష్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. సతీష్‌ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నట్టు సమాచారం.

తెలుగుదేశం, జనసేనలో తత్తరపాటు

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతం అయిన కొద్దీ తెలుగుదేశం, జనసేన నాయకుల్లో తీవ్ర కలకలం, తత్తరపాటును గత మూడు రోజులుగా చూస్తున్నాం. దాడి జరిగిన రోజునుంచీ ఈ ఘటనను వీలైనంత వరకు చిన్నగా చేసే ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇష్టానుసారంగా తమ నోరు పారేసుకున్నారు. లోకేష్‌ చేసిన ట్వీట్‌ అయితే తీవ్ర వివాదస్పదం అయింది. పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబే ఏకంగా ఒక ప్రెస్‌ రిలీజ్‌ ఇచ్చారు. అప్పటి వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. అయినా చంద్రబాబే ఓ అడుగు ముందుకేసి టీడీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించాడు. పోలీసులు గానీ, వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు చెప్పకపోయినా.. గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకునే రీతిలో చంద్రబాబు వ్యవహరించారు.

బోండా.. నీ సంగతేంటీ?

ఇక టిడిపి సీనియర్‌ నాయకుడు, విజయవాడ సెంట్రల్‌ టిడిపి అభ్యర్థి బొండా ఉమ వ్యవహరశైలి తీవ్ర వివాదస్పదంగా ఉంది. దర్యాప్తులో అన్ని వేళ్లు తనవైపు చూపిస్తుండడంతో ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఇష్టానుసారంగా కామెంట్లు చేశాడు బోండా ఉమా. ఆయన కామెంట్లు చూస్తే..

  • అన్నా క్యాంటీన్ మూసేసినందుకు కోపంతో కొట్టాడు
  • ర్యాలీకి వస్తే రూ.300 ఇస్తానని ఇవ్వలేదు అందుకే కొట్టాడు
  • సింపతీ కోసం వైఎస్సార్‌సిపి వాళ్లే కొట్టించుకున్నారు
  • అధికారులను హెచ్చరిస్తున్నా.. నా పేరు ఈ కేసులో పెట్టొద్దు
  • జూన్ 4 తర్వాత పోలీసుల సంగతి తెలుస్తా

ఇప్పుడు దర్యాప్తులో వేముల సతీష్‌ పాత్ర బయటపడడంతో బోండా ఉమ తనను తాను కాపాడుకోడానికి రాజకీయాలు చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement