20న ఎడ్ల బండలాగుడు పోటీలు
సీఎస్పురం (పామూరు): సీఎస్పురం మండలం రామాపురం గ్రామంలో పట్టాభిరామస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈనెల 20వ తేదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రకాశం, నెల్లూరు, కడప, కృష్ణా, గుంటూరు 5 జిల్లాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నారా కుటుంబ సభ్యులు తెలిపారు. ఎడ్ల పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల యడ్ల జతల యజమానులు తమ పేర్లను ఈనెల 19వ తేదీ రాత్రి 9 గంటలలోగా రూ.500 ఎంట్రీఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు వరుసగా ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.40 వేలు, తృతీయ రూ.30 వేలు ఇవ్వనున్నారు. వివరాలకు సెల్: 9666673735, 8499036565, 9611118712 నంబర్లను సంప్రదించవచ్చు.
స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎంలు
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం మంగళవారం సాయంత్రానికి జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఈవీఎంలు రైజ్ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ స్ట్రాగ్ రూముకు చేరాయి. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్కుమార్ ఈవీఎంలను పరిశీలించి స్ట్రాంగ్ రూములకు సీళ్లు వేశారు. అనంతరం అక్కడి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం సోమవారం రాత్రి రైజ్ ఇంజినీరింగ్ కాలేజి స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఇతర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలకు సంబంధించి దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలు మంగళవారం రైజ్ కాలేజికి చేరాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక కంటైనర్ వాహనాల్లో తీసుకొచ్చారు. సెంట్రల్ స్ట్రాంగ్ రూములోని ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్నీ భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులకు సీళ్లు వేశారు. కలెక్టర్తో పాటు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కే మెహతా, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్ఓ శ్రీలత ఇతర అధికారులు, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వేలానికి అన్ని గ్రేడులు తెచ్చుకోవాలి
● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్
టంగుటూరు: పొగాకు రైతులందరూ వేలానికి అన్ని రకాల గ్రేడులను తెచ్చుకోవాలని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. స్థానిక వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబు, ఒంగోలు పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి లక్ష్మణరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వేలం సరళిని, వివిధ పొగాకు గ్రేడులకు వచ్చిన ధరలను పరిశీలించి, రైతులతో వారి సమస్యలు అడిగారు. రైతులందరూ ధరలు మంచిగా ఉన్నందున సంతృప్తి వ్యక్తం చేశారు. అన్య పదార్థాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. మార్కెట్ నడుస్తున్న ప్రకారం పొగాకు బేళ్లను తెచ్చుకోవాలని, సాఫ్టు, హీటు, గ్రేడ్ మిక్సు లేకుండా తెచ్చుకోవాలని సూచించారు. అలాగే కంపెనీ బయ్యర్లతో మాట్లాడి అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేయాలని కోరారు. వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు, రైతు నాయకులు, బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
861 పొగాకు బేళ్ల కొనుగోలు
స్థానిక వేలం కేంద్రంలో మల్లవరప్పాడు, శివపురం, గొర్లమిట్ట, మట్టిపాడు గ్రామాలకి చెందిన రైతులు 919 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 861 కొనుగోలు జరగ్గా, 58 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.300 కాగా, కనిష్ట ధర రూ.205, సరాసరి రూ.261.69 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 36 మంది వ్యాపారులు పాల్గొన్నారని తెలిపారు.